తల్లి గర్భం నుండి బయట పడటంతో మొదలైన వలస, రానురాను ఏదో ఒక రూపంలో వలస జీవితం అనుభవంలోకి రాకుండా ఉండదు. అయితే అన్ని వలసలూ ఒకటి కావు. కొన్ని కోరి తెచ్చుకున్నవి అయితే, నెట్టబడ్డ వలసలు మరికొన్ని. రెండింటిలోనూ ఇబ్బందులున్నా, కోరితెచ్చుకున్నాక భరించడం తప్ప మొరపెట్టుకుందుకు ఆస్కారం లేదు. కానీ నెట్టబడ్డ వాటిలో మొరపెట్టుకుందుకు కూడా చాలనన్ని ఇబ్బందులు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. వారి జీవితాలు సంఘర్షణలమయం. వలసలనుండి తప్పించుకుందుకు తిరిగివెళ్లలేని పరిస్థితిలో పడటం మరీ దుర్భరం. నా రక్తంలోనే వలస ఉండటాన్నో ఏమో, వలస వేదనలో ఉన్న జీవితాలు నన్ను వెంటాడతాయి. కలతపెడతాయి, కలవరపరుస్తాయి. టిబెట్ వలసవాసుల కథలు, కవిత్వం నన్ను చాన్నాళ్లుగా వేధిస్తూనే ఉన్నాయి. అయితే టిబెట్ పూర్వాపరాలు తెలుసుకుంటేనే గానీ, వారి బాధలను అర్థం చేసుకోలేము కావున, ఆ ప్రయత్నంలో నేను తెలుసుకున్న విషయాల్ని అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను.
—
సుమారు 6 మిలియన్ల జనాభా ఉన్న టిబెట్, ఖామ్, అండో, సెంట్రల్ టిబెట్ అనే మూడు ప్రాంతాలుగా విభజించబడింది. అది గాంచెన్ (మంచు భూమి) లేదా ప్రపంచపు మేడ మీద ఉన్నట్టున్న ప్రదేశం. అందమైన పర్వతాలు, విశేష భౌగోళిక పరిస్థితులు, అపారమైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి. దాని సగటు ఎత్తు దాదాపు 13000 అడుగులు, ఆసియా ప్రధాన నదీ వ్యవస్థలకు మూలాలు కూడా అక్కడే ఉన్న ప్రాంతం. గిరిజన జీవనశైలితో, ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 7వ శతాబ్దంలో టిబెట్ రాజు సాంగ్జెన్ గాంపో ద్వారా బౌద్ధమతం ప్రవేశపెట్టబడింది. చాలా కాలం పాటు దలైలామాలతో పరిపాలించబడిన దైవపరిపాలనా సమాజం టిబెట్. విదేశీయులకు నిషేధించబడింది. శతాబ్దాలుగా టిబెటన్లు తమలో తామే నివసించారు ప్రపంచంలోని ఏకాంత మూలలో.
టిబెట్కు అనేక పొరుగు దేశాలు ఉన్నాయి. తూర్పు, ఉత్తరాన – చైనా, మంగోలియా, తూర్పు తుర్కెస్తాన్, భారతదేశం, బర్మా; దక్షిణాన – నేపాల్, సిక్కిం, భూటాన్ రాష్ట్రాలు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సోవియట్ యూనియన్ కూడా దగ్గరగా ఉన్నాయి. ఈ పొరుగువారితో అనేక శతాబ్దాలుగా, వారికి అనేక సంబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా భారతదేశంతో, గత వెయ్యి సంవత్సరాలలో, బలమైన మతపరమైన సంబంధాలు. నిజానికి, వారి వర్ణమాల సంస్కృతం నుండి తీసుకోబడింది, ఎందుకంటే బౌద్ధమతం భారతదేశం నుండి టిబెట్కు వెళ్లినపుడు టిబెట్కు లిపి లేదు, మతపరమైన రచనలను టిబెటన్లు అనువదించి చదవగలిగేలా ఒక లిపి వారికి అవసరం అయింది. మంగోలియా, చైనాతో మతపరమైన, రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి. పూర్వ కాలంలో పర్షియా, తూర్పు టర్కీతో సంబంధాలు సైతం ఉన్నాయి. తద్వారా పెర్షియన్, టిబెటన్ దుస్తుల మధ్య ఇప్పటికీ సారూప్యత కనిపిస్తుంది. ఇటీవలి చరిత్రలో, ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో, రష్యాతో రాజకీయ సంబంధాలూ ఉన్నాయి, ఆ తర్వాత, బ్రిటన్తో చాలా కాలం పాటు కొనసాగాయి.చాలా మంది టిబెట్ ప్రజలు తమ మత విశ్వాసాలు, సాంప్రదాయ సంస్కృతితో సంబంధాలు, భౌగోళిక స్థానాల పరంగా తమ స్వంత గుర్తింపును నిర్వచించుకున్నారు. వారు ఏ మఠాలకు చెందినవారో, ఏ మతపరమైన శాఖలు, ఏ ఆధ్యాత్మిక లామాలను అనుసరించారో వ్యక్తపరచడం ద్వారా తమను తాము పరిచయం చేసుకునేవారు. అందువల్ల, వారి ప్రాపంచిక జీవిత లక్ష్యాలు, సమూహం, వ్యక్తిగత గుర్తింపుల సారాంశం, మత సంస్కృతిలో లోతుగా మునిగిపోయాయి.
