పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పంచేంద్రియాలు: 5 స్పర్శ గురించి రావు వేమూరి అభిప్రాయం:

    06/25/2026 10:28 am

    వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు!
    మీరు అందించిన సమాచారాన్ని వీలువెంబడి ఉపయోగించుకుంటాను.
    ఎంత జాగ్రత్తగా రుజువులు సరి చూసినా ముద్రారాక్షసాలని తప్పించుకోలేకపోతున్నాను. తప్పు సవరించినందుకు సంపాదకవర్గానికి ధన్యవాదాలు.

  2. పంచేంద్రియాలు: 5 స్పర్శ గురించి మంథా వీరభద్రం అభిప్రాయం:

    06/22/2026 1:54 pm

    విజ్ఞాన శాస్త్ర విషయాన్ని విడమఱచి చెప్పే వ్యాసం కూడా సాహిత్యపు గుబాళింపులు విరజిమ్మేలా వ్రాయగలగటం మీ గొప్పదనం.

    నన్నెచోడుని మాటల్లో చెప్పాలంటే, విజ్ఞానశస్త్ర వైదుష్యం,సాహిత్య వివేచన అనే కరిహరులను ఒకే గాటన కట్టగలిగిన పండితులు మీరు.

    …“మరైతే ఇక్కడ ట్రిక్ ఏమిటి?” అని అడుగుతాడు. “నొప్పిని పట్టించుకోక పోవడమే ట్రిక్” అంటాడు.

    ఇలాంటి తలపే గాలిబ్ ఒక కవితలో అంటాడు.

    దర్ద్ కా హద్ సే గుజరనా హై, దవా హో జానా
    (दर्द का हद से गुज़रना है दवा हो जाना।) “హద్దు దాటే దాకానొప్పిని భరించటం, దానికి మందు”.అని అనువదించుకోవచ్చేమో.

    శకుంతలా పరిణయం కావ్యంలో కూడా పచ్చబొట్టు ప్రస్తావన వస్తుంది.

    అనుయాయుడుకి బదులు అనునాయుడు అను లేఖకదోషం ఈ వ్యాసానికి దిష్టి చుక్క.

    [ముద్రారాక్షసాన్ని సవరించాము. తెలిపినందుకు ధన్యవాదాలు. — సం.]

  3. మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    06/21/2026 5:15 pm

    వేంకటరమణగారు, మీ వ్యాసం 2012 లో ఈమాటలో వచ్చినప్పుడు చూచినట్లు లేను. My loss! మీరు ప్రస్తావించిన చాలా పద్యాలు ఒకప్పుడు కంఠతా నేర్చుకున్నవి.

    ఈ రోజు వేరొకచోట “గంగా సంగమమిచ్చగించునె? మదిన్ గావేరిఁ దేవేరిగా …” అన్న పద్యం ప్రస్తావన వస్తే “తెనాలి రామకృష్ణ” సినిమాలో తీసివేయబడిన కొన్ని పాటలు, పద్యాలలో ఇదొకటి అని కామెంటు రాస్తూ “ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా …” గురించి కూడా ప్రస్తావించాను. పద్యం మొదటి పాదమే గుర్తుంది, Google లో వెతికితే మీ వ్యాసం కనబడింది. అలా ఇప్పుడు చదవగలిగాను.

    ఈ పద్యం, సినిమా చివరిలో తెరపై “శుభం” పడేప్పుడు మాధవపెద్ది గొంతుకలో వస్తుంది. వచ్చేది అనాలేమో! ఇప్పుడు మట్టి రికార్డుపైన మాత్రమే మిగిలింది. ) నిజానికి ఈ పద్యం గురించి సుమారు 30 ఏళ్ళ క్రితం “తెలుసా” అన్న e-mail discussion group లో ఒకసారి రాసాను. సినిమాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, సినిమాలో వచ్చే tenaali కవి గారి మరొక పద్యం “తరుణ శశాంక శేఖర మరాళమునకు సారగంభీర కాసార మగుచు…” (ఉద్భటారాధ్య చరిత్రంలోనిది).

