తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

ప్రసన్నత

కవిత యొక్క లక్షణాలలో ప్రసన్నత అతిముఖ్యమైనది. రచయిత చెప్పదలచుకన్న భావాన్ని ఎప్పుడైతే పాఠకుడు సంపూర్ణంగా – కొంచెం కూడా వదలకుండా గ్రహింపగలడో, సందిగ్ధం లేకుండా, అటూ ఇటూ పొర్లకుండా గ్రహించగలడో అప్పుడే ఆ రచన సార్థక మౌతుంది. ఆ రచన యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ లక్షణాన్నే ప్రసన్నత అనవచ్చు. దీనినే నన్నయ ‘‘ప్రసన్న కథా కలితార్థయుక్తి’’ అన్నాడు.

సుదీర్ఘ సంస్కృత సమాసాలతో రాసిన కవితను నిఘంటువుల సహాయంతో అర్థం చేసుకోవచ్చు, కాని అన్వయ సారళ్యం, ప్రసన్నతా లేని కవితలను – అవి ఎంతటి సులభ వ్యావహారిక భాషలో ఉన్నా – అర్థం చేసుకోవడం కష్టం. రచయిత స్వయంగా వచ్చి వివరింపవలసిందే.

ఈ మధ్య వెలువడిన కొన్ని కవితలలో ఈ ప్రసన్నతా లక్షణం పూర్తిగా లోపించింది. భావం తల పగలగొట్టుకున్నా అంతు చిక్కడం లేదు. కారణం ఏమిటి? ఆ రచయితలు తమ కవితలలో ఎక్కువగా వాదన ప్రతీకలూ, రూపకాలంకారాలూ ఉత్ప్రేక్షలు ఒక దానికొకటి పొంతన లేకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒక కవితా సంపుటిలోని ఈ కవిత చూడండి.

‘‘విశ్వమంత్రనగరి సరిహద్దుల కవాటాల ఆంతర్యాలపై
విఫల ప్రహారాల విజయానుభూతినిస్తుంది.’’

దీనికి సంబంధించిన భావం రచయిత హృదయంలో ఏదో ఉండే ఉంటుంది. కాని అది పాఠకునికి అందాలి కదా. ప్రతీకలనూ, రూపకోత్ప్రేక్షలను రచయిత ఊహించుకుంటే చాలదు. పాఠకునికి అందివ్వాలి.

ఈ రచయితే మరోచోట రాసిన కవిత –

‘‘ప్రతి ఓటమీ తొలిగెలుపు
ప్రతి నిరాశా ఆశకు ఊపిరి
ప్రతి దు:ఖమూ ఆనందానికి పునాది.’’

దీనిని ప్రసన్నతకు చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. అలంకారాలనూ విశేషోక్తులనూ ప్రసన్నతకు దోహదకారులుగా ఉపయోగించుకోవడం కష్టమైనప్పుడు రచయిత ఆ ప్రయత్నం మానుకొని ఉన్నది ఉన్నట్టు వర్ణించి హృద్యంగా చెప్పవచ్చు. దీన్నే స్వభాపోక్తి అంటారు.

‘‘పసి పాపలన్నా, నక్సలైట్లన్నా
నాకెంతో ఇష్టం
పాపలకా నిష్కాపట్యం
ప్రపంచం తెలియక వచ్చింది.
అన్నలకా స్వార్థ రాహిత్యం
ప్రపంచం తెలిసి వచ్చింది’’ (ఒక కవితా సంపుటి)

అన్నలనూ నక్సలైట్లనూ ఒకచోట కూర్చోబెట్టడం రచయిత చమత్కారం. ఈ కవితలో ఏ విశేషోక్తీ లేదు. ఉన్నదంతా స్వభాపోక్తియే.ఈ కవితలోని ప్రసన్నతా, శబ్దాలంకారమూ చూడండి –

‘‘నవభాష్ప ధారలో నవ్వు కాగలవు
ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు
యత్నించి చూడమని అంటాను నేను
రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు’’ (ఒక సంకలనం)

ప్రయత్నించి కృషిచేస్తే ప్రతికూలత నుంచి అనుకూలతనూ, లేమినుంచి కలిమినీ, దు:ఖం నుంచి సంతోషాన్నీ సాధించగలవు అన్నభావం చక్కగా ఆలంకారికంగా చెప్పబడింది. ప్రసన్నత దెబ్బతినలేదు. ధారణా యోగ్యత ఉన్న కవిత ఇది. ఇలా అలంకారాలూ, ప్రతీకలూ, ధ్వనులూ ప్రసన్నతకు దోహదం కలిగించేవిగా ఉండాలి. భంగం కలిగించేవిగా ఉండరాదు.

