విధ్వంసం

తెల్లారితే కన్నెమ్మకి పెండ్లి. కన్నెమ్మ గుడిసె దగ్గర పెండ్లి జోరు ఏమీ కనబడటం లేదు. కన్నెమ్మ, ఆమె అమ్మి కురువమ్మ ఎప్పటి తీరుగానే గుడిసె ముంగిట కూర్చొని వున్నారు. చుట్టు పక్కన ఉన్న ఆడోళ్ళు కూడా వచ్చి కూర్చుని ఆమాటా ఈమాటా మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగేదానికంతా కురువమ్మే నోరు తెరిచి జవాబు చెబుతోంది. కన్నెమ్మ ఎప్పటి లాగానే అన్యం పుణ్యం తెలీని పిల్లలా కూర్చోనుంది. ఆమెకి ఇప్పుడు ఇరవై నిండింది. ఈడుకొచ్చి ఇప్పటికి నాలుగేండ్లయింది. ఈ నాలుగేండ్ల బట్టి కురువమ్మ ఒక్క తీరుగ పోరుతూనే వుంది. ఆమె సోబతు ఈడు కొచ్చిన పిల్లలందరికి ఒక్కేడు, రెండేండ్లలో పెండ్లిళ్ళు అయి వెళ్ళి పోయారు. వాళ్ళంతా ఇప్పుడు చంకన ఓ బిడ్డ, కడుపున ఒక బిడ్డ అన్న తీరున ఉన్నారు. కన్నెమ్మ మాత్రమే పెండ్లి కాకుండా ఇంటి దగ్గర పడి ఉంది. అది చూసినప్పుడల్లా కురువమ్మకి కడుపు మండిపోతుండేది.

కురువమ్మకి పెండ్లి అయ్యిన నెలలోనే కన్నెమ్మ కడుపున పడింది. ఆమె పెనిమిటి కాలయ్యకి సంబరం పట్టలేదు. కాని కన్నెమ్మ పుట్టక ముందే, చంటిదాని మొఖం చూడక ముందే కాలయ్య చచ్చిపోయాడు. కాని ఇప్పుడే చచ్చినట్లుందని కురువమ్మ మాటకోసారి అనుకుంటూ గుబులు పడుతుండేది. కన్నెమ్మ ఈడుకొచ్చిన దగ్గర్నుండీ, కాలయ్య జ్ఞాపకాలతో కురువమ్మకి ప్రతిరోజూ మనసు కష్టమయ్యేది.

“ఎవరనుకుంటిమి గట్ల పోతడని. ఎప్పటి సంది బాయి తవ్వడానికి ఎల్లిండు. నెలలు నిండినయి. జర బద్రంగా ఉండమని తనతో చెప్పిఎల్లినోడే. మద్యానం సరిగ్గా కిరస్తానోల్ల గుడిలో పన్నెండు గంటలు కొట్టేకాడికి, ఆణ్ణి పీనుగ లెక్క తెచ్చి పడేసిండ్రు. బాయిలో బాంబు పెట్ట బోయిండట. గట్లనే వాణ్ని తీసి పారేసిందట. బాంబు పేలి సచ్చిండో లేక దెయ్యం కొట్టి కాలం చేసిండో ఏమీ తెలియకపాయే. నన్ను బద్రంగా ఉండమని వెళ్ళినోడు వాడే లేకుండా పోయిండు. కడుపులో బిడ్డ మాత్రం లేకపోతే అప్పుడే నేను కూడా పానం తీసుకొని వాడితోనే పోయుండేటి దాన్ని. కడుపులో బరువుపెట్టి పోయిండు. దాని కోసం గిట్ల పానాన్ని చేతుల పట్టుకొని తిరుగుతున్నా. ఇగ ఆమెని ఒకయ్య చేతిలో మంచి తీరుగ పెట్టితే గదే చాలు.”

“సర్లె సర్లె. అన్నీ మంచిగ జరుగుతయి. నువ్వూర్కెనె లొల్లి పెట్టుకుంట కూసోకు. మేమంతా ఇప్పుడు లేమా ఏందీ? అందరం కలిసి జేసినమంటే మంచిగ అయితది. కురువీ, నీకు గుబులెందుకైతదే. పోయి జరంత తిని పండుకో. మేం పొద్దుగాలనే వస్తం. మరిడెమ్మ గుడికే కదా రమ్మని చెప్పిండ్రు. అందరం కలిసే పోదం. సరేనా! ఒసే కన్నమ్మా! అమ్మిని తీస్కపోయి జర గంజి కాచి తాపించు.” పక్కింటి ముత్తమ్మ ధైర్యం చెప్పింది.