  4. ఓడిస్సీ – చివరిమాట గురించి రావు వేమూరి అభిప్రాయం:

    06/21/2026 12:04 pm

    రూపేష్ గారికి, కొండలరావు గారికి ,
    ఓపికగా చదివి మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయత్నం ఒక కొలిక్కి రాడానికి ఈమాట సంపాదకవర్గం – ప్రత్యేకించి ఉ. శ్రీనివాస్ గారు – అందించిన సహాయం చాలా ఉంది.

  5. ఓడిస్సీ – చివరిమాట గురించి Kondala Rao Palaka అభిప్రాయం:

    06/18/2026 12:48 pm

    Vemuri garu,
    I don’t know if I’ll ever have the time and patience to read the Odyssey. I think your easy-to-read translation is all I need. Thank you for doing all the heavy lifting for me. I concatenated all the chapters into one google doc and had great fun reading it in one go.

  6. ది అన్‌సీన్ గురించి Mala Kumar అభిప్రాయం:

    06/18/2026 12:45 pm

    మొదట కాస్త గందరగోళంగా అనిపించినా, చివర్లో రచయిత్రి చెప్పాలనుకున్న భావం అర్థమైంది. ఆలోచింపజేసే కథ.

  7. అస్తిత్వవాద సాహిత్యం: 6అ. హైడెగర్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/17/2026 7:26 pm

    బహుభాషా పాండిత్యంతో పాటు సాహిత్యం, తత్వశాస్త్రాలలో ప్రావీణ్యం ఉన్న సూరపరాజు గారి రచనలు చదవదగ్గవి. హైడెగర్ అంత సులువుగా బోధపడడు; అందుకు కొంతవరకు అతను వాడే క్లిష్టమైన పరిభాష కారణం. తెలుగులో హైడెగర్ మీద నాన్-అకడమిక్ రచనలు అరుదు; నాకు తెలిసి, వాడ్రేవు “సత్యాన్వేషణ” లోని “Letter on Humanism” సంక్షిప్త అనువాదమొక్కటే.

    కేవలం కొన్ని ఉల్లేఖనలతో మాత్రమే హైడెగర్ దర్శనాన్ని గ్రహించలేము; వచ్చే వ్యాసాల కోసం ఎదురుచూడాలి.

    ప్రస్తుత వ్యాసంలోని కాలరేఖలకి కొన్ని మార్పులు చేర్పులు:

    1919: కాథలిక్ మతాన్ని వదిలింది 1913లో కాదు, 1919లో మొదటి సంతానం కలిగిన తర్వాతే.

    1923: బ్లాక్ ఫారెస్ట్ (Black Forest) కొండల్లో కుటీర (Todtnauberg cabin) నివాసం. అతని మాగ్నమ్ ఓపస్, బీయింగ్ అండ్ టైమ్ (Being and Time), రచన ఇక్కడే.

    1931-32: నాజీ పార్టీ భావజాలం వైపు మొగ్గు.

    1933 ఏప్రిల్: ఫ్రైబర్గ్ విశ్వవిద్యాలయానికి రెక్టర్‌గా నియామకం. ఆ వెంటనే మే నెలలో నాజీ పార్టీ సభ్యత్వం. అయితే, సంవత్సరం తిరక్కుండానే నాజీ పార్టీ అనుయాయులతో, తోటి ఆచార్యులతో విభేదాలు రావడంతో రెక్టర్ పదవికి రాజీనామా. కానీ ప్రొఫెసర్‌గా కొనసాగింపు.

    1945: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ సైన్యం ఆక్రమణ, ‘Denazification’ కమిటీ విచారణ. ఫలితంగా 1949 వరకు బోధన నుండి బహిష్కరణ.

    హైడెగర్ బహిరంగంగా ఎప్పుడూ తన నాజీ అనుకూలత గురించి మాట్లాడలేదు. యూదుల మారణహోమం (Holocaust) గురించి ఒక్క మాటైనా మాట్లాడి సంజాయిషీ ఇస్తాడని కొందరు ఆశించారు. కానీ అతను మౌనం వహించాడు. బహుశా దానికి తను బాధ్యుడిని కానని.

