ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు

[ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు అయిన ఆవంత్స సోమసుందర్ (1924-2016) వజ్రాయుధం అన్న తమ కావ్యం ద్వారా సుప్రసిద్ధులు. కాహళి, రక్తాక్షి, మేఘరంజని, అనలకిరీటం వీరి ఇతర రచనలలో కొన్ని మాత్రమే. ఇటీవలే మరణించిన వీరి జ్ఞాపకార్థం, వచన కవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలు అనే పుస్తకంలో (జనవరి 1967, సంకలనం: కుందుర్తి, గోపాల చక్రవర్తి) ప్రచురించిన వీరి వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాం.]


త్రిదశత్వం అందుకున్న ఈ తరుణంలో ముక్తచ్ఛంద కవిత ప్రధాన ఆధునిక కవితవాహికగా స్థిరపడినట్లు కనిపిస్తోంది. సుదూర భవిష్యత్తు వరకూ ఈ ప్రక్రియ ప్రవర్థితం కాగలదన్న అచంచల విశ్వాసం కలుగుతూన్నది. ఆధునిక యుగ సంబంధమైన కవితా వాణిగా ఈ ప్రక్రియా విశేషం పరిగణింపబడుతోంది.

అయినా పూర్వ యుగ అవశేషాలయిన లాక్షణిక ఛందో బద్ధ కవితలూ (మార్గి) మాత్రాచ్ఛంద కవితలూ (దేశి) వెలువడుతూనే ఉన్నాయి. పూర్వయుగావశేషాలు వర్తమాన యుగంలో సైతం రాజకీయ సాంఘిక ఆర్థిక నైతికాది సర్వరంగాల లోనూ విడువకుండా అంటిపెట్టుకుని ఉండినట్లే, కవితా రంగంలో కూడా పూర్వయుగవైలక్షణ్యం పూర్తిగా తొలగిపోదు. అలా మిగిలి ఉన్నప్పటికి అవి ఆధునిక యుగ ప్రాతినిధ్యాన్ని వహించలేవు.

రచనా వైవిధ్యము

ఈ కవితాప్రక్రియ ఒక ఉద్యమంగా రూపొంద గలుగుతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. వచనకవితాప్రక్రియ ఒక నిర్ధిష్టమైన కవితా స్వరూపాన్ని సంతరించుకున్నదే కాని, నిర్దుష్టమైన స్వభావాన్ని రూపొందించుకోలేక పోయింది. ఈ ప్రక్రియలో ఆత్మాశ్రయమైన ప్రేమేతివృత్తము, వాస్తవికతాదర్శనతో లోకవృత్త ప్రదర్శనము, మార్మిక భావనా సముచ్ఛయము, మున్నగు అనేక వస్తువులను స్వీకరించి వ్యక్తీకరించడం విశేషంగా కనిపిస్తుంది. కనుకనే, ఈ భావ సంకీర్ణత ముక్తచ్ఛంద మార్గానుగాములలో వైవిధ్యాన్ని (అనైక్యత కాదు) స్థాపిస్తోంది.

ఈ కవితా సిద్ధాంతావలంబకులలో గల ఈ వైవిధ్యం అనూచాన కవితా వాహినిలో నిర్మాణయుతమైన విప్లవాత్మక పరిణామాలను చేకూరుస్తున్నదా? లేక విచ్ఛిన్నకర భ్రష్ట రూపాలను ఉత్పత్తి చేస్తున్నదా? అనే సందేహం కొందరిలో కలుగుతున్నది. ఈ ప్రశ్నకు కూలంకష సమాధానం చెప్పుకుందుకు, ముక్తచ్ఛంద కవితా చరిత్రను స్థూలంగా స్పర్శించవలసి వుంది.

