[డా॥ అల్లూరు రాజకుమారి రాజోలులో 14, 15 డిసెంబర్ 1994 తేదీల్లో నిర్వహించిన చలం సాహిత్యోత్సవాల్లో భాగంగా మొదటి రోజు డా॥ పాపినేని శివశంకర్ చేసిన ప్రసంగ పాఠం. — సం. ]
చలం గురించి ఈ వేళ ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే, ఎందుకసలు మాట్లాడుకోవాలి? కేవలం ఆయనకి వందేళ్ళు పూర్తి కావటం వల్ల మాట్లాడుకోవటమా? లేక, ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవటమా?
మాకో మాస్టారు ఉండేవారు. గ్రామరు చెబుతూ, సూత్రం ప్రకారం ఉదాహరణ చెప్పి, ఇది ఇట్లా ఎందుకు అవుతుందని ప్రశ్న వేసేవారు. ఎందుకు అవుతుందో మాకు అర్థమయ్యేది కాదు. ఇక ఆయనే చెప్పేవారు, అవుతుంది కాబట్టి అవుతుంది అని. అలాగ మనం కూడా ఈ వేళ చలం గురించి ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవటం కాదు. ఆయన అవసరం ఈనాటి వర్తమాన సమాజానికి ఉన్నది కాబట్టి మాట్లాడుకోవాలి. లేకపోతే, నూరేళ్ళు పూర్తి అయిన అందరి గురించి మాట్లాడుకోవాలి. అది కాదు విషయం. అంటే, సమాజానికి ఈ వేళ ఆయన అవసరం ఉంది. ఈ వేళ ముందుకు వస్తున్నటువంటి స్త్రీవాదానికి ఆయన అవసరం ఉంది. ఈ వేళ రకరకాల ప్రశ్నల మధ్య వ్యక్తి యొక్క జీవితం చిక్కుముడిగా మారిపోతున్న దశలో చాలా వాటికి మనం సమాధానాలు వెతుక్కోవటానికి చలాన్ని కూడా ఈ వేళ మనం వెతుక్కోవలసిన అవసరం ఉంది. కొత్తగా మనం ఎసెస్ చేసుకోవలసిన అవసరం ఉంది. ఏ సాహిత్యమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ రచయిత అయినా కూడా, వర్తమాన సామాజిక, వర్తమాన విమర్శనాత్మక దృక్కోణం నుంచి మాత్రమే ఆంచనా వేయబడతాడు. అతన్ని మనం ఎలా చూస్తామంటే, మన దృష్టికోణంలోనుంచి మాత్రమే చూస్తాం. అట్లాగే చలాన్ని కూడా ఈ వేళ మనం ఎలా చూస్తామంటే, మన సామాజిక అవసరాల నుండి, అనేక పరిస్థితులను మనం ఎదుర్కొనేటటువంటి రకరకాల బాదరబందీల నుండి ఆయన్ని కూడా మనం అంచనా వేయటం. అట్లాగే మనం పరిశీలించినప్పుడు చలం మంచి రచనలు చేసినటువంటి తీరు చాలా ప్రధానమైనటువంటిదని మనకు అనిపిస్తుంది. మనిషిని మనిషిగా ఏ బంధాలూ లేకుండా, ఉన్న వ్యక్తులు ఉన్నట్లుగా, ఉన్న సమాజాన్ని ఉన్నట్లుగా, ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా పరిశీలించటమన్నది చాలా కష్టమైన పని. Man as he is; man as he should be. అది తన సాహిత్యంలో చలం చేసిన పని అని నేను అనుకుంటున్నాను. మనిషి ఎట్లా ఉన్నాడు? ఎట్లా ఉండాలి? అనే దాన్ని ఆయన చాలా తరచి చూసినట్లుగా కనిపిస్తుంది.
తరువాత, ఆయన ఎట్లాంటి రచయిత అవుతాడు అని మనం వర్గీకరణ చేయదలచుకున్నట్లయితే సాధారణంగా, స్థూలంగా రచయితలంతా కూడా రెండు ప్రధాన వర్గాలుగా అవుతారు. నిబద్ధులు, అనిబద్ధులు. Confirmists, Nonconfirmists. సమాజంలో ఉన్న సమస్తమూ కూడా ఆమోదించదగిందే. దానితో మనకు ఎటువంటి పేచీ లేదు. ఉన్నది ఉన్నట్లుగా ఆమోదిస్తాం. అటువంటి రచయితలు కొంతమంది ఉన్నారు. వారికి ఎవరితోనూ, ఎటువంటి సమాజంతోనూ పేచీ ఉండదు. యద్దనపూడి నవలలు చదువుతాం. లేదా యండమూరి నవలలు చదువుతాం. వారికి ఈ సమాజంతో ఎటువంటి పేచీ లేదు. All is well with the society. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ప్రేమ, కొంచెం హాహాకారం, కొంచెం సెన్సేషన్` ఇవన్నీ కలగాపులగం చేసి ఆకర్షింపజేయాలనే ప్రయత్నమే కానీ, అటువంటి రచయితలకు ఈ సమాజంతో ఎటువంటి పేచీ లేనే లేదు. చాలా సరదాగా, చాలా హాయిగా చాలా ఖుషీగా రాసుకుపోతారు.