కన్నెమ్మ పెండ్లి గురించి ఊరంతా ఒకటే ముచ్చట. ‘ఎంతయినా కురువమ్మ గట్టిదేనే. మొగుడు బోయినంక గూడ ఒంటిగనే పిల్లను పెద్ద చేసింది. కన్నెమ్మకి ఏం తక్కువాయె? సూడనిక్కి సక్కగుంటది. ఇన్నేళ్ళ సంది ఒక్క పోరగాడు కూడా పిల్లని అడగడానికి రాలేదు కందా. పాపం ఆ పోరి తన పనేదో తను జూసుకుంటున్నమా, గంజి నీళ్ళు తాగినమా అన్నట్లు ఉండిపాయే. పిల్ల ఉన్న సప్పుడే తెలియక పాయె. నోరనేది లేకుండె. ఆమె కూడా పెండ్లి చేసుకుని పోతె, కురువమ్మ ఒంటిగ బిక్కు బిక్కుమంటూ బతకాలె.”

“అక్కోవ్! నువ్వు చెప్పనీకి ఏముంది? ఈ కాలంలో ఏ పోరగాడు ముక్కుతీరు, ముకం తీరు చూసి లగ్గం జేసుకుంటున్డు? ఎంత బంగారం పెడతాండరు? సామాన్లు ఏమేమి ఇస్తాండరు అని దెయ్యం లెక్క తిరుగుతాండరు. కాస్త ఉన్నోల్లుగా ఉంటేనే పిల్లను అడిగి వస్తున్నరు. లేనోల్లు గిట్లనే పడి ఉంటిరి. గిప్పుడు కూడ కన్నెమ్మని పిల్ల అడిగి వచ్చింది ఎవరనుకుంటున్నవు? ఒక ముసలాడే. కొంచం కూడా సిగ్గు శరం లేకుండా అరవై ఏండ్ల ముసలోడు ఇరవై ఏండ్ల పిల్లను పెళ్ళి చేసుకుంటానని బయలు దేరి వచ్చిండు.”

“నిజమానె నువు జెప్పేడిది?”

“మల, అబద్దం చెప్తనా ? ఏదో గవర్మెంటు ఉజ్జోగంల నుంచి రిటైరయినడంట. పెండ్లం సచ్చి ఇంకా సమత్సరం కూడా కాలేదంట. గంతలనే ఇంకో పెండ్లం కావాలని వస్తుండు.”

“పిల్లలు గిట్ల ఎవరూ లేరంటనా?”

“ఎందుకు లే? మంచిగున్నరు. ఇద్దరు పోరీ లిద్దరు పోరగాల్లు. వొక్కనిగ్గూడ పెండ్లి గాలే. అందరూ పెండ్లీడు కొచ్చిన్రంట. ఇంటామె మంచిగ ఉంటే, ఈల్లందర్నీ చక్కగ చూస్కుంటుండె. పాపం కాన్సరొచ్చి పోయిందంట. సిత్రం తెల్సునా, ఆ యమ్మి సావు బతుకుల మద్దె ఉన్నప్పుడే వీడు పిల్లను సూడనిక్కి బయలుదేరిండంట. ఆమె సావనికి ముందు పెనిమిటితో ‘నువ్వు ఎన్ని లగ్గాలైనా చేసుకో కానీ నా పిల్లల్ని జరంత సూసుకో. వాల్లనేదైన దారి బట్టించినంక నీకిష్టమున్నట్టు సేసుకో’ అని సెప్పి సచ్చిందంట. అయ్యా మల్లీ పెళ్ళొద్దే అని పిల్లలంతా సెప్పిండ్రట. మల్లీ బిడ్డ గట్ల పుడితే ఆస్తి కోసం లొల్లి అవుతదని అన్నరంట. అంటే, నా పెండ్లమే నన్ను పెండ్లి సేసుకోమని సెప్పి మరీ చచ్చింది. మద్దెలో మీరెవరు? నాకేమైనా పిల్లా పాపా లేరంటనా? బిడ్డ కోసమా నేను పెండ్లి సేసుకునేది? మీరంతా రేపు మొగుడ్నీ, పెళ్ళాన్నీ ఎతుక్కుంట బోతే నాకు మంచి నీళ్ళయిన ఇచ్చే దిక్కు కూడా లేకుండ ఉండాల్నా? అని అడిగిండట.”

“మంచి నీళ్ళు కుండకెల్లి ముంచుకు తాగనీకి ఈనికి సెయ్యి లేదా ఏందీ?”

“గా ముచ్చట ఆడినే అడగాలి. సెయ్యుంది, కాలుంది, ఈన్బొందలకెల్లి అన్నున్నై. ముసిలాడు బైటికి చెప్పుకునేది గా తీర్ల. వయసైపోయి మనవడు పుట్టినంక గూడా మగోనికి ఆడది కావాల్సి వచ్చె. ఏం జెప్తం, లోకమట్లున్నది. మొగోడెట్లైన ఆని మాట నిలబెట్టుకుంటడు.”

ఆడవాళ్ళ ముచ్చట్లు వింటున్న కురువమ్మకి, కన్నెమ్మకి దిగులు పెరిగింది. కన్నెమ్మకైతే కళ్ళల్లో నీళ్ళొచ్చినై.

“అమ్మా ఏందే! నాకన్నా పెద్దోళ్ళంటనే ఆయన బిడ్డలు. ఆండ్లకిష్టం లేదంట గందనే. మరి ఆ కొంపలనన్నెట్లుండనిస్తరే?”