టిబెట్ వాసుల్లో ఎక్కువ మంది రైతులు లేదా గొర్రెల కాపరులు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు మఠాలలో చేరారు. మఠం అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ఈ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య విభేదాలు చాలా తక్కువ. బలహీనమైన లింగం “తల్లి” గా కీర్తించబడుతుంది. అది జీవితానికి ప్రతీక. టిబెటన్ వ్యవస్థలో కుటుంబానికి కూడా అధిక విలువ ఉంటుంది. కుటుంబ సంబంధాలు పవిత్రంగా పరిగణించబడతాయి, విడాకులు విడిపోవడం వంటి ఆధునిక పరిస్థితులు వినబడవు. టిబెట్లోని అన్ని కార్యకలాపాలకు మతం ఆధారం.
చైనా యొక్క మంగోల్ మంచు చక్రవర్తులు టిబెట్ను స్వాధీనం చేసుకున్నప్పటికీ టిబెట్ పాలకులకు ప్రత్యేక హోదా కల్పించారు. 1940లలో, ది చియాంగ్ కై-షేక్ నేతృత్వంలోని కోమింటాంగ్ పార్టీ చైనా రాచరికాన్ని కూలదోసింది. చియాంగ్ కై-షేక్ను 1950లలో మావో జెడాంగ్ పడగొట్టాడు. అయితే, టిబెట్ చరిత్రలో ఒక ప్రధాన మలుపు 1949 అక్టోబర్ 1న జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, మావో జెడాంగ్ నేతృత్వంలో, చైనా ప్రజల గణతంత్రం (PRC – People’s Republic of China) స్థాపన జరిగింది. కొంతకాలానికి అది రేడియో బీజింగ్ ద్వారా, చైనా అన్ని ప్రాంతాల్నీ “విముక్తం” చేస్తామని ప్రకటన చేసింది, ఇందులో అప్పటివరకు స్వతంత్ర దేశమైన టిబెట్ కూడా ఉంది. దానిని ఎదుర్కొనేందుకు, టిబెట్ ప్రభుత్వం PRCని సంప్రదించేందుకు, తటస్థ ప్రాంతంలో అధికారులను పంపించింది. అయితే, చైనా పెట్టిన నిబంధనల కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1950 నవంబర్ 11న సంఘటనలు ఇంకా చేదుగా మారాయి. చైనాలో తీవ్ర కరువు సంభవించడంతో, తూర్పు టర్కిస్తాన్, అంతర్గత మంగోలియా, మంచూరియాలో లక్షలాది మందికి ఆహారం అందించడానికి, టిబెట్ వంటి పొరుగు దేశాలను చైనా 1950 లలో స్వాధీనం చేసుకోవడం, చైనాకు అమితంగా అనుకూలించింది. అప్పటి నుండి వరుసగా చైనా ప్రభుత్వం మెజారిటీ హాన్ చైనీయులను టిబెట్లోకి పంపడం ప్రారంభించింది. టిబెట్, చైనాలోని భాగమేనని పేర్కొంటూ అనేక “కాలనీలను” ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. టిబెటన్లకు అననుకూలమైన అనేక నియమాలను ప్రవేశపెట్టింది.
