ఛందస్సు కొక కొండ కొక్కొండ

చిత్రకవిత్వము

పంతులుగారు చిత్రకవిత్వములో కూడ కసరత్తు చేసినవారే. గర్భకవిత్వముగా వీరు వ్రాసినవి – మత్తేభవిక్రీడిత కందగర్భ సీసము, భుజంగప్రయాతవృత్తగర్భ స్రగ్విణి, కందపద్య తనుమధ్యావృత్త గర్భిత ప్రియకాంతావృత్తము, అనుష్టుబ్గర్భ పంచపాదిగీతాంచిత సీసము, శ్రీకరవృత్తగర్భ చంద్రశేఖరవృత్తము. ఇందులో మొదటి రెంటిని ఇతర కవులు (ఉదా. తిమ్మన, పాపరాజు) కూడ వ్రాసియున్నారు. ఇవి గాక రథబంధము, చతుర్దళ పద్మబంధము, అష్టదళపద్మబంధ స్రగ్ధరా వృత్తము, షోడశదళపద్మబంధ సీసము, చక్రబంధము, బిల్వబంధము, గోమూత్రికబంధము, స్రగ్ధరలో పుష్పమాలికాబంధాది బంధకవిత్వమును కూడ మలచినారు. దురదృష్టవశాత్తు, ఒక్క రథబంధానికి తప్ప మిగిలినవాటికి చిత్రాలు లేవు. నేను చక్రబంధము, గోమూత్రికాబంధము, పుష్పమాలికాబంధము, అష్టదళపద్మబంధములకు చిత్రాన్ని సృష్టించాను.


చక్రబంధము

ఇందులో కేంద్రమునుండి మూడవ వలయములో (గులాబి రంగు) కవిరత్నకృతి అనియు, కేంద్రమునుండి ఆరవ వలయములో (కాషాయపు రంగు) బిల్వేశ్వరీయము అనే కావ్యనామమును గమనించవచ్చును. ఇవి గాక ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్ర్యక్షరి, చతురక్షరులను కందపద్యములుగా వ్రాసినారు. ద్వి, చతుర్, పంచ ప్రాసాక్షరాల పద్యాలను రచించారు. ఓష్ఠ్య నిరోష్ఠ్య, సంకర కందములను, అచలజిహ్వ, అస్పర్శ కందములను కూడ వ్రాసినారు. 36 మారులు సహస్ర పదమును ఉపయోగించి శ్లోకములను, దేవ్యష్టోత్తరశతక్షేత్రసీసమాలికను, మహిషాసురమర్దినీ కంద నవరత్నహారమును, స్త్రీనీతికంద నవరత్నహారమును వ్రాసినారు. వీరి చిత్రకవిత్వములో కొన్నింటిని అనుబంధము-2లో చదువవచ్చును.

శివపార్వతుల పెళ్ళి సందర్భముగా ఆనందగీతము, కల్యాణగీతము, నలుగు పాట, పూలబంతులాట పాట, మంగళగీతము, లాలిపాట, శోభనగీతములను వ్రాసినారు. అందులో ద్విపదలో వ్రాసిన కల్యాణగీతమును ఈ వ్యాసములో చదువవచ్చును. ఇవి కాక నరసింహస్వామిపైన నవరత్నగీతమాలిక నొకటి సంస్కృతములో సృష్టించారు.

ముగింపు

ప్రాచీన కావ్యశైలి, కవితారీతికి సాయంసంధ్య పందొమ్మిదవ శతాబ్దము. ఆ సంధ్యాకాశములో నిజముగా శుక్రతార కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు. కవిత్వము, పాండిత్యము, సృజనాశక్తి, శాస్త్రజ్ఞానము, కౌతూహలము, నైర్మల్యత, ధర్మచింతన అనే సప్తస్వరాలతో సాహిత్యవిపంచిని మేళవించిన మహనీయు డితడు. వారి గ్రంథములను ఈ తరమువారు చదివి అవగాహన చేసికొనవలసిన అవసరము తప్పక ఉన్నది.

కొండయు నీవు పాండితిని గోవిదుఁడై యలరారినావు, కొ-
క్కొండయె నీవు ఛందమున కొల్లలుగా నవ వృత్తరీతులన్
నిండుగ వ్రాసినావు, కవినిష్ణుఁడ వేంకటరత్నశర్మ, మా
గుండెలలోన నుందువయ కోమల గ్రంథ సుగంధవీచితోన్


గ్రంథసూచి

  1. జెజ్జాల కృష్ణ మోహన రావు, తానా పలుకు, డెట్రాయిట్, 2005.
  2. పొత్తపి వేంకటరమణ కవి, సం. రావూరు దొరసామి శర్మ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు, 1979.
  3. రావూరు దొరసామి శర్మ, తెలుగు భాషలో ఛందోరీతులు, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.
  4. జీ. వి. సీతాపతి, History of Telugu Literature, సాహిత్య అకాడెమీ, కొత్త ఢిల్లీ, 1968.
  5. కొక్కొండ వేంకటరత్న శర్మ, బిల్వేశ్వరీయము, కలారత్నాకర ముద్రాక్షరశాల, చెన్నపురి, 1893.
  6. కోవెల సంపత్కుమారాచార్య, ఛందఃపదకోశము, తెలుగు అకాడెమీ, హైదరాబాదు, 1977.
  7. హరి దామోదర వేళంకర్, జయదామన్, హరితోష సమితి, బొంబాయి, 1949.
  8. సం. రాయవరపు రామస్వమి, పరిష్కర్త రావూరి దొరసామి శర్మ, కవితాసాగరము, శ్రీపతి ముద్రణాలయము, కాకినాడ, 1962.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...