అలా కాకుండా, కొంత మంది ప్రశ్నించే రకం ఉంటారు. ప్రతి దాన్నీ ఎదురు ప్రశ్న వేసి, ‘ఇది ఇట్లా ఎందుకు అవుతుంది? ఎందుకు కావాలి?’ అనేవారు ఉంటారు. జీవితం ఇలా ఉంది అంటే, ఇలా ఎందుకు ఉండాలని ఎదురు ప్రశ్నలు వేసేవారు ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎట్లా? అనే మౌలికమైన ప్రశ్నలు వేసుకుంటూ, జీవితాన్ని` కుటుంబ జీవితాన్ని గానీ, సామాజిక జీవితాన్ని గానీ నిష్కర్షగా అంచనా వేసినటువంటి, నిష్కర్షగా పరిశీలించినటువంటి రచయితగా చలం మనకు కనబడతాడు. అతను confirmist కాడు. ఏ దశలో కూడా, సమాజంతో కానీ, వ్యక్తుల జీవితాలతో కానీ, సామాజిక ఆచారాలతో కానీ ఆమోద స్వభావాన్ని మాత్రం అతను పొందలేదు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడా ఆమోదించలేదు. చలం జీవితమంతా ఒక ప్రశ్న, ఒక అన్వేషణగానే మనకు కనిపిస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇందాక ఇస్మాయిల్ గారు చెప్పినట్లు, చలం అంటే స్వేచ్ఛ, చలం అంటే సౌందర్యం, చలం అంటే ప్రేమ, చలం అంటే ఆనందం. ఇలా అనేక రకాలుగా చలం మనకు కనిపిస్తాడు. వారే చెప్పినట్లుగా ఆరుగురు గుడ్డివాళ్ళకు ఏనుగు కనపడిన విధంగా, ఏనుగును వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా చలాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ తేడా ఏమిటి అంటే మనం గుడ్డివాళ్ళం కాదు కాబట్టి, ఆంతో ఇంతో ఆలోచించగలం కాబట్టి, చలం ఎలాంటి వాడు, చలం సాహిత్యానికి ఈనాడు ఉన్నటువంటి సాపేక్ష సంబంధం ఏమిటి అనేది కొంతవరకు చూడగలుగుతాం.
తరువాత, ఈ రచయితకు ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం` ఏది రాశాడో అదే చలం. ఏది నమ్మాడో అదే అతను రాశాడు. ఏది రాశాడో అదే అతను చెప్పాడు. అంటే ఏ దశలో గానీ, ఏది రాశాడో దానినుంచి ముఖ్యంగా వైమనస్యం గానీ, వైముఖ్యం గానీ, చలానికి సంబంధించినంత వరకు ఏదీ మనకు కనపడదు. వర్తమాన కాలంలో తద్విరుద్ధమైన రచయితలు చాలామంది ఉంటారు. ఆ తీరుగా చలం ‘ఆత్మలోకంలో దివాలా’ తీయలేదు.
స్త్రీవాదం పట్ల ఎంతో సానుభూతి చూపించి, చివరకు చావగొట్టి చెవులు మూసేవారు ఎంతోమంది ఉంటారు. సందేహం లేదు. అలానే ఎన్నో గొప్ప ఆదర్శాలు కవిత్వంలో ప్రతిపాదించి తద్విరుద్ధమైన దారుణమైన జీవితాన్ని గడిపేటటువంటివారు కూడా కొంతమంది ఉన్నారు మనకు. అయితే చలం విషయంలో మాత్రం అది ఎట్టి పరిస్థితిలోనూ సరి కాదు. అతను ఏదైతే ఆలోచించాడో అదే చెప్పినట్లుగా మనకి అనిపిస్తుంది. ఏది చెప్పాడో అదే ఆచరించినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే దశలు ఉన్నాయి. ఏ దశలో ఏది చెప్పాడో ఆ దశలో దానినే ఆచరించాడు. romanticగా ఉన్నప్పుడు romanticismని అతను నమ్మాడు. దానినే అతను ప్రతిపాదించాడు. ఆధ్యాత్మికవాదిగా మారిన తరువాత, దానినే అతను నమ్మాడు. దానినే అతను ప్రతిపాదించాడు. సౌరిస్లో నాకు భగవంతుడు కనిపించాడు అని చెప్పుకున్నాడు. అంతే. అది అతని నమ్మకం. దానిని మనం ఈ వేళ ప్రశ్నించి లాభం లేదు. తాను నమ్మిన దానినే ఆచరించాడు. నీ కోసమో, నా కోసమో, మరొకరి కోసమో ఎవరేమనుకుంటారో అనే భావంతో మరో విధంగా ఆచరించటం కానీ, మరొక విధంగా మాట్లాడటం కానీ, ఆత్మ విరుద్ధమైన భాష, ఆయన వ్యక్తిగత రచనల్లో కానీ, మ్యూజింగ్స్లో కానీ, కథలు, నవలలు` ఇలాంటి వాటిల్లో కానీ మనకు కనపడనే కనపడవు.