1590 అక్టోబర్ 6న, 40,000 పీపుల్స్ లిబరేషన్ సైనికులు (PLA) జిన్షా నదిని దాటి, టిబెట్ సైన్యాన్ని ఓడించి, ప్రాంతీయ గవర్నర్ న్గాబో న్గావాంగ్ జిగ్మెను బంధించి, టిబెట్ స్వతంత్రతకు ముగింపు పలికింది. టిబెట్ కు UNO సభ్యత్వం లేకపోవడంతో, 1950 నవంబర్ 11న అది UNO కి చేసిన విజ్ఞాపన ఏవిధంగానూ ఫలించ లేదు. ఏ సహాయమూ UNO నుండి పొందలేకపోయింది. 1950 నవంబర్ 17 నాటికి, 14వ దలై లామా తమ స్వావలంబనను కాపాడేందుకు పూర్తి రాజకీయ బాధ్యతలు స్వీకరించారు. “స్వాతంత్ర్యం తప్ప ప్రతిదీ చర్చించవచ్చు” అన్న సూత్రం మీదే టిబెట్ తో, చైనా ఏ చర్చలకైనా అంగీకరించేది. అయినా అనేక చర్చలు కొనసాగినా పెద్దగా ఫలితం కనిపించలేదు. మే 1951లో PRC “17 అంశాల ఒప్పందం” సమర్పించింది. టిబెట్ దానిని తిరస్కరించినప్పటికీ 1951 మే 23న దానిని జాతిపరమైన ఒత్తిడి కారణంగా అంగీకరించవలసి వచ్చింది. 1954లో PRC, దలై లామాను బీజింగ్కు ఆహ్వానించింది, కానీ టిబెట్ స్వేచ్ఛకు సంబంధించిన అంశంలో విభేదాలు తలెత్తాయి. 1956 నుండి 1959 వరకు పరిస్థితులు మరింత దిగజారాయి, 1959 మార్చి 10న టిబెట్ రాజధాని లాసాలో చైనాకు వ్యతిరేకంగా జాతీయ తిరుగుబాటు జరిగింది. 1959 మార్చిలో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేసిన తుపాకీ కాల్పుల వల్ల లాసాలోని మూడు ప్రధాన బౌద్ధ మఠాలు—సేరా, గాండెన్, ద్రెపుంగ్—భారీగా నష్టపోయాయి. దలైలామా రక్షణదళ సభ్యులను నిరాయుధులు చేసి, బహిరంగంగా మరణశిక్ష విధించారు. వేలాది టిబెటియన్ బౌద్ధ సన్యాసులు మరణించారు లేదా నిర్బంధించబడ్డారు, అలాగే లాసాలోని అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి.
ప్రాణహాని ఏర్పడడంతో, 1959 మార్చి 17న, దలై లామాకు టిబెట్ విడిచిపోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. దలైలామా 15 రోజులపాటు హిమాలయాలను దాటి, భారతదేశానికి చేరుకునే ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1959 ఏప్రిల్ 18న, ఆయన తన సహచరులతో పాటు అస్సాంలోని తేజ్పూర్కు చేరుకున్నారు. భారతదేశం ఆశ్రయం కోరి, అతను భారతదేశంలో శరణార్థి అయ్యాడు. ఆయనతో పాటు వేలాది మంది టిబెట్ ప్రజలు కూడా భారతదేశం, భూటాన్, నేపాల్ వంటి దేశాల్లో ఆశ్రయం పొందారు. వేలాది మంది టిబెటన్లు అతనిని అనుసరించి ప్రవాసాన్ని తమ వాస్తవికతగా అంగీకరించడం మొదలుపెట్టారు.
టిబెట్ ప్రజల సంక్షేమం, వారి స్వేచ్ఛ కోసం ప్రతినిధ్యం వహించడానికి, ప్రవాసంలో ఒక పాలనాత్మక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం దలైలామాకు ఏర్పడింది. 1959 ఏప్రిల్ 29న, దలై లామా తన స్వదేశం వెలుపల భారతదేశంలోని ముస్సూరీలో ఈ పరిపాలనాత్మక నిర్మాణాన్ని స్థాపించారు. 1960లో అది హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు మార్చబడింది. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA)గా అది ప్రఖ్యాతి పొందింది. ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, టిబెట్ స్వేచ్ఛ కోసం ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి దానిని విభాగాలుగా ఏర్పాటుచేయబడింది. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA) ప్రకారం, ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 130,000–150,000 మధ్య, టిబెటన్లు చెల్లాచెదురుగా ఉన్నారు, వీరిలో గణనీయమైన శరణార్థ జనాభా భారతదేశంలోనే స్థిరపడ్డారు.
