చలం గురించి…

[ 1994 డిసెంబర్ 14, 15 తేదీల్లో రాజోలులో ‘చలం సాహితీ సమాలోచన’ జరిగింది. తొలిరోజు ఆర్.ఎస్. సుదర్శనం అధ్యక్షతన ఇస్మాయిల్, పాపినేని శివశంకర్ ‘చలం ఆధ్యాత్మికత’, ‘చలం సాహిత్యం- విముక్తి’ అనే అంశాలపై మాట్లాడారు. ఆనాటి ఇస్మాయిల్ ప్రసంగ పాఠాన్ని చలం జయంతి సందర్భంగా ఇప్పుడు ఈమాటలో ప్రచురిస్తున్నాము. అడిగిన వెంటనే పంపిన పాపినేని శివశంకర్‌గారికి మా ధన్యవాదాలు. – సం. ]

‘ఆరుగురు గుడ్డివాళ్ళు – ఏనుగు’ అన్న కథలో లాగ చలాన్ని రకరకాలుగా అర్థాలో, అపార్థాలో మనవాళ్ళు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను రెండు మూడు సార్లు చలంగారు వుండగా తిరువణ్ణామలై వెళ్ళాను. ఆంధ్ర దేశం నుండి ప్రేయసీ ప్రియులు పెళ్ళి చేసుకుందామనుకునేవారు తిరువణ్ణామలై వచ్చి చలంగారి ఎదురుగా దండలు మార్చుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. చలంగారేమో నవ్వుతున్నారు. ఎందుకంటే చలంగారికి వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటి నుండి ఏవగింపు. ఆయన మొట్టమొదటి నవల 1921లో వ్రాసింది, ‘శశిరేఖ’లో ఆయన వివాహ వ్యవస్థను వ్యతిరేకించారు. తరువాత ఆ అభిప్రాయం ఆయన ఎప్పుడూ మార్చుకున్నట్లుగా నాకు అనిపించలేదు.

ఆయన అరుణాచలం వెళ్ళిన 5, 6 సంవత్సరాలకు చలంగారి మూడో కూతురు చంపక, మా తమ్ముడు వజీర్ రెహ్మానూ పెళ్ళిచేసుకుందామని, ఈయన దగ్గరకి వెళ్ళి ‘నాన్నా! మేం పెళ్ళి చేసుకుంటాం’ అని అడిగారు. అడిగితే, ‘పెళ్ళా? పెళ్ళెందుకు? కలిసి వుండండి’ అని అన్నారాయన. తన స్వంత కూతురి విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు. ఇది 1958లో జరిగింది. అంతే కాదు, ఆయన చిన్నప్పుడు పదో యేటను నాలుగు నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తల్లిగారు చిన్నపిల్లలతో చాలా బాధలు పడేది. రాత్రంతా పిల్లలు ఏడుస్తూ వుండేవారు. ఆవిడ వాళ్ళని వూరుకోబెట్టడానికి పాట పాడుతూ వుండేది. ఆవిడ అవస్థను చూసి ఈయనకు చాలా జాలివేసి ఏడుపు వచ్చిందట.

ఈయన నాలుగు నిర్ణయాలు తీసుకున్నారు.

1. పెళ్ళి చేసుకోకూడదు.
2. పెద్దవాళ్ళు బలవంతంగా పెళ్ళి చేసినా పిల్లల్ని కనకూడదు.
3. పిల్లల్ని కన్నా వాళ్ళను ఏడిపించకూడదు.
4. వాళ్ళు యేడ్చినా, ఏమైనా సరే వాళ్ళను కొట్టకూడదు.