ప్రేమను గురించి ఆయన రాసినప్పుడు దీనిలో తారతమ్యాలు మనకి చాలా కనిపిస్తాయి. నవలల్లో కానీ, కథల్లో కానీ చాలా స్వేచ్ఛాపూరితమైన ప్రేమని అతను ప్రతిపాదించాడు. అయితే ఆయా వ్యక్తుల్ని బట్టి, ఒక్కొక్క చోట కేవలం కామంలా మనకి కనిపిస్తుంది. ఒక్కొక్క చోట అది మరి కాస్త పై స్థాయిలో చేరినట్లుగా కనిపిస్తుంది. ఇలా రకరకాల ప్రేమల్ని, రకరకాల శృంగారాల్ని అయన ప్రతిపాదించాడు. అయితే ఎక్కడా కూడా, ఈ శృంగార వర్ణనలు చేసేటప్పుడు కానీ, అలాంటి కథలు రాసేటప్పుడు కానీ శరీరం లేనటువంటి ప్రేమను అతను ప్రతిపాదించలేదు. శరీర సహితమైన ప్రేమనే ప్రతిపాదించాడు. ఇక్కడే భావకవులకూ, ఆయనకీ చాలా తేడా కనిపిస్తుంది. వాళ్ళూ, ఆయనా ఒకే కాలంలో పుట్టి పెరిగినా, రాసినా, ఆలోచనావిధానంలో మాత్రం చాలా భేదం ఉంది.
భావ కవిత్వం గురించి మనం చెప్పుకోవాలంటే, సింపుల్గా పురుషుడు ప్లస్ స్త్రీ మైనస్ శరీరం. శరీరం లేనటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది. భావ కవిత్వంలో కృష్ణశాస్త్రిగారు ఉన్నారనుకోండి. ముక్కూ మొహమూ ఏమీ కనపడవందులో. కేవలం ఆమెతో ఊహా విహారం చేయటం మాత్రమే మనకు తెలుస్తుంది. ఆమె ఎలా ఉండేది? ఎర్రగా ఉండేదా? బుర్రగా ఉండేదా? కృష్ణశాస్త్రి చెప్పలేదు. మనకు తెలియదంతే. అలా కొంచెం కనపడీ కనపడనట్లుగా ఊహించుకోవలసిందే కానీ ఒక స్పష్టమైనటువంటి శరీరాకృతి మనకు కనిపించదు. అందుకనే భావ కవిత్వంలో స్త్రీకి శరీరం లేదు పొమ్మన్నారు విమర్శకులు. చలంలో మాత్రం కచ్చితంగా స్త్రీ యొక్క శరీరం మనకు కనిపిస్తుంది. అది శరీరం లేనటువంటి, శరీర కాంక్ష లేనటువంటి ప్రేమ కాదు. ఇది చలం ప్రేమను గురించి ప్రతిపాదించిన ఒకానొక ప్రధానమైన అంశం.
ఎప్పుడైతే శరీరాన్ని ప్రధానంగా తీసుకున్నాడో, అప్పుడు తప్పనిసరిగా అందులో కామమూ, మోహమూ` ఇలాంటి అంశాలు మనకి ఎన్నో కనిపిస్తాయి. ఒక్కొక్కచోట మనం అంగీకరించలేం కూడా. ‘హంపీ కన్యలు’ కానీ, ‘మైదానం’ కానీ` ఇట్లాంటి రచనల్లో మనం చూసినట్లయితే, పూర్తిగా కామదృష్టి మనకు కనిపిస్తుంది. స్త్రీ కోసం వెంపర్లాడటం. ‘హంపీ కన్యలు’ మొత్తం కూడా ఇద్దరు ముగ్గురు స్త్రీలు అతనికి తారసపడినప్పుడు, వాళ్ళ కోసం అతను వెంపర్లాడుతూ, ఆ స్త్రీలతో అనుభవం కోసం ఎంతో నీచమైన పద్ధతిలో అతను ఆలోచిస్తూ, ప్రవర్తిస్తున్నట్లుగానే మనకు అనిపిస్తుంది. అతనంటే ఇక్కడ చలం అని కాదు. అతను చెపుతున్న ప్రకాశం అన్న పాత్ర. శరీరరాహిత్యం అన్నది లేదు. శరీరకాంక్షా సహితమైన ప్రేమే చలం సాహిత్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలోనే చలం స్త్రీ పురుషుల మధ్య సమాజంలో ఈవేళ చలామణీ అవుతున్నటువంటి, ఆనాడు చలామణి అయినటువంటి ఒక ద్వంద్వ నీతిని కూడా ప్రశ్నిస్తాడు. మనం పెట్టుకున్న నీతి వేరు. వాళ్లు పెట్టుకున్న నీతి వేరు. మన స్వెేచ్ఛ వేరు, వాళ్ల స్వేచ్ఛ వేరు. అంతే.