    ఈ సందర్భంలో ఒక సాహిత్య ప్రస్తావన. 1967లో ప్రసిద్ధ యూదు కవి Paul Celan హైడెగర్ కుటీరాన్ని సందర్శించాడు. (ఇతని ప్రఖ్యాత కవిత ‘Todesfuge’ కి తమ్మినేని అనువాదం “మృత్యుమేళ“). ఆ పర్యటన తర్వాత, హైడెగర్ నోట ఓ మాట (“for a thinker’s word to come, in the heart”) కోసం ఎదురుచూడటంపై Celan రాసిన కవిత ‘Todtnauberg‘.

    1966లో డెర్ స్పీగెల్ (Der Spiegel) పత్రికకు తను చనిపోయిన తర్వాత ప్రచురించాలనే నిబంధనపై ఇచ్చిన యింటర్వ్యూ “Only a God Can Save Us“. ఆధునిక టెక్నాలజీ మూలంగా మానవుడి జీవితం సహజత్వాన్ని కోల్పోతోందని వగచాడు:

    స్పీగెల్: “కానీ ఒకరు చాలా అమాయకంగా ఇలా ప్రశ్నించవచ్చు. అంతా సజావుగానే నడుస్తోంది కదా. విద్యుత్ కేంద్రాలు పెరుగుతున్నాయి, ఉత్పత్తి పెరుగుతోంది. సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాల్లో ప్రజలు సుఖంగా ఉన్నారు. మనం సుసంపన్నమైన కాలంలో జీవిస్తున్నాం. మరి మనకు లోపించిందేమిటి?”

    హైడెగర్: “అవును, అంతా సజావుగా నడుస్తోంది. ఆ సజావుగా నడవడమే ప్రతిదాన్నీ మరింత యాంత్రికత వైపు వేగంగా నెడుతోంది. ఈ సాంకేతికత మానవుడిని క్రమంగా తన నేల నుండి, మూలాల నుండి వేరుచేస్తోంది. కొద్దిరోజుల క్రితం చంద్రమండలం నుండి తీసిన భూమి ఫోటోలను చూసి దిగ్భ్రాంతుడనయ్యాను. మనిషిని తన ఉనికి నుండి వేరు చేయడానికి అణుబాంబులు అక్కర్లేదు, ఆ పరాయీకరణ ఇప్పటికే వచ్చేసింది. మన సంబంధాలన్నీ కేవలం సాంకేతిక సంబంధాలుగా మారిపోయాయి.”

    అది 1960ల నాటి మాట. నేటి స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లని చూసి ఏమనేవాడో ఊహించుకోవచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. ది అన్‌సీన్ గురించి పి.యస్.యమ్. లక్ష్మి అభిప్రాయం:

    06/17/2026 4:42 am

    చిన్నప్పుడు వడ్డెర చండీదాస్ హిమజ్వాల చదివాను. ఇప్పుడు గుర్తులేదు కానీ వడ్లమాని మణి కథ ఇదివరకు ఒకటి చదివి చెప్పాను. ఆ లెవెల్లో వుందని. ఇదీ అంతే. సామాన్య పాఠకుడు అర్ధం చేసుకోవటం కష్టం. నేను రెండోసారి చదివినప్పుడే కొంచెం అర్ధం అయింది. మణీ అప్పుడప్పుడూ ఇలాంటి ఝలక్ ఇచ్చినా నాలాంటి మామూలు పాఠకులను కూడా గుర్తుంచుకోమ్మా కొంచెం మాకు కథ చదవడమంటే జీర్ణం కావటం కూడా.

  9. ది అన్‌సీన్ గురించి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి అభిప్రాయం:

    06/16/2026 1:19 pm

    ఈ కథ ప్రారంభం చదువుతూనే ఉలిక్కిపడ్డాను. తేలిగ్గా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయే కథ కాదని వెంటనే అర్థమైపోయింది. అందుకే కథను మరింత ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టాను.