శాంతి ప్రియమైన దేశంగా, టిబెట్ స్వాతంత్ర్య పోరాటం ఎల్లప్పుడూ అహింసను నమ్ముతూ చైనా, ఇంకా ప్రపంచం ముందు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంలో నిమగ్నమైంది. టిబెటన్ యూత్ కాంగ్రెస్ (TYC), టిబెటన్ ఉమెన్ అసోసియేషన్ (TWA) వంటి ప్రముఖ సంస్థలు శాంతి దృక్పథంతో ఈ లక్ష్యానికి కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా, టిబెట్ సపోర్ట్ గ్రూప్స్ (TSGs) అంతర్జాతీయ సంఘాల మద్దతుతో టిబెట్ను స్వతంత్ర దేశంగా చూడాలనే దృక్పథాన్ని ప్రోత్సహించడానికి పనిచేస్తున్నాయి.
1987లో, దలై లామా చైనాకు మధ్యేమార్గం పద్ధతిని ప్రతిపాదించారు. ఆ పద్ధతిని ఆయన ఐక్యరాజ్యసమితి కాంగ్రెస్ మానవహక్కుల సమావేశంలో వివరించారు. అందులో టిబెట్ కోసం ఐదు-అంశాల శాంతి ప్రణాళికను చేర్చారు, ఇది టిబెట్ సమస్య మీద ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఆక్రమణ నిర్బంధానికి ముందు, టిబెటన్లు పర్వతాల మధ్య, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, స్వయంపూర్తిగా నడిచే జీవనశైలిని టిబెట్ వాసులంతా గడిపారు. తమ స్వదేశం మీద వారి ప్రేమ, తిరిగి వెళ్లాలనే తీరని కోరిక తరం తరువాత తరాలకు వారసత్వంగా వస్తూనే ఉంది. ఈ గతవ్యామోహం ధ్యాస ప్రత్యేకంగా ప్రవాసంలో ఉన్న రెండవ , మూడవ తరం టిబెటన్లలో ఎక్కువగా కనిపిస్తుంది. తమ స్వదేశపు సాంస్కృతిక వారసత్వం, వారిని ఆమోదించిన దేశాల వాస్తవాలను సమన్వయం చేస్తూ, వారంతా రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్నారు. టిబెట్ అనేక ప్రతిఘటన ఉద్యమాలను చూసింది. అత్యంత ప్రసిద్ధమైనవి 1960లో ఖంపా తిరుగుబాటుదారులు చేసినవి. కానీ ఏ రకమైన హత్య అయినా, దలైలామా బోధనలకు వ్యతిరేకం కావడంతో వారంతా ప్రతిఘటన ఉద్యమాన్ని విరమించుకున్నారు.
ప్రవాసంలో ఉన్న టిబెటన్ రచయితలందరిలో ప్రధాన లక్ష్యం వారి జీవితపు వ్యక్తీకరణ మాత్రమే కాదు, టిబెట్ వాదం గురించి బిగ్గరగా వినిపించడం కూడా. ప్రవాసంలో ఉన్న వారి టిబెట్ రచనల్లో ఒక బలమైన మనస్సాక్షిని గమనించొచ్చు, అది ప్రపంచాన్ని తమ స్థితిని గుర్తించమని నిరంతరం చెబుతున్నట్టు ఉంటుంది. ఈ మనస్సాక్షి మూలం, బహుశా వారి స్వేచ్ఛ అన్వేషణకు వాస్తవిక సమాధానాన్ని కనుగొనడంలో వారి అసమర్థతకు వారి స్వంత సమర్థనేమో అని కూడా అనిపిస్తుంది. ఆధునిక టిబెట్ వాసులు కొత్త ప్రపంచ క్రమానికి అనుగుణంగా మారలేక సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య నలిగిపోతున్నారు.
టిబెట్ భారతదేశం మధ్య 3440 కి.మీ.లకు పైగా సరిహద్దుకు సంబంధించిన ప్రాంతం ఉంది. దీనిలో గణనీయమైన భాగం ఇప్పటికీ భారతదేశం-చైనా రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఇటీవలి కాలంలో, అనేక సరిహద్దు సంఘటనలు భారత చైనా అధికారుల మధ్య అధిక స్థాయి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.