మరి అలాంటి సమాజంలో, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ద్వంద్వనీతికి విరుద్ధంగా చలం తిరుగుబాటు చేశాడు. అతని వేదాంతం అంతా కూడా తిరుగుబాటే. మగవాళ్ళు ఆనేకమంది స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నారు. కలిగి ఉంటున్నారు. దానిని ఎందుకు మనం ప్రశ్నించటం లేదు? ఒక స్త్రీకి అనేకమంది పురుషులతో సంబంధం ఉన్నప్పుడు దానిని మాత్రమే మనం ఖండిస్తున్నాం. ఆమె వ్యభిచారిణి, లేదా వేశ్య అని స్త్రీకి పేరు పెట్టినట్లుగా, మగవాడికి ఏమైనా పేరుందా? ఈవేళ ‘వేశ్యుడు’ అని అంటున్నామా? అనటం లేదు. ఎందుకు అనటం లేదు? మనకిది తప్పు కాదు. స్త్రీ మాత్రమే వ్యభిచారిణి అవుతుంది. స్తీ మాత్రమే వేశ్య అవుతుంది. వీడు ఎంతమందితో సంబంధం పెట్టుకున్నా కూడా వీడికి ఆ నీచత్వం లేదు. స్తీ మాత్రమే పతిత అయిపోతుంది. ‘కులట’ ఆనే మాట ఉంది, కానీ ‘కులటుడు’ అనే మాట లేదుగా పురుషుడికి? తీరా చెప్పుకోవడానికి వ్యభిచారి అని చెప్పుకోవచ్చు. కానీ పురుషుడికి అంతకుమించి ప్రత్యేకమైన సంకేతాలు వ్యభిచారానికి సంబంధించి ఏర్పడలేదు.
ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో దాన్ని మనం తప్పుగా భావించటం లేదు కనుక. కృష్ణుడు మనకు ఆదర్శం కద. కృష్ణుడు మరి దక్షిణ నాయకుడు కద. ఎనిమిది మంది భార్యలు ఉన్నారు. ఇంకా పదహారువేల మంది గోపికలు. ఆయన ఆదర్శం మనకు. ఆయనను దక్షిణ నాయకుడని ఎట్టి పరిస్థితిలోనూ మనం ప్రశ్నించటం లేదు. సత్యభామ పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ వుంటే ఉండవచ్చు. అంటే అందరు భార్యలతో సమానంగా వ్యవహరించేవాడు దక్షిణ నాయకుడు. ఆ దక్షిణ నాయకత్వాన్ని మనం సమర్థిస్తున్నాం. కానీ స్తీల విషయంలో మనం దాన్ని సమర్థించటం లేదు. అలాంటి సందర్భంలో చలం దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ‘మైదానం’లో కానీ, ‘శశిరేఖ’లో కానీ, అనేకులు, అంటే ఒకరి కంటే ఎక్కువమందితో సంబంధం పెట్టుకోవటం చాలా స్పష్టంగా ప్రతిపాదించాడు. ఎక్కడా తప్పు పని చేసినట్లు మాత్రం చలం మనకి ఎక్కడా చెప్పలేదు.
తరువాత సామాజిక ఆచారాలను కూడా ప్రశ్నించటం. బ్రాహ్మణుడుగా పుట్టి, మరి బ్రాహ్మణ కుటుంబాలలో ఎట్లాంటి దుర్భర ఆచారాలు ఉన్నాయో, అటువంటి వాటి మధ్య ఆయన పెరిగినవాడు కాబట్టి బాగా తెలుసుకోగలిగాడు. వాటిని ప్రతి సందర్భంలోనూ ఆయన ఖండించాడే కానీ, ఎక్కడా కూడా బ్రాహ్మణత్వాన్ని సమర్థించినట్లుగా మనకి అనిపించదు. అందుకోసమే మన విమర్శక మిత్రులు ‘చలం బ్రాహ్మణీకం నుండి బ్రాహ్మణీకం దాకా పోయాడు’ అని చెప్పి దుర్విమర్శలు చేశారు. కానీ నిజానికి ఆయన ఎక్కడా కూడా, బ్రాహ్మణత్వాన్ని సమర్థించినట్లుగా మనకు అనిపించదు.
‘ఎరికలమ్మ’ అని ఒక కథ రాశాడు. ఒక ఎరుకల ఏనాది యువతీయువకులు. వారిద్దరూ పెన్నా నదిలో జలక్రీడలాడుతున్నారు. అతను ఆమె ఒళ్ళంతా రుద్దుతాడు. దాన్ని ఈ రచయిత చూస్తాడు. అద్భుతంగా వర్ణిస్తాడు. అది మరి కామం కావచ్చు. లేకపోతే అది శరీర కాంక్ష కావచ్చు. దాన్ని ఎక్కడా కూడా రోత అనుకోడు చలం. చక్కగా వివరంగా వర్ణిస్తాడు. వర్ణించి ఈ సామాజిక, సాంఘిక ఆచారాలను చాలా తేలిగ్గా హేళన చేస్తాడు. ఎలా ఉంటుంది అంటే, ‘ఆనకట్ట కింద మడిరేవులో, మేము స్తానం చేసిన నీళ్ళు చేరుకునే గుంటలో పారుదలే లేని ఆ మురికిలో, ముసలమ్మలు చెంబులు తోముకుంటున్నారు. శ్రోత్రియులు మంత్రాలు చదివి స్తానాలు చేస్తున్నారు. ఈ నాడు పావనమైంది మీ జన్మ! ఆమె వీపు కడిగిన నీళ్ళు ఆచమనం చేస్తున్నారు. స్వర్గం కావాలా మీకు? ఎక్కడ వుంది స్వర్గం? నల్లని వీపు తోమే భాగ్యం లేని మీకు స్వర్గం ఏమిటి?’ అంటున్నాడు. ఎంత దారుణంగా హేళన చేస్తున్నాడు? అంటే అక్కడ కులం లేదు. మతం లేదు. ఇటువంటి ఆచారాలనే హేళన చేస్తున్నాడన్న మాట. అంటే, ఏవి మనిషిని కట్టిపడేస్తున్నాయో, వాటన్నిటి పట్లా వ్యతిరేకత చలానికి ఉంది. చలం సాహిత్యమంతా విముక్తి వాదమే. మనిషికి ఉన్నటువంటి సమస్యల నుంచి కానీ, మనిషికి ఉన్నటువంటి రకరకాల ప్రభావాల నుంచి కానీ, రకరకాల ఆచారాల నుంచి కానీ, పూర్తి విముక్తిని చలం సాహిత్యం కోరుతూ ఉంది. కాబట్టి చలం సాహిత్యం = విముక్తి అని స్థూలంగా మనం చెప్పుకోవచ్చు.
