హిందూ మతం అంటే ఏమిటి?హిందువులు ఎవరు? లాంటి ప్రశ్నలు ఆధునిక కాలంలో ఎప్పుడూ చర్చనీయాంశం గా వున్నాయి. ఈ ప్రశ్నలు అసలు మతం అంటే ఏమిటి? ఇండియాలో అసలు మతం ఉందా? కులాలు మాత్రమే ఉన్నాయా అనే ప్రశ్నలకు దారి తీసాయి. ఈచర్చ తెలుగునాట కూడా జరగడం ఆసక్తికరం. తెలుగు మేధావుల నేపథ్యంలో ఈ వ్యాసం సాగుతుంది.
భారతదేశంలో అసలు మతం ఉందా? ఈ ప్రశ్న ప్రధానంగా పాశ్చాత్య వలసవాద తాత్వికుల నుండి ఉద్భవించింది. భారతదేశానికి చరిత్ర, న్యాయం, చట్టం వంటి భావనలు ఉన్నాయా అని ప్రశ్నించిన క్రమంలోనే భారతీయులకు మతం ఉందా అనే ప్రశ్న మొదలైంది. అసలు భారతీయులు అంటూ ఉన్నారా, వారిని ఎలా నిర్వచించాలి అనే ప్రశ్న కూడా దీని అంతర్భాగమే. గత వేల సంవత్సరాలుగా యవనులు (గ్రీకులు) కానీ ముస్లింలు కానీ ఇంత వేరుగా నిలబడి భారతీయుల అస్తిత్వం గురించి ప్రశ్నలను సంధించలేదు. పాశ్చాత్య వలసవాదం జ్ఞానపరమైన ఆధిపత్యాన్ని నెలకొల్పడంలో ఈ ప్రశ్నించే ధోరణి ఒక భాగం. ప్రశ్నించే స్థానంలో ఆంగ్లేయ వలస పాలకులు ఉంటారు, ప్రశ్నించబడి సమాధానం చెప్పవలసినది భారతీయుడు.
ప్రశ్నించే ఆంగ్లేయ వలసవాది పూర్తిగా పాశ్చాత్య క్రైస్తవ దృక్పథం నుండి ప్రశ్నిస్తాడు. దాంతో, ప్రశ్నించబడే భారతీయుడు బోనులో నిలబడి పాశ్చాత్య క్రైస్తవ కొలతలు, ప్రమాణాల ప్రకారం సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. వలసవాది “భారతీయులకు మతం ఉందా?” అని ప్రశ్నించినప్పుడు, పాశ్చాత్య ప్రొటెస్టెంట్ క్రైస్తవ నమూనా గల మతం ఉందా అని అర్థం. అంటే, చర్చి లాంటి వ్యవస్థ, ఒకే దేవుడు, ప్రామాణిక గ్రంథం, పూజారి, ‘క్రియేషనిజం’ వంటివి ఉన్నాయా అని తాత్పర్యం. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలోనే పాశ్చాత్య క్రైస్తవ నమూనాతో తయారుచేసిన ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ వంటి సంస్కరణ సంస్థలు పుట్టుకు వచ్చాయి.
‘హిందూ’ అనే పేరుపై సందేహాలు
అన్నింటికన్నా పెద్ద ప్రశ్న: అసలు భారతీయులకు ఒక మతం ఉంటే దాని పేరేమిటి? ముస్లింల కాలంలో ‘హిందూ’ అనే పదం మతపరంగా పెద్దగా వాడబడలేదు. ముస్లిమేతరులను, అబ్రహమిక్ మతాలకు చెందని వారిని హిందువులు అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ జనాభాను స్పష్టంగా వర్గీకరించారు, జనాభా లెక్కలు సేకరించారు. ఈ క్రమంలో హిందూ మతం అనే పేరును కూడా వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే, ఈ పేరు పైన ఎప్పుడూ సందేహాలే.
‘పేరు సమస్య’
హిందూ మతాన్ని బ్రాహ్మణిజం కు లేదా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ ధర్మానికి పర్యాయపదంగా వాడడం కూడా వలసవాద కాలంలో స్థిరపడిపోయింది.
బ్రిటిష్ వారు ‘రెలీజియన్ ఆఫ్ బుక్’ కి చెందినవారు కనుక, విద్యావంతులైన బ్రాహ్మణులను హిందూ ప్రతినిధులుగా భావించారు. కానీ ఆశ్చర్యంగా, ‘హిందూ’ అనే పేరుపై బ్రాహ్మణ పండితులలో కూడా సందేహాలు అలాగే మిగిలిపోయాయి. 1986లో రాణి శ్రీనివాస శాస్త్రి “హిందూ శబ్దము భారతీయము కాకపోగా అతినీచమైనది” అనే పుస్తకం రాసి స్వయంగా ప్రచురించాడు. దీనికి తర్క వేదాంత సామ్రాట్ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి ముందుమాటలో సంకోచం వ్యక్తం చేస్తూ, “కొంతమంది ఆధునికులకు ఈ గ్రంథమును చూచిన దురాగ్రహము కూడా కలుగును అని నాకు అనిపించింది” అన్నాడు. ఇక్కడ దురాగ్రహం కలిగేది సంప్రదాయం, శాస్త్రం తెలియని ఆధునికులకు మాత్రమే కానీ సనాతనులకు కాదని మాణిక్యశాస్త్రి హృదయం. “ఇట్టి పరిశీలన సమర్థులు మన భారతదేశమునందు ఉండుట మన మహాభాగ్యము. ఇట్టి సమర్థులను మన భారతీయులు గ్రహించకపోవుట దౌర్భాగ్యమని నాకు తోచినది” అంటూ ఇది కలి ప్రభావం అంటాడు.
వేదార్థ సామ్రాట్ రేమెళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి ఇలా అంటారు: “మన మతము హిందూ మతం అని, మన దేశము హిందూ దేశమని, మనం హిందువులమని చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్న మాట నిజమే. కానీ హిందూ శబ్దం ఎందుకు వాడబడుచున్నది? ఈ శబ్దం మన ప్రాచీన ఆర్ష వాంగ్మయములో కలదా? అని పండితులు విమర్శ చేయలేదు. ఆర్ష వాఙ్మయమున హిందూ శబ్దము కానరాదు అన్న మాట నిజం.”
