నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము

కవిత్వం పదాల పరసువేది. కోటిస్తంభాల మంటపం. త్యాగయ్యలు తాకితే సంగీతాన్ని ధ్వనిస్తుంది. జాషువా, కరుణశ్రీలు తాకితే నవనీతమై కరుగుతుంది. విశ్వనాథది ఖంగుమని మోగుతుంది. శ్రీశ్రీదైతే ఉద్యమఘోష చేస్తుంది. కీట్స్, సౌందర్య స్వరూపమొక అనశ్వరానంద హేతువు అంటాడు. కవిత్వం అటువంటి సౌందర్య స్వరూపం. వేనవేల తలాలు కలిగిన గాజు స్పటిక. అక్కడ పదాలు పరావర్తనం చెంది సౌందర్యావిష్కరణ చేస్తాయి. ఆ సౌందర్యం అనుభూతి చెందగలిగితే అదృష్టమే కానీ, అన్నిసార్లూ అంతా పదాలకి అందుతుందని మాత్రం చెప్పలేము. అందుకే ఇన్నితరాలుగా, ఇన్ని భాషల్లో కవులు ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంది. ఆ సౌందర్యపారావారము మేర లేనిది. పాండ్యరాజు గారి శంఖపీఠిలా ఎందరు కవులు కూర్చున్నా మరొక కవికి చోటు ఎప్పుడూ ఉంటుంది.

కవిత్వానికి, భాష, చెప్పదలుచుకున్న ప్రధానమైన భావం, ఉపయోగించే ప్రతీకలు స్థూలంగా ప్రధాన అంగాలని చెప్పవచ్చు. వాటిని ఉపయోగించే రీతీ, సందర్భమూ, ఎన్నుకునే రూపురేఖలలోనే కవుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అందుకే కవితలు ఒకదాన్నొకటొ ప్రభావితం చేస్తుంటాయి. అంటే కవులు ఒకరినొకరు అనుకరిస్తారని కాదు. ఒక మంచి కవిత ఎప్పుడూ మరొక కవితకి ప్రేరణ కలిగిస్తుందని. విశ్వనాథ “నీ రథము” అయినా, శ్రీ శ్రీ “ఆః” కవిత అయినా, వేదుల “ఆశాగానము” అయినా పైన చెప్పిన లక్షణాలతో పాటు, క్లుప్తతను జత చేసుకుని మరింత ఆకట్టుకుంటాయి. కరుణశ్రీ గారి “పుష్పవిలాపము” లో పూలు మనుషుల కాపట్యాన్ని, ఆత్మవంచనని ఎత్తి చూపిస్తే, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి “కాంక్ష” లో అప్పుడే పూచిన పూవు క్షణికమైన తన జీవితకాలాన్ని గుర్తిస్తూనే, మనుషులు పూలని ఎన్ని రకాలుగా దైనందిన జీవితంలో ఉపయోగిస్తారో వాటన్నిటినీ నిరాకరిస్తూ, తనజీవిత పరమార్ధాన్ని చివరివరకూ ఉత్కంఠత కలిగిస్తూ వివరిస్తుంది. నాకు నచ్చిన అనేకానేక పాతకొత్తల మేలుకలయికలో, విశ్వనాథ “నీ రథము” ఒకటి.

కవిత్వసౌందర్యం గురించి ఎవరు ఎన్ని చెప్పినా, చెప్పడానికి ప్రయత్నించినా అది భాస్కరశతకకారుడు చెప్పినట్టు చేతి పాత్రతో నదీ ప్రవాహంలో నీటిని పట్టుకోవడం లాంటిది. పంచతంత్రంలో గుడ్డివాళ్ళు ఏనుగును నిర్వచించడంలాంటిది. ప్రతి వివరణా వ్యక్తులు తమ దృక్కోణంలో, తమ అవగాహన మేరకు, ఆవిష్కరించిన చిత్రమే. కనుక నా పరిమితుల్లో నా అవగాహనని పంచుకుందికి ప్రయత్నిస్తాను.

“నీ రథము” రెండు కారణాలవల్ల నాకు నచ్చింది. ఒకటి పద్యంలోని అంతర్గత సౌందర్యం, రెండవది అతని జీవితానికేగాక, కవి అన్నప్రతివాడికీ ఒక విలక్షణత ఉండాలని చేసిన ప్రభోదం. ఇవి కేవలం మూడే మూడు పద్యాలు.