అలా ఆ విముక్తిని గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు రకరకాల పాత్రల గురించి, కుటుంబాలలో స్త్రీలు పడుతున్న రకరకాల యిబ్బందులను గురించి, కష్టాలను గురించి తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి, చాలా విపులంగా ఎన్నో కథలలో వాటి గురించి చెపుతాడు. స్త్రీల విముక్తినే ప్రధానంగా చూశాడు. పురుషుడి విముక్తి పెద్దగా అవసరం లేదు.
వితంతువుల పరిస్థితి గురించి చెప్పాడు. ‘శేషమ్మ’ అని ఒక కథ. కాపురం అన్నది సరిగ్గా లేక, పిల్లలు లేక, ప్రేమ అనేది సరిగా పూర్తిగా అనుభవించక జీవితంలోని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించక ఉన్నటువంటి దశలో, సహజంగానే ఏ వ్యక్తికైనా జీవితం పట్ల ఒక విధమైనటువంటి ద్వేషం కలుగుతుంది. వాళ్ళు మరొకరు సుఖపడటం చూడలేరు. అటువంటి పాత్రను ఇక్కడ శేషమ్మ అనే పాత్రను తీసుకొని చెపుతాడు. అంటే, ఆమె జీవితంలో కోల్పోయిన దాని గురించి. ఎవరు సుఖపడుతున్నా కూడా ఆమె సహించలేని స్థితిలో ఉంది. ఎందుకు? అది ఆమె తప్పా అంటే అది ఆమె తప్పు కాదు. ఆమెను ఆట్లా నిర్దేశించి, కుటుంబంలో అటువంటి పరిస్థితుల నుంచి కదలకుండా చేసి చుట్టూ ముళ్ల కంచెలు వేసినటువంటి సమాజానిది ఆ తప్పు. కేవలం ఆమె చూడలేనితనమూ, ఆమె బాధ, దానిని మనం పరిగణనలోకి తీసుకోవటం కాదు. ఆ పరిస్థితి ఏమిటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దాని చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థ ఎట్లాంటిది అని కూడా మనం ప్రశ్నించుకోవలసి ఉంటుందన్న మాట. అందుకని ‘వాళ్ల జన్మలో ఉందా లోపం? వారినిలా వదిలేసిన సంఘ పరిస్థితిలో వుందా లోపం?’ అని అక్కడ చలం ప్రశ్న వేస్తాడు.
అలాగే ఈ స్త్రీపురుష సంబంధాల గురించి ఎన్నెన్నో మనం దాచి పెడతాం. చాలా విషయాలు పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పం. చిన్న క్లాసుల్లో కూడా, fertilisation – ఇలాంటివి ఉన్నాయి. ఎలా ఈ సంతానోత్పత్తి జరుగుతోంది? ఇలాటివి అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు అడుగుతారన్న మాట. ఛ! ఇలాంటివి అడుగుతావేమని మనం వాళ్ళని మందలిస్తాం, తిడతాం. మళ్లీ జన్మలో అడగడు వాడు. కాబట్టి వాడికి తెలియదు. మరి పెళ్లి అయిన తరువాత వాడికి చెపుతారా ఎవరైనా వివరంగా? శాస్త్రీయంగా ఇలా సెక్స్ సంబంధాల గురించి మనం చెబుతున్నామా? చస్తే చెప్పం. అది చీకటి చాటున చేసే ఒక పాపకృత్యంగా భావిస్తున్నాం. అందుకని ఆ చీకటి తప్పుని గురించి బహిరంగంగా మాట్లాడటానికి భయపడతాం. సంకోచిస్తాం. ఇది ఒక ప్రధానమైన లోపం. దీని వలన స్త్రీలు గానీ, పురుషులు గానీ బలి అయిపోతూ ఉంటారు. అలాంటి కథని ఒకటి ఈయన రాశాడు. ‘నేనేం చేశాను’ అన్న కథ. ఒక అమాయకురాలిని ఈ sexuality గురించి తెలియనపుడు ఎవరో మోసం చేస్తే, అందరూ ఈ అమ్మాయిని, ఇంట్లోనుంచి బయటకు రానివ్వకుండా చేసి హింసిస్తారు. వేరొకరితో పెళ్లి అయినాక పాత సంగతి బయటపడుతుంది. ఫలితం? చివరికి సంఘంలోనుంచి వెలి. ఆమె ప్రశ్నిస్తుందన్న మాట. ‘నేను చేసిన పాపమేమిటి?’ అని. ఇక్కడ కూడా ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక సామాజిక వ్యవస్థలో ఉండే లోపాలను గురించి ఆయన చెపుతాడు. అలాగే స్త్రీలకు ఉండాల్సిన హక్కులను గురించి ‘ఆర్గ్యుమెంట్’ అని ఒక కథ రాశాడు. దాంట్లో ఒక యువతి జడ్జీతో వాదిస్తుంది. పోషించేవాడు వదిలెయ్యగా ఆమె గర్భస్రావం చేయించుకుంటుంది. ‘బిడ్డ పుట్టకుండా నేను గర్భం తీసేసుకున్నాను. అదెట్లా నేరమో చెప్పు?’ అని ప్రశ్నిస్తుంది. ఈ హక్కు నాకెందుకు లేదు? నన్నెందుకు శిక్షిస్తున్నారని అడుగుతుంది.
