ఛోసెర్ గుహలు చూడటం ముగిశాక మా డ్రైవర్ దీపక్ ఈసారి మరో దారిగుండా హోటల్కు తీసుకువెళ్ళాడు. వచ్చినప్పటి దారికన్నా ఇది ఎంతో మెరుగ్గా ఉంది. ఈ దారి నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంనుంచి లోమాన్థాంగ్ వరకూ చైనా వారి సహకారంతో నిర్మింపబడుతోందట. ఈ రోడ్డనేగాకుండా ఆ ప్రాంతంలో ఇతర రోడ్ల నిర్మాణం విరివిగా సాగుతోందట. ‘ఈ దారిలో రావడం నాకు ఇదే మొదటిసారి’ అన్నాడు దీపక్. మొత్తానికి చైనావాళ్ళు ఎగువ ముస్తాంగ్ విషయంలో బాగా చొరవ చూపిస్తున్నారనిపించింది.
తిరిగి మేము మా హోటల్ చేరినపుడు ధోండుప్ తన పరివారంతో కలసి నిలబడి స్వాగతం పలికాడు. భోజనాలు ముగించి ఆ మధ్యాహ్నమంతా రక్షణ ప్రాకారం నడుమన ఉన్న లోమాన్థాంగ్ పాతపట్నం చూసి రావాలన్నది మా ఆలోచన. తనకా పాతపట్నంతో అంతగా పరిచయం లేదని రేషమ్ అన్నాడు. ఊళ్ళోని గొంపాలూ ఇతర ముఖ్యస్థలాలను చూసి రావడానికి లోకల్ గైడ్ను పెట్టుకోవడం మంచిదని ధోండుప్ సలహా ఇచ్చాడు. ఆ మాటను రేషమ్ సమర్థించాడు. ఇలా రక్షణప్రాకారం మధ్యన ఊరు ఉండటం అన్నది లోమాన్థాంగ్కే ప్రత్యేకం కాదు. రాజకీయ స్థిరత్వం లేని రోజుల్లో – ముఖ్యంగా మధ్యయుగాల్లో – ఈ పద్ధతి దాదాపు ప్రపంచమంతటా ఉండేది. నేను మొరాకో వెళ్ళినపుడు అక్కడి పాతపట్టణాలూ నగరాలూ ప్రాకారం నడుమన ఉండటం చూసాను. ఉదాహరణకు భారత రాజధాని ఢిల్లీ కూడా – మొగలాయీల కాలంనాటి షాజహానాబాద్ – ప్రాకారం నడుమనే ఉండేది. ఆ గోడలూ దర్వాజాలూ ఇప్పటికీ ఢిల్లీలో కనిపిస్తాయి. లోమాన్థాంగ్ ఈ మధ్య కాలంలో ప్రాకారం దాటి విస్తరించింది. అన్నట్టు మా హోటల్ ప్రాకారం బయటనే ఉంది. లంచ్ ముగించి లాబీలోకి వచ్చేసరికి పిసాంగ్ యాడ్కే అన్న గైడు మమ్మల్ని పలకరించాడు. చిన్నపాటి శరీర ఆకృతి, పెదాలపై చెరగని చిరునవ్వు – చూడగానే ఇతను మన బాణీ మనిషే అన్న ఆత్మీయ భావం కలిగింది.
లోమాన్థాంగ్ పాత పట్టణం వైపుకు మా అందర్నీ ప్రాకారం పక్కగా నడిపించాడు పిసాంగ్. మేము నడచిన రోడ్డుకు ఒక పక్కన ప్రాకారం ఉంటే రెండవ పక్కన చిన్న చిన్న దుకాణాలు – స్థానికుల అవసరాలనూ యాత్రికుల అవసరాలనూ సరిచూడగల దుకాణాలవి. షాపులతోపాటు అనేక బాణీల టీ హౌసులు కూడా ఉన్నాయక్కడ. మధ్యాహ్నం గదా – ఎండ బానే ఉందిగానీ అంతగా ఇబ్బంది పెట్టలేదు.
మా కొత్త గైడు పిసాంగ్ మాట కలుపుతూ ‘మీరు ఇపుడు సముద్రతలానికి 3820 మీటర్లు ఎగువన ఉన్నారు, ఆ తేడా ఏమన్నా తెలుస్తోందా?’ అని అడిగాడు. మా రేషమ్ అంది పుచ్చుకుని ‘వీరిద్దరూ ఇపుడే అన్నపూర్ణ ట్రెక్ ముగించి వస్తున్నారు. అంచేత ఎత్తులకు ఇప్పటికే బాగా అలవాటుపడిపోయారు’ అని చెప్పాడు. ‘ఓ! అదా సంగతీ, అన్నపూర్ణ ట్రెక్ అంటే మిమ్మల్ని నిజంగా అభినందించాలి. అసలింత దూరం లోమాన్థాంగ్ దాకా రావాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందీ అని మిమ్మల్ని అడుగుదామనుకున్నా. ఇప్పుడర్థమయింది’ అని స్నేహంగా నవ్వాడు పిసాంగ్.
