ఛందస్సు కొక కొండ కొక్కొండ

రత్నావళి

కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు సృష్టించిన జాతి పద్యాలలో రత్నావళి నిజముగా గొప్పదని చెప్పడములో సందేహము లేదు. రత్నావళి లక్షణాలను వారు క్రింది లక్షణ పద్యములో చెప్పారు. అది –

రత్నావళి –

విలసిలు రత్నావళి యను పద్యము విద్వద్వంద్యంబయి ప్రాసో-
జ్జ్వలమయి పాడఁగ నెల్లరు విన ముప్పది దినముల నెలవలె నెల నా-
ని లలి వర్ధిల నూతనముగఁ గవు లెక్కువ మక్కువఁ గనఁగొనఁగా
జెలువుగ ముప్పది మాత్రలఁ బాదము చెల్ల విరతి పదునేడింటన్

ప్రాసాదము సర్వాధారంబున్ బ్రాప్యము సర్వఫలప్రద మం-
చా సన్మంత్రస్రజమున కొలికిగనవుఁ దారకమం చది గాంచన్
వాసిగ బిల్వేశ్వరుఁ గొలువన్వలెఁ బ్రబ్బెడు జీవన్ముక్తియు నం-
చీ సముచిత రత్నేశ్వరకృతి వచియించున్ దత్త్వము శివమంచున్

– 6 ద్వితీయ భాగము, రత్నేశ సర్గము 13

ప్రతి పాదమునకు 30 మాత్రలు, పాదము 16, 14 మాత్రలుగా విరుగుతుంది, పదిహేడవమాత్రపైన యతి చెల్లుతుంది, జాతి పద్యము కనుక ప్రాస అవసరము. శార్దూల మత్తేభవిక్రీడితాలలో కూడ ప్రతి పాదానికి 30 మాత్రలు ఉన్నవి అన్న విషయము గమనార్హము. క్రింద రత్నావళిగా ఒక మత్తేభవిక్రీడితమును మీ గమనికకు తెస్తున్నాను –

భవ మందెప్పుడు నీవె యండ గద భావాతీత భవ్యప్రదా
నవమై జేయుమ నాదు జీవనము నానాచిత్రరూపమ్ములన్
శివమౌ సర్వము సంతసమ్ము లిడు శ్రీచిద్రూప శోభాస్పదా
రవముల్ మ్రోగు వసంతమౌ బ్రదుకు ప్రారంభించు సంతోషముల్

ప్రాసరహితముగా ఉండే రత్నావళిని ఏకావళి అనియు, ద్విపదగా ఉండే రత్నావళిని ద్వ్యావళి అనియు పంతులుగారు వాడినారు. ఈ రత్నావళికే కొన్ని మార్పులు చేసి గురురత్నావళిని, మహాగురురత్నావళిని సృష్టించారు. వాటి వివరాలు క్రింద చూడగలరు –

ఏకావళి – ప్రాసరహితముగఁ బరఁగిన రత్నావళి యేకావళియౌ నెటులేన్

ఇందులో ఏ పాదము ఆ పాదానికి స్వతంత్రముగా తరువాతి పాదముతో ప్రాస లేక ఉంటుంది. ఒక రెండు పంక్తులు

శ్రౌతస్మార్తా గమికములగు బహు సత్కృత్యములను దగఁ జలుపన్
శాస్త్రనిషిద్ధాచారంబులఁ గడుఁ జలుపుదు నేమనఁగల నింకన్

– 6 ద్వితీయ భాగము, రత్నదాస సర్గము 95

ద్వ్యావళి – రత్నావళి యర్ధము వేర్వేఱయి రంజిలఁగన్ ద్వ్యావళి యననౌ. ఇది రత్నావళి లక్షణములు కలిగిన ద్విపద.