ఎందుకంటే, కనేది తనే. ఆ బాధ తనది. పురుషుడిది కాదు. కష్టాలు అనుభవించవలసిన అవసరం ఉండదు. ఆ కష్టాలు లేకుండా చూసుకోవలసినది తను. తన ఉద్దేశం అక్కడ ప్రధానమైంది. కాబట్టి నాకు ఇష్టమైతేనే నేను పిల్లల్ని కంటాను. నాకు ఇష్టం లేనప్పుడు నేను కనవలసిన అవసరం లేదు. వాడి కోసం ఏమిటి? వాడి వంశం నిలపడానికి కనటం? ఇలాంటివి మనలో ఉన్నాయి కదా! వీటికి వ్యతిరేకంగా ఒక స్త్రీ చేత చలం అలా మాట్లాడించాడు. సమాజాన్ని కానీ, వ్యక్తిని కానీ, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఆచార వ్యవహారాలు బందీగా చేస్తున్నాయో, వాటన్నిటికీ చలం వ్యతిరేకంగా పోట్లాడినట్లు చలం సాహిత్యం ఋజువు చేస్తోంది.
కథను ప్రధానంగా చేసుకొని మాట్లాడదలచుకున్నాను. కథారచనలో అతను పాటించినటువంటి శిల్పం కూడా చాలా గొప్పది. ఈ శిల్పమూ లేక శైలి` వీటి గురించి మాట్లాడడమంటే, చలానికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఒక రచయితను in toto మనం రీసెర్చ్ చేయవలసి వచ్చినప్పుడు, తప్పనిసరిగా వస్తువుతో పాటు రూపాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. అలా చూసినప్పుడు చాలా చరిత్రాత్మకమైనటువంటి రచనా విధానం కూడా కొన్ని సందర్భాలలో మనకి కనిపిస్తుంది.
‘ఓ పువ్వు పూసింది’` ఇలాంటి కథలు చదివితే, చాలా పొయిటిక్గా, చాలా బ్రీఫ్గా, పొయిట్రీలో ఎలాంటి సంక్షిప్తత, క్లుప్తత ఉంటుందో అటువంటి క్లుప్తత తోటి, అటువంటి శక్తిమంతమైన వాక్య నిర్మాణం తోటి, కథాశైలి కూడా కొనసాగుతుంది. అటువంటి కవితాత్మకమైన శైలి చాలా రచనలలో చలంలో మనకు కనిపిస్తుంది. తరువాత మరో ముఖ్యమైనటువంటి అంశం, చలం రచనలో మనకు కనిపించేదేమిటంటే, చలం చెప్పదలచుకున్నటువంటి విషయంలో ఏది అత్యంత ప్రధానమైన విషయమో, దాన్ని మాత్రమే చెపుతాడు. ఇతర విషయాలను ఎక్కడా వర్ణించనే వర్ణించడు. అతను చెప్పిన ప్రతి మాటా ఆ కథలో అవసరమే.
చెహోవ్ కాబోలు ఒక చోట అంటాడు. ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ప్రదర్శనలో ఒక తుపాకీ గనుక స్టేజీపై వ్రేలాడదీయబడి ఉంటే, ఆ నాటకం పూర్తి అయ్యేలోగా ఆ తుపాకీ పేలాలి అని. అంటే ప్రతి అంశమూ కూడా దాని ప్రయోజనాన్ని అది కలిగి ఉండాలి. ప్రయోజనరహితమైన ఏ ఒక్క అంశమూ, రచయిత చెప్పగూడదు. ఏది అత్యంత అవసరమో దాన్ని మాత్రమే చెప్పాలి. తద్వ్యతిరేకమైన, తద్భిన్నమైన, దేన్నీ కూడా చెప్పగూడదు. ఈ సూత్రం చలం రచనల్లో మనకు చాలా చక్కగా కనిపిస్తుంది.
అతను చేసినటువంటి వర్ణనలున్నాయి. రాసినటువంటి సంభాషణలున్నాయి. చాలా క్లుప్తంగా ఉండడానికి కారణం అదే. ఏది అత్యంత ముఖ్యమో దాన్ని మాత్రమే చెపుతాడు. అందువల్లనే సంభాషణలన్నీ సుదీర్ఘంగా డైలాగుల్లా ఉండవు. చాలా సింపుల్గా, సూటిగా సాగుతూ ఉంటాయి. ‘హంపీకన్యలు’, ఉదాహరణకి.
‘నేను వెళ్లకపోతే కొంపలు మునుగుతాయి.’
‘వొద్దు, నేను మునిగిపోతాను.’