‘ఆ మొదటి రెండు నిర్ణయాలూ నా చేతిలో లేవు కనుక, ఆ చివరి రెండు నిర్ణయాలూ చివరి వరకూ పాటించాను’ అని వ్రాసుకున్నారు. చిన్నప్పుడే ఆయనలో ఆ తిరుగుబాటు మనస్తత్వం, తోటి వారి యెడల కారుణ్యం, జాలి అన్నీ వుండేవి. ఆయన తల్లి, పురాణ కథలు చెప్పేదట. అతనంటాడు ఆత్మకథలో : ‘భారతం చివర పాండవులు నరకంలో కాలారనీ, కౌరవులు స్వర్గంలో సింహాసనాల మీద కూర్చున్నారనీ అంటే, నా గుండె దహించుకుపోయి. ఎందుకూ? అని అమ్మను ప్రశ్నలు వేసేవాణ్ణి.’ ఆ ప్రశ్నించే మనస్తత్వం ఆయనకు చిన్నప్పటి నుండి వుండేది. ‘ఆమెకు మాత్రం ఏం తెలుసు? చివరకు భీముడు వాయుదేవుడిలో కలిశాడని అదేదో న్యాయంలా చెప్పేది పిచ్చి మా అమ్మ. అంటే, ఇంతేనా, అదేం జస్టిస్? అని ఎదురుతిరిగేది నా హృదయం. ఈనాటికీ ఎదురు తిరుగుతోంది. ఆ పరబ్రహ్మంలో నీడలో నీడలాగ, నూనెలో నూనెలాగ కలసిపోతామని బొర్ర బ్రాహ్మడు comfortableగా, భోజనం చేసి వేదాంతం మాట్లాడితే, ఒక కర్ర తీసుకుని బుర్ర మీద కొట్టాలనిపిస్తుంది. అందుకే వేదాంతమంటే అంత అసహ్యం’ అని అంటాడు.

తరువాత చివరికంటా ఆయనలో నిల్చిన ఒక లక్షణం చిన్నప్పుడే వికసించింది. ఏమిటంటే శృంగార వాంఛ. చిన్నప్పుడు ఎక్కువగా ఆడపిల్లలతో ఆడుకునేవాడు. మనిషి చాలా సన్నంగా పీలగా వుండేవాడు. అంటే, మొగపిల్లలతో ఆడుకోవడానికి భయం వేసేదేమో? ఆడపిల్లలతోనే ఆడుకునేవాడు. ఆ విధంగా ఆడవాళ్ల మీద ఒక జాలి, ఒక understanding, rapport ఏర్పడినట్లు కనిపిస్తుంది.