నీ రథము

ఓ ప్రభూ! నీ రథము దీక్షాప్రణీత
విధురవేగమ్ము పరువులువెట్టుచుండె
నా శరీరమ్ము దానిక్రిందబడి నలిగి
నలిగిపోయినది రక్తనదములింకి.

దివ్యతేజోవిరాజత్త్వదీయ రథము
ఈ గతుకుడేమియనియైన ఆగలేదు
నా నిరోధించిన హఠాన్నినాదమునకు
వెనుదిరిగియైన మరిజూచికొనగలేదు

నాదు రక్తము నీ రథచోదకుండు
కడిగివేయును రేపు చక్రములనుండి
అచటబహుజనరక్తచిహ్నములయందు
నాదియిదియనిగుర్తేమికన్పడును, సామి!

ఇందులో కవి చెప్పిన విషయం కాలమూ, మృత్యువూ, కాలాన్ని అధిగమించి నిలబడగల మన గుర్తింపూ (ఐడెంటిటీ). ఎన్నుకున్న ప్రతీక రథము. కవి ఎక్కడా కాలాన్ని వాచ్యం చెయ్యకపోవడం గమనించదగ్గది. వాచ్యం చెయ్యకుండా అనుభవంలో ఉన్న ప్రతీకలద్వారా కవి తన భావాన్ని చెప్పడం ఒక కళ. చాలామంది కవులు పాఠకుడికి ఎక్కడ అర్థం కాదోనన్న ఆదుర్దాతో కొటేషన్లలో పెట్టి మరీ ఆరాటపడిపోతుంటారు. కవిత బాగా నడిపినా చివరకి వాచ్యం చేసి దాని సౌందర్యాన్ని చెడగొడుతుంటారు. మనం ముఖ్యంగా గమనించవలసింది, పాఠకుడికి ఆ శ్రద్ధలేకపోతే కవిత్వాన్ని చదవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? అసలు ఈ కవిత్వం చదవడమన్న పని మానేసి హాయిగా నాలుగు రాళ్ళు సంపాదించుకునే మరొక లౌకిక వ్యాపకం చూసుకుని ఉండేవాడు. పాఠకుడికి కవి అంతరార్థాన్ని కనిపెట్టగల ఓర్పూ నేర్పూ ఉన్నాయన్న విషయం మరిచిపోకూడదు. తిలక్ చెప్పినట్టు ‘కవిత్వం లో కొంత అస్పష్టత ఉండవచ్చు, కాని కవి “అనుభూతి ఆకారం పాఠకుడికి అందాలి,” తప్ప కవిత్వం పజిల్ లాగ ఉండకూడదు. అలాగని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుకాకుండా, కొంత ప్రయత్నం చేసిన తర్వాత అర్థం అవాలి. పాఠకుడికి తను స్వయంగా అర్థం చేసుకున్నపుడు కలిగే ఆనందమే వేరు.

ఇక్కడ ఆయన ఎన్నుకున్న భాష ఆయన సంస్కారా న్ననుసరించి గ్రాంథిక భాష. అయితే, ఇందులో బహుశా “దివ్యతేజోవిరాజత్త్వదీయ రథము”, “దీక్షాప్రణీత విధురవేగమ్ము” అన్న సమాసాలు మినహాయిస్తే, అర్థం కాని మాటలు లేవు. ఇవికూడా జాగ్రత్తగా గమనిస్తే, అర్థం అవుతాయి. కాకపోయినా మొదటిది రథాన్ని వర్ణిస్తున్నాదనీ, రెండవది రథం యొక్క వేగాన్ని గురించో, దాని లక్ష్యం గురించో చెబుతున్నదనీ సందర్భాన్ని బట్టి సులువుగానే అర్థం అవుతుంది.

అసలయిన భావం చివరి పద్యంలో ఉంది. సాధారణంగా కవిత్వశిల్పం తెలిసినవాళ్ళు కవిత్వం ఆదిని గాని, అంతాన్నిగాని చక్కగా రూపుదిద్దుతారు. కారణం మొదటిది కవితని చివరిదాకా చదివిస్తే, రెండవది కవిత చదివినతర్వాత, గోరింటవాసన లాగో, కర్పూరతాంబూలంలాగో దానిభావం మనల్ని కొంతసేపు వీడకుండా ఉంటుంది.