వెల్లవేసి ఉన్న నగరపు ప్రాకారం బాగా దిట్టంగా ఉన్నట్లు కనిపించింది. ‘అవును.. దిట్టమైన గోడే.. ఎనిమిది మీటర్ల ఎత్తు, మీటరున్నర మందం’ అని చెప్పుకొచ్చాడు పిసాంగ్. పదిహేనో శతాబ్దంలో కట్టిన గోడ అట. అంతా కలసి 800 మీటర్లు.
డజనుకు పైగా బురుజులు ఉన్నాయి. ప్రాకారానికి ఉన్న ఒక ద్వారంగుండా పాతపట్నంలోకి ప్రవేశించాం. ఊళ్ళోని ఇళ్ళు కాస్తంత దిట్టంగా, ముతకగా కనిపించాయి. వెల్లవేసి ఉన్నాయి. తలుపులకూ కిటికీలకూ కంటికి నదురుగా కనిపించే రంగులు వేసి ఉన్నాయి. ఇళ్ళ కప్పుల మీద బాగా ఎండిన కట్టెల మోపులు కనిపించాయి. ఆ కట్టెలు వంటచెరుకుగా పనికిరావడమేగాకుండా కప్పులోంచి ఇంటిలోకి నీళ్ళు కారకుండా కూడా ఆపుతాయట. ఆ మోపుల్ని అందంగా పై కప్పు అంచుల దగ్గర పరచారు – ఆ అమరిక ఆ ఇళ్లకు కాస్తంత శోభను సమకూరుస్తోంది. ఇహ వీధుల్లో బౌద్ధ ప్రార్థనా పతాకాల సంగతి సరే సరి – ఆ జెండాలు కూర్చిన తాళ్ళు వీధుల్లో అల్లిబిల్లిగా మూలమూలలకూ విస్తరించి కనిపించాయి.
రాళ్ళు పరచిన లోమాన్థాంగ్ కాలిబాటల్లో అలా నడుస్తూ వెళ్ళాం. దారిలో జంట గోపురాల స్తూపం (Chortens) ఒకటి కనిపించి పలకరించింది. అక్కడి స్తూపాలు తెలుపూ ముదురు ఎరుపు రంగుల్లో ఉన్నాయి. ఆ మందిరాలకు ఈ రెండు రంగులే ఎక్కువగా వాడతారని బోధపడింది. గొంపాలు మాత్రం పూర్తిగా ముదురు ఎరుపు రంగులో ఉన్నాయి.
లోమాన్థాంగ్ ఉనికిలోకి వచ్చి ఐదారు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ చక్కగా పదిలంగా నిలిచి కనిపించింది. కాలరేఖ మీద ఘనీభవించి నిలిచిన పట్నంలా అనిపించింది. మనం రెండు మూడు శతాబ్దాలు వెనక్కి వెళ్ళి ఊరిని చూడగలిగితే ఇపుడు ఎలా ఉందో అపుడూ అచ్చంగా ఇలాగే ఉండి ఉండేది అనిపించింది. ముఖ్యంగా ఆ గొంపాలు పట్నపు ప్రాచీనతను స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ‘అవును, మా పాతపట్నం శతాబ్దాల తరబడి మార్పు అనేది లేకుండా అలాగే నిలచి ఉంది,’ అని నా మనసులోని మాట తెలిసినట్లుగా నిర్ధారించాడు పిసాంగ్. ఊరి మధ్యలో ముఖ్య రాజప్రాసాదం ఉంది. మరమ్మత్తులు జరుగుతున్నాయట – లోపలికి వెళ్ళి చూడలేకపోయాం. ఆ రాజప్రాసాదమే కాకుండా పాతపట్నంలో మూడు పురాతన గొంపాలు, మరికొన్ని ఆ కాలపు విశాలమైన ఇళ్ళూ ఉన్నాయట. ముందే చెప్పుకున్నట్టు ఈ మధ్యనే వచ్చిన ఇళ్ళూ హోటళ్ళూ ప్రాకారం వెలుపల ఉన్నాయి. ‘మా ఊరు సామాన్యంగా మనుషులు ఉండీ లేనట్టుగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇవాళ మా చోదే మఠంలో ఉత్సవం ఉంది గదా – దానికోసం చుట్టుపక్కల గ్రామాలనుంచి జనాలు వచ్చారు. అందుకే కాస్తంత హడావుడి,’ వ్యాఖ్యానించాడు పిసాంగ్. అతనామాట అన్నాడేగానీ మాకు మాత్రం ఊళ్ళో నడుస్తున్నపుడు అంతా నింపాదిగా, ప్రశాంతంగానే కనిపించింది. స్థానికులు ఏ వత్తిళ్ళూ లేకుండా ఎంతో తాపీగా తమ తమ పనుల్లో నిమగ్నమై కనిపించారు.
