పునః

చెదిరిపడ్డ శకలాల్ని ఒక్కొక్కటిగా ఏరుకుని
పూటకొకటిగా పేర్చుకుని
యింకొక హృదయాన్ని కట్టుకున్నాను

ప్రాణం మొదలయేంతలో
మళ్ళీ నువ్వు…


గాయపడ్డ మాటలన్నింటినీ దాచుకుని
రెండు దోసిళ్ళలో నింపుకుని
మహానిశ్శబ్దాన్ని నిర్మించుకున్నాను

శాంతి మంత్రమేదో దొరికేంతలో
మళ్ళీ నువ్వు…


ఏ పువ్వూ పూయని ఆ పాత మట్టిలోకి
ఇన్నేళ్ళుగా కన్నీటిని జారవిడుస్తూ
సమాధానాలు వెతుక్కుంటూ అలసిపోయాను

యిక ముగిసిపోతుందనుకున్న చీకటి చివర్న
మళ్ళీ నువ్వు…


అవుననలేను.
అనుమతించలేను.
నీ కన్నుల్లో మెత్తదనం తెలుస్తున్నా,
ఆ శిథిలాల్ని మళ్ళీ అలంకరించలేను

నువ్వెళ్లిపోయావు
నేను మిగిలిపోయాను
ఇదీ మన కథ.


నవీన్ కుమార్

రచయిత నవీన్ కుమార్ గురించి:

తనదైన గొంతుకతో, గాఢమైన అనుభవాలను కవిత్వం చేస్తున్న ప్రతిభావంతుడైన రాయలసీమ కవి.

 ...