ప్రముఖ సంస్కృత పండితుడు ఆచార్య పోలూరి హనుమజ్జానకీ రామశర్మ, “హిందూ అనేది పూర్తిగా రాజకీయ పదం అని, మత సంస్కృతిని సూచించదని” స్పష్టం చేశాడు. “ఈ దేశమును పుణ్యభూమిగా అభిమానించు వారిని, ఇతర మతాల వారి నుండి ప్రత్యేకించి ఒక సమాజముగా పేర్కొనుటకు హిందూ శబ్దము రాజకీయముగా ఇటీవల పైకి వచ్చినది” ఈ సందర్భంలో హిందూ మహాసభ పాత్రను కూడా ప్రస్తావించాడు. “హిందువులు అనగా వేద ధర్మపరాయణులైన వారే కాక, వేద ధర్మమునకు దూరమైన బౌద్ధులు, జైనులు, సిక్కులు మొదలగు వారు కూడా ఈ దేశమును పుణ్యభూమిగా భావింతురు. కావున ముస్లిములలో, క్రైస్తవులలో ఎవరైనా ఈ దేశమును పుణ్యభూమిగా భావించిన వారు కూడా హిందువులే. కావున హిందూ శబ్దము దేశాభిమాన సూచకమే కాని వేద ధర్మంను స్ఫురింపజేయునది కాదు.” సావర్కర్ అసలు హిందుత్వ కు సనాతన ధర్మానికి సంబంధం లేదు అని, పూర్తి ఆధునికం అన్నాడు.
ఐతే తెలుగునాట స్వాతంత్ర్యానంతరం కూడా హిందూ మతం అనే పేరు పైనే ఇలా సందేహాలు వ్యక్తం కావడం విశేషం. పైగా బ్రాహ్మణ సంస్కృత పండితులు ఆ పదం పూర్తిగా రాజకీయ పదమని తేల్చివేయడం గమనించదగినది. హిందూ అనగానే మతం కన్నా రాజకీయాలే గుర్తుకు రావడానికి కారణం ఇదే.
నిఘంటువులలో ‘హిందూ’ అర్థం
అసలు మత నామధేయ చర్చ కేవలం ఆంధ్ర దేశానికి పరిమితం కాదు. 1872లో కాశీలో అఖిల భారత మహాసభలలో మహా పండితులు, నిరుక్త వ్యాఖ్యానకర్త దుర్గా దత్ పండితుడు ‘హిందూ’ అనే పేరు సనాతనం కానే కాదని, పైగా చెడు అర్థాన్ని సూచిస్తుందని స్పష్టం చేశాడు. పర్షియన్ నిఘంటువులలో ‘హిందూ’కు అనేక నీచార్థాలు ఉన్నాయి. అయితే, ఇంగ్లీష్ నిఘంటువులలో ఉన్న అర్థాలను కూడా రాణి శ్రీనివాస శాస్త్రి పేర్కొన్నాడు.
1978 వెబ్స్టర్స్ న్యూ వరల్డ్ డిక్షనరీ ప్రకారం, ‘హిందూ’కు మూలపదం ‘హినా’ లేదా హిగ్నా’ రైతు, కూలీ అని అర్థం వస్తుంది. దీనితో పాటు, లోకజ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. శ్రామిక జనం పట్ల శిష్ట వర్గ దృక్పథం నుండి ఈ అర్థాలు వచ్చి ఉండవచ్చు. 1972 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ‘హిందూ’కు నీచార్థాలు ఉన్నాయని శ్రీనివాస శాస్త్రి పేర్కొన్నాడు. శ్రీనివాస శాస్త్రి సిద్ధాంత విచారణ ప్రకారం, ‘హిందూ’ శబ్దం వైదికం, సనాతనం కాకపోగా, శ్రామిక కులాలకు సంబంధించినది. ఈ శబ్దం శ్రామిక కులాల పట్ల చిన్నచూపు నుండి నీచార్థంలోకి పరిణమించింది. కారణం భారతీయ ఆచారాలను పాగన్ అని,, గ్రంథం మత వ్యవస్థ లేని అప్రామాణిక మతానికి చెందినవి అని భావించడం వల్ల కూడా అలా పిలిచారా?
కంచ ఐలయ్య దళిత బహుజన దృక్పథం
రాణి శ్రీనివాస శాస్త్రి హిందూ శబ్దానికి బుద్ధిహీనుడు అని అర్థంతో పాటు, పొలం పనివాడు, శ్రామికుడు అనే అర్థం ఉందని ప్రకటించిన దశాబ్దం తర్వాత, కంచ ఐలయ్య అనే అతి శూద్ర మేధావి “నేను హిందువును కాదు” అని ప్రకటించుకున్నాడు. “శూద్రులలో అతి తక్కువ కులాల్లో, అతిశూద్ర కులాల్లో, (వీరినే నేను దళిత బహుజనులు అంటాను) పుట్టిన మాకు హిందూ మతంతో, హిందూతో అసలు సంబంధం ఏమిటి అన్నదే ప్రశ్న. నేను అంటే నేనొక్కడినే కాదు, నాతో పాటు ఈ దేశంలో పుట్టిన ఈ దేశం దళిత బహుజనులు ఎవరూ ఎప్పుడూ ‘హిందువు’ అన్న మాట వినలేదు – ఒక మాటగా కానీ, సంస్కృతిగా కానీ, మతంగా కానీ, హిందూ మతం గురించి వినలేదు.” అని కంచ ఐలయ్య అంటాడు. శ్రీనివాస శాస్త్రి బ్రాహ్మణ ధర్మ శాస్త్రాల ఆధారంగా ‘హిందువు’ అనే పేరును, అటువంటి పిలుపును తిరస్కరిస్తే, కంచ ఐలయ్య తన అతిశూద్ర ఉనికి ద్వారా దానిని తిరస్కరించాడు. అయితే, కంచ ఐలయ్య దృష్టిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు మాత్రమే హిందువులు. సకల పౌరాణిక దేవతలు హిందూ దేవతలు. వారితో దళిత బహుజనులకు సంబంధం లేదు. క్రైస్తవులతో, ముస్లింలతో తిండి, ఆచార వ్యవహారాలలో దళిత బహుజనులకు కొంత సంబంధం ఉంది కానీ, అగ్రవర్ణాలు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతో) ఎటువంటి సంబంధం లేదు. అగ్రవర్ణ శూద్రులను ఈ లిస్టులో చేర్చలేదు ఐలయ్య. శూద్ర కులాల వారు కూడా హిందువులు కాదు ఐలయ్య తత్వంలో. వారు దళిత బహుజనుల సహజ మిత్రులు. అందుకే వారు చేసే దాడుల పట్ల మౌనం వహిస్తారు అనుకుంటా.