నవయుగారంభం

మూడు దశాబ్దాల క్రితం — మహాప్రస్థాన గీతాలు రచింపబడుతున్న దశలో (1934) ముక్తచ్ఛంద కవితకు ప్రథమ స్వరూపాలు శ్రీశ్రీ చేత ఆవిష్కరింపబడ్డాయి. ఈ ప్రక్రియకు నిర్దిష్టమైన రీతులు (ఆకాశదీపం, ఋక్కులు, సాహసి, ఐ వంటివానిలో) ప్రయుక్తమైనవి. సాహితీసంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు కవితలు అల్పసంఖ్యాకంగానే రచించారు. కాని, వానిలోనే ప్రేమకవితామార్గానికి, దేశభక్తి కవితా మార్గానికి, వాస్తవిక కవితా మార్గానికి బీజాక్షరాలు లిఖించారు. అట్లే శ్రీశ్రీ కూడా సమాజ వాస్తవికతను చిత్రించే ముక్తచ్ఛంద కవితలకూ మాత్రాచ్ఛంద స్వరూపంలో విప్లవగీతాలకూ ఆద్యుడై నాంది వినిపించాడు. ఈ ముప్పది సంవత్సరాలలోనూ మూడు స్పష్టమైన కవితావిభాగాలు ద్యోతకమవుతున్నాయి.

ఒకటి:- శ్రీశ్రీ వెనువెంటనే వచ్చిన అనిర్ధిష్ట కవితాయుగం. పురిపండా, శ్రీరంగం నారాయణ బాబు, జరుక్ శాస్త్రి, శిష్ట్లా ఉమా, పఠాభి, సింగరాచార్య, పా.ప. హ్రీ. హ్రీ. పూషా, సంపత్, తిలక్ ప్రభృతులు (1934 – 44) ఈ శ్రేణి లోని కవులు.

రెండు: అభ్యుదయ కవితాయుగం. కుందుర్తి, ఏల్చూరి, రామదాసు, అనిసెట్టి, చిరంజీవి, సోమసుందర్, ఆరుద్ర, రమణారెడ్డి, గంగినేని, అజంతా, బైరాగి, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రభృతులు (1944 – 54). వీరిలో అధికసంఖ్యాకులు మాత్రాచ్ఛందస్వరూపాలు విరచించినా ప్రతి ఒకరూ ముక్తచ్ఛందాలు రచించడం మానలేదు. (మొదటి తరంలోని శ్రీ తిలక్ తనంత తానుగా ఒంటరిగా ఈ ప్రక్రియతో కవితలు వ్రాసి ప్రచురిస్తుంటే రెండవ తరంలోని కుందుర్తి తెలంగాణ ప్రచురించి హైదరాబాద్‌లో వచన కవితా ఉద్యమాన్ని కేంద్రీకరించాడు.)

మూడు: వచన కవితా యుగం. దీనినే స్వచ్ఛంద కవితా యుగమని కాని ముక్తచ్ఛంద కవితా యుగమని కాని అనడం మరింత నిర్దిష్టంగా ఉంటుంది.దీనిలో తిలక్, కుందుర్తి, మాదిరాజు, అరిపిరాల, కేశవరావు, యాదవరెడ్డి, వరవరరావు మొదలగువారు (1954 – 64) పాత్రధారులు.