“ఆయన సెప్పిండు గాదె! గుడిల పెండ్లి కాగానే నిను తీస్కబోతడంట. నిన్ను ఉంచేదానికి పక్కూర్ల ఇల్లు కిరాయకు తీసుకున్నడంట.”

“గట్లైతే మరి ఆ ముసలోనితో నేనొక్కదాన్నే ఉండాల్నా?”

“గాకుంటె ఏందే! మరి పెండ్లెందుకు చేస్కుంటుండనుకున్నవ్? ఆని ఆస్తి అంత ఆని పిల్లలు గుంజుకున్నరంట. పింఛనొస్తదంట నెల్నెలకి. దాంతోటే నిన్ను జూస్కుంటనని జెప్పిండు. ఆడు పోయినంక ఆ పించను నీకిస్తరు. నువ్వు సచ్చేదాక పైసలొస్తై. అందుకె గాదె ఆయనొచ్చి అడగంగనె సరేనంటి.”

“ఐతే ఇప్పుడేంది గంజిగ్గూడ లేకుండ ఆకలి బుట్టి సస్తున్ననా? నాకొచ్చిన పని జేస్కుంట తింటలేనా, ఉంటలేనా.”

తల్లీ కూతుళ్ళు మాట్లాడుకునేది చూసి కాళియమ్మ మధ్యలో కలగజేసుకుని చెప్పింది, “గంజి నీళ్ళకి గతి లేకనేమె మీ యమ్మ నీకు పెండ్లి చేస్త? మీ అమ్మ బోయినంక నీకు తోడెవరుంటరే? ముసలోడో, కుంటోడో, ఇంట్ల మొగోని తోడు కావలె గాదె. ఆడు ముసిలోడని నువ్విది గామాక. మనకెట్ల రాసుంటె గట్లనే అవుతది. ముసిలోన్తోని గన ఒకరిద్దర్ని కన్నవంటె నీ బిడ్డల్జూస్కుంటరు మంచిగ నిన్ను. కొత్తల ఆడు తిట్టిన కొట్టిన గమ్మునుండు. పూటకింత మంచిగ తిండి వండి పెట్టినవంటే మెల్లిగ ఆడే నోర్మూస్కొని పడుంటడు ఇంట్ల. సర్లే, పొద్దయింది, ఇంక బోయి పండుకో.”

‘ఇదొక పెండ్లి అనుకోవాల్నా?’ అని మనసులో అనుకున్నా బైటికి ఏమీ అనకుండా లేచి వెళ్ళింది కన్నెమ్మ. వాళ్ళమ్మ కూడా లేచి లోపలికి వచ్చింది. ఇద్దరూ తిండి తినకుండానే పడుకున్నారు. ఇద్దరికీ నిద్ర పట్టక పొర్లుతున్నా ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడు కోలేదు. దిగులుతో, గుబులుతో ఆ రాత్రిని ఎలాగో గడిపారు.

కోడి కూయగానే పక్కింటి వాళ్ళందరూ కూడి అయ్యంపేట ముసలాడు రాజయ్యకీ, మెలట్టూర్ కురువమ్మ కూతురు కన్నెమ్మకీ మరిడమ్మ గుడిలో పెండ్లి జరిపించారు. రాజయ్య తాలూకు మనుషులు గాని, పిల్లలుగానీ ఎవరూ రాలేదు. తాళి కట్టిన వెంటనే కన్నెమ్మను తనతో మంగల్కుడికి తీసుకు వెళ్ళి పోయాడు. సామాన్లు ఏమీ వద్దని చెప్పేశాడు. అందరూ ఏడిచారు. కన్నెమ్మ మాత్రం గుండెను రాయి చేసుకున్నట్టుగా అతనితో వెళ్ళి పోయింది. ఆమెకి కూడా ఏడవాలని అనిపించింది. కానీ ఏడవలేక పోయింది. మనసు మాత్రం భారంగా అయ్యింది.


గుడిసెలో కన్నెమ్మ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుని ఉంది. రాజయ్య బిడ్డలను చూసి వస్తానని అయ్యంపేటకి వెళ్ళాడు. చుట్టు పక్కల గుడిసెలో ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు కన్నెమ్మ చెవులలోనూ వినబడినాయి.

“గంజి నీళ్ళకి కూడా దిక్కులేని ఇంటి పిల్లట. తండ్రి లేడట. ఎవరూ వచ్చి పిల్లను అడగడానికి రాలేదట. అందుకే ముసలాడికి కట్టబెట్టారట. చిన్న పిల్లలాగే ఉంది. పాపం! ఈ ముసలాడికి పట్టింది యోగం.”

‘యోగం ముసలోనికి పట్టింది. నాకు శని పట్టింది. నాకిట్లనే రాసుంది. ఇగో, ఒక పనిమనిషి లెక్క ఈనికి వండి పెట్టుకుంట, ఇల్లు తుడుసుకుంట, బట్టలుతుక్కుంట బతకాలె. నా బతుకింతె!’ అనుకుంది కన్నెమ్మ.