    పగలు మన దృష్టికి రాని చాలా విషయాలు రాత్రి కాగానే కలత పెడుతుంటాయి. మనకి అర్థం కాని విషయాన్ని “ట” లతో చెప్పడం మానవ సహజం. అలాగే పగలు చెయ్యలేని చాలా పనులని ముసుగు తొలగించుకుని రాత్రి చేస్తామన్నది కూడా నిజం.

    ఎవరో అదృశ్యవ్యక్తి రాత్రి జరిగే గొడవలన్నీ ఆపేస్తున్నాడంటే అందరికీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం సహజం. కానీ మనలో కూడా అలా ప్రవర్తించే మనసుంటుందని మనకే తెలియని నిజం.

    ఈ కథంతా ఆ అదృశ్యవ్యక్తి ఎవరోననే సందేహంతోనే నడుస్తుంది.

    సార్త్రే వాక్యం, “మనం చేసిన చర్యలే మనం.” అన్న మాట ఈ ప్రశ్నకి సమాధానం చెపుతుంది.

    మన చేతలే మన మనసుకు సాక్షి అన్న విషయం స్పష్టంగా ఈ కథలో తెలుస్తుంది. దానిని చెప్పడంలో రచయిత్రి విభిన్నమైన శైలిని యెంచుకున్నారు.

    వర్ణనలలో వడ్లమాని మణి ఒక దృశ్యాన్నే ఆవిష్కరించారు.

    ఏదైనా కథ పూర్తయాక, ఆ కథను ఎదురుగా వుంచుకుని, ఆ కథలోని లోతును తరిచి చూసినప్పుడే అందులోని నిగూడార్థం బయట పడుతుంది. ఈ కథ అలాంటిదే.

    ఈ కథలో ప్రముఖ రచయిత్రి వడ్లమాని మణి చేసిన ప్రయోగం అభినందించదగ్గది.

    జి.యెస్.లక్ష్మి,(గరిమెళ్ళ సుబ్బలక్ష్మి)

  10. ది అన్‌సీన్ గురించి SRIRAM అభిప్రాయం:

    06/15/2026 10:29 pm

    రాత్రి యొక్క అంతుచిక్కని స్వభావాన్ని పట్టుకోగల రచయితలు అరుదు. దోస్తోవిస్కీ, గురుదత్ లాంటి చాలా తక్కువమంది రాత్రి యొక్క ఆత్మను పట్టుకోగలిగారు. తెలుగులో రాత్రి యొక్క అంతుచిక్కనితనాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యంగల కొద్దిమందిలో, లేదా ఓకే ఒక రచయిత్రి మణి గారు.

    కథ ఒక అనుభవం. అయితే కథను ఒక నైరూప్య అనుభవంగా మలచడం అందరికీ సాధ్యం కాదు. ఒక లీనియర్ కథనానికి అలవాటు పడిన పాఠకులకు అనుభవమే కథ అని చెబితే సందేహిస్తారు. ఈ కథ కథల యొక్క చట్రాన్ని పగుల కొట్టి బయటకు వచ్చింది. ఒక గొప్ప అనుభవాన్ని సృష్టించడానికి కొత్త తరహా వ్యక్తీకరణ అవసరం. నియామాల ఉల్లంఘన అవసరం. అవి ఈ కథలో పుష్కలంగా ఉన్నాయి.

    అలానే అందరూ నైరూప్య అనుభవాన్ని తీసుకునే పరిణతతో ఉండరు. అయినా పాఠకుల కోసం రచయిత కథలో గాఢతను తగ్గించాల్సిన అవసరం లేదు. పాఠకులే కథ యొక్క స్థాయిని శ్రద్ధ పెట్టి అందుకోవాలి. అటువంటి సవాలును విసిరే కథలు విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్తదారిలో వెళ్ళే వారికి ముళ్ళు గుచ్చుకోవడం సహజం. భరిస్తూ ముందుకుపోవాలి.