అభ్యుదయ కవితా వ్యాప్తి

మూడు దశలలోనూ కూడ వర్తమాన కవిత్వం పండిత భిషక్కుల ప్రాతికూల్యాన్ని ఎదుర్కుంటూనే వుంది. మొదటి దశకంలో యుగపురుషుడైన శ్రీశ్రీ తదనానుయాయులూ ప్రతికూల ఋతుపవనాలకు ఎదురొడ్డి నిలవవలసి వచ్చింది. మొదటి దశాబ్ది చివరి పాదంలో సంప్రదాయవాదుల నిరాదరణ వల్ల శ్రీశ్రీ అనుయాయులు కొందరిలో నిస్తేజం పొడసూపింది. తాము కూడ సంప్రదాయ ఛందస్సులను ప్రయుక్తం చేయగలమన్న శక్తి ప్రదర్శనకు పూనుకోవడం క్షీణలక్షణంగా వ్యాపించింది. మన దేశానికి సహజం కాని అధివాస్తవికతా వాదం వంటివానికి అంటుకట్టి పెంచడం మరొక లక్షణమై ప్రగతి స్తంభించింది. అట్టి దశలో అభ్యుదయ కవితా ఉద్యమం ప్రాదుర్భవించింది. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలలో ప్రదర్శించిన విహంగేక్షణతో స్థూల రేఖలుగా చిత్రితమైన పీడిత మానవ శ్రేణుల పురోగతిని అభ్యుదయ కవితా యుగం లోని ప్రముఖ కవులందరూ మరింత వస్తు నిర్దేశం తోను, మరింత సూక్ష్మ విశ్లేషణ తోను, మరింత మమేక భాగస్వామ్యత్వం తోను చిత్రించారు. ఈ యుగంలో పండిత విమర్శలకు, పరిగణనకు, పారితోషికాలకూ నిమిత్తం లేని ఆశేష ప్రజాదరణను అభ్యుదయ కవిత సముపార్జించుకోగలిగింది.

నిరంతరాన్వేషణ

కవికి జీవనధాతువైన ప్రతిభ నవనవోన్మేషశాలి. నిరంతర అన్వేషణాశీలి. ప్రతిభకు ప్రయోగశీలత, సాహస యాత్ర, ద్వితీయ ప్రకృతులు. ప్రతిభావంతులైన కవులు పరిణత మనస్కులై ముందంజ వేయడమే గాక పరిపక్వ చేతస్కులై కవితా స్వరూప స్వభావాలలో మార్పులు సైతం ఆపాదించ గల్గుతారు. నిన్నటి కవుల కవితలను నేటి కవులనుసరించడం దోషమైనట్లే నిన్నటి తన కవిత్వాన్ని నేడు అనుకరించడం కూడ దోషమే అవుతుంది. ఒక కవి అనుభవ ప్రవృద్ధు డవుతున్న కొద్ది, విషయజ్ఞాన వ్యుత్పన్నుడవుతున్న కొద్ది కవితారచనలో నూత్న యితివృత్తాన్వేషణకు సంవిధాన చాతురికి పూనుకుంటాడు. లేదా, పూర్వేతి వృత్త స్వీకరణలో సైతం సృజనాత్మకంగా అపూర్వ సంవిధానాన్నీ రీతినీ అనుసంధిస్తాడు. అప్పుడే అతని కవితకు విశిష్టత చేకూరుతుంది.

వర్తమాన లోకంలో బ్రతుకుతున్న మన కవుల లోనే విభిన్న లోకాల లోనూ కాలాల లోనూ నివసిస్తున్న వ్యక్తు లుంటారు. కొందరు కేవలం గతలోక వాసులు. కొందరు వర్తమానులు, మరికొందరు భవిష్యద్దర్శకులు. ఇట్టిది సర్వజనుల లోనూ కనిపించే విభేదమైనట్లే కవులలో సైతం ద్యోతక మయ్యేదే! ఏమైనా కవితా స్రవంతిలో పొడసూపిన విభేదాలు స్థూలంగా రెండు రకాలు: ఒకటి — రీతిగతమైనది (ఫార్మ్), రెండు — విషయ గతమైనది (కంటెంట్). మొదటి విభాగంలో పొడసూపిన మార్పులు ఛందస్సు లోను, లయ లోను, శయ లోను, స్వరూపం లోను స్పష్టమవుతాయి. ద్వితీయ విభేదం: స్వీకృత కవితా వస్తువు లోను, సాంప్రదాయ విచ్ఛిత్తి లోను, ప్రయోగ శీలత లోను, భావనా చిత్రణ (ఇమేజరీ) లోను, కవితాసమయాల లోను, ఉక్తివైచిత్రి లోను ద్యోతకమవుతుంది.

