మిత్రునికి వీడ్కోలు

(మిత్రులు భమిడిపాటి జగన్నాధ రావు గారు కాకినాడ నుంచి బదిలీ అయినప్పుడు 1976 లో)

జగన్నాధ రావు గారికి బదిలీ అయి వెళుతున్నారంటే , నిజంగా నాకు దిగులుగా ఉంది.ఆయన లేని లోటును భర్తీ చేయగలవారు మరెవ్వరూ లేరు మనూళ్ళో.

జగన్నాధ రావు గారి చదువు పుస్తక పఠనంతో ఆగిపోలేదు. మంచి అభిరుచులు సృజించుకున్నారాయన. ఆయనకీ నాకూ సామాన్యమైన అభిమాన విషయాలు చాలా ఉన్నాయి. పద్మరాజు గారి కథలు మొదలైనవి. ఇదోరకమైన బంధుత్వం మాకు.

ఆయనలో నన్ను బాగా ఆకర్షించింది ఆయన చేతనా సౌకుమార్యం(fine sensibility).సున్నితమైన అనుభూతులకు తీవ్రంగా కదిలిపోతారాయన. కృష్ణ శాస్త్రి గారన్నట్లు

నా వలెనె యాతడున్మత్త భావశాలి
ఆగికోలేడు రేగునూహల నొకింత !
ఎట్టి నిశినే నదరిపోవు నెగసిపడును
ఎన్ని చుక్కలపాటు లెన్నెన్ని మెరపులు !

ఇంత చిరుగీతి యెద వేగిరించునేని
పాడుకొనును తాండవనృత్య మాడు కొనును.

శాస్త్రి గారు భగవంతుడి గురించి చెప్పిన మాటలివి. భావశాలిత భగవదంశే మరి !

జగన్నాధ రావు గారూ , మేము కలిసి ఎన్నో సౌహార్ధ్ర సుందరమైన సాయంకాలాలు సాహిత్య చర్చల్లో గడిపాం. వారి విస్తృత పఠనమూ, విచక్షణా, అభిరుచీ చాలా సందర్భాల్లో మాకు గీటురాయై తోడ్పడ్డాయి. ఆయన ప్రోత్సాహం లేకపోతే నాకు తెలిసిన కొన్ని సభలూ, సమావేశాలూ జరిగేవి కావు. జగన్నాధ రావు గారి వంటి మిత్రులు లేకపోతే ఈ కవిత్వాలూ కాకరకాయలూ అనవసరమనిపించును నా మట్టుకు నాకు.

జగన్నాథ రావు గార్నీ, మనల్నీ కలిపి ముడేస్తూ ఇన్ని తంతువులున్నాయి. మరి వీటన్నిట్నీ ఎలా తెంపుకు వెడతారీయన?

28-5-1976


ఇస్మాయిల్

రచయిత ఇస్మాయిల్ గురించి:

కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశారు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశారు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.1976 సంవత్సరానికి మృత్యువృక్షం కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని, 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు.

 ...