ఛందస్సు కొక కొండ కొక్కొండ

పరిచయము

ఛందశ్శాస్త్రము ఒక మహాసాగరము వంటిది. అందువల్లనే కాబోలు కొందరు లాక్షణికులు తమ గ్రంథాలకు ఛందోంబుధి, వృత్తరత్నాకరము, కవితాసాగరము అనే పేరుల నుంచారు. నాలుగు పాదాలు ఒకే విధముగా నుండే ఒకటినుండి 26 అక్షరాలవరకు ఉండే సమవృత్తాలను 134,217,726 విధములుగా వ్రాయవచ్చును. ఇవి గాక అర్ధసమ వృత్తాలు, విషమవృత్తాలు, జాతులు, తెలుగులో ఉపజాతులు ఉన్నాయి. ఒక సీస పద్యపు పాదాన్ని186,624 విధములుగా వ్రాయవచ్చును. ఛందస్సులో ఇలా ఎన్నో గణితాంశాలు దాగి ఉన్నాయి. ఈ గణిత సౌందర్యాన్ని ఒకప్పుడు నేను వివరించి ఉన్నాను[1]. ఎన్నో రకాల వృత్తాలు, కందాది జాతులు, గీత్యాది ఉపజాతులు ఉన్నా కూడ, నన్నయనుండి నేటివరకు కవులు వీటిలో కొన్నిరకాల పద్యాలను మాత్రమే తమ కావ్యాలలో ఉపయోగించారు. అందులో ఖ్యాతవృత్తాలు నాలుగు – చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము. కవులందరు ఎక్కువగా జాతి పద్యమైన కందమును వాడారు. తెలుగు భాషలో ఈ కందము సంస్కృతములోని అనుష్టుప్ శ్లోకపు స్థానాన్ని ఆక్రమించుకొన్నది. అందుకే తెలుగులో శ్లోకము అరుదు. ఉపజాతులలో ఆటవెలది, తేటగీతి, సీసము ఎక్కువగా వాడబడినవి. ఇవి కాక కొన్ని మత్తకోకిలలాటి విశేష వృత్తాలను, ఉత్సాహలాటి జాతులను కూడ సమయోచితముగా కవులు ఉపయోగించారు. నన్నయ, నన్నెచోడుడు వృత్తౌచిత్యములో అందెవేసిన కవులు. తిక్కన స్త్రీపర్వములో ఎన్నో అరుదైన వృత్తాలను వాడారు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణ కల్పవృక్షములో సుమారు 400లకు పైగా వృత్తాలను, జాత్యుపజాతులను ప్రయోగించారు. ఇటీవల వేము భీమశంకరం రసస్రువులో ఛందోవైవిధ్యాన్ని చూపారు. కాని ఒక విషయము, ఈ కవులందరు లక్షణ గ్రంథాలలో ఉండే వృత్తాలను మాత్రమే వాడారు. తాము స్వతంత్రముగా కొత్తగా కనిపెట్టిన వృత్తాలు చాల తక్కువే అని చెప్పవచ్చును.

పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో [2] ఎన్నో కొత్త వృత్తాలను ఉదహరించారు. తరువాత పందొమ్మిది, ఇరవై శతాబ్దాలలో జీవించిన కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు ఎన్నో వృత్తాలను, జాత్యుపజాతులను కనుగొనడము మాత్రమే కాక, వాటిని తన గ్రంథాలలో (ముఖ్యముగా బిల్వేశ్వరీయములో) ప్రయోగము చేసినారు. ధర్మవరం రామకృష్ణాచార్యులు, వేదం వేంకటరాయశాస్త్రి, రాయదుర్గము నరసింహశాస్త్రి మున్నగువారు కూడ నూతన వృత్తాలను, జాత్యుపజాతులను కనుగొని తమ రచనలలో వాడారు[3]. ఈ శతాబ్దములో తిరుమల కృష్ణదేశికాచార్యులు కొన్ని ప్రయోగాలను చేసిన విషయము గమనార్హము. వైయక్తికముగా న్యూజెర్సీ వాస్తవ్యులు సుప్రభగారు (పావులూరి ప్రభావతి) ఎన్నో కొత్త గణ వృత్తాలను, మాత్రా వృత్తాలను కనుగొని ఛందస్సు, రచ్చబండ గుంపులలో వాటికి ఉదాహరణలను పద్యరూపముగా నిచ్చారు. గడచిన పది సంవత్సరాలుగా నేను ఈ ఉద్యమములో నిరంతర కృషిని సలుపుచున్న విషయము అందరూ యెరిగినదే. ఉన్న వృత్తాలలోని విశేషాంశాలు, అందులో దాగియుండే అపురూపమైన నడకలు, ఎన్నో కొత్త వృత్తాలు, తాళబద్ధమైన మాత్రా వృత్తాలు, సంగీతానికి సాహిత్యానికి ఉండే పద్యరూపమైన అవినాభావ సంబంధాన్ని విశదీకరించే ఉదాహరణలను తెలుపుతున్నాను.