ప్రయోగ ప్రయోజనం

నిజమైన ప్రయోగవాది తన గొంతు వింతగా ఉండాలని కాని, చమత్కారం కోసం కాని, ప్రయోగం చెయ్యడు. కొత్త పద్ధతిలో చెప్పటమొక్కటే తన ప్రయోగానికి ఫలశ్రుతి అనుకోడు. లేదా పఠితలను హడలగొట్టి ఆశ్చర్యం లోను దిగ్భ్రమ లోను ముంచెత్తి కనులు మిరుమిట్లు గొల్పడానికి కూడా ప్రయోగం సాగించడు.

నిన్న రాసిన తన కవితలలో కాని, లేదా ఇతరుల కవితలలో కాని, కానరాని కొండొక అపూర్వగుణమూ ఓజస్సూ ధీశక్తీ హృదయగమత మున్నగు గుణాత్మక లక్షణాల కోసం కవి సాగించే నిరంతరాన్వేషణలో ప్రయోగాత్మక రచనలు వెలువడతాయి. తద్వారానే వ్యక్తిగతంగా ఒక కవికి గాను, సామూహికంగా కవితకు గాని పురోగతి సిద్ధిస్తుంది. కవిత కలిగించే అనుభూతి లోను, ముద్ర లోను అనితఃపూర్వ అభివృద్ధి పరిగణింపబడుతుంది. కవులు అనుసరిస్తున్న కళాత్మక సిద్ధాంతాల లోని అవలక్షణాల ఫలితంగా ప్రేపేపితమైన పిల్లి మొగ్గలు ఆరోగ్యకరమైన ప్రయోగాలుగా గుర్తింప నవసరం లేదు.

నేటి కవుల బాధ్యత

కళాత్మక సిద్ధాంతాలలో నిత్య నూతనమైన మార్పులు గోచరిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ విప్లవ సిద్ధాంతం ఉద్భవించినా అది క్షణంలో నలు దిశలా వ్యాపించే విచిత్ర లక్షణం వర్తమాన యుగాని కున్నది. మేధా సంబంధి సంక్షోభాలు, అనవగాహనలు, కళాత్మక సిద్ధాంతాలలో సైతం పొడసూపి విచిత్ర వాదాలకు దారి తీస్తున్నాయి; ఆధునిక సమాజంలో భావవిప్లవం క్రమ వికాసం చెందకుండా ప్రగతిని సంక్షుభిత పరుస్తున్నాయి. కవులూ కళాకారులూ ఒక సంవిధానాన్ని ఏర్పరుచుకొని తమకు మార్గదర్శకులైన ముందు తరాల ప్రముఖ కవుల, మేధావుల సాధనాజన్యమైన విప్లవ భావేతివృత్తాన్ని పురోగమింప జేయడంలో దర్శనానైశిత్యాన్ని అలవర్చుకోవడం అత్యవసర మవుతున్నది. ముందు తరాల కవుల భావనాసముచ్ఛయాన్ని పురోగమింప చేసే ప్రయత్నంలో కవితా ప్రక్రియలో పేలవత్వం పొడసూపకుండా జాగరూకత వహించాలి. నిస్తేజమైన అనుకరణ విధానాలు దొంగచాటుగా ప్రవేశించకుండా శ్రద్ధ తీసుకోవాలి. ఓజోరహితమైన నినాద ప్రాయ వచనబంధం దురాక్రమణ చేయకుండా కాపాడు కోవలసి ఉంది. శక్తివంతులైన కవుల తదనంతర అనుయాయులు తమ కవితలనీ పరమ బాధ్యతలతో సంరక్షించుకొనక పోతే ప్రతిధ్వనులుగా క్షీణించాల్సి వస్తుంది!