1947, 1949లలో భారతదేశం చైనా స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, ఈ రెండు దేశాల మధ్య టిబెట్, విభేదాలకు కారణంగా ఉంది. చరిత్రలో, టిబెట్ను చైనా నియంత్రించింది కానీ ఇరవయ్యవ శతాబ్దంలో, చైనా దానిని బ్రిటన్ చేతిలో కోల్పోయింది. దక్షిణాసియా ఉపఖండం నుండి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత చైనా భారతదేశం రెండూ, వారి ప్రాంతపు యాజమాన్యాన్ని ప్రకటించుకున్నాయి. చైనా సాంప్రదాయకంగా టిబెట్ను గ్రేటర్ చైనాలో భాగంగా పేర్కొంది. అయితే, భారతదేశం బ్రిటిష్ విధానాన్ని వారసత్వంగా పొందడం ద్వారా టిబెట్ను తటస్థమండలంగా పరిగణించడం కొనసాగించింది. ఎందుకంటే టిబెట్ స్వయంప్రతిపత్తి హోదా, భారతదేశ భద్రతా ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఆ కారణంగా టిబెట్ను స్వయంప్రతిపత్తి ప్రాంతంగా మార్చాలని భారతదేశం చైనాను కోరింది. ఆ ప్రాంతంలో తన సైనిక ఉనికిని తగ్గించాలని కూడా భారతదేశం చైనాను కోరింది.
మార్చి 2008లో ధర్మశాలలో దలైలామా, అతని మద్దతుదారులు చైనాకు వ్యతిరేకంగా జరుపుకున్న, టిబెట్ తిరుగుబాటు దారుల 49వ వార్షికోత్సవ వేడుకలు, టిబెటన్ రాజధాని (లాసా)లో టిబెటన్ల హింసాత్మక ప్రదర్శనలకు దారితీశాయి, అందులో చైనా భద్రతా సిబ్బందితో సహా 13 మంది మరణించారు. భారతదేశంలోని అనేక నగరాల్లో టిబెట్ వాసులు, వారి భారతీయ మద్దతుదారులు కూడా ప్రదర్శనలు నిర్వహించారు. వాటిని చైనా తమకు వ్యతిరేక కుట్రగా భావించింది. భారతదేశం అశాంతిని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించినప్పటికీ, మీడియా నివేదికలు చైనా వ్యతిరేక వైఖరిని వ్యక్తం చేశాయి.
తీవ్ర భావోద్వేగాలు కలిగిన ప్రాంతంగా టిబెట్ కొనసాగుతూనే ఉంది. చైనా ప్రభుత్వం చైనీస్ హాన్ జనాభా టిబెట్లో పెరగడానికి అనుకూలమైన విధానాలను అమలు చేస్తూనే ఉంది. అది కొంతమందికి టిబెట్లోని అధిక సంఖ్యాకుల ప్రతిఘటనను తగ్గించడానికి ప్రయత్నంగా కనిపిస్తుంది. ప్రస్తుత విధానాలు, ధోరణులు కొనసాగుతే, అది టిబెట్ సంస్కృతి గుర్తింపు క్రమంగా తగ్గిపోతుందనే ఆందోళనలను పెంచుతూనే ఉంది. అది హాన్ గుర్తింపులో కలిసిపోయే అవకాశాలను కలిగిస్తోంది.
చైనా, జాతీయ ఐక్యత సార్వభౌమత్వపు పరిధిలో, టిబెట్ సమస్యను పరిష్కరించడానికి, చైనాతో సఖ్యత సాధించడానికి ఇటీవలికాలంలో దలైలామా చేసిన సూచనలు ప్రతిబింబిస్తున్నాయి. టిబెట్ స్వయం శాసనాన్ని కోరుతూ ఆయన చేసిన ప్రతిపాదన ఈ దృష్టిలో ఉంది, అయితే అది చైనా జాతీయ సార్వభౌమత్వం, పాలన మీద అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే దానిని నెరవేర్చడం కష్టమే.
***
మానవ నాగరికత గమనంలో వలసలూ స్థానభ్రంశాలూ లేకుండా లేవు. కాలానుగుణంగా బహిష్కరణ, దేశ బహిష్కరణ, వలసలుగా అవి పరిణామం చెందడమే కాదు, ఎక్కడో ఒక దగ్గర స్థిరపడటం, అక్కడ నుండి మరో చోటుకు మారడం, అంతులేని ప్రక్రియగా మారిపోతూ ఉంది. మనిషికి ఎప్పుడూ తన మూలాలతో సంబంధం ఉంచుకోవలసిన అవసరం తటస్థపడుతూనే ఉంటుంది. మూలాల జ్ఞాపకాలు ‘మాతృభూమి’ని మరచిపోనివ్వదు. ప్రవాసంలో గుర్తింపు సంక్షోభంలో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూ ఉండటం, వారిని మాతృభూమితో మరింత కట్టిపడేస్తుంది. తిరిగి వేళ్లే అవకాశం కోసం ఎదురుచూసేట్టు చేస్తూనే ఉంటుంది.