‘మీరు పైకి రారాదూ?’
‘నది నన్ను కావిలించుకుంది.’
‘నేను పిలిస్తే`’
‘నవ్వే కన్య కన్న కావిలించుకునే కన్య నయం కాదా?’
కొంచెం కోపమొచ్చింది.
‘చాలు.’
వెడుతోంది.
‘హంపీకన్యా!’
ఆగింది.
‘కోపంతో వెళ్ళవద్దు. ఆఖరు చూపు. నవ్వుతో కనపడు.’
నవ్వుతో నుంచుంది.’
ప్రతి వాక్యమూ చాలా సింపుల్గా సరళంగా ఉన్నటువంటి వాక్యాలు. ఆమె నవ్వుతూ నిలుచుంది అనవచ్చు. కర్త, కర్మ, క్రియ అన్నీ ఉండాలిగా, ఏమీ లేదు. ‘వెడుతోంది.’ అంటే ఏది మనకు అత్యవసరమో, కేవలం మనకి హింట్ ఇస్తే చాలు. అది మాత్రమే మనకు చలం రచనల్లో కనిపిస్తుంది. అది అతని రచనా విధానంలో చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. కొంచెం చెప్పవలసింది చెప్పేసి పాఠకుల ఊహకీ, తర్కానికీ, ఆలోచనకీ కొంత చోటు చలం ఇస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అలా ఆయన రచనా విధానాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, చలం రచనల మీద అప్పటికీ, ఇప్పటికీ ఎన్నో విమర్శలు సాగుతూ ఉన్నాయి. ‘ఒక్క మాటలో సూత్రీకరించాలంటే చలంను hedonist (స్వసుఖవాది) అనవచ్చు’ అన్న రా.రా. మాటలు కూడా ఎవరో ప్రతిపాదించారు. మరి హెడొనిస్ట్ అవునో కాదో కానీ, మొత్తానికి ఒకానొక శరీరాపేక్ష ఉన్నట్టుగానే, స్త్రీకి కామం ప్రధానమైనట్టుగానే, స్త్రీకాంక్ష వాస్తవికంగానే ఆయన భావించినట్లుగా మనకి తోస్తుంది. కాబట్టి, కేవలం దీన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లి విమర్శించకపోయినా, అంతో ఇంతో సుఖవాదానికి ఆయన ప్రాముఖ్యం ఇచ్చినట్లుగానే, ఇంతకుముందు ఇస్మాయిల్గారు చెప్పినట్లుగా మనం భావించవలసి ఉంటుంది. అంటే ఈ శరీరం, శరీర కాంక్ష` వీటి పట్ల చిన్న చూపు` ఇవేవి అతనికి లేవు. సుఖమూ, ఆనందమూ` ఇవన్నీ కూడా మనకి కావాలి అనేదే అతని దృష్టి.
తరువాత మరో ప్రమాదకరమైన విమర్శ ఏమిటంటే, చలం వ్యక్తుల్ని పట్టించుకున్నాడు. వ్యక్తివాదం అతని రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది. సామాజిక వాదాలు మనకి కనపడనే కనపడవు. ఇది బాగానే ఉంది. వ్యక్తుల గురించి నువ్వు రాసేటప్పుడు, వాళ్ళ వెనుకనున్న ఆర్థిక పరిస్థితుల గురించి రాయటం జరగదు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? స్త్రీ పురుషుల్ని ‘లేచి పో’ అన్నాడు. లేచిపోయిన తరువాత ఏం చేయాలి వాళ్ళు?’ అనే ప్రశ్న గనుక మనం వేస్తే, కొన్నిసార్లు చలం రచనల్లో మనకి సమాధానాలు దొరకవు. మరి ఏం తిని బ్రతకాలి? వాళ్ళు అసలు ఎందుకు లేచిపోవాలి? చాలా కథల్లో చాలా తొందరగా లేచిపోతారన్న మాట.
‘వాణీ – ఏ స్టడీ’ అన్న కథ ఉంది. వాళ్ళ ఊళ్ళో ఎవరో నాటకాలు వేయటానికి వస్తారు. అందులో శివాజీ పాత్రధారి ఉంటాడు. రోషనార కోరినా తిరస్కరించినవాడు శివాజీ. ‘తనే అయితే అంత యోచనా?’ అనుకుంటుంది. ‘అంత నిగ్రహం ఉన్న యోధుడి మనస్సునే చలింపజెయ్యాలి.’ మర్నాడు వాళ్ళ యింటికి అతను భోజనానికి వస్తాడు. చాటుగా ఒకరినొకరు చూసుకుంటారు అంతే. మళ్ళీ ఆ రాత్రి నాటకం జరుగుతూ ఉంటే ఆమె నాటకం దగ్గరకు వెళుతుంది. చాటున ఉండి అతన్ని పిలిపిస్తుందన్న మాట. ‘ఏమిటిట్టా వొచ్చావు?’ అంటే, ‘మీ కోసం.’ ఏమిటంటే, మనమిద్దరం లేచిపోదాం. మరి వాడు ఏ ఆలోచనలో ఉన్నాడో ఈ నాటకాన్ని వదిలిపెట్టి అతను కూడా లేచిపోతాడు. మరి తర్కానికి అసలు అందదు. ఇప్పుడు ఉపన్యాసం జరిగింది. ఒక గంటో, రెండు గంటలో మాట్లాడాం. ఈ రెండు గంటల్లోనే ఇద్దరు కలిసి లేచిపోవటం ఎలా? జీవితంలో ఇంత తొందరగా మనం నిర్ణయాలు చేయగలుగుతామా? అవతలి వ్యక్తి నాకు అర్థం కావాలి కద. నా జీవితం ఏమిటో అతనికి అర్థం కావాలి కద. మన భావాల యొక్క సంఘర్షణ ఏమిటి? ఇవి ఒక దారిన పోతున్నాయా లేదా? ఇవన్నీ ఆలోచించుకోవాలి కద. ఇవన్నీ లేకుండా చాలా తేలిగ్గా లేచిపోవటమన్నది చాలా సులువైన విషయంగా చెప్పేస్తారు చాలామంది. మరో కథలో – సీత తల్లి – ఒక అమ్మాయిని ప్రేమించి వచ్చిన యువకుడిని ఆమె తల్లి లోబరుచుకుంటుంది. ఇలాంటివి మనకు తర్కానికి అందవు అతని కథలు. ఇలాంటివి అన్నీ నా మట్టుకు నాకు చాలా అభ్యంతరకరమైన విషయాలుగా తోస్తాయి.