ఐతే కంచ ఐలయ్య ముస్లింలు, క్రైస్తవులు తమకు మిత్రులని ప్రకటించాడు. ఐలయ్య తనని తాను బౌద్ధుడిగా ప్రకటించుకున్నప్పటికీ, క్రైస్తవాన్ని మానవీయ మతంగా ప్రకటించే వ్యాసాలు రాశాడు. ఐలయ్య తన పేరు చివర ‘షెఫర్డ్’ అని చేర్చుకున్నాడు.
ఐలయ్య గారి వైఖరికి భిన్నంగా దళిత బహుజన జానపద సంస్కృతిలో క్రైస్తవుల నుంచి వస్తున్న ముప్పును గురించి మరో బహుజన మేధావి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతాడు. ఆయన కుల పురాణాలు, కుల సంస్కృతులు, గిరిజన సంస్కృతులపై చాలా పరిశోధన చేశాడు. జాంబపురాణం గానం చేసే కుటుంబాలు క్రైస్తవంలోకి మతాంతరీకరణ చెందుతున్నాయి. “నష్కల్ గ్రామంలో డక్కలి స్త్రీలు ఆదివారం బౌండు పుస్తకం చేతిలో పట్టుకుని కరుణపురం చర్చికి గుంపులుగా బయలుదేరుతున్నారు. ఎన్నడూ లేని విధంగా డక్కలి కళాకారులు ఇప్పుడు తమ కుటుంబ స్త్రీలను వదిలి పురుషులు మాత్రమే జాంబ పురాణం ప్రవచనం చేయడానికి బయలుదేరుతున్న సమయం ఇది. పాత జాంబవ సంస్కృతితో జీవించడానికి సరిపడని ప్రపంచం ఒకటి సృష్టించబడుతున్నది. ఈ కొత్త మత ప్రభావాల్లో జాంబపురాణంలోని సృష్టి కథనాలు, జెనెసిస్ మార్పు పొందే అవకాశం ఉంది.” ఈ తరం గొప్ప బహుజన మేధావి జయధీర్ తిరుమలరావు ఇక్కడ కొత్త మత ప్రభావాల గురించి మాట్లాడుతున్నారు(మరో మేధావి ఏకే ప్రభాకర్ కూడా). ఈ మత ప్రభావాల వల్ల క్షీణిస్తున్న కథనాల గురించి మాట్లాడుతున్నారు కానీ మతం గురించి కాదు. ‘హిందువు’ లాంటి అస్తవ్యస్త, అయోమయ పదాల జోలికి వెళ్లకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. కానీ కంచ ఐలయ్య మెచ్చుకునే బిబ్లికల్ సంస్కృతి వల్ల జానపద పౌరాణిక కథనాలకు వచ్చే ముప్పుని ప్రస్తావిస్తున్నాడు. కంచ ఐలయ్య కూడా జానపద, శ్రామిక సంస్కృతులు భిన్నమైనవి అని చెబుతూ జానపద దేవతల గురించి ఎక్కువగానే చెబుతాడు. కానీ ఆయన ‘యూనివర్సల్ రెలిజియన్స్’ (బౌద్ధ, క్రైస్తవాలలో) తన ఉనికిని వెతుక్కుంటాడు. ఇంగ్లీషులో రచనలు చేసి విశ్వవ్యాప్త గుర్తింపు పొందారు ఐలయ్య. అందువల్ల ఆయనకు గ్లోబలైజ్డ్ ఐడెంటిటీ అవసరమైంది. తన పేరు చివర ‘షెఫర్డ్’ అని చేర్చుకోవడం క్రైస్తవంతో అనుబంధాన్ని సూచిస్తుంది.
ఆయన కొన్ని వ్యాసాలలో హిందూ మతం అత్యంత హింసాత్మక మతం అని, హిందూ దేవతలు ఆయుధ ధారులు అయ్యి ఉంటారని పైగా హిందూమతం సోమరుల మతమని, క్రైస్తవం శాంతియుత మతమని శ్రామిక జనాల మతమని రెండు మతాలని పోలుస్తూ రాశాడు. జాతీయంగా తనను తాను బౌద్ధుడుగాను, అంతర్జాతీయంగా క్రైస్తవంతో తన ఉనికి ముడిపడి ఉన్నట్టుగాను ఐలయ్య అంతరంగం కావచ్చు. తెలుగులో మాత్రమే రచనలు చేయడానికి పరిమితమైన జయధీర్ తిరుమలరావుకి ఈ ప్రపంచీకరణ సమస్య లేకపోవచ్చు. అందుకే క్రైస్తవం వల్ల జానపద కథనాలకి (మతానికి కాదు) వచ్చిన ముప్పుని అంత స్పష్టంగా ప్రస్తావిస్తాడు. జయధీర్ తిరుమలరావు వంటి వారు మత గుర్తింపును గురించి కాక కమ్యూనిటీలు, తెగలు, కుల సంస్కృతుల ప్రత్యేకతల గురించి మాట్లాడతాడు. స్థానిక కథనాలు సంప్రదాయాలు పిల్ల కాలువలు అయితే, మతాలు మహాసముద్రాలు. ఆధునిక కాలంలో మతాలు జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ఐడెంటిటీని ఏర్పరుచుకోవాల్సిన అగత్యంలో పడ్డాయి. ఈ ఆధునికత తెచ్చిన సమస్య అలా ఉంచితే, కంచ ఐలయ్య తాను హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందనని చెప్పుకున్నాడు. “ఐ యామ్ నాట్ ఏ హిందూ” అనే పుస్తకంలో. ఈ మూడు పెద్ద మతాల కంటే తన ప్రత్యేక యాదవ అస్తిత్వం భిన్నమైనదని ఆయన చెప్పదలుచుకున్నాడు.