కాలమే చోదక శక్తి

నవ్యత సాధారణంగా నిరాదరణకు గురి కాబడుతుంది. ఈ నిరాదరణ భావాన్ని నవ్య కవితా విమర్శకులూ వ్యాఖ్యాతలూ తృణీకరించ వలసి వస్తుంది. ఇట్టి ప్రతిఘటనలో సౌష్ఠవమైన కళాత్మక సిద్ధాంతాల ఆసరా అవసరమవుతుంది. ఆదర్శాత్మక వర్తమాన సమాజంలో భవిష్యద్దర్శన గల నవశక్తుల అభివృద్ధి కాంక్షించబడుతుంది. ఈ కాంక్షయే కవిత్వాని కొక సంప్రదాయమూ వారసత్వమూ ఘటిస్తుంది. ఐతే, సంప్రదాయానికి అవిభాజ్యమైన ఛాయామాతృకమైన మూఢ విశ్వాసమే జీవ శక్తికి మించినదై భావకల్లోలాన్ని రేపుతుంది. అప్పుడే సంప్రదాయజ్ఞులైన క్రాంతదర్శులు నవ్యత కోసం సాహసోపేతమైన ముందడుగు వేయవలసి వస్తుంది. ఈ ముందడుగులలో ప్రాచీనత కొంత విధ్వంసం కాకనూ తప్పదు. నవ్యతకు కొంత ఉత్తేజం కలుగకనూ తప్పదు! ఈ చక్రగతికి కాలమే చోదక శక్తి!

ఏ వాదాన్ని అనుసరించే కవి అయినా ఆ వాదమే అతని కళా విస్తృతికి ఒక పరిధిని నిర్మిస్తుంది. క్రమశః ఈ పరిధియే అతని పురోభివృద్ధికి అవరోధం కలిగించకుండా చూసుకోవల్సిన అవసరం ఏర్పడుతుంది. తన వాదాన్ని బలపరిచే భావనాపటిమలో నిరంకుశత, నిర్నిరోధకతలు పొడసూపకుండా కాపాడుకోవలసిన బాధ్యత పెరుగుతుంది. తద్వారా సోదాహృతమైన హేతువాద విపులీకరణలో సంకుచితవాదాలు సమసిపోతాయి. సరిగ్గా ఇదే సత్ఫలితం ఈ ముప్ఫై సంవత్సరాలు కవితా సాధన లోనూ సిద్ధించింది.

ఉక్తి వైచిత్రి

ఈ శతాబ్దంలో కవిత్వం పట్ల ఆదరణ ప్రతి దశాబ్ది లోనూ నిర్దిష్టమైన అభివృద్ధిని సూచిస్తున్నది. ప్రతి దశాబ్ది లోనూ ఆధునిక కవితా పురోగతి కొత్త మలుపులు తిరుగుతూ, పాతనుంచి కొంత స్వీకరణ, కొంత నిరాకరణలను సాగిస్తూ పురోగమిస్తున్నది. ఈ శతాబ్దపు తొలి మూడు దశాబ్దాల లోనూ సాధింపబడని ఉక్తివైచిత్రిను, నవ్యతను, విశిష్టభావజాలాన్ని, మలి మూడు దశాబ్దాల ఆధునిక కవిత సాధిస్తూ అమేయాభివృద్ధి గాంచింది. ముఖ్యంగా, ఈ ముప్పదేళ్ళ కవితాచరిత్ర లోనూ విశిష్ట విభాగంగా పెంపొందుతూ వచ్చిన ముక్తచ్ఛంద కవిత తత్పూర్వమెన్నడూ ఆంధ్ర కవిత శతాబ్దాలుగా సాధించుకోజాల నంతటి ఆవేగాన్నీ అంతర్ముఖత్వాన్నీ ఆలోచనామృతాన్నీ సాధించుకోగలిగింది. ఛందస్సులో స్వేచ్ఛను ప్రోది చేసుకుని స్వచ్ఛంద వృత్తాన్ని స్వీకరించడం ద్వారా ఆధునిక మానవుని సమస్త భావాజాలాన్నీ — వైజ్ఞానిక, సారస్వత, సాంస్కృతిక, సామాజిక భావజాలాన్ని — ఒక్క కవితాస్వరూపం లోనే సమన్వయం చేసుకోగలిగింది. నవ్య వ్యక్తికై, ఆధునిక భావవ్యంజనకై అనవరత సాధన ముక్తచ్ఛందానికి జీవన ధాతువైంది. ఈ స్వచ్ఛంద కవిత కవిత్వ స్వరూపంలో వచనానికీ లేదా గద్యకూ సాన్నిహిత్యం నెరపడం వల అటు శుష్కవచన రీతికి జారిపోకుండాను, ఇటు కవిత్వ ఓజస్సును ప్రతిపద నిష్యందిగా వెలార్చునట్లునూ సమ్రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ కవులకు అనివార్యమైంది. కొన్ని రకాల ముక్తచ్ఛంద కవితలు శుష్కవచన రీతిలో రాజకీయ ఉపన్యాసాల వలె మారిపోవడం తప్పడం లేదు. అట్టి రచనలను స్వీకృత వస్తువు లోని వీర వాస్తవికతను, సామాజిక కశ్మల వాతావరణ ప్రకర్షను సాకుగా చెప్పి బలపర్చడమూ కనిపిస్తున్నది. కాని, సర్వదశల లోను వస్తు విన్యాస వైఖరులు, భావవ్యంజనా పద్ధతులు కవితా విమర్శకు నికషోపలాలుగా పరిగణన పొందుతూనే ఉన్నాయి.