దారిలో మాకు ‘ఓం మణి పద్మేహమ్’ అన్న బౌద్ధమంత్రాలతో కూడిన మణికుడ్యం కనిపించింది. చిన్న చిన్న స్తూపాలు ఒక వరుసలో అమరి ఉండటాన్ని ‘మణికుడ్యం’ అంటారు. పిసాంగ్ మమ్మల్ని ఊళ్లోని జంపాగొంపా దగ్గరికి తీసుకువెళ్ళాడు. 15వ శతాబ్దంలో నిర్మించిన మూడంతస్తుల మట్టి గోడల కట్టడమది. లోమాన్థాంగ్లోని అతి పురాతనమైన మఠమట. వాస్తుశిల్పరీతికీ, టిబెటన్ బౌద్ధపు పవిత్ర చిత్రకళారూపాలకూ పేరుపొందిన ప్రదేశమది. ఈ మఠంలో 108 వజ్రయాన మండలాలు చిత్రించి ఉన్నాయి. వెండీ-బంగారు వర్ణాలు, గాఢనీలపు పైపూత, పొదిగిన పగడాలూ ఇతర విలువైన శిలలు – ఎంతో వైభవంగా ఉన్నాయి ఆ మండలాలు. ఈ మండలాలు అన్నవి బౌద్ధ మతరీతిలో రూపొందించబడే ఆధ్యాత్మిక చిత్రకళారూపాలు. విశాల విశ్వపు ప్రతీకలు. ధ్యానానికీ ఇతర మతకార్యకలాపాలకూ ఉపకరించే పరికరాలు. అలా 108 మండలాలు కొలువుదీరి ఉండడమన్నది జంపాగొంపా విశిష్టత. అలాగే ఆ గొంపాలో బుద్ధుని జీవితంలోని అనేక ఘట్టాలను ఛూపించే థంగ్కా చిత్రాలు కూడా ఉన్నాయి. దిగువనుంచి మొదటి అంతస్తువరకూ విస్తరించిన భవిష్యత్కాలపు మైత్రేయ బుద్ధుని బృహత్తర విగ్రహం అక్కడి మరో విశిష్టత.
జంపాగొంపా చూడటం ముగిసాక థుబ్చెన్ గొంపా దగ్గరకు వెళ్ళాం. ఇది కూడా 15వ శతాబ్దానికి చెందినదే. మహా వైభవోపేతమైన కట్టడమది. 48 స్తంభాల మీద నిలచిన పైకప్పు ఉన్న అతి విశాలమైన ప్రార్థనా మండపం మమ్మల్ని ఆకట్టుకొంది. అందంగా చెక్కిన పవిత్రమంత్రాలతో కూడిన పైకప్పు వాసాలు, గోడలమీదా పైకప్పు మీదా వివిధ హస్తముద్రలతో కూడిన బుద్ధులూ బోధిసత్వుల రూపాలు – ఊహాతీతమైన వైభవమా మండపానిది. ఆ మండపంలో అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ, ఈ ఇద్దరు బోధిసత్వుల మృణ్మయ శిల్పాలు ఉన్నాయి. వాటితోపాటు ఆ ప్రాంతాలలో టిబెటన్ బౌద్ధాన్ని ప్రవేశపెట్టిన పద్మసంభవుని విగ్రహం కూడా ఉంది. ఇవన్నీగాకుండా ఆ సమావేశమందిరంలో సుఖాసీనభంగిమలో ఉన్న శాక్యముని బుద్ధుని కంచు విగ్రహం మొదటి అంతస్తు దాకా విస్తరించి ఉంది. దానికి బంగారపు పైపూత ఉంది. అన్ని చిత్రాలనూ విగ్రహాలనూ దాటుకుని మన దృష్టిని తన వేపు తిప్పుకోగల శక్తి ఉన్న విగ్రహమది. అపుడపుడు ఆ మందిరంలోకి బౌద్ధగురువులు రావడం, వెన్నదీపాలు వెలిగించి మత కార్యక్రమాలు నిర్వహించడం గమనించాం. ఆ దీపాల వెలుగు పరిసరాలకు అలౌకికశోభను సమకూర్చి మనల్ని వెనుకటి కాలాలలోకి తీసుకువెళ్ళే శక్తి గలది.
చివరికి అందరం చోదే గొంపా వేపు నడిచాం. 18వ శతాబ్దంలో కట్టిన మఠం అది. భిక్షువులూ లామాలూ అంతా కలసి వందమంది అక్కడ నివసిస్తున్నారు. ఆ ప్రాంగణంలో ఉన్న మ్యూజియంలోకి అడుగు వేశాం. ఉత్సవాల్లో ఉపయోగించే రకరకాల మొహపు తొడుగులు, మరికొన్ని విగ్రహాలు, రాతప్రతులు ఆ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. అలాగే ఆ విశాల ప్రాంగణంలో కొమ్మలూ రెమ్మలుగా విస్తరించి ఉన్న జూనిపర్ వృక్షం కనిపించింది. ప్రార్థనామందిరంలోకి వెళ్ళాం – అక్కడంతా జూనిపర్ ధూమపు సువాసన. నాలుగురోజులపాటు సాగుతోన్న ‘మహాకాల’ ఉత్సవంకోసం అక్కడి భిక్షువులంతా సన్నద్ధమవుతూ కనిపించారు. అక్కడి సంగీత వాయిద్యాలను కొంతమంది భిక్షువులు సంసిద్ధం చేసుకుంటున్నారు. ఆరోజు ఆ పండుగ ఆఖరి రోజట. ‘మీరు ఇలా పండుగనాడు రావడం చాలా బావుంది,’ మనస్ఫూర్తిగా అన్నాడు పిసాంగ్. ఈ ‘మహాకాల’, టిబెటన్ బౌద్ద సంప్రదాయంలో ధర్మ పరిరక్షకులలో ఒకరు.