టిబెట్ వాసుల వర్తమానం మీద నిరాశావాదానికి జవాబుగా, వారి మాతృభూమి పరిస్థితి గురించి ప్రస్తుత దలైలామా తమ్ముడు టెన్జిన్ చోగ్యాల్ ఇలా వ్యాఖ్యానించాడు -“కాలిపోతున్న భవనంలోంచి బయటకు పరుగెత్తే పిల్లాడు, దానినుండి బయటపడడానికి శక్తిలేనివాడు, వాడు చేయగలిగినదల్లా, “మంటలు, మంటలు” అని అరవగలగడమే. బలమైన వ్యక్తులు, పెద్దలెవరో వింటారని, వాడిని రక్షించడానికి ఎవరో ఒకరు పట్టించుకుంటారని, ఏదో ఒక చర్య తప్పకుండా తీసుకుంటారని ఆశపడతాడు. ఖచ్చితంగా అదే మనం టిబెటన్లం చేస్తున్నాం. మన ఇల్లు శిథిలమైపోతోంది. మన బంధువులు అక్కడ ఉన్నారు. అది ఇప్పటి టిబెట్ పరిస్థితి. మనం టిబెట్ వాసులం, ప్రపంచమంతటా నివసిస్తున్న నిర్వాసిత ప్రజలం అయిపోయాం. ప్రస్తుత చైనా ఆక్రమిత టిబెట్లో మన బంధువులను రక్షించుకుందుకు, మన ఇంటిని చేరుకుందుకు, మానవాళికి విన్నవించుకుందుకు మనం ఆ పిల్లవాడిలానే ఏడుస్తున్నాం.” అని చెప్పుకున్నాడు.
ప్రవాసంలో ఉండటం అనేది ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసులు ఎదుర్కొంటున్న అత్యంత శక్తివంతమైన వాస్తవికత. వారి హృదయాలు మాతృభూమి కోసం తహతహలాడుతున్న సమయంలో, వారు తెలియని దేశాలలో జీవితాన్ని నిర్మించుకునే సవాలును ఎదుర్కొంటున్నారు. మతం పురాణాల ద్వారా మాత్రమే తెలిసిన భూమికి తిరిగి పోవాలనే వారంతా కోరుకుంటున్నారు. కానీ అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు.
ప్రవాసంలో అరవై సంవత్సరాలకు పైగా ఉన్నప్పటికీ, టిబెట్ వాసులు వారి స్వాతంత్ర్య ఆకాంక్షను ఎప్పుడూ తాజాగా ఉంచుకోగలుగుతున్నారు. అది సాకారం కావాల్సిన కల అని, ఆ కల శాంతియుతంగా నెరవేరుతుందని టిబెటన్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. అహింసను బోధించే బౌద్ధ విశ్వాసం సిద్ధాంతాలకు కట్టుబడి, కోరికలన్నింటినీ వదులుకోవడం ద్వారా సాధించే ఆనందాన్ని విశ్వసించే వారి ఆధ్యాత్మిక తండ్రి దలైలామా కోరికలకు విధేయత చూపడం ద్వారా, టిబెట్ వాసులు క్రూరత్వాన్ని ఆశ్రయించడం లేదు. హింసాత్మక మార్గాల ద్వారా తమ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నించిన ఇతర వలస వర్గాల కంటే, ఏనాటికైనా “టిబెట్” వారిదే అవుతందన్న నమ్మకంతో, వారు చాలా భిన్నంగా ఉంటున్నారు.