బ్రాహ్మణ మేధావులు – మత గుర్తింపు
అంతకు చాలా ముందే ‘హిందూ’ అనే పదాన్ని తిరస్కరించిన బ్రాహ్మణ మేధావి రాణి శ్రీనివాస శాస్త్రి, దాని స్థానంలో భారతీయ, వైదిక పదాలు స్వీకరించాలని భావించాడు. కానీ ఆ పదాలు ఏవీ ఒక పాపులర్ రెలీజియన్కి ప్రాతినిధ్యం వహించలేవు. అందుకే ‘హిందూ’ అనే పదానికి అంత ప్రశస్తి వచ్చింది. కనీసం అబ్రహమిక్ మతాల కి విడిగా ఉండే పెద్ద సమూహాన్ని ‘హిందూ’ సూచిస్తుంది కానీ, వైదికం కాదు.
సంప్రదాయం నుంచి మతంలోకి
జానపద సంప్రదాయాలు అంతరిస్తున్నాయనే బాధ బహుజన మేధావి జయధీర్ తిరుమలరావులో కనబడుతుంది.
మరో రూపంలో గ్రామీణ సంప్రదాయాలు నశిస్తున్నాయనే బాధ విశ్వనాథ సత్యనారాయణలో కూడా కనపడుతుంది. ఆయన కూడా మౌఖిక సంప్రదాయానికి ఎనలేని ప్రాముఖ్యతను ఇస్తాడు. బ్రాహ్మణ నేపథ్యం నుంచి ఎక్కువగా విశ్వనాథ రాస్తాడు. అయితే, బ్రాహ్మణేతర కులాలని గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. పాశ్చాత్య క్రైస్తవ ప్రభావాలు సంప్రదాయాలతో సంఘర్షించడాన్ని విశ్వనాథ బలంగా చిత్రీకరించాడు. వలసవాద సంక్షోభం నుంచి భారతీయ ఆధునికత అభివృద్ధి చెందినట్లు, క్రైస్తవ స్థానిక సంప్రదాయాలు సృష్టించిన కల్లోలం నుంచి హిందూమత భావన పుట్టింది. వలస క్రైస్తవానికి అనుకరణగా మతం, హిందూ మతం అనే భావన బలపడ్డాయి.
హిందూమత సహన స్వభావం
క్రైస్తవ మిషనరీ అయిన ఎమ్మా రొషాంబు క్లౌ 1899లో ఇలా అన్నారు: “నంబూరి కుటుంబం బ్రాహ్మణ మాలలలో ప్రసిద్ధమైంది. వారి పూర్వీకులు పూజారులుగా ఉన్నారు. రామానుజాచార్యుల నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ కుటుంబం వారసత్వ పౌరోహిత్యాన్ని స్వీకరించింది. రామానుజ మతంలోని పూజారి విధులతో తృప్తి చెందక, ఆనందయ్య చర్మ నిష్ట శాఖలో చేరాడు. శాఖలు మార్చడం, అభ్యంతరాలు ఎదుర్కోకపోవడం హిందూ మతంలోని అపరిమిత సహనానికి నిదర్శనం. అయితే, ఇది సామాజిక వ్యవస్థకు ఆధారమైన కుల వ్యవస్థను ముట్టుకోనంత వరకే. ఆలోచించగల హిందువుకు శివుడు, విష్ణువు, ఇతర దేవతలు ఒకే పరమేశ్వరుని ప్రతిరూపాలు. ఈ పరమత సహనం క్రైస్తవానికి వర్తించదు, ఎందుకంటే అది కులాలకు వ్యతిరేకమైన తిరుగుబాటును సృష్టిస్తుంది.”
ఇక్కడ ‘హిందూ మతం’ అనే పదాన్ని ఈ క్రైస్తవ మత పెద్ద వాడుతున్నాడు. కానీ ఇక్కడ కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు మాత్రమే ఉన్నాయి. ఒక మతపర వ్యవస్థ బలంగా లేదు. అందువల్ల ఒక సంప్రదాయం నుంచి మరొక సంప్రదాయంలోకి చలనం సులభం. దానిని అడ్డగించే, నిషేధించే బలమైన మత పెద్దల వ్యవస్థ లేదు. అదే సహనానికి కారణం. కానీ ఈ స్థానికత, సాంస్కృతికత కులాలపై ఆధారపడి ఉంది. అందువల్ల హిందూ మతం అంటే కులాల కలగూరగంప. అంబేద్కర్ లాంటి వారి అభిప్రాయాలు ఈ క్రైస్తవ ప్రతిధ్వని మాత్రమే. ఒకప్పుడు హిందూమతం ఒక ప్రచారక మతం, కానీ తర్వాత కులాలుగా చీలిపోయింది అంటాడు. (అంబేడ్కర్ బ్రాహ్మణ సంస్కృత గ్రంథాల ఆధారంగా హిందూ మతాన్ని నిర్వచిస్తాడు. స్థానిక సంస్కృతులు పట్టించుకోడు. ఇది వలస క్రైస్తవ ప్రభావం). మరి విప్లవం ఏమిటి? క్రైస్తవం, క్రైస్తవాన్ని అనుకరించే నవ బౌద్ధం. బౌద్ధంలో కర్మ, పునర్జన్మ, నిర్మాణం లాంటి విశ్వాసాలని పూర్తిగా వడగట్టి నిర్మించిన కొత్త పాశ్చాత్య క్రైస్తవ హేతుబద్ధ నిర్మాణం.
వలస క్రైస్తవం తెచ్చిన విప్లవం ఏమిటి? అది కులాలని, కుల సంస్కృతులను నిజంగా నిర్మూలించిందా? దాని కల్లోలం యొక్క ఫలితం ఏమిటి? అది సృష్టించిన సంక్షోభం, కల్లోలం యొక్క ఫలితం హిందూత్వ ఆవిర్భావం. మతం అనే భావన లేని ఇండియాలో మత భావన బలపడటం, దానికి వ్యతిరేకంగా సెక్యులరిజం అవసరం కావటం.