కొక్కొండ వేంకటరత్నము పంతులు


కొక్కొండ వేంకటరత్నము
(1842-1915)

ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు ఛందశ్శాస్త్రములో చేసిన గొప్ప కృషిని అందరికీ తెలుపడము మాత్రమే. కొక్కొండ వేంకటరత్నము పంతులు 1842-1915 మధ్యకాలములో జీవించారు. వీరి తండ్రి నరశింగశర్మ, తల్లి రమాంబ (రామమ్మ, రామాయమ్మ). మొదటి భార్య పేరు సుబ్బమ్మ, వేంకట లక్ష్మీనరసింహులని యిద్దరు కొడుకులు. పరవస్తు చిన్నయసూరి పిదప మదరాసు రాజధాని కళాశాలలో 1878-1899 కాలములో తెలుగు పండితుడుగా పని చేసారు. (వీరి తరువాత వీరేశలింగముగారు ఈ పదవిని అలంకరించారు.) తరువాత రాజమండ్రిలో కూడ పని చేసారట. అక్కడ వీరు రత్నకవి గ్రంథాలయము అని ఒక గ్రంథాలయమును కూడ స్థాపించారు. ఇది తరువాత గౌతమీ గ్రంథాలయములో ఒక భాగమైనది. వీరి తనయుడు కుమారనరసింహం తరువాత శాంతానందస్వాములని ప్రసిద్ధి పొందారు. వీరి రెండవ కుమార్తె బెహరా కమలమ్మ కమలాంబికగా బాలత్రిపురసుందరీపీఠాన్ని అధిరోహించారు.

పంతులుగారు సాంఖ్యయోగములో దిట్ట. వీరికి కవిబ్రహ్మ, కవిరత్న, మహామహోపాధ్యాయ అనే బిరుదులు ఉండేవి. వీరి రచనలు – పంచతంత్రము (విగ్రహము – వచన రచన), సింహాచలయాత్ర, బిల్వేశ్వర శతకము, బిల్వేశ్వరీయము, కోరుకొండ మాహాత్మ్యము, మంగళగిరి మాహాత్మ్యము, గోదావరీ వర్ణనము, గోవిందమంజరి (భజగోవిందము తెలుగు సేత), దీక్షితచరిత్రము, Prince of Walesను గురించి వ్రాసినది, సంస్కృత మహాశ్వేత తెలుగు అనువాదము, నరకాసురవిజయ వ్యాయోగము, ధనంజయవిజయ వ్యాయోగము అనే రెండు వ్యాయోగ నాటకాలు, ప్రసన్న రాఘవమునకు తెలుగు అనువాదము. ఇందులో వీరి మహాశ్వేతను కొందరు మొదటి తెలుగు నవలగా గుర్తిస్తారు. వీరి నరకాసురవిజయ వ్యాయోగము తెలుగులో మొట్ట మొదటి నాటకపు ప్రచురణ (కోరాడవారి మొట్టమొదటి నాటకము మంజరీ మధుకరీయము తరువాత ప్రచురించబడినది). ఇందులో బిల్వేశ్వరీయము, గోవిందమంజరి, దీక్షితచరిత్రము Digital Library of India (DLI)లో లభ్యము. బిల్వేశ్వరీయము కొన్ని నెలల ముందు రత్నకమలాంబికా సేవ ట్రస్ట్ ఆధ్వర్యాన పునర్ముద్రించబడినది.

ఆ సంధియుగములో తెలుగు సాహిత్యములో ముగ్గురు హేమహేమీలు ఉండేవారు, వారు – కొక్కొండ వేంకటరత్నము పంతులు, కందుకూరి వీరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి. అందరూ చిన్నయ సూరి విధానమే అనుసరించారు. కాని వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ. ముగ్గురికీ మూడు పత్రికలు ఉండేవి – కొక్కొండకు ఆంధ్రభాషాసంజీవని, వీరేశలింగమునకు వివేకవర్ధని, వేంకటరాయశాస్త్రికి వారి స్నేహితులైన పూండ్ల రామకృష్ణయ్య నడిపే అముద్రిత గ్రంథచింతామణి. వీటిలో ఎప్పుడు ఒకరిని మరొకరు దుయ్యబట్టేవారు. వ్యావహారిక భాషావాదులైన గిడుగు రామమూర్తిపంతులుకు వీరెవ్వరి ధోరణి నచ్చకపోయినా, మిగిలినవారు దురుసుగా, అమర్యాదగా, అనవసరముగా కొక్కొండను విమర్శించారని అభిప్రాయపడ్డారని గిడుగు సీతాపతి చెప్పారు[4]. పంతులుగారు శుద్ధ గ్రాంథికవాదులు అనడములో అతిశయోక్తి యేమాత్రము లేదు. వారు తన స్వగృహములో భార్యతో, బంధువులతో, బయట వర్తకులతో, పనిమనుషులతో గ్రాంథికములోనే మాటలాడేవారట. ఆశువుగా గ్రాంథికభాషలో ప్రాసానుప్రాసలతో చక్కగా కర్ణానందముగా ఉపన్యాసాలను యిచ్చేవారట.