చుట్టుపక్కల గ్రామాలనుంచి వచ్చిన స్థానికులతోపాటు కొంతమంది టూరిస్టులుకూడా ఉత్సవాన్ని చూడటానికి గుమికూడి కనిపించారు. ‘ఓం మణి పద్మేహం’ అన్న మంత్రోచ్ఛారణతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సుమారు ముప్ఫైమంది భిక్షువులు ఎదురుబొదురుగా రెండు వరసల్లో అమరి కనిపించారు. దాదాపు అందరి దగ్గరా సంగీత వాయిద్యాలు – ఢంకాలు, చేగంటలు, తాళాలు, బాకాలు. అందులో రెండు బాకాలు అనూహ్యమైన నిడివిగలవి; దాదాపు పది అడుగులు.
భిక్షువుల్లో పెద్దవాళ్ళు మిగిలినవారికన్నా ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కనిపించారు. కొంతమంది కృత్రిమ ముఖాలను – మాస్క్లు – ధరించారు. దాదాపు అందరూ భిక్షువులూ గోధుమ కలసిన ఎర్రరంగు దుస్తులే ధరించినా వారిలో ఒకతని వస్త్రధారణ ఆడంబరంగా కనిపించింది. అతని శిరస్త్రాణం కూడా భిక్షువులు ధరించేదిలా లేదు – రాజులూ మహారాజులూ ధరించే కిరీటంలా ఉంది. ‘అదిగో అతనే మహాకాల పాత్రధారి’ చెప్పాడు పిసాంగ్. మిగిలిన భిక్షువులు నల్లని శిరస్త్రాణాలతో కనిపించారు. వాటి పైన నట్టనడుముగా క్రిందకు దిగిన నిట్టనిలువు ఎర్ర తూలికల తొడుగు.
ముఖ్యభిక్షువు మంత్రోచ్ఛారణ, సంగీతవాయిద్యాల ప్రకంపనలతో ఉత్సవం మొదలయింది. ఆ శబ్దవాహిని కొంతసేపు కొనసాగింది. మెల్లగా భిక్షువుల బృందం ఊరేగింపుగా వీధుల్లోకి ప్రవేశించింది. మేము అనుసరించాం.
మఠం దాటాక రాజప్రాసాదం దగ్గర ఉన్న కూడలిలో భిక్షువులంతా మరోసారి తమ వాద్యగోష్టి వినిపించారు. ఉత్సవంలోని ఇతర పాత్రధారులు చెక్క ముఖతొడుగులతో, నీలి, పచ్చ, గులాబీ రంగు దుస్తులలో ఉన్నారు. వారంతా సంప్రదాయ నృత్యప్రదర్శన చేశారు. నృత్యంతోపాటు కల్పనాయుద్ధాలు, ధూపపు పొగలు సెగలు సరేసరి. వెరసి ఆ మహాకాల ఉత్సవం కన్నులపండుగగా ఉంది. వాళ్ళేం చేస్తున్నారు, ఏమిటా నృత్యం, ఎందుకా ఉత్తుత్తి పోరాటం అన్నవి మనకు ఏ మాత్రం తెలియకపోయినా ఆ సంబరం కలిగించే ఉత్సవహేల ఒక చక్కని వాస్తవం. అక్కడ ఆ సమయంలో ఉండగలగడం, ఆ ఉత్సవాన్ని చూడగలగడం – వీటి పుణ్యమా అని ఆ ప్రాంతంతోనూ, అక్కడి మనుషులతోనూ, ఆ ప్రాచీన సంప్రదాయాలతోనూ ఏదో ఆత్మీయ బంధం ఏర్పడ్డ భావన!
‘ఎగువ ముస్తాంగ్ ప్రజల వృత్తి వ్యాపకాలేమిటీ’ అని పిసాంగ్ను అడిగాను. గొర్రెల పెంపకం, వ్యవసాయం, వ్యాపారం అని చెప్పాడతను. ఇంట్లో పెద్దకొడుక్కి ఆస్తిపాస్తులు చెందుతాయట; చిన్నవాడు బౌద్ధభిక్షువు అవుతాడట – అదీ వాళ్ళ
సంప్రదాయం.
‘మరి మీ కుటుంబంలో ఎవరైనా భిక్షువులయ్యారా?’ అన్నది మా తదుపరి ప్రశ్న. నవ్వేశాడు పిసాంగ్. ‘నేను పదేళ్ళ వయసులో భిక్షువునయ్యాను. ఇరవై ఏడేళ్ళదాకా కొనసాగాను. రెండేళ్ళ క్రితమే మళ్ళా మామూలు ప్రపంచంలో పడ్డాను,’ అని సమాధానం చెప్పాడు. మఠంలోంచి బయటకు వచ్చినా ఇంకా అక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడట. ‘మాది, నిన్న మీరు చూసి వచ్చిన ఛోసెర్ గుహల దగ్గర ఉన్న ఓ గ్రామం. ఇపుడు నేను లోమాన్థాంగ్లో ఉంటూ చిన్నపిల్లలకు విద్యాబోధన చేస్తున్నాను. భిక్షువుగా ఉన్న రోజుల్లో బౌద్ధతాత్వికత అధ్యయనంకోసం హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల పట్టణంలో ఉన్న మత పాఠశాలలో కొంతకాలం గడిపాను. అన్నట్టు ఈ ధర్మశాలలోనే దలైలామా నివసించేది. చెప్పుకోదగ్గ టిబెటియన్ జనాభా ఉందా పట్టణంలో,’ చెప్పుకొచ్చాడు పిసాంగ్.