హెన్రీ వైట్హెడ్ అనే క్రైస్తవ మిషనరీ, జాతర్లలో జంతుబలులు తీవ్ర జుగుప్స కలిగిస్తాయని రాశాడు. కానీ ప్రాచీన యూదుల జంతుబలులలో ఉన్నత దైవ భావన అంతర్లీనంగా ఉంది. స్థానిక మొరటు గ్రామదేవతలు, జంతుబలులలో అటువంటిది లేదు అన్నాడు. గ్రామదేవత పూజలలో బ్రాహ్మణ పూజారులు లేకపోవడం గురించి బాధ వ్యక్తం చేస్తాడు. బ్రాహ్మణ ఆచారాలు, సంప్రదాయాలని ఆర్య సంస్కృతి అని మెచ్చుకుంటాడు. ఆశ్చర్యంగా సంప్రదాయ బ్రాహ్మణ పండితుడు ముదిగొండ వెంకట రమణశాస్త్రి గ్రామదేవతల ఆచారం సనాతన ధర్మం అని నిరూపిస్తాడు తదన్నాస్తస్య దేవతాః అనే రామాయణ శ్లోకం ఉదహరిస్తూ, మాంసాహారులు మాంసాన్ని నైవేద్యం పెట్టడం ధర్మం అంటాడు.
శిష్ట పూజారి వ్యవస్థ లేని ఆచారాలు, సంప్రదాయాలు క్రైస్తవానికే కాదు, వలస ఆధునికతకు కూడా ముప్పుగా కనిపించాయి. అందువలనే క్రైస్తవ మిషనరీలు గ్రామదేవతలపై, అతిశూద్ర సంప్రదాయాలపై పరిశోధన చేసేది. వాటిని నిర్మూలించి, వాటి స్థానంలో చర్చి లాంటి వ్యవస్థను నిర్మించడానికి. అలాగే అతిశూద్ర, దళిత సంస్కృతుల పట్ల ఆసక్తి ప్రేమ, మెగా రెలిజియన్స్లో వాటిని నిమజ్జనం చేయడానికి మాత్రమే. ఎందుకంటే భారీ ఉత్పత్తి, మహా నిర్మాణం పై ఆధారపడిన ఆధునికత స్థానికతలను ఒప్పుకోదు.. అందుకే బ్రాహ్మణ సంస్కృతి మిగులుతుంది కానీ అతిశూద్ర దళిత సంస్కృతులు బలహీనపడుతున్నాయి. ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే మత వ్యవస్థ వైపు ముందడుగే ఈ పరిణామం. అది ఒకే జాతీయ దేవుడు రాముడు గుడి ఉద్యమానికి కారణమైంది. ఆ ఉద్యమంలో అతిశూద్రులు, దళితులు భాగమయ్యారు. ఈ మెగా రెలిజియన్స్ వ్యాప్తిలో ప్రధానంగా ఆంగ్ల భాష ప్రాధాన్యం వహిస్తోంది. హిందూ మతం అనే భావనని జాతీయ, అంతర్జాతీయంగా పరివర్తన చేసినది ఆంగ్ల మాధ్యమమే.
స్వామి వివేకానంద, హిందూమతం అన్ని మతాల దృక్పథాలని ఇముడ్చుకుందని, అయితే సారాంశంలో హిందూమతమే అన్ని మతాల కన్నా ఉన్నతమైన మతమని అన్నాడు. అయితే ఇటువంటి యూనివర్సల్ మూలాలు కూడా వలస క్రైస్తవంలోనే ఉన్నాయి. ఆధునిక హిందూమతం ఒక ప్రచ్ఛన్న క్రైస్తవం. ఈ విషయాన్ని సులభంగా వివరించడానికి ఉదాహరణ ఇస్తాను. బ్రాహ్మణీకరణ ప్రాధాన్యాన్ని గుర్తించిన రాబర్ట్ డి నోబిలి (1577-1656), ఒక ఇటాలియన్ జెస్యూట్ మిషనరీ. ఆయన బ్రాహ్మణ సన్యాసి వేషధారణ చేశాడు. బ్రాహ్మణ ఆచారాలు పాటించాడు, జంధ్యం ధరించాడు. క్రైస్తవ త్రిత్వానికి అది చిహ్నం అన్నాడు. సంస్కృతం నేర్చుకుని వేదాల అధ్యయనం చేశాడు. యేసు వేద అనే గ్రంథాన్ని రచించాడు. అంటే బ్రాహ్మణ సంస్కృతిని గౌరవిస్తూ, దానిని అంతిమంగా విశ్వమతమైన క్రైస్తవంలో మేళవించాడు. ఇదే రీతిలో స్వామి వివేకానంద క్రైస్తవాన్ని అంగీకరిస్తూ ఒక యూనివర్సల్ మత ప్రచారం చేశాడు. అదే హిందూ మతం. ప్రధానంగా యూనివర్సల్ మతంగా, మిగిలిన సిద్ధాంతాలు, వేదాంతాలు పక్కనపెట్టి కేవలం శంకర అద్వైత వేదాంతం ఆధారంగా ఈ హిందూ అస్తిత్వాన్ని, హిందూ మతం అనే భావనని బలపరిచాడు వివేకానంద. సావర్కర్ హిందూ ధర్మ భావనని ఒక చారిత్రక, రాజకీయ కోణంలో బలపరిచాడు. శ్రీలంకకు చెందిన బౌద్ధ గురువు అనగారిక ధర్మపాల బౌద్ధాన్ని ఒక విశ్వజనీన మతంగా నిలిపాడు. ఈయన కూడా వివేకానంద లాగే విశ్వ మత మహాసభలలో ప్రసంగించాడు. వీరు అందరూ యూనివర్సల్ రెలీజియన్ అనే పాశ్చాత్య క్రైస్తవ దృక్పథం వల్ల ప్రభావితం అయ్యారు.