ఇజాలూ. వాదాలూ

తెలుగు సాహిత్యంలో సామ్యవాదం, దళితవాదం, స్త్రీ వాదం, మైనారిటీ వాదం, సర్రియలిజం, పోస్టు మాడరనిజం మొదలైన అనేక సిద్ధాంతపరమైన శాఖలు చోటుచేసుకున్నాయి. వీటిలో సామ్యవాదం, సామ్రాజ్య వ్యతిరేకవాదం శ్రీశ్రీకాలం నుంచి ప్రచారంలో ఉన్నవే. రాజకీయాలలో మితవాదులూ, అతివాదులూ, తీవ్రవాదులు లాగానే ఈ సామ్యవాద రచయితలలో కూడా అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు, దిగంబర కవులు బయలుదేరారు. వీరు కేవలం సాహిత్య సృష్టితో సరిపుచ్చుకోక సంఘాలుగా చేరి తమ సిద్ధాంతాలనూ, సాహిత్యాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. వీరి సాహిత్యంలో సాహిత్య విలువల కంటే సిద్ధాంతాల విలువలే ఎక్కువ. కాబట్టి ఈ సామ్యవాద సాహిత్యానికి అనుకూలురు, ప్రతికూలురు అనే ఖచ్చితమైన విభజన జరిగిపోయింది.

పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం బుడగలు బుడగలుగా లేచిన స్త్రీ వాదం క్రమంగా బలం పుంజుకుంది. మొదట స్త్రీలలోని బానిస భావాలను పారదోలడం, వారిలో చైతన్యం కలిగించడం – లక్ష్యాలుగా ప్రారంభమైన స్త్రీవాద కవిత్వం క్రమంగా పురుషాధికారాన్ని, లింగ వివక్షనూ, అత్యాచారాలనూ, గృహ హింసనూ నిలదీసి ఖండించడం వరకు పురోగమించింది. స్త్రీవాద రచయిత్రులు రచయిత్రులుగా కంటే స్త్రీవాద నాయకురాండ్రుగా ఎక్కువ ప్రచారమూ, పేరు ప్రతిష్ఠలూ పొందుతున్నారు.

ఇటీవల పదహైదు సంవత్సరాలుగా దళితవాదమూ, ఐదారు సంవత్సరాలుగా మైనారిటీ వాదమూ బయలుదేరాయి. మైనారిటీ వాదానికి అప్పుడే అంతర్గత ప్రతికూలత బయలుదేరింది. దళితవాదం బాగా పుంజుకుంది. దళితేతరులు దళితవాద కవితలు రాస్తుండగా దళితులు వారిని కటువుగా విమర్శించి ‘‘మా వాదాన్ని మేమే వినిపించుకుంటాం’’ అన్నారు. దళితవాదం కూడా స్త్రీ వాదం లాగానే మొదట దళితులలో న్యూనతా భావాన్ని తొలగించడం, చైతన్యం కలిగించడంతో ప్రారంభమై క్రమంగా పెత్తందార్లనూ, అగ్రవర్ణాలనూ పనిగట్టుకని విమర్శించడం వరకూ వెళ్ళిపోయింది. అంతటితో ఆగక సంప్రదాయ కవితా రీతుల్ని కూడా విమర్శించడం మొదలుపెట్టారు దళిత సాహిత్యకారులు. తిరుపతిలోని ‘‘కోనేటిగట్టు మిత్రులు’’ అనే సంఘం వారు తమ రచనలలో ఇలా అంటారు. ‘‘మేము చెబితే బూతు, మీరూ చెబితే శృంగారమా? బూతు మీ ‘‘గోపీ పీన పయోధర మర్దన’’లో ఉందా మా ‘‘ఎత్తు పిర్రల ఎంకీ’’లో ఉందా’’ సామాజిక అసమానతలను ఎంత తీవ్రంగానైనా విమర్శించవచ్చుగానీ సాహిత్యరీతుల్ని విమర్శించడం ఆరోగ్యకరం కాదు. ఇవి అవాంఛనీయం.

ఇక సర్రియలిజం, పోస్టు మాడరనిజం మొదలైన ఇజాలు ఆయా సిద్ధాంతాలు తెలిసిన వారికే – పాశ్చాత్య సాహిత్యంతో పరిచయమున్న వారికే – పరిమితమై పోయాయి. సామాన్య పాఠకునికి అవి కొరకరాని కొయ్యలు. సాహిత్యంలో సిద్ధాంతాలూ, ఇజాలూ ప్రవేశించడం వల్ల సాహిత్యం ఏకముఖమై స్తబ్ధమైపోతుందని కొందరి అభిప్రాయం.