‘మరి నీకు పెళ్ళయిందా?’ అని అడిగాను. అవలేదు. ‘అయినా లోమాన్థాంగ్లో సంబంధం దొరకడం కష్టం. అంతా ఊరొదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఏదో ఒక సంబంధం దొరక్కపోదు,’ నవ్వుతూ చెప్పాడు పిసాంగ్.
నన్ను ఎప్పట్నించో తొలుస్తోన్న ఒక ప్రశ్న అడగాలనిపించింది. “మీ లోబా ప్రజలదీ కింగ్డమ్ ఆఫ్ లో. ఇప్పుడు రాజులూ రాజ్యాలు పోయినా నిన్నటిదాకా మీరు నేపాలు రాజ్యపు నీడలో దాదాపు స్వతంత్రదేశంగా ఉన్నారు. ఆ నేపాలు కూడా చివరిదాకా స్వతంత్ర రాజ్యంగానే ఉంది. ఆఫ్రికానుంచి, జపానువరకూ దాదాపు అన్ని దేశాలూ రాజ్యాలూ యూరోపియన్ల వలసలుగా ఉన్న సమయంలో నేపాలు స్వతంత్రదేశంగా ఎలా ఉండగలిగిందీ?” అన్నది నా ప్రశ్న. క్షణంసేపు ఆలోచనలను కూడదీసుకుని స్పందించాడు పిసాంగ్. “నిన్నమొన్నటిదాకా నాకూ ఈ అనుమానం ఉండేది. ఆమధ్య మీలాంటి ఒక యాత్రికుని పుణ్యమా అని అనుమానం తీరింది. ఇది యూరోపియన్ల తెలివైన ఎత్తుగడ. పెద్దపెద్ద వలస దేశాల మధ్య చిన్నపాటి రాజ్యాలను స్వతంత్ర దేశాలుగా ఉంచడం రాజకీయంగా వారికి అనుకూలించే పద్ధతి. అందుకే అటు చైనా ఇటు భారతదేశాల మధ్య నేపాల్ అలా ఉండగలిగింది. ఆగ్నేయాసియాలోకూడా థాయ్లాండ్ దేశం ఇలా బఫర్ స్టేట్గా చివరిదాకా ఉండగలిగిందట కదా…”
మబ్బు వీడింది.
ఊరి టూరు ముగించుకొని అందరం రాయల్ ముస్తాంగ్ చేరుకున్నాం. ఆత్మీయంగా పిసాంగ్కు వీడ్కోలు పలికాం. పూర్వాశ్రమంలో బౌద్ధభిక్షువుగా ఎన్నో ఏళ్ళు గడిపి ఆ ప్రాంతపు సంస్కృతీ సంప్రదాయాలలో తానూ ఒక తునకగా నిలిచిన వ్యక్తి మార్గదర్శకత్వంలో ప్రాకారసహిత లోమాన్థాంగ్ పట్టణపు వీధుల్లో తిరుగాడటం, ఆ ఊరి విలక్షణతలను అతని కళ్ళతో చూడగలగడం – అరుదైన అవకాశం అని స్ఫురించింది. సాయంత్రం అయిదయింది. రెస్టరెంట్లో ఓ కప్పు టీ తాగాక, ‘కాసేపు రిలాక్సవుతాను’ అంటూ సోమేశ్ లోపలికి వెళ్ళాడు. రేషమ్ను తోడు చేసుకుని నేను మళ్ళీ పాతపట్నం వేపు వెళ్ళాను. ఉత్సవం ముగిసింది కదా, వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కాసిన్ని దుకాణాలు ఉన్న ఓ కూడలిలో స్థానిక యువకులు కారమ్స్ ఆడుతూ కనిపించారు. ఓ మూల కొద్దిమంది మహిళలు కూడి ముచ్చటలాడడం కనిపించింది. చాలావరకూ ఇళ్ళకు తాళాలు వేసి కనిపించాయి. ధోండుప్ అన్న మాట నిజమే – ఊళ్ళో వాళ్ళు చాలావరకూ మెరుగైన అవకాశాలకోసం జీవితంకోసం ఊరు వదిలి దూరతీరాలకు వెళ్లిపోయారన్నమాట! ఇక ఊళ్ళో ప్రముఖంగా మిగిలింది గొంపాలూ భిక్షువులు. గొంపాలు ప్రాచీన సంస్కృతికి ప్రతీకలుగా కొనసాగుతున్నాయి. భిక్షువులు ఆ ప్రక్రియలో తమ వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళే లేకపోతే ఊరంతా ఈ పాటికి జనరహితమై పోయి ఉండేది.