మెగా నాగరికతలు, అమెరికా పాశ్చాత్య నాగరికతలు
మెగా జాతి రాజ్యాలు, మెగా పరిశ్రమలు గ్రామాలని, అడవులను, చెదురుమదురుగా ఉన్న వృత్తులని ధ్వంసం చేసినట్లే, యూనివర్సల్ మతాలు విస్తరించటం స్థానిక సంస్కృతులకి, సంప్రదాయాలకి ముప్పుగా మారింది. టెక్నాలజీలో వచ్చిన మార్పు సంస్కృతిలో కూడా ప్రతిబింబించింది. క్రైస్తవ, హిందూ మతాలు ఆధునిక రూపం ధరించిన మతాలు. స్థానిక సంస్కృతులు, సంప్రదాయాలకు ముప్పుగా మారాయి. బహుళత్వం స్థానంలో ఏకీకృత నిర్వచనం బలపడింది. దీని వల్ల సాంస్కృతిక సామ్రాజ్యవాదం బలపడింది.
చిన్న అస్తిత్వాలు – మెగా మతాలు
చిన్న అస్తిత్వాలని మెగా అస్తిత్వాలు, మెగా మతాలు లీనం చేసుకోవడం గురించి ఒక ఉదాహరణ ఇస్తాను. సామాజికవేత్త జోయల్లీ (Joel lee) ఉత్తర భారతదేశంలో ప్రధానంగా లక్నో లో పరిశుద్ధ కార్మిక కులాల సంప్రదాయం గురించి రాశాడు. వారు వాల్మీకి ని దేవుడు గా కొలుస్తారు. ఐతే ఆ వాల్మీకి సంస్కృత రామాయణ ఋషి ఏమాత్రం కాదు. ఆధునిక కాలంలో హిందూ జాతీయవాదులు వారిని హిందువులుగా ముద్ర వేస్తున్నారు. వాల్మీకి జయంతి ఉత్సవాల ద్వారా హైందవీకరించాలని చూస్తున్నారు. వాల్మీకి ఋషి విగ్రహాలు స్థాపించారు. కానీ వీరు ఒక ప్రత్యేక మత సమూహం అని అనలేము. సూఫీ కేంద్రాలు, ఇస్లామీయ మత ఆచారాలు, ఈ సమాజాల మత జీవితంలో కీలక పాత్ర పోషించాయి. వీరిలో కొందరు 1940 నుండి 1970 మధ్యకాలంలో తమ ముస్లిం పేర్లన్నీ (రుక్సానా, నజీర్, అల్లా, రఫీ) విడిచి పెట్టేశారు. లాల్ బేగి అనే కులం పేరు వదిలి వాల్మీకి అని పేరు పెట్టుకున్నారు. ఈ మార్పు రావడం కోసం కాంగ్రెస్ కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రోత్సహించింది. వీళ్లను హిందూ స్రవంతిలో కలపడం కోసం ఋషి వాల్మీకి విగ్రహాలు వెలిశాయి. ‘వాల్మీకి అనిలాల్ బాగ్’ అని పిలవబడే ఈ కుల ఋషికి రామాయణ కథలతో సంబంధం లేదు.
ఆశ్చర్యం. ఇప్పుడు హిందువులు అని పిలవబడేవారు అందరూ ఆచరించే సత్యనారాయణ వ్రతం మూలాలు సత్యపీర్ అనే సూఫీ గురువు ఆరాధన ఆయనకు సంబంధించిన కథలలో ఉన్నాయి అని పరిశోధకులు అంటారు. అలాగే చాలామంది హిందువులు ముస్లిం మూలాలు కల షిరిడీ సాయి బాబాను పూజించడాన్ని హిందువాదులు వ్యతిరేకిస్తున్నారు.
నామరూపాలే జగత్తు అంటారు వేదాంతులు
అంబేద్కర్ పేరు ప్రాధాన్యాన్ని గుర్తించాడు. ఆయన ఇలా జనసమూహాలు హిందూ ఐడెంటిటీలో భాగం కావడానికి ఇష్టపడలేదు. కానీ తమ ప్రాచీన అస్తిత్వాలు, సంప్రదాయాలు, పేర్లను కొనసాగించడం కూడా అంబేడ్కర్ దృక్పథానికి విరుద్ధం. పాత అస్తిత్వాలు పేర్లు అణచివేతలో భాగం అని ఆయన భావన. ఆయన పూర్తి ఆధునిక వాది. అందుకే అంబేద్కర్ సూఫీ తత్వం, స్థానిక దళిత సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపలేదు.
ఈ పరిశుద్ధ కార్మికుల వాల్మీకి తత్వంలో సూఫీ తత్వం ఉంది. కానీ అంబేద్కర్ కోరుకున్నది ఒక మెగా రెలిజియన్. దానికి నవబౌద్ధం అని పేరు పెట్టాడు. అదొక జాతీయ మతంగా ఆయన భావించాడు.
ఆధునికత మరియు స్వచ్ఛ అస్తిత్వం
జాతి రాజ్యాల ఏర్పాటు, జనాభా సేకరణలు, ప్యూరిటీ -పొల్యూషన్ అనే భావాలకి కొత్త అర్థాన్ని ఇచ్చాయి. ఏమాత్రం విదేశీ మత సంకరం లేని స్వచ్ఛ మతం కోసం తహతహ మొదలైంది., అస్తిత్వాలని ఒకే ఒక మత అస్తిత్వంగా నిర్వచించటం, దానికి ఒకే ఒక మతం పేరు పెట్టడం, ఆ మతానికి ఇతర మతాలతో ఎటువంటి సహకారం లేదు అని నిరూపించటం అత్యవసరం అయింది. ఇదొక జాతీయ దురహంకార వైఖరిగా మారింది.
బహుళ దేవతలు, సంప్రదాయాలు భారతదేశంలో ‘హిందూ మతం’గా వ్యవహరించే సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. అయితే, అయోధ్య రామాలయ నిర్మాణ సందర్భంలో శ్రీరాముడిని ఒకే హిందూ దేవుడిగా ప్రపంచవ్యాప్త మీడియాలో ప్రచారం చేశారు.