1911లో ఆయన కాకినాడ వచ్చి సి.ఆర్. కాలేజీలో- రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు అప్పుడు ప్రిన్సిపాలు- ఆయన శిష్యుడిగా చేరాడు. నాయుడుగారు ఇంగ్లీషు లిటరేచర్, పార్సీ, సంస్కృతమూ బాగా చదువుకున్నాడు. ఆయన ఇంటర్‌లో Shakspeare, Shelly, Keats మొదలైన romantic poets గురించి ఉపన్యాసాలు చెబుతూ వుండేవాడు. ఆ ప్రభావం ఆయన మీద చాలా ఎక్కువగా వున్నట్లు కనిపిస్తుంది. సుదర్శనంగారు చలం రొమాంటిక్ కాదేమోనన్నారు. కానీ నాకు చలం రొమాంటిక్ పరంపరలోని వాడనిపిస్తుంది. ముఖ్యంగా English romantic పరంపర. European Romanticism కాదు. European Romanticism అంటే కేవలం ప్రేమ, విరహం అంతకన్న ఏం లేదు. English Romantics అలా కాదు. వాళ్ళలోని ముఖ్య లక్షణమేమిటంటే, వాళ్ళు చాలా సున్నిత హృదయులు. చేతనా సౌకుమార్యం అంటే, అనుభూతి సున్నితత్వం వారు సాధించారు. ఈ చేతనా సౌకుమార్యం అంటే, మనిషి మేధకీ, తర్కానికీ కాకుండా, హృదయానికి, ఇంద్రియానుభూతికీ ప్రాముఖ్యం ఇవ్వడం అన్నది. రినైజాన్స్ కాలంలో ఇది బయలుదేరింది. నిజానికి నాకు ఏమనిపిస్తుందంటే, యూరోపియన్ రినైజాన్స్‌లో మనిషి మూలతత్వమే మారిపోయిందని. అంతవరకూ మనిషినీ, సంఘాన్నీ మేధ, తర్కం, హేతుబుద్ధి పరిపాలించింది. కానీ, రినైజాన్స్‌లో వ్యక్తికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేసరికి, వ్యక్తి యొక్క స్వంత అనుభూతి, ఇంద్రియ సౌకుమార్యం ప్రొమినెన్స్‌కి వచ్చింది. దీనికి ఎక్కువ పని కల్పించారన్నమాట. సంఘం కాదు ముఖ్యం, సంఘం కన్న వ్యక్తి ముఖ్యం, అందులో వ్యక్తి యొక్క స్వంత అనుభూతి ముఖ్యం అని చెప్పి ఈ Renaissance కాలంలో వాళ్ళు ప్రతిపాదించారు. ఈ influence, వీళ్ళ మీద ఈ రొమాంటిక్స్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రినైజాన్స్ పరంపరలో వచ్చినవాళ్ళే రొమాంటిక్ పొయట్స్. వాళ్ళంతా వ్యక్తివాదులు, స్వేచ్ఛావాదులు, వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం అంటారు. రెండవది, వాళ్ళు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించారు. ఇది చేతనా సౌకుమార్యం వల్ల ఏర్పడిన లక్షణం. తరువాత ఇంద్రియానుభూతికీ, ఇంద్రియ సంవేదనకూ, వాళ్ళెక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అదొక్కటే కాదు. ఇంద్రియ సంవేదన నుండి ఇంద్రియానుభూతికీ, ఇంద్రియానుభూతి నుండి ప్రపంచానికీ అతీతమైన, అంటే, మన సామాన్య అనుభూతికి అతీతమైన సత్యాన్ని సాధించవచ్చును అని వాళ్ళు చెబుతారు. ఈ ప్రపంచ వ్యవహారాల వెనుక ఏవో కొన్ని శక్తులు వున్నాయి. ఆ శక్తుల్ని గానీ, ఆ సత్యాన్ని గానీ మనం ఇంద్రియానుభూతి ద్వారా సాధించవచ్చును అని చెప్పి ఇంగ్లీషు రొమాంటిక్స్ నమ్మారు. ఆ ఇంద్రియానుభూతిలో నమ్మకం వున్నదే, అది వాళ్ళ ప్రత్యేక లక్షణం. ఆ లక్షణమే నాకు చలం కథల్లో కనిపిస్తుంది.

చలం రొమాంటిక్స్ దగ్గర నుండి చాలా తెలుసుకున్నాడు. ఎందుకంటే, చలంగారి గురువుగారు సామాన్యుడేమీ కాదు. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు. ఆయన చాలా గొప్ప టీచరు. ఆ లక్షణాలే ఈయనలో బాగా కనిపిస్తాయి. సౌందర్యోపాసన, ప్రేమ, ప్రపంచం యెడల కరుణ. మనుష్యులు ఎవరికి వారు విశిష్ట వ్యక్తులు, అందరూ సమానులే, ఆ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే, పురుషాధిక్యత పనికిరాదు అన్నారు. ఇటువంటివి అన్నీ ఆ వ్యక్తివాదం నుండి వచ్చినవే. ఈ వ్యక్తి వాదం ఈయన (చలం) ఇంగ్లీషు రొమాంటిక్స్ నుండి ఎక్కువ నేర్చుకున్నాడు. అంటే మొట్ట మొదటి నుంచి ఆ ప్రవృత్తి లేదని కాదు. రొమాంటిక్ కవుల అధ్యయనం ఆయన ఆలోచనలకు ఒక తాత్విక ప్రాతిపదిక ఇచ్చి వుంటుంది అనుకుంటాను.