‘వ్యూ పాయింటుకు దారి’ అని చేతి రాతతో ఇంగ్లీషులో రాసి ఉన్న సైన్పోస్ట్ ఒకటి కనిపించింది. అది చెప్పిన దిశలో వెళ్ళి ఓ ఇంటి ముందుకు చేరుకున్నాం. ఆ ఇంటి యజమానురాలు చిన్నపాటి రుసుము తీసుకుని మమ్మల్ని పై కప్పు మీదకు తీసుకువెళ్ళింది. ఆ మేడమీదకు వెళ్ళే దారి చిన్నపాటి వైకుంఠపాళీని తలపించింది. ముందుగా వంటపాత్రలు శుభ్రం చేస్తోన్న వంటింటి మీదుగా సాగాం. ఆ తర్వాత మెట్లెక్కి మొదటి అంతస్తు చేరాం. అక్కడ నిచ్చెన పట్టుకుని మేడ మీదకు చేరాం. అప్పటికే మేడమీద ఖాట్మండూనుంచి వచ్చిన టూరిస్టులు కొంతమంది చేరి కనిపించారు. వాళ్ళకి కూడా లోమాన్థాంగ్ రావడం అదే మొదటిసారట. నిజమే, ఎగువ ముస్తాంగ్ విదేశీయులకేగాదు, నేపాలీయులకుకూడా దూరాన ఉన్న అందరాని చందమామే అనిపించింది.
మేడమీదనుంచి ఊరుఊరంతా రెక్కలు విప్పుకుని కనిపించింది. మూడు ముఖ్యమైన గొంపాలు, రాజసౌధం, ఇతర భవనాలూ – అన్నీ ఒకేసారి కనిపించి ‘భలే’ అనిపించాయి. ఇళ్ల పైకప్పుల అంచుల దగ్గర పేర్చిన ఎండుకట్టెల మోపులు ఆ ఇళ్లకు మంచెలూ వేదికల రూపును సంతరించిపెడుతున్నాయి. ప్రార్థనాపతాకాల వెల్లువ వీధులన్నింటినీ రంగుల నెలవులుగా మార్చేస్తోంది. ఎర్రెర్రని గొంపాలు ఆ ప్రాంతమంతటికీ ఒక విలక్షణ శోభను సమకూరుస్తున్నాయి. మేడ దిగాక ఊళ్లోని వీధివీధినీ అడుగడుగునా చూసుకుంటూ వెళ్ళాం. కాలాతీత నగరం లోమాన్థాంగ్ను – నా షాంగ్రి-లాను – మనసులోకి ఇంకించుకొనే ప్రయత్నం చేసాను. అలా రెండుగంటలపాటు తిరుగాడాక తృప్తిగా అనిపించింది. మెల్లగా మా హోటల్ చేరుకున్నాం. ఊరంతా తడిమి చూసాననీ, చూసి ఆ జ్ఞాపకాలను మనసు పొరలలో భద్రంగా దాచుకోగలిగాననీ, అవి ఎన్నటికీ చెదరని జ్ఞాపకాలుగా నాలో నిలచి ఉంటాయనీ అనిపించింది.
గబగబా స్నానించి వెళ్ళి హోటల్ బార్లో ఉన్న సోమేష్ను కలిశాను. అతనూ నాలానే లోమాన్థాంగ్ విషయంలో సంతృప్తి చెందాడనిపించింది. నాకంటే షాంగ్రి-లా మీద ఉన్న ఆసక్తి వల్ల ఈ లోమాన్థాంగ్ మీదకి దృష్టి మళ్ళింది.. మరి సోమేష్ నా ప్రేరణవల్ల వచ్చాడు గదా – అతనికీ ఈ అనుభవం నచ్చడం నాకు ముఖ్యం…
మా హోటల్ బార్లో ఎక్కువమంది అతిథులు లేరు – 70లు నిండిన ఒక యూరోపియన్ జంట, 60లలో ఉన్న మరో న్యూజిలాండ్ దంపతులు – అంతే. మెల్లగా వారితో మాట కలిసింది. కబుర్లు సాగాయి. గ్లాసుల్లోని ఉత్తేజాన్ని రుచి చూస్తూ మా లోమాన్థాంగ్ అనుభవాలను పంచుకున్నాం. అందరిదీ ఒకటే భావన: ఈ సుదూర ప్రాంతానికి రావడమన్నది జీవితంలో ఎంతో అరుదుగా దొరికే అనుభవం. అసలు మొత్తం ఎగువ ముస్తాంగ్లో తిరుగాడటం అన్నదే అపురూప అనుభవం. ఆ గొంపాలు, గ్రామాలు, సంస్కృతి, నైసర్గిక సౌందర్యం…
మా కబుర్లు ముగిసాక నేనూ సోమేష్ మిగిలాం. అది గమనించిన ధోండుప్ వచ్చి మమ్మల్ని పలకరించాడు. అప్పటికే అతనంటే నాకు గురి కుదిరింది: చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు అన్న విషయాలలో అతనికి సగటుకు మించిన అవగాహన ఉంది. మేము రోజంతా లోమాన్థాంగ్ పట్టణంలో తనివితీరా తిరిగినా – ఇంకా తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయనిపించింది. అతనుకూడా మాట్లాడటానికి సుముఖంగా ఉన్నట్లు కనిపించాడు… ముగ్గురం మాటల్లో పడ్డాం. క్రమపద్ధతిలో వివరాలు అడిగాం. చక్కగా సమాధానాలు చెప్పుకొచ్చాడు ధోండుప్.