అంతన్ గ్రమముగ సాంఖ్యజ్ఞానం బభివర్ధిల్లం దనుమధ్యా
కాంతుని బిల్వేశ్వరు నెల్లప్పుడు స్వాంతమునందు స్మరించుటచే

– 6 ద్వితీయభాగము, రత్నాయన సర్గము 69>

లఘురత్నావళి

అల రత్నావళియే గురు వెడలుట నంతమునను లఘురత్నా-
వళి యని పలుకంబడుఁ బదునేడిట వళి యొప్పెడు నప్పగిదిన్
దొలుతను మాత్రలు పదునాఱగు మఱి దొడరెడు ద్వాదశమాత్రల్
గలయఁగ నిరువదియెనిమిది మాత్రలు గాదె హరిహర్యైక్యంబే

రత్నావళి పాదాంతములో రెండు మాత్రలను తొలగిస్తే మనకు లఘురత్నావళి లభిస్తుంది. యతి స్థానములో మార్పు లేదు. ఇదొక్కటే రత్నావళికి (30 మాత్రలు) లఘురత్నావళికి (28 మాత్రలు) భేదము.

తా సమకూడిన యక్షర సాంఖ్య సుధారసమున్ దా నొకఁడే
గ్రాసముగాఁ గొన కెల్లర కిడుట వరంబని సంస్కృత భాషన్
జేసెద తండల మార్గదాయినిని జెప్పెఁ దెనుంగున సారం
బా సువర్ణమణిమాలికఁ జెప్పెద నారయుఁ డీరు దగంగన్

– 6 ద్వితీయభాగము, రత్నాయన సర్గము 53

గురురత్నావళి – (అదనపు నాలుగు మాత్రలు వాలు అక్షరాలలో చూపబడినవి.)
తల్లఘురత్నావళి పదముపయిన్ దనరిన నాలుగు మాత్రల్ యతితోఁ దార్కొన్న ద్వాదశమాత్రల్
చెల్లెడు గురురత్నావళి పద్యము చెల్లెడు ద్వ్యేకావళులున్ వలసినఁ జేయఁగనౌ నెటులేనిన్

30 మాత్రల ప్రతి రత్నావళి పాదము పిదప యతి లేక నాలుగు మాత్రలు, యతితో 12 మాత్రలు ఉంటాయి ప్రతి గురురత్నావళి పాదానికి. ఈ గురురత్నావళి ఏకావళిలా కూడ ఉండవచ్చును.

రత్నమనంగ నరుం డొకరుం డిటు రత్నదాసుఁ డనఁ బరగెన్ బదపడి రత్నగుప్తుఁడనఁ దనరెన్
రత్నవర్మయననై యటుపిమ్మట రత్నశర్మయనఁగఁ దగెన్ సాంఖ్య ప్రజ్ఞానంబును గనుటన్
రత్న మనంగను బ్రాసాదము దారక మని యర్థ మెఱింగెన్ గని త ద్రత్నాయనములఁ జనియెన్
రత్నాయనుఁడని పేరందెన్ మఱి రత్నేశ్వరుఁడే యయ్యెన్ వింతయె రత్నము రత్నమె యయ్యెన్

– 6 ద్వితీయభాగము, రత్నేశ సర్గము 11

మహాగురు రత్నావళి – (అదనపు రెండు మాత్రలు వాలు అక్షరాలలో చూపబడినవి.)
రత్నావళి పాదముపై నిరు మాత్రలు యతిముఖముగ మనుమాత్రల్ దన రను గ్రమముగఁ జెప్పిన నొప్పున్
యత్నమున మహాగురురత్నావళి యను పద్యము ద్వ్యావళిగానే నే కావళిగానేణియుఁ దగెడున్

ఇందులో రత్నావళి పాదము పిదప యతి లేక రెండు మాత్రలు, యతితో 14 మాత్రలు ఉంటుంది. ఇది ఏకావళి లేక ద్విపదగానో ఉండవచ్చును.

రత్నేశుఁడు బిల్వేశుఁడె యౌటను రత్నములౌదురు తద్భక్తుల్ నర రత్నములౌదురు శ్రీయుక్తుల్
రత్నాయన కృత మగుటను సాంఖ్యము రత్నాయన మది గనుట నరుల్ నవ రత్నా యన నవరత్నేశుల్
రత్నము ప్రాసాదము దారక మా రత్నములన్ గని రంజిలుఁడీ నర రత్నములుగ మీరలు గండీ
రత్నమనన్ బ్రణవంబును బ్రహ్మము రత్నమనన్ నరుఁడౌటఁ గనన్ నర రత్నము బ్రహ్మం బౌనుగదా

– 6 ద్వితీయభాగము, రత్నేశ సర్గము 12