ఈ సమస్య ఇలా కొన సాగాల్సిందేనా అన్న అందోళన అందరికీ ఉంది. 1979-1984ల మధ్య చైనాతో సమస్యల పరిసష్కారానికి ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదు. టిబెట్ స్వాతంత్ర్యం కోసం తాను అడగడం లేదని తరచుగా స్పష్టంగా బహిరంగంగా దలైలామా చెప్పారు. టిబెట్ చారిత్రాత్మకంగా చైనా నుండి స్వతంత్ర ప్రత్యేక దేశంగా ఉన్నప్పటికీ, మారుతున్న ప్రపంచంలో, ఒక చిన్న సమాజం లేదా దేశం ఒక పెద్ద రాష్ట్రంతో కలిసి ఉండటం ద్వారా ప్రయోజనం పొందగల అవకాశాల గురించి అతనికి తెలుసు కనుక, అతను చరిత్ర మీద చర్చకు ఇష్టపడక, భవిష్యత్తులో సైనిక విదేశీ విషయాలను చైనీయుల జాబితాలో ఉంచి, బీజింగ్ నిర్వహించుకోవచ్చని, టిబెటన్లు నిజమైన స్వయం పాలనను కలిగి ఉండటమే వారికి ముఖ్యమైన అవసరంగా భావించారు. టిబెట్ ప్రజలకు, దేశానికి సేవ చేయడానికి ఇదొక్కటే ఉత్తమమైన అహింసా మార్గం అని అతను నమ్మారు. దానిని సాధించడానికి, మొదట పౌర ప్రాంతాల నుండి సైనిక బలగాలను తొలగించాలని, సంబంధిత పక్షాలతో ఒప్పందం ద్వారా అన్ని సైనిక సిబ్బంది వారి ఆయుధాలను తొలగించడం అవసరం అని అభిప్రాయపడ్డారు. దాని ద్వారా అన్ని పార్టీల మధ్య, ప్రత్యేకించి భారతదేశం చైనా లాంటి పెద్ద శక్తుల మధ్య ఏదైనా సంఘర్షణకు అవకాశం లేకుండా చేయొచ్చని భావించారు. ఆ విధంగా టిబెట్ ఒక శాంతి ప్రాంతంగా, ఈ ప్రాంతంలో, ప్రపంచంలో శాంతికి నిజంగా అది దోహదపడుతుందని అతని విశ్వాసం. ఆ విధంగా టిబెట్ సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలు కాపాడబడతాయని, టిబెట్ వాసులకు స్వేచ్ఛను సాధించే ప్రాథమిక ఆలోచనకు అతను కట్టుబడి ఉన్నారు. టిబెట్ పోరాటం చైనీస్ ప్రజలకు లేదా చైనాకు వ్యతిరేకంగా కాదని, టిబెట్ ప్రజల చట్టబద్ధమైన హక్కులను రక్షించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి, ప్రపంచంలోని గొప్ప విలువైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే ప్రయత్నం మాత్రమే అనేతను చెప్పుకున్నారు.
దలైలామా, ఇరవయ్యవ శతాబ్దంలో, ఒక శరణార్థి కంటే, మన ప్రపంచ సంస్కృతి, మన ప్రపంచ ధర్మం, మన ప్రపంచ కర్మ గురించిన స్పష్టమైన భావన ఉన్నవారు. బుద్ధుడులా ఉన్న శరణార్థుడు అతను. దలైలామా, చిన్నతనంలో తన ముందు ఉంచిన పనిని పూర్తి చేసి, తన దేశాన్ని రక్షించి, టిబెట్కు తిరిగి వస్తాడని ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసులంతా నమ్ముతున్నారు. అతను చేయలేకపోతే, అందరం ఆ నిందలో భాగస్వాములమని, కానీ ఆయన చేయగలుగుతే అందరం ఆ ఆనందంలో భాగస్వాములమని వారంతా భావిస్తున్నారు.
