తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి

శబ్దసౌష్టవం

ఒక కవితకు భావం ఎంత ముఖ్యమో శబ్దసౌష్టవం (హక్కు) కూడా అంతే ముఖ్యం. దానినే కాళిదాసు ‘‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే’’ అన్నాడు.

భావాన్ని బట్టి శబ్దం – అంటే పదజాలం – మారుతూ ఉండాలి. గంభీరమైన భావానికి గంభీరమైన పదజాలం, లలితమైన భావానికి లలితమైన పదజాలం ఉంటేనే ఆ కవిత ఆకట్టుకుంటుంది. భావానికి తగిన పదజాలం లేకపోతే గుడిలోని పూజారికి సూటూ, బూటూ వేసినట్టూ, పోలీసుకు పంచెకట్టూ జుబ్బా, కండువా వేసినట్టూ ఉంటుంది. భావానికి తగిన భాష వాడాలంటే రచయిత భాషపైన పట్టు సాధించాలి. అందుకు విస్తృతంగా చదవడమే ఏకైక మార్గం. అట్లా అని రచయితలందరూ బాల వ్యాకరణమూ, పాణీనీయం, సంస్కృతాంధ్ర పంచకావ్యాలూ చదవమని నేను చెప్పడం లేదు. చదివితే మాత్రం తప్పేమిటి? మరీ మంచిదే కదా. ప్రస్తుతం తెలుగుభాష అన్యభాషా సంపర్కంవల్ల చాలా విస్తృతమైపోయింది. సర్వవిధ వ్యవహారాలకూ పర్యాప్తమై నిలిచింది. భాషా సౌష్టవం లేకుంటే కవిత పేలవమై పోతుంది. ఈ సందర్భంలో తెన్నేటి హేమలత గారి మాటలను గుర్తుచేసుకోవాలి –

‘‘నాకు మాటలొచ్చు. మాటల అర్థం తెలుసు. సమయోచితంగా వాడకపోతే మాటలు చచ్చిపోతాయని నాకు తెలుసు. మనం మాటల్ని నమ్ముకున్న వాళ్ళం. అంచేత మాటల్ని వాడుకొని బతకాలి తప్ప మాటల్ని చంపుకొని బతకకూడదు’’ అంటారామె. శ్రీశ్రీ గారి ఈ కవిత చూడండి –

‘‘నిప్పులు చిమ్ముకుంటూ, నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు.
నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే’’

శబ్ద సౌష్టవానికి ఇంతకంటే మించిన చక్కని ఉదాహరణ మరొకటి కనబడదంటే అతిశయోక్తి కాదు. శ్రీశ్రీగారి శబ్దాధికారం అనన్య సామాన్యం.

సరళమైన భావానికి సరళమైన భాష ఎలా ఉండాలో ఈ కవితలోచూడండి.

‘‘వదలనీ నాజూకు తనమును
విడువనీ మది పిరికితనమును
చూడనీ కను విచ్చి లోకం
ఆడ దప్పుడు బాగుపడునోయ్‌.’’

అలాగే ఆరుద్ర గారి కవిత –

‘‘ప్రొద్దున్నే యెదురొచ్చే ప్రశస్తమైన విశ్వస్త
బలవంతపు పెళ్ళిలోని ముదనష్టపు పెళ్ళికూతురు
మూగవాని భావప్రకటన పేదవాని మూడో పెళ్ళాం.’’

ఈ కవితలో సందర్భోచిత, భాపోచిత భాష ఉండడమే కాక, వింత వింత ఉపమానాలూ, లయబద్ధతా పాదబద్ధతా ఉండడం విశేషం.

ఇలాంటి భాషా సంపద ఆరుద్ర, శ్రీశ్రీలాంటి తొలితరం వచన కవితా రచయితలకు అబ్బడానికి కారణం వారు ప్రాచీన సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివిన వారు కావడమే. ఈ తరం వచన కవితా రచయితలకు పూర్వసాహిత్యం పైన ప్రీతీ, ఆసక్తే కొరవడ్డాయి. రచయితలు పూర్వ సాహిత్యాన్ని బాగా చదవాలని వచన కవితా వైతాళికులలో ప్రసిద్ధులైన శ్రీ కుందుర్తి గారే ఒక ఇంటర్వ్యూలో ఇలా సెలవిచ్చారు –

‘‘మొదటి దశలో ఆధునికులైన వారు పూర్వకవిత్వాన్ని గురించి ఏమీ తెలియకపోయినా వచన కవిత్వం రాయవచ్చు. అది ప్రవేశార్హత. ఆపైన పూర్వ సంప్రదాయం పైన అధికారం సాధిస్తేనే గానీ గొప్ప వచన కవిత్వం రాయలేరు.’’ కుందుర్తి గారి అమూల్యాభిప్రాయాన్ని వర్ధమాన రచయితలు అందరూ తప్పక శిరసావహించాలి.

కొన్ని కవితలలో శబ్దసౌష్టవం ఎంత దరిద్రంగా ఉంటూ ఉందో ఈ కవితలో చూడండి –

‘‘పెళ్ళాం చచ్చి నేను అఘోరిస్తూ ఉంటే
నన్నే కట్టాలని చూస్తారా
నేను ఈ హత్య చేయలేదు
దు:ఖించే వాడిని, బాధపడే వాడిని
నన్ను దోషి అనీ, హంతకుడనీ
బాధిస్తారా – బాదాలని చూస్తారా’’

దీన్ని కవిత అని ఎలా అనాలో, ఎందుకనాలో తెలియడం లేదు. ఇది కవితా సంపుటిలో ముద్రితమైపోయింది మరి. ఈ కవిత చదువుతూ ఉంటే సానుభూతి కలుగదు సరికదా, వీడే పెళ్ళాన్ని చంపి దొంగ ఏడుపులు ఏడుస్తూ బుకాయిస్తున్నాడనిపిస్తుంది. ఈ కవితలో ఉత్కృష్టమైన భావమూ లేదు ఏ విధమైన విశేషోక్తీ లేదు. లయబద్ధతా లేదు. పాద బద్ధతా లేదు శబ్దపౌష్టవం అంతకన్నా లేదు. ఇది కవితకు పట్టిన గ్రహణం అనవచ్చు.

ఈ భావాన్నే ఇలా రాయవచ్చు. ‘‘భార్య చచ్చిందని ఏడ్వనా, నీవు కొడుతున్నావని ఏడ్వనా. బిడ్డలు దిక్కులేని వారయ్యారని ఏడ్వనా. అత్తమామలు నిందమోపుతున్నారని ఏడ్వనా, భార్యచితికి కట్టెలు తెచ్చుకోనా, ఉరివేసుకోవడానికి బారెడు తాడు తెచ్చుకోనా. ఏం చెయ్యమంటావు పోలీసూ ఎలా చావమంటావు’’