గన్స్ & మాన్సూన్స్ మహి బెజవాడ రాసిన పది కథల సంకలనం. చాలా వరకు తెలుగు కథలు చదువుతున్నప్పుడు అందులో తెలిసిన సంఘటనలే కనిపిస్తాయి. ఇదివరకు ఎక్కడో చూసిన, విన్న, చదివిన విషయాలే అనిపిస్తాయి. నావరకూ, చాలా కథల ముగింపులూ ఊహించగల్గినవే అవుతాయి. కానీ మహి బెజవాడ కథలు మాత్రం మొదట్నుండీ చివరివరకూ కొత్తగా కనిపించాయి. రంగసాని, రత్నం, జార్జ్, రీనా, మీవా, శ్యామ్, మీరా, సిరిల్, బ్లాండీ, జే, మార్క్, కెప్టెన్ సనా లాంటి రకరకాల పాత్రలతో మనోరంజని పూలు, ఊదారంగు వర్షం, నారింజరంగు లాంటి ప్రతీకలతో చదవడం మొదలుపెట్టగానే ఆసక్తి పెరిగింది. కథల్లోని పాత్రలన్నీ తన జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడిన వ్యక్తులే అన్న మహి మాట చదివి ఇంత వైవిధ్యమైన మనుషులు ఆయనకే ఎలా ఎదురయ్యారు, ఇలా కలవడం ఎంత బాగుంటుంది కదా అనుకున్నాను. తరిచి చూస్తే మనకు ఎదురైన వ్యక్తుల్లో మనకు ఏం కావాలో అదే చూస్తాం. అలా తను కలిసిన వ్యక్తుల్లో అందరూ చూడలేని, అర్థం చేసుకోలేని, పట్టించుకోని కోణాలను మహి చూసారు. తనలోని అద్భుతమైన రచయిత ఆ వ్యక్తులకు, సంఘటనలకు మ్యాజిక్ను అద్ది మనకు పరిచయం చేసారు.
మహి కథల్లో చాలా వరకూ ప్రధాన పాత్రలు కళాకారులు. బహుశా తనకు వివిధ ఆర్ట్ ఫాంలలో ఆసక్తి, అవగాహన ఉండడం వల్లే ఇలా తీసుకొని ఉంటారు. మామూలుగానే ఆర్టిస్ట్లకు భావోద్వేగాలు ఎక్కువ. ఇంక ఆ పాత్రలను కథల్లో తీసుకుని వాటి లోతులను ఆవిష్కరించడంతో అవి పాఠకులకూ ఆ ఉద్వేగాన్నిచ్చి అక్షరాల వెంట దౌడు తీయించాయి.
కొన్ని కథల్లోని సందర్భాలు, కొన్ని మాటలు సహజత్వానికి దూరంగా కొంత నాటకీయంగా అనిపిస్తాయి. కానీ ఈ శైలి కూడా కొత్తగా, చదివించేలా, ఆసక్తి కలిగించేలానే ఉంది. కళ్ళముందు జరిగేవే కాకుండా ఇలా ఊహను జోడించిన కథలు కూడా రావాలి అనిపించింది. మాజిక్ రియలిజం, సర్రియలిజం తెలుగు కథల్లో చదవాలని అనుకునేదాన్ని. త్రిపుర కథల తర్వాత గన్స్ & మాన్సూన్స్లో ఆ శైలి కనిపించింది. ఈ పుస్తకం మొత్తం సంభాషణలు లేకుండా కథనం తోనే నడవడం మరో ఆసక్తికరమైన విషయం. దీనివల్ల చదివే వేగం పెరిగింది.
అన్నిట్లోకీ నాకు నచ్చిన కథ “రంగసాని”. ఇది నాటకం ట్రూప్ నేపధ్యంలో మాండలికంలో ఉంటుంది. ఇందులో ఉన్న కళ, ప్రతిభ, స్నేహం, ప్రేమ, త్యాగం అన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో కొన్ని తిట్లు మాత్రం అంత అవసరం లేదనిపించింది.
“నారింజ రంగు సిరా మరకలు” ఒక అభ్యుదయ రచయిత తన చుట్టూ, చరిత్ర చుట్టూ జరిగే అక్రమ మార్పుల్ని చూసి ఎలా కుంచించుకు పోయాడో చూపించే సర్రియలిస్టిక్ కథనం.
“మెమొరీస్ ఇన్ మొనోలాగ్” తండ్రీ, కూతుర్ల మధ్య జరిగే సంభాషణ. తప్పని సరై అంగీకరించాల్సిన బ్రేకప్లు, ఎవరికి వాళ్ళే గుండెదిటవు చేసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో భలే కథ చెప్తాడు తండ్రి కూతురికి.
“వొదిలెల్లిన జోళ్ళు” కథ ఆదర్శ లోకాన్నీ సమసమాజాన్ని కలలుకనే ఒక సామాన్యుని ఆరాటం, దానికోసం పడ్డ అతని తొలి అడుగు.