ప్రతి రథచోదకుడూ చేసేపని సాయంత్రం ఇంటికివచ్చేక రథాన్ని శుభ్రంగాకడిగి మరుచటిరోజు ప్రయాణానికి సన్నధ్ధం చెయ్యడం. రథం అన్న తర్వాత చెత్తాచెదారం అన్నిటి మీద నుండీ పోతుంది. ఇది కాలచక్రం కనుక మనుషులమీంచి పోతుంది. అలాగే ఒక రోజు నా(కవి) మీద నుండి కూడా పోయింది. బండికింద పడ్డవాడు ఏమిటి చేస్తాడు? గట్టిగా ఒక గావుకేక (లేదా చావుకేక) వేస్తాడు (నా నిరోధించిన హఠాన్నినాదము అంటే ఇదే). కాని కాలం ఎవరి కోసమూ ఆగదు కదా. అందుకని వెనుతిరిగి చూడకుండా పోయింది. నా రక్తం ఆ చక్రాలమీద తుళ్లి మరకలు పడింది. రథ చోదకుడు చక్రాలను రోజూ కడుగుతున్నాడు కదా, అలా కడుగుతూ కడుగుతూ ఉంటే రక్తపు మరకలన్నీ ఒకచోటకి పారి మడుగులా తయారయింది. అందులో నాలాగే కాలచక్రం క్రిందపడి నలిగిపోయిన చాలా మంది రక్త చిహ్నాలున్నాయి. అక్కడ ఉన్న అనేకానేక రక్త చిహ్నాల్లో, “నాది ఇది” అని ఎలా పోల్చుకోవడం? అని అడుగుతున్నాడు కవి దైవాన్ని. “పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అని వేమన శతకకారుడు చెప్పినట్టు కాకుండా, మనం మన జీవితానికి ఒక ప్రత్యేకత సంతరించుకోవాలి. కవులైతే, శైలి, వస్తువు, సాహిత్య సృజన ఏదైనా, తమ ముద్రతో ఉండాలి. అంటే, ఉపయోగించే ఉపమానాలలో (ప్రతీకలు), భాషలో, వస్తువైవిధ్యంలో తమ ముద్ర ఉండాలి అని పరోక్షంగా ప్రబోధిస్తున్నాడు కవి.

ఈ కవిత మీద నా భావనలనిట్లా మిత్రులతో పంచుకుంటున్నప్పుడు, యాదృచ్ఛికంగా, కృష్ణశాస్త్రి ఇదే కవితను గురించి మరొకలా అనుభూతి చెంది, తన భావాలను పంచుకున్న వ్యాసమొకటి నా దృష్టికి వచ్చింది. ఆ వ్యాసంలో ఆయనిట్లా అంటారు:

“ఓ ప్రభూ!నీ రథమ్ము దీక్షాప్రణీత విధురవేగమ్ము; పరువులు పెట్టుచుండె” దానికింద పడిపోయిన వారెందరో దినాంతమందు నీ రథ చక్రాలు కడిగేటప్పుడు ఏ రక్తం ఎవరిదో గుర్తు పట్టగలవా అంటాడు విశ్వనాధ.

అబ్బ! అయినా బాధ ఎంత గొప్పది! అందరికీ వేదన రావాలి. అందరికీ ప్రేమ కావాలి.

పారశీక కవి సాథీ అన్నట్లు మనం అందరం ఒక్క ఆదంలో నుంచే వచ్చాం. మానవ లోకం అంతా కలిపి ఒక శరీరం. ఈ లోకంలో ఏ మానవుడు చనిపోయినా నువ్వూ నేనూ చనిపోతున్నాం. ఏ మానవుడు పుట్టినా నువ్వూ నేనూ మళ్ళీ పుడుతున్నాం. వేదనా ప్రేమా కలిస్తేనే కరుణ. కరుణ సృష్టిస్తుంది. కరుణ శైథిల్యంలోనుంచి చైతన్యాన్ని పుట్టిస్తుంది. కరుణ బోధివృక్షం, కరుణ సిలువ, కరుణ సబర్మతి. ఊరికే బాధ చాలదు. కన్నీరు రావాలి. మేఘాలు పట్టవచ్చు. వర్షం కురియకపోవచ్చు. కన్నీటి భాగ్యం మానవునికే ఉంది.”

గొప్ప కవిత్వం ఎన్నో పొరలను దానిలో దాచుకుని ఉంటుందని, కాలాలకు అతీతంగా, అది ఒక్కొక్క పాఠకుడిలో ఒక్కో భావనను రేకెత్తిస్తుందని ఈ ఉదాహరణ మరొక్కసారి చెప్పినట్టైంది.