1919లో ఆయన సి.ఆర్. కాలేజీలో ట్యూటర్‌గా చేరాడు. ఈయనకు మొక్కపాటి రామ్మూర్తి ఒక స్నేహితుడు. మొక్కపాటి రామ్మూర్తి మరదలు రత్నమ్మతో ఈయనకు స్నేహం ఏర్పడింది. అంతవరకూ ఈయన బ్రహ్మసమాజంలో అనుష్ఠానికుడు (sic). అంటే Extremist Brahmo అన్నమాట. కానీ, ఈ రత్నమ్మతోటి అనుభవంతో ఈయనకు ఈ బ్రహ్మ సూత్రాల మీద డౌట్స్ ఏర్పడ్డాయి. స్త్రీ మీద కోర్కె పాపం అంటారు కదా? మరి నాకెందుకు కలుగుతోంది? కోర్కెను ఎందుకు ప్రవేశపెట్టాడు భగవంతుడు? ఇంత ఆనందం కలుగుతోంది కదా, ఈ మోహం వల్ల. ఇది పాపం ఎలా అవుతుంది అని చెప్పి ఆయనకు సందేహాలు కలగడం ప్రారంభించాయి. ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా, మెల్లిగా బ్రహ్మ సమాజపు ప్రభావాలు ఆయన మీద నుండి తొలిగిపోయాయి.

‘నా రొమాన్స్ అన్నది నా రక్తంతో కలసి నాతోనే పుట్టింది. ఎంత ప్రయత్నించీ శృంగార వాంఛను ఇంతవరకూ జయించ లేకపోయాను. అదే లేకపోతే నేను ఎందుకు బ్రతికి? ఈ భూమి limitationsని మించి సంచరించి ఒక స్త్రీ నాలో మెలుగుతూ వుండేది. ఆమె నా స్వప్నం. ఆమె ఈ భూమి మీద వుండదని తెలుసు. అందుకనే నేను ప్రయత్నించి ఉన్నతున్నై ఆమెను అందుకోవాలని అనుకునేవాణ్ణి. నేను వాంఛించే వెలుగు, వైశాల్యం అన్నీ ఆమెలో నాకు లభ్యమవుతాయని ఆశపడేవాణ్ణి. ఎక్కడా? ఎక్కడా? అనే నా అన్వేషణ నన్ను ఆవరించింది. ఇది పాపమా? ఇంత ఆనందకరమైనది పాపమా? ఎందుకు పాపం? భార్యతో లేని పాపం ఇంకో స్త్రీతో పాపమెలా అవుతుంది? ఈ శృంగారం పాపమని నిజంగా ఈశ్వరుడు చెప్పాడా? అసలు శృంగారమంటే తెలియని జడులు ఇలాంటి అబద్దపు నిబంధనలు ఏర్పరిచారా?’ అని ఆయనకు సందేహాలు కలగడం ప్రారంభమయ్యాయి.

చలంగారి గురించి చెప్పాలంటే, చలంగారి మాటలే చాలా అప్రాప్రియేట్‌గా వుంటాయి. చాలా నిశితంగా, చాలా చక్కగా ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు మ్యూజింగ్స్ కానీ, ప్రేమలేఖల్లో కానీ, ఇతరులకు వ్రాసిన లేఖల్లో కానీ. ఒకచోట అంటాడు : ‘స్త్రీ మోహం కంటే ఉత్తమమైనదీ, వాంఛనీయమైనదీ, ఈ లోకంలో ఏముందీ? ఆత్మ సౌందర్యం అనేదే వుంటే అది, లేకపోతే స్త్రీ సాంగత్యం. ఇవి రెండే, ఇంకేమీ లేవు. వీటి ముందు తక్కినవి దుమ్ము. ఎందుకు బ్రతుకుతున్నాము? అని ప్రశ్నిస్తే, ప్రేమను వెతుక్కునేందుకు అని చెప్పగలగాలి’. ‘సౌందర్యోపాసన, ప్రేమ’ ఇవి రెండూ చాలా ముఖ్యం అని ఈయనకు తోచింది. వీటికి ప్రాతిపదిక స్వేచ్ఛ. స్వేచ్ఛ లేకపోతే ప్రేమ లేదు. సౌందర్యోపాసన లేదు. అంటే ఇవి మూడూ ఒకటేనన్న మాట. వ్యక్తి స్వేచ్ఛ, ప్రేమ, సౌందర్యం- ఇవి మూడూ విడదీయరానివి. ఒకవేళ ప్రేమ వున్నా స్వేచ్ఛ లేకపోతే ఆ ప్రేమ బ్రతుకదు. అటువంటి పరిస్థితిలో ఆ మనిషి కూడా వుండలేడు.