14వ శతాబ్దంలో కింగ్డమ్ ఆఫ్ లో రాజ్యాన్ని స్థాపించిన అమెపాల్ వాస్తవానికి ఒక టిబెటన్ యోధుడు. ఇలా ఒక చిన్న రాజ్యం మొలకెత్తడం అప్పట్లో అటు టిబెట్కూ ఇటు నేపాల్కూ రాజకీయంగా సౌకర్యవంతం అనిపించింది. అంచేత ఆ మొలకను చిదిమే ప్రయత్నం జరగలేదు. కాలక్రమేణా కింగ్డమ్ ఆఫ్ లో నేపాల్ దేశపు మృదు పెత్తనానికి గురి అయింది.
పెత్తనం సంగతి ఎలా ఉన్నా నేపాల్, కింగ్డమ్ ఆఫ్ లో రాజ్యాల మధ్య గౌరవమర్యాదలు కొనసాగాయి. అందుకు రాజకీయకారణాలతోపాటు ఆర్థిక వ్యాపారకారణాలూ దోహదం చేసాయి. మధ్యయుగాలలో టిబెట్ –నేపాల్ దేశాల మధ్య ఆవిష్కరించబడిన సాల్ట్ రూట్ ఈ రాజకీయ-ఆర్థిక క్రీడలో ప్రముఖపాత్ర వహించింది.
టిబెట్ పీఠ భూమిలోని సరోవరాలలో ఉప్పు పండుతుంది. నేపాల్ దేశంలో వరి పండుతుంది. ఈ రెండు పంటలూ పరస్పర పూరకాలు. నేపాల్ వారికి ఉప్పు కావాలి. టిబెట్ కు బియ్యం. ఈ రెండు సరుకుల రవాణాకూ ఒకటే మార్గం – ఎగువ ముస్తాంగ్, అంటే కింగ్డమ్ ఆఫ్ లో ద్వారా సాగే సాల్ట్ రూట్. అలా కొంతకాలం ఉప్పు-వరి ఇచ్చిపుచ్చుకోవడాలు సాగాక నేపాల్ దేశంలోకి భారతదేశపు ఉప్పు ప్రవేశించింది. ఉప్పు ధరలు గణనీయంగా పడిపోయాయి. అపుడు టిబెట్ – నేపాల్ దేశాల వాణిజ్యంలో ఉప్పుకు బదులు ఉన్ని ప్రధానవస్తువు అయింది. ఉన్నితోపాటు టిబెట్ వారి ఉన్ని దుస్తులు కూడా నేపాల్కూ, భారతదేశానికీ చేరాయి. రాహుల్ సాంకృత్యాయన్ అన్నట్టు దేశాలు, సరిహద్దులు, రహదారులు, కొండబాటలు, కనుమలు – వీటన్నిటి ఆవిష్కరణ వెనకా ఆర్థిక-వాణిజ్య ప్రయోజనాలదే ముఖ్యపాత్ర..
2008లో నేపాల్ దేశం ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది. దానితోబాటు కింగ్డమ్ ఆఫ్ లో కూడా రాచరికానికి స్వస్తి పలికింది. అయినా ఇప్పటికీ ఎగువ ముస్తాంగ్ ప్రాంతాలవారు తమ చిట్టచివరి రాజు పల్వర్ బిస్తాను గౌరవిస్తారు. ఆయన 2016లో మరణించాకకూడా ఆయన కొడుకు పుల్వెర్ బిస్తాకు ఆ మర్యాదలు అందుతున్నాయి. మన మైసూరు ఒడయార్లూ విజయనగరం గజపతి రాజులూ మర్యాదలు అందుకోవడంలేదూ – అలా అన్నమాట! ఏమాటకామాట – ఈ ఎగువ ముస్తాంగ్ రాజకుటుంబం వాళ్ళు ఉదారస్వభావులు. జనహితం కోరేవాళ్ళు. వారికి ఇప్పటికీ వేలాది ఎకరాల భూములూ, ఇతర ఆస్తులూ ఉన్నాయి. వాటిల్లో ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అలాగే అక్కడి గొంపాలకూ, మఠాలకూ వారి మద్దతు పరిపూర్ణం. వాటిల్లో భిక్షువులకేగాకుండా మరెంతోమందికి ఆశ్రయం, ఉపాధి లభిస్తున్నాయి.