భారతదేశంలో టిబెట్ ప్రశ్నతో తరచుగా చర్చ జరుగుతూనే ఉంది. శతాబ్దాలుగా టిబెట్ భారతదేశపు ఉత్తరాన పొరుగు దేశం కావడం మూలానే ఆశ్చర్యం ఆందోళన కలిగించే అంశం కాదు. టిబెట్ సంస్కృతి భారతదేశం ద్వారా ఎక్కువగానే ప్రభావితమైంది, దాని ఫలితంగా టిబెట్, భారతీయ ప్రజల మధ్య స్థిరమైన సంబంధాలు ఏర్పడ్డాయి, అందులో మతపరమైన విలువలు కూడా ఉన్నాయి. టిబెట్ భారతదేశపు ఉత్తర సరిహద్దులో ఎక్కువ భాగంలో ఉండడంతో శతాబ్దాలుగా భారతదేశం చైనా మధ్య తటస్థ ప్రాంతంగానే పనిచేసింది. 1950ల ప్రారంభం నుండి టిబెట్ను చైనా ఆక్రమించడంతో, చైనా భారతదేశానికి తక్షణ పొరుగు దేశంగా మారింది. అంచాత రెండు దేశాల మధ్య కొన్నిసార్లు సమస్యాత్మక రాజకీయ సంబంధాలు ఏర్పడ్డాయి. సరిహద్దు దాటి ఉత్తర భారతదేశంలోని టిబెట్ ప్రాంతాల్లోకి చైనా చొరబాటు ప్రాదేశిక సమస్యలకు సంఘర్షణలకు మూలం అవుతూనే ఉన్నాయి. ఇతర వివాదాలు కూడా చైనా-భారత సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి, పాకిస్తాన్తో చైనా పొత్తు, ముఖ్యమైన నీటి సమస్య వరకు. భారతదేశంలో 130,000 మందికి పైగా టిబెట్ శరణార్థులు ఉండటం టిబెటన్ సమస్య మీద భారతీయ ఆసక్తిని మరింత తీవ్రతరం చేస్తోంది. టిబెట్ శరణార్థుల పట్ల భారతదేశపు దీర్ఘకాలిక కట్టుబాట్ల కారణంగా, శరణార్థుల సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. సరిహద్దుల వెంబడి అధికార చైనా అనుసరిస్తున్న విధానాల మూలంగా, ఆందోళనలు ఎలాగూ ఉన్నాయి.
ఈ జూలై 6, 2025న టిబెట్ బహిష్కృత ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు 90 ఏళ్లు నిండినప్పుడు, అతను తన వారసత్వం విషయంలో మరింత స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు, ఈ విషయం మీద ఆయన చేసిన ప్రకటనలు వివిధ పరిణామాలను సూచిస్తున్నాయి. 2019లో ధర్మశాలలోని జర్నలిస్టుల బృందాన్ని ఉద్దేశించి చేసిన ప్రకటన ఇలా ఉంది.
“దలైలామా పునర్జన్మ, దలైలామా భవిష్యత్తు, చివరికి నా చేతుల్లోనే ఉంది. నా మరణ సమయంలో, నేను కొంత వీలునామా రాస్తాను. కాబట్టి నా పునర్జన్మ ఎక్కడో బౌద్ధ సమాజంలో ఉంటుందని నేను భావిస్తున్నాను. 1969లోనే, దలైలామా సంస్థను కొనసాగించాలా వద్దా అనేది టిబెట్ ప్రజల ఇష్టం అని నేను స్పష్టం చేశాను. పునర్జన్మ ముఖ్యం కాదు, బుద్ధుని బోధనలు అలాగే ఉండడం ముఖ్యం.”
“ప్రపంచం ఇప్పుడు ఎంత కుంచించుకుపోయిందో, ఎలాంటి ప్రజలకైనా ప్రమాదరహిత ఒంటరితనంలో జీవించడం అసాధ్యమని కఠినమైన పాఠం మేము నేర్చుకోవలసి వచ్చింది” – ప్రపంచం టిబెట్ను, టిబెటీయులకు ఇప్పించలేని స్థితిలో ఉండడం దలైలామాను ఎంత బాధిస్తోందో అతని ఈ వ్యాఖ్యే చెబుతుంది.
1951లో చైనా కమ్యూనిస్టులు సైనిక బలగాలతో టిబెట్ మీద దండయాత్ర చేయడానికి ముందు, చాలా మంది టిబెటన్ ప్రజలు తమ మత విశ్వాసాలు, సాంప్రదాయ సంస్కృతితో సంబంధాలు, భౌగోళిక స్థానాల పరంగా తమ స్వంత గుర్తింపులను నిర్వచించుకున్నారు. చాలా కాలంగా, టిబెట్ పాండిత్యం ఆధ్యాత్మికత, మార్మిక వాదం, తత్వశాస్త్రం, మతం మీదనే ఎక్కువగా వారు దృష్టి సారించారు. ఇప్పుడు ప్రవాసం టిబెట్ వాసులకు వారి గుర్తింపు, వారి జాతి వ్యక్తీకరణగా మారింది. వారి రచనలు చైనా వలసవాద దాడిని ప్రతిఘటిస్తూ నిరసన తెలిపే నిర్దిష్ట ప్రతిధ్వనిగా మారింది. అందువల్ల టిబెట్ వాసులకు వారి స్వరం నిరంతర నిరసన రూపం – ప్రవాసంలో ప్రతిఘటన రూపం.