నాకు చాలా నచ్చిన మరో కథనం “ది డెడ్ మాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్”. విడిపోయిన ముగ్గురు స్నేహితుల్ని ముప్పై సంవత్సరాల తర్వాత కలవాలని తన దగ్గరికి పిలుస్తాడు మార్క్. ఆ ముగ్గురూ అతనితో ఉన్న అందమైన జ్ఞాపకాలను పంచుకుంటారు. చివర్లో మార్క్ మనుషులందరూ ఒకేలా ఉన్నారనీ, అమ్మ కరపత్రాలు పంచుతుందనీ ఇలా ఎన్నెన్నో కలవరిస్తాడు. ఆ వాక్యాల్లోని మార్మికత వాటిని మళ్ళీమళ్ళీ చదివించింది.
కాలంతో వేగంగా పరిగెడుతూ, పరిస్థితులతో పోరాడుతూ బాల్యాన్నీ గతాన్నీ వదిలేసుకుంటాం. అలాంటి స్థితిలో ఏదో ఒక క్షణాన గాఢమైన గతపు అనుభవం ఎదురైనపుడు మనసు ఎలా స్పందిస్తుందో చెప్పిన కథ “ఊదారంగు చినుకులు”.
“ఎకోస్ ఆఫ్ మెలాంఖలి” ఒక విలక్షణమైన చిత్రకారుడు మీరా గురించిన కథ. మీరా, జన్నత్, జన్నత్ లో లెక్కపెట్టలేనన్ని గుర్రాల బొమ్మలు, జన్నత్ చుట్టూ తిరిగే “అతడు”, జన్నత్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న కెప్టెన్ సనా, బ్లాండీ లతో సాగిన ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లాంటి ఈ కథను చదువుతుంటే మనసులో ఏ మూలో ఏం.ఎఫ్. హూసేన్ గుర్తుకు వస్తాడు.
“గన్స్ & మాన్సూన్స్” ముందుగా తండ్రి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్ళిన కూతురి కథలా, తర్వాత ప్రేమ కథలా అనిపిస్తూ చివరికి శాంతి సందేశంతో ముగుస్తుంది. ఏ రాజకీయ, ప్రజా పోరాటలైనా శాంతి కోసమే అని ఎల్టీటీఈ గొడవల నేపథ్యంలో చెప్పటం, శ్రీలంకను కళ్ళు ముందుకు తేవటం ఆశ్చర్యపోయేలా ఉంది…ఊహించని కథ ఇది.
‘కాగజ్కే పూల్’ లో ఒక చాలా మంచివాడైన సున్నిత హృదయుడి మనసుకు తీవ్రమైన గాయం తగిలితే ఎలా మారుతాడో చూస్తాం. అతడు గాయానికి మూలమైన ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో అనామకంగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా తన చుట్టూ సంతోషాన్ని నింపుతాడు. విషాద కథ అయినా మంచివాళ్ళు మంచి మాత్రమే చేయగలుగుతారు అనే సంతోషం కలిగింది చదువుతుంటే. తమ చుట్టూ పూలవనాలను సృష్టించేవాళ్ళను చూడ్డం బాగుంటుంది అది కథలో అయినా సరే.
‘సుందర్రావు మరణాలు’ కథలో చుట్టూ ఉన్న మనుషులు ఎంత జడ్జిమెంటల్గా ఉంటారో చూస్తాం. ఎదుటి వ్యక్తులను జడ్జ్ చేయడమే మంచిది కాదు. ఇంక తప్పుగా జడ్జ్ చేసి మాట్లాడ్డం, వాళ్ళ వ్యక్తిత్వహననం చేయడం హత్యతో సమానమే. ఇందులో స్వార్థం కూడా తోడయితే, ఇక నరం లేని నాలుక ఎలా అయినా మాట్లాడుతుంది. ఇలా చేయడం వల్ల ఒకే వ్యక్తి మళ్ళీమళ్ళీ ఎలా మరణిస్తాడో చెప్తూ చనిపోయిన తర్వాత చుట్టూ ఉండే మనుషుల సహజమైన ప్రవర్తనను చిన్న అంశాలు కూడా వదలకుండా రాసిన కథ ఇది.
ఈ కథల్లో సామాజిక అంశాలు నేరుగా కనిపించవు. కానీ గమనిస్తే చాలా రాజకీయ అంశాల ప్రస్తావన సున్నితంగా, ప్రభావం చూపించేలా ఉంది. రచయితలో వ్యక్తిగత ఆరాటం కంటే సామాజిక తపన ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలో మనిషి ఎదుర్కొనే సంఘర్షణల వల్ల వచ్చే డిప్రెషన్, బైపోలార్ లాంటి మానసిక స్థితులను చాలా చోట్ల ప్రస్తావించాడు. చుట్టూ ఉన్న అశాంతినీ, విధ్వంసాన్నీ, బాధనూ చూపిస్తూనే వాటినుండి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలలు కంటాడు. వాక్య నిర్మాణం, నేపథ్య చిత్రన చాలా అందంగా కవిత్వంలా ఉంది. దాదాపు అన్ని కథల్లో చిన్న కథలు, ఫ్లాష్ బ్యాక్ కథలున్నాయి. అసలు కథకంటే అవి ఓ మెట్టు పైనే ఉన్నాయి. కొన్ని కథలు చదివినప్పుడు పక్కనే కూచుని ఎవరో కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఆ కథ చెప్పే ఒడుపు, దానికి అమరిన శైలి, జారిపోనీయకుండా పొదివిపట్టుకున్న ఆశావహమైన కలల వెలుగు, ఈ పుస్తకపు బలాలు.