చలంగారి నాయికలు ‘శశిరేఖ’లో శశిరేఖ, ‘దైవమిచ్చిన భార్య’లో పద్మావతి, ఈ ప్రేమలో స్వేచ్ఛ లేకపోవడం వల్లనే చివరికి ఆత్మహత్య చేసుకోవడమో చనిపోవడమో ఏదో ఒకటి చేస్తారు. కనుక, ఈ romantic traditionలో, మొదటి నుండీ ఇంద్రియానుభూతి ద్వారా ఏదో ఆధ్యాత్మికమైన సత్యాన్ని కనుక్కోగలం, లేదా సాధించగలం అని ఈయన మొదటి నుండి నమ్మేవాడు. అందుకే గొప్ప సహచరిణి ఎవరో తనకు ఆధ్యాత్మిక ద్వారాలను తెరుస్తుందని చెప్పి మొదటి నుండి ఆయన అనుకుంటూ వుండేవాడు. ‘అరుణ’ నవలలో అరుణ చివరికి మాయమైపోయినప్పుడు ఆయన అంటాడు. మళ్ళీ ఎప్పుడో వచ్చి ఈ ఆధ్యాత్మిక లోకపు ద్వారాలని ఈ అరుణే నాకు తెరుస్తుంది’ అని. ఆయన తన జీవితమంతా అటువంటి స్త్రీ కోసం గాలించాడు.

చివరికి 1942లో లీలగారని పిఠాపురం నుండి ఒకావిడ ఈయన్ని ప్రేమించి, కలుసుకోవడానికి వచ్చింది. ఆవిడ బాగా చదువుకున్నది. గొప్ప వైణికురాలు, గాయకురాలు. ఆవిడ ద్వారా ఈ ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయనీ, ఏదో ఆధ్యాత్మిక సత్యాన్ని తను కనుక్కోగలననీ ఆయన ఆశపడ్డాడు. అప్పుడే ఆయన అరుణాచలం వెళ్ళడం, రమణ మహర్షిని కలుసుకోవడం జరిగింది. రమణమహర్షి ఆయన కలలోకి వచ్చి, ఆధ్యాత్మిక ద్వారాలు తెరిచే శక్తి గల స్త్రీని నీ దగ్గరకు పంపిస్తున్నానని చెప్పారట. అప్పుడాయన దీక్షితులుగారికి జాబు వ్రాస్తూ, ‘లీలగారి కళ్ళల్లో నాకు రమణమహర్షి రెండుసార్లు కనిపించారు’ అన్నారు. ఇంద్రియానుభవం ద్వారా ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం సాధించవచ్చు అని ఆయన ముందు నుంచీ నమ్ముతూ వచ్చాడు. అంటే, ఈ శృంగారానుభవం ద్వారా, స్త్రీ ద్వారా లభించే అనుభవం ద్వారా ఆధ్యాత్మికమైన లోకాన్ని మనం అందుకోవచ్చును అని, లీలగారి ద్వారా ఇటువంటి అనుభవం సాధ్యమవుతుందని ఆయన అనుకున్నాడు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. చివరికి ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు. తనను తాను ఓదార్చుకుంటూ అంటాడు. ‘నేను ఆదర్శపురుషుణ్ణి అయితే కదా, నాకు ఆదర్శ స్త్రీ దొరకడానికి?’

సత్యం అంటే ఏమిటి? అనే విషయాన్ని చర్చించి, ‘నువ్వు నమ్మిందే సత్యం’ అంటాడు. తన స్వధర్మమే సత్యం. తన జీవితంలో కూడా అదే ఆచరించాడు. ‘శ్రీశ్రీ లౌడ్ స్పీకర్లోంచి అరుస్తున్నాడు, సూర్యకుమారి గొంతు పెట్టుకుని. ఏది మంచి? ఏది చెడు? అని. జవాబు చెబుతున్నాను వినండి శ్రీశ్రీ. ఏది సత్యం? నీ అంతరాత్మ చెప్పిందే సత్యం. తక్కిన సత్యం గురించి తెలుసుకుంటారు సత్యదేవతలు.’