1979లో ప్రచురించిన తన గ్రంథంలో ముదిగొండ వెంకటరామశాస్త్రి భారత ఖండంలోని పుణ్యక్షేత్రాలను మూడు రకాలుగా వర్గీకరించారు: ఆగమికములు, వైదిక ఆగమికములు, కేవల వైదికములు. కొన్ని క్షేత్రాల్లోని ఆలయాలలో బ్రాహ్మణులు మాత్రమే పూజించడం ధర్మం, మరికొన్నిటి లో నాలుగు వర్ణాల వారు పూజించవచ్చు, ఇంకొన్నిటి లో (కలకత్తా కాలిక, అమ్మ దేవతలు) తాంత్రిక సంప్రదాయం రాజ్యం చేస్తుంది. శూద్రులు పూజారులు గా వుండచ్చు. అంటే కేవలం ఫక్తు వైదిక సంప్రదాయానికి చెందిన ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు, అబ్రాహ్మణ ఆచారాలు కూడా ఉంటాయి అని శాస్త్రి స్పష్టం చేశాడు.
ఈ సాంస్కృతిక బహుళత్వం గురించి కన్నడ బహుజన మేధావి డి ఆర్ నాగరాజు బలంగా మాట్లాడుతాడు. అసలు బ్రాహ్మణ సంస్కృతిని శూద్ర సంస్కృతి ప్రభావితం చేసింది, అలాగే శూద్ర బ్రాహ్మణేతర సంస్కృతిని బ్రాహ్మణ సంస్కృతి ప్రభావితం చేసింది. ఏవీ విడిగా ఉండలేవు అంటాడు ఆయన. వైష్ణవ పాంచరాత్ర ఆగమం లో అవైదిక పద్ధతులు ఉండడాన్ని గుర్తు చేస్తాడు. పూర్తిగా బైనరీ ఆపోజిట్స్ గా విడదీసి చూసే ఆధునిక పద్ధతి అసత్యం, అవాంఛనీయం. కంచ ఐలయ్య చెప్పినట్లు, బ్రాహ్మణ శూద్ర సంస్కృతులు, శైవ వైష్ణవాలు, బ్రాహ్మణ బౌద్ధాలు మధ్య అగాధం శాశ్వత వైరం లేదు. ఘర్షణ ఉంది, గాఢ మైత్రి కూడా ఉంది శైవం పేదల పీడితుల మతం. వైష్ణవం అణచివేత మతం అనే ఐలయ్య, కొందరు ప్రగతిశీలుల వాదన లు పచ్చి అబద్ధం. కుల వ్యవస్థను వ్యతిరేకించిన శైవం మరోవైపు బౌద్ధులను జైనుల ను ఊచకోత కోసింది.
సర్వమత సామరస్యాన్ని బోధించిన రామకృష్ణ పరమహంస జన్మతః బ్రాహ్మణుడు, కానీ అవైదిక తాంత్రిక సంప్రదాయానికి చెందిన కాళీ దేవతకు పూజారి. ఐతే ఆయన శిష్యుడు వివేకానంద, సంస్కృత అద్వైత గ్రంథాల ఆధారంగా హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఈ క్రమంలో, రామకృష్ణ పరమ హంస బోధించిన స్త్రీ దేవత, తాంత్రిక సంప్రదాయం, సర్వమత సమానత్వం అప్రధానమయ్యాయి. స్త్రీ దేవత స్థానంలో పురుష దేవుడు జాతీయ దేవుడిగా అవతరించాడు. ఓరియంటలిస్టులు మాక్స్ ముల్లర్ తో సహా అనేకమంది పాశ్చాత్యులు గ్రంథ ప్రాధాన్యం గల ప్రొటెస్టెంట్ క్రైస్తవం పద్ధతిలో హిందూయిజాన్ని సంస్కృత గ్రంథాలలో వెతికారు. ఇది రిడక్షనిజం మాత్రమే. ఇదే పద్ధతిని వివేకానంద అనుసరించాడు.
అయితే రామకృష్ణ పరమహంస స్ఫూర్తి కొనసాగుతూ వచ్చింది అనడానికి నేటి కాలపు ప్రముఖ సంస్కృత పండితులు మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు రాసిన ఈ శ్లోకం తార్కాణం: “యమ్ శైవాశివ ఇత్యహుర్మజద ఇత్యాది” శ్లోకంలో శివుడని శైవులు, జహోవ అని యూదులు, గాడ్ అని క్రైస్తవులు పిలిచే దేవుడు మాధవుడే అంటాడు శ్రీరామచంద్రుడు. కానీ నిజానికి ఈ శ్లోకానికి ఒక ప్రాచీన మూలం ఉంది. దానిని అనుకరిస్తూనే ఈ శ్లోకం రాశారు పుల్లెల. “యమ్ శైవాస్సముపాసతే శివ” ఇత్యాది శ్లోకంలో శివుడు పరబ్రహ్మ, బుద్ధుడు అర్హతుడు ఇలా వివిధ మతాలతో, సంప్రదాయాలతో పూజించబడేది ఒకే విష్ణువే అని ఆ శ్లోకం భావం. ఐతే అబ్రహమిక్ మతాల దేవుళ్ళని, చైనా, పారసీక దేవుళ్ళని కూడా చేర్చారు పుల్లెల వారు తన ప్రార్థనా శ్లోకంలో. అలా విశాలార్థాన్ని మత అసహనాన్ని తగ్గించడం కోసం కల్పించాడు.
ఇది సంస్కృత సంప్రదాయానికి భిన్నంగా కబీర్, నానక్, రామకృష్ణ పరమహంస, గాంధీల సంప్రదాయం. “ఈశ్వర్ అల్లా తేరే నామ్” అని గాంధీ పాడడం అతి ప్రాచీన సంప్రదాయానికి కొనసాగింపే. అయితే దీనిని ఇటీవల హిందూ వాదులు వివాదాస్పదంగా మార్చడానికి కారణం స్వచ్ఛ అస్తిత్వం కోసం తపన. మతపరంగా, దైవపరంగా, జాతి పరంగా ఇతర జాతులతో ఏమాత్రం ప్రభావితం కాని పూర్తి స్వచ్ఛ అస్తిత్వం కోసం తపన హిందూత్వగా బలపడుతుంది. దీనికి ఆధునిక వ్యక్తివాదం కూడా మూలం. కమ్యూనిటీతో, గ్రామంతో తెగతెంపులు చేసుకొని నగరాలకు చేరుకున్న అత్యాధునిక యువతరం సమాజం నుంచి మొత్తంగా వేరుపడి ఇటువంటి స్వచ్ఛ అస్తిత్వం కోసం తపన పడుతోంది. తన శూన్యాన్ని పూరించుకోవాలని చూస్తోంది. స్థానిక కథనాలు, సంప్రదాయాలను పక్కనపెట్టి మీడియా, పుస్తకాల ఆధారంగా తన స్వచ్ఛ మత అస్తిత్వాన్ని బలపరుచుకుంటుంది. నిజానికి విశ్వవ్యాప్తమైన డిజిటల్ మీడియా ఉత్పత్తి ఈ స్వచ్ఛ హిందూ అస్తిత్వం. దీని పేరుతో సహా అంతా ప్రచార సంరంభం తప్ప మరేమీ లేదు.. నిజానికి అస్లీ ఇస్లాం కానీ, స్వచ్ఛ హిందుత్వం కానీ ఇలా జాతీయవాదాల నుంచి ఆధునిక టెక్నాలజీ, పెట్టుబడిదారీ వ్యవస్థల ఫలితంగా పుట్టినవే.