తరువాత వ్యక్తివాదాన్ని ఆయన ప్రధానంగా తీసుకున్నప్పుడు, అంతరాత్మ చెప్పిందే సత్యం అని చెప్పి అతను వాదించిన మాట వాస్తవమే. అయితే అంతరాత్మ అన్ని వేళలా సత్యాన్ని కనుక్కుంటుందని మనం అనుకోవటానికి వీల్లేదు. ఒక్కొక్కసారి మన అంతరాత్మ కూడా మనని మోసం చేయవచ్చు. కాబట్టి, చలం అంతరాత్మ చెప్పింది, లేదా అంతరాత్మ చెప్పింది సత్యమని ఆయన ఒప్పుకున్నా, మనం అంత తేలిగ్గా దాన్ని ఒప్పుకోవటం కష్టమే. ఎందుకంటే, సత్యానికి subjectivity అనేది ఎలా ఉంటుందో objectivity అనేది కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి నాకు కళ్ళు లేవు. నేనా ట్యూబు లైటును చూడలేను. కానీ, చేత్తో తడిమి నేను చెప్పగలుగుతాను. దానికి కాంతి లేదనే నేను అనుకుంటాను. కాంతి సంగతి నాకు తెలియదు కాబట్టి. మరి కాంతి లేదనటానికి లేదు కద. ఉంది. అంటే, it is there objectively. నా ఉనికికీ, నా అస్తిత్వానికీ, నా ఇంద్రియానుభూతులకీ అతీతంగా ఒక వస్తువూ, దానికొక ప్రభావమూ అక్కడ ఉన్నాయి. ఒక్కొక్కసారి దాన్ని గమనించవచ్చు. సత్యాన్ని గుర్తించవచ్చు. గుర్తించలేకపోవచ్చు.
అలా తాను నమ్మిందే సత్యం అని చెప్పి, ఎవరు నమ్మింది వారికి సత్యం అని చెప్పి చలం అనుకున్న మాట వాస్తవమే. కానీ, అదే సత్యం అని మనం అనుకోవటం మాత్రం అంత సమంజసమనిపించదు. అంటే సత్యం యొక్క బాహ్యాత్మకతను (objectively) కూడా మనం తప్పనిసరిగా గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు చలం మొత్తం మీద ఒక వైరుధ్యంగా కూడా మనకి అనిపిస్తాడు. Man of contradictions అని కూడా మనకి అనిపిస్తుంది. ఒక చోట రొమాంటిక్ గానూ, ఒక్కొక్క చోట పూర్తి సామాజిక వ్యక్తి గానూ, ఒక్కొక్క చోట అత్యున్నత ప్రణయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రచయితగా అనేక కోణాలు మనకి కనిపిస్తాయి.
బహుశా దీనికి ఒక కారణమేమిటి ఆంటే, ఒక ప్రబలమైన సిద్ధాంత నేపథ్యం చలానికి లేకపోవటం. ఒక కచ్చితమైన సిద్ధాంతాన్ని అతను ఆవలంబించి ఉన్నట్లయితే, రకరకాల వైరుధ్యాలు ఉండడానికి అంత అవకాశం ఉండదు. అయితే గొప్ప సిద్ధాంత నేపథ్యం ఉన్నంత మాత్రాన గొప్ప రచయిత అవుతాడా? అంటే కాకపోవచ్చు. కానీ గొప్ప రచయితకు సిద్ధాంత నేపథ్యం ఉంటే, చాలావరకు అది దారి తప్పనివ్వకుండా చేస్తుంది. చలం తన రచనల్లో తను ప్రతిపాదించిన భావాలనే తర్వాత దశలో తిరస్కరించి, లేదా నిరాకరించి, వేరొక దారి పట్టాడు. రమణీ ఆశ్రమం నుంచి రమణాశ్రమం దారి పట్టాడు. ఏ దారి పట్టటానికైనా అతనికి హక్కు ఉంది. అయితే అతని దారివెంట నడిచినవాళ్ళు తిరిగి ఏ దారి పట్టాలన్నదే ప్రశ్న. ధన్యవాదాలు.