వచన కవితను రచించిన కవులలో అసంఖ్యాకులు వ్యక్తీకరణలో కొత్త వయ్యారాలెన్నో సృష్టించారు. ఇతఃపూర్వ మెన్నడూ ఎరుగని అందాలు సంతరించారు. నాగరిక జీవితం లోని కృతకృత్వం అనివార్య మౌతున్నట్లే, తజ్జన్యమైన విషయావిష్కరణలో కూడ కృతకత్వం అనివార్య మౌతున్నది. ఈ ముక్తచ్ఛంద కవులలో ఆధునికత, తత్సంబంధ ఇతివృత్త సేకరణ, ఆవిష్కరణ, సంవిధానము మున్నగునవి తమ అనుభవైకవేద్యాలు, జీవిత సంఘర్షణా జన్యాలు కాకపోవడం వల్ల కొన్ని చోట్ల అయోమయత, సంక్షోభములకు దారి తీస్తున్నాయి. కేవల రీతి గత నవ్యతపై ఆధారపడి భావ వ్యక్తీకరణ సాగించడం వల్ల తమ మనోగత పూర్ణబింబాన్ని పఠిత్రు మనో యవనికపై సజీవంగా ప్రతిబింబించ లేకపోవడం కొన్ని తావుల జరుగుతున్నది.

ముకచ్ఛంద స్వరూపం నిర్దిష్టమైన కవితా జీవవాహిక అయినట్లయితే దానికి నిర్దిష్టమైన కవితానిర్వచనా లుండవలసిన అవసరం వర్తమాన కాలంలో ఎదురవుతున్నది. ఈ ప్రక్రీయకు పుష్టికరమైన లక్ష్యశుద్ధి అవసరమవుతున్నది. అంతర్లయ, ప్రవాహగుణము వంటి బాహ్యలక్షణాల పట్ల సిద్ధిని చేకూర్చుకోవలసి వున్నది. ఛందస్సు భగ్నం కావటం వల్ల గేయగుణం మృగ్యమైంది. గేయగుణం వల్ల శ్రోత చెవులలో కవిత ప్రవేశించగానే హృదయాన్ని వశీభూతం చేసుకుని మెస్మరైజ్ చేసే సద్యస్ఫూర్తి అనుపూర్వికంగా సమకూరేది. అట్టి గుణం లుప్తం కావడంతో శ్రోత హృదయాన్ని మేజిక్ చేసే యితర కవితా గుణాల సంపద పెంచుకోవలసి వస్తున్నది. లోపించిన దాని స్థానే ఏ కళాత్మక లక్షణం అనివార్యమో గుర్తెరుగవలసి వుంది. యిట్టి సర్వ లక్షణాల పట్ల లక్ష్యం కలిగివున్న కవి కావ్య నిర్మాణదక్షుడు కావడంలో సందేహ ముండదు.