కార్ల్ మార్క్స్, సావర్కర్
ప్రకృతిని, పశుపక్ష్యాదులను పూజించే ప్రాకృతిక మతంగా హిందూ మతాన్ని వర్ణించాడు మార్క్స్. ఇది మనిషిని ప్రకృతి స్థాయికి దిగజారుస్తుంది అన్నాడు. ఇది యూరోపియన్ వలసవాదులు ప్రాచ్య దేశాలను చూసిన తీరుకి కొనసాగింపు. దీనికి సమాధానం అన్నట్లుగా సావర్కర్ హిందూత్వ పుస్తకంలో, వలస వచ్చి భరతఖండాన్ని జయిస్తూ వచ్చిన యుద్ధ వీరుడుగా శ్రీరాముని చిత్రించాడు. ఆ ఆర్యరాముడే ద్రావిడులను కలుపుకొని హిందూ దేశాన్ని ఏర్పాటు చేశాడన్నాడు. ఆ విధంగా ఒక విజయ చరిత్రతో హిందూత్వను ముడివేశాడు. తద్వారా హిందూ మతం ఒక ప్రాకృతిక మతం కాదని, ఒక హిస్టారికల్, ఆంత్రోపోసెంట్రికల్, చారిత్రక మతం అని చాటాడు సావర్కర్.
కార్ల్ మార్క్స్ లాంటి తత్వవేత్తలు ప్రపంచాన్ని వివిధ చారిత్రక దశల్లో ముందుకు సాగుతున్నదిగా చూశారు: ఆదిమ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇలా మార్క్స్ చారిత్రక దశలు నిర్ధారించాడు. మార్క్స్ దృష్టిలో -ఆశ్చర్యంగా భారత్ ఈ చారిత్రక దశల్లో వేటిలోనూ లేదు. అక్కడ మార్పు నిలిచిపోయింది, కాలం నిలిచిపోయింది. దానిని ‘ఆసియా నియంతృత్వం అన్నాడు. అందుకే మార్పు, కాలగమనం నిలిచిపోయిన భారత్లో మతం కూడా అత్యంత ప్రాకృతికం, అచారిత్రకం అని మార్క్స్ అభిప్రాయం.
“మాకు చరిత్ర ఉంది, మాకు చారిత్రక మతం ఉంది” అని నిరూపించుకోవాల్సిన అగత్యం భారతీయులకు దాపురించింది. అందుకే సావర్కర్ హిందూత్వ పేరుతో ఒక విజేత చరిత్ర నిర్మించాడు. ఆ వలస విజేత రాముడు. అందుకే హిందూత్వవాదులు, సెక్యులరిస్టులు బాబ్రీ స్థలంలో ఆలయ అవశేషాలు ఉన్నాయా లేవా అనే చర్చలలో ఇరుక్కుపోయారు. భారతీయులు చరిత్రహీనులు అని వలసవాదులు చేసిన విమర్శను ఎదుర్కోవటం కోసం ఒక చారిత్రక మత స్ఫూర్తిలోకి ఇరుక్కుపోయారు. అసలు విషయం సర్వాంతర్యామి అయిన దేవుడికి చరితం తప్ప చరిత్ర ఉండదు. భగవంతుడికి విశేషణం అనంతత్త్వం. అనంతకాలంలో పరమాత్మ చక్రాకృతిలో పరిభ్రమించే యుగ పరంపరలో తిరిగి తిరిగి అవతరిస్తాడు అనేదే భారతీయుల విశ్వాసం.
ఉపసంహారం
వలసవాదం, ఆధునికత, జాతీయవాదం హిందూ మతాన్ని ఒక ‘మెగా మతం’గా రూపొందించాయి, ఇది స్థానిక సంప్రదాయాలను అణచివేస్తూ ఏకీకృత అస్తిత్వాన్ని సృష్టించింది.
మూలాలు
- Why I Am Not a hindu, Kancha Ilaiah, First Publication Year: 1996: Samya Publishers, Kolkata
- D. R. Nagaraj (1954–1998), Title: The Flaming Feet and Other Essays: The Dalit Movement in India South Forum Press, Bangalore, 1993
- Deceptive Majority: Dalits, Hinduism, and Underground Religion by Joel Lee, Cambridge University Press in 2021
- డక్కలి జాంబ పురాణం ప్రధాన సంపాదకుడు జయధీర్ తిరుమల రావు, జానపద ప్రచురణ హైదరాబాద్ 2011
- వేదాంత సర్వస్వము ముదిగొండ వెంకట రమణశాస్త్రి. త్రిలింగ మహా విద్యాపీఠం, 1979
- The Village Gods of South India by Henry Whitehead. the Oxford University Press. 1916
- హిందూ మతం సనాతన ధర్మం కొన్ని ఇతర మతాలు ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు. జయలక్ష్మి పబ్లికేషన్స్, హైదరాబాద్ 2008
- ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం 1857 – 1859 మార్క్స్ ఎంగెల్స్ ప్రగతి ప్రచరణాలయం, మాస్కో1987
- While Sewing Sandals: Or, Tales of a Telugu Pariah trib, Emma Rauschenbusch-Clough ప్రచురణకర్త: Hodder and Stoughton, London, 1899
- కుల నిర్మూలన – అంబేడ్కర్
- Human As Christian in Life/Philosophy by Kancha Ilaiah