చలం నవలల్లో ‘జీవితాదర్శా’నికీ, మిగిలిన నవలలకీ చాలా తేడా కనిపించింది నాకు. దీనిలో చలం శాంతిని కోరుతాడు. అంటే, అప్పటికి అతను చాలా అలిసిపోయి, ముసలివాడు అయిపోయి, ఇక నేను struggle చేయలేను అని చెప్పి రిటైర్ అయినట్లుగా కనిపిస్తుంది. శాంతి అనేది ఆయన తన జీవితంలో ఎప్పుడూ వాంఛించలేదు. 70యేళ్ళు దాటిన తరువాత ఆయన డిక్టేట్ చేసి వ్రాయించిన ఆత్మకథలో చివరి వాక్యం: ‘నా జీవితానికి మూలసూత్రం బాధ. దాన్నే వేదన అంటాను. ఎప్పుడూ నన్ను విడువని, జీవితమంతా నల్చుకు తింటున్న వ్యధకి అందని దాని కోసం, నా లోపలే అందక ఎప్పుడూ నన్ను పీడిస్తూ, ప్రతిక్షణం నన్ను నిలువ నీయకుండా చేసిన ఒక అసంతృప్తి, అదే నా అసలు వ్యధ. అప్పుడప్పుడూ నా జీవితంలో మెరిసే ఫ్లాషస్ వల్ల ఆశపడుతూ వుంటుంది, మళ్ళీ ఏదైనా వెలుగు నా జీవితంలో కలుగుతుందేమోనని. దాని కోసమేనేమో ఈ బాధ. అగ్నిని పంపి మలినాన్ని కాలుస్తున్నాడేమో, ఈశ్వరుడు? నాలో వున్న మురికి వైపు చూసుకున్నప్పుడల్లా ఇది ఎప్పటికి కాలుతుంది? ఎప్పటికి నాకు శాంతి వస్తుంది? అనుకుంటాను.’ అంతే కానీ, జీవితగమ్యం శాంతి అని చెప్పి ఆయన ఎప్పుడూ అనుకున్నట్లు కనిపించలేదు. చివరికలా అనిపించినట్లుంది ఆయనకి.

చలం ముఖ్యంగా వ్యక్తివాది, స్వేచ్ఛావాది, సౌందర్యవాది, హృదయవాది. ఈయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి థియరీస్ వున్నాయి చూశారా? అవి హేతుబుద్ధి ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యేవి కాదు. హేతుబుద్ధి ద్వారా నిరూపించబడేవి కాదు. అవి హృదయానుభూతి వల్ల మాత్రమే నిరూపించబడేవి. స్త్రీలకు సమానత్వం, సమాన హక్కులు ఎందుకివ్వాలి? స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలని మీరు పది కారణాలు చెబితే ఇవ్వకూడదు అని చెప్పి వంద కారణాలు చెప్పగలను. అది హృదయానికి తోచాలి. స్త్రీలు పురుషులు సమానులు, జనమంతా సమానులు అని హృదయానికి తోస్తుంది. అంతే కానీ హేతువుకి తోచదు. ఇటువంటివి అన్నీ హేతువు వల్ల సాధించినవి కావు. హృదయానుభూతి వల్ల సాధించింది. చలం హృదయవాది. హేతువాది కాదు. చలం గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటివి కొన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి.

చలం రొమాంటిక్. ఆ రొమాంటిక్ ట్రెండ్స్ ఈయనలో చాలా వున్నాయి. వ్యక్తివాదం, స్వేచ్ఛావాదం, ఇంద్రియానుభూతి ద్వారా ఏదో ఆధ్యాత్మిక సత్యాన్ని సాధిస్తాను అనే నమ్మకం- ఇది కీట్స్, షెల్లీ, వర్డ్స్‌వర్త్, కోల్‌రిడ్జ్- వీళ్ళల్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇటువంటి అభిప్రాయాలు. ఆ పరంపరలోని వాడు చలం. మనకు వున్న రొమాంటిక్స్, భావకవులు చాలా మంది వున్నారు కానీ, నిజమైన రొమాంటిక్స్ ఇద్దరే. వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి. ఈ వేళ ఈ విషయం మీ ముందు మనవి చేసుకుందామని అనుకున్నాను. సెలవు.