వృత్తాలను ఎందుకు కనుక్కోవాలి?

కోట్ల కొలది వృత్తాలు ఉన్నా కూడ, వాటిలో పేరున్న వృత్తాలు సుమారు 1000-2000 మాత్రమే[5]. అందులో కూడ సంస్కృతాంధ్ర కవులు ఒక 50-100 వృతాలు మాత్రమే తమ కావ్యాలలో వాడినారు. తెలుగు కవులు చంపకోత్పలమాలలను, శార్దూలమత్తేభవిక్రీడితాలను మాత్రమే విరివిగా నుపయోగించారు. కవికి ముఖ్యమైన కర్తవ్యము తన కావ్యములో రక్తికరముగా, ఆసక్తికరముగా కథను నడిపించడము, వర్ణనలను చేయడము, యిత్యాదులు. దీనికి తాను ఎన్నుకొన్న యే వృత్తమయినా సరిపోతుంది. ప్రతియొక్క కవి కొన్ని పద్యాలను మలచడములో ప్రతిభావంతుడు, ఉదా. పోతన మత్తేభాలు, శ్రీనాథుని సీస పద్యాలు, సోమనాథుని ద్విపదలు మున్నగునవి. ఈ కొన్ని వృత్తాల ప్రయోగములో కవులు అసమాన చాతుర్యాన్ని ప్రదర్శించారు. కాని కొందరు కవులకు కొత్త కొత్త చట్రములో పద్యాలు యేలాగుంటాయో అనే కుతూహలము కలుగుతుంది. ఆ జిజ్ఞాసను పూర్తి చేసికోవడానికి విశేష వృత్తాలలో పద్యాలను వ్రాసినారు. చాల మంది కవులు ఆశ్వాసాంతములో యిలాటి వృత్తాలను ఉపయోగించారు. కొన్ని వృత్తాలు లయబద్ధముగా, తాళబద్ధముగా ఉంటాయి, ఉదా. లయగ్రాహివంటి ఉద్ధురమాలావృత్తాలు, రగడలు, దండకము మున్నగునవి. చక్కగా వ్రాయబడిన యిట్టి తాళవృత్తాలను పాడుకొని ఆనందించవచ్చును. యక్షగానాలలో ఇట్టివి పదేపదే గోచరిస్తాయి.

ఎవరెస్టు, కాంచనజంగ, కిలిమంజారో, పైక్స్ పీక్ మున్నగు పర్వతశిఖరాలను వ్యయప్రయాసల కోర్చి యెందుకెక్కాలయ్యా అంటే దానికి జవాబు అవి ఉన్నాయి కనుక, వాటిని యెక్కాలి. అదే విధముగా కొత్త కొత్త పద్యాలను ఎందుకు సృష్టించాలి అంటే అవి ఉన్నాయి, ఆ అమరికలో వ్రాయబడిన పద్యాలు ఎలా వినబడుతాయో అనే ఆదుర్దాను తీర్చుకోడానికి అన్నదే నా జవాబు. బహుశా ఈ కారణాలవల్లనే పంతులుగారు కూడ యెన్నో విశేష వృత్తాలలో వ్రాసినారు, మఱి కొన్ని వృత్తాలను, జాతి పద్యాలను సృష్టించి ఆ చట్రములో తన కవితను పదిల పరచినారు.

ఛందశ్శాస్త్రములో తన నూతన పంథాను గురించి , తాను వ్రాసిన కావ్యములను గురించి ఈ క్రింది పద్యాలలో చెప్పుకొన్నారు (ఆ పద్యముల ఛందస్సును తరువాత వివరిస్తాను).

బంగారము
బిల్వేశ్వరీయమన్ విదిత ప్రబంధంబు
వివిధ సద్వృత్తాళి విస్తరించి పేర్మి మించి
వెండి బంగారముల్ వెలయించి యాంధ్రభా-
షాసీస దుస్థితి నోసరించి వాసిఁ గాంచి
యంతియే కాక రత్నావళుల్ గల్పించి
యాంధ్రు లెందఱనొ భూషాంచితులఁగ నాదరించి
గురుత విశ్వామిత్ర గోత్రగౌరవ మెచ్చఁ-
గన్ గవిబ్రహ్మ నా ఖ్యాతిఁ గాంచి కరము మించి
తేఁటి
సముచితాక్షర సాంఖ్యశాస్త్రము నొనర్చి సరవిఁ బేర్చి
కనితి వర్ణసాంఖ్యాచార్యుఁ డనఁ బ్రసిద్ధి ఘన సుసిద్ధి
గన మహామహోపాధ్యాయ ఘన బిరుదము వినుతి యెందు
నిఖిల పండిత కవివంద్య నీకె తగును నీకె తగున్

– శ్రీదీక్షితచరిత్రము, అవతారిక 11.