అప్పటి చరిత్రకి చెందిన విషయాలేగాకుండా ధోండుప్ ఈ కాలపు పరిణామాలగురించీ చక్కని అవగాహన కలిగిన వ్యక్తి అని మాకు బోధపడింది. అది గ్రహించాక సోమేష్ శరవేగంతో ప్రశ్నలు సంధించాడు. ఈలోగా మా వైన్ గ్లాసులు ఖాళీ అయిపోవడం గమనించిన ధోండుప్ వాటిల్ని నింపించాడు. ‘ఇది మా తరఫున మీకు కానుక’ అన్నాడు. వద్దు అనలేకపోయాం. 1950ల నాటి టిబెట్ పరిణామాలు, నేపాల్ మీదా ఎగువ ముస్తాంగ్ మీదా వాటి ప్రభావం అన్న విషయం గురించి మా మాటలు కొనసాగాయి. చైనా, సిఐఏ, ముస్తాంగ్, దలైలామా – ఆ పరిణామాల నేపథ్యంలో అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెకింగ్ మార్గం యాత్రికులకు అందుబాటులోకి రావడం, మా మాటల్లో దొర్లాయి.
అన్నపూర్ణ సర్క్యూట్ ఉత్తరభాగంలోని కొన్ని ప్రదేశాలు భౌగోళికంగా ముస్తాంగ్ ప్రాంతాన్నీ టిబెట్ పీఠభూమినీ తాకుతాయి. 1940ల ఆఖరి దినాలలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పరిణామాల ప్రభావం టిబెట్ ప్రాంతానికీ సోకింది. ఆ ప్రభావంనుంచి టిబెటన్ సంస్కృతిని పరిరక్షించుకోవాలన్న ధ్యేయంతో అక్కడి ఖంపా ప్రాంతపు మతయోధులు 1950లో ఒక క్రియాశీలమైన బృందంగా ఏర్పడ్డారు. 1950ల చివరి రోజుల్లో చైనా వారి టిబెట్ ఆక్రమణ జరిగాక ఈ బృందం గెరిల్లా యుద్ధం ఆరంభించింది. ఆ రోజుల్లో టిబెట్ను విడచివచ్చిన అనేకమంది సామాన్యప్రజలకు ముస్తాంగ్ ప్రాంతం స్వాగతం పలికింది. స్థావరంగా మారింది. వారిలో కొంతమంది ఖంపా బృందంలో చేరి గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. వారికి సిఐఏ వారి ఆయుధ, ఆర్థిక సహకారం లభించింది. ఈ పరిణామాలవల్ల ముస్తాంగ్ ప్రాంతం క్రమక్రమంగా మిగతా ప్రపంచానికి దూరమయింది. విదేశీయాత్రికులకూ ట్రెకర్లకూ అనుమతులన్న మాటే లేదు.
1969లో యుఎస్ చైనాల మధ్య సంబంధాలు మెరుగవడం మొదలయింది. గెరిల్లా దళాలకు సిఐఏ మద్దతు ఉపసంహరించబడింది. చైనాతో దౌత్యసంబంధాల పునరుద్ధరణ ప్రయత్నంలో ఉన్న యుఎస్ఏ, ఖంపా దళాలను అణచి వేయమని నేపాల్ మీద వత్తిడి తెచ్చింది. 1974లో నేపాల్ దేశం అందుకోసం తన సైన్యాన్ని నియోగించింది. ఈ పరిణామాల మధ్య దలైలామా, ఆయుధాలు విడిచిపెట్టమని ఖంపా దళాలను కోరాడు. అలా ఆ పోరాటం ముగిసింది. శాంతిభద్రతలు నెలకొన్నాయి. పర్యాటకులు ట్రెకర్లు రావడం మొదలయింది. అన్నపూర్ణ సర్క్యూట్ ట్రైల్ పునరుద్ధరించబడింది.
ఈ పరిణామాలు ముస్తాంగ్ ప్రాంతంమీద ఎలాంటి ప్రభావం చూపించాయీ అని ధోండుప్ను అడిగాం. కాసేపు ఆలోచించాడు. ఈ విషయంలో వాళ్ళ అమ్మానాన్నలూ ఇతర పెద్దలూ ఏమనేవారో గుర్తుచేసుకున్నాడు. “గెరిల్లా పోరాటాలు 1974లో ముగిసి శాంతిభద్రతలు నెలకొన్న తర్వాతకూడా 1990ల ఆరంభంవరకూ మా ప్రాంతంలో బ్రతుకు కష్టంగా ఉండేది. రోడ్లు లేవు, సమాచార వ్యవస్థ లేదు, ఏ రకమైన ప్రాధమిక సౌకర్యాలూ ఉండేవిగావు. ప్రపంచం ముందుకు సాగిపోతున్నా మేమంతా ఏ మార్పూ లేని జీవితాలూ, ఆ జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసే పేదరికం మధ్య కష్టాలు పడ్డాం. విచిత్రంగా అలా ఏ మార్పూ లేకుండా మిగిలిపోవడమే మా ప్రాంతానికి సాహసికుల్నీ యాత్రికుల్నీ రప్పించిందా సమయంలో..” చెప్పుకొచ్చాడు ధోండుప్. ‘మా తాతయ్య వాళ్ళ రోజుల్లో పొఖారా వెళ్లడమంటే అదో యజ్ఞం. గుర్రంమీద వెళ్ళినా నెలరోజులు పట్టేది. అప్పట్లో మాకు అతి దగ్గరలో ఉన్న పట్టణం పొఖారానే. 1992లో పరిస్థితులు మారాయి. మా రాజుగారు ‘ఎగువ ముస్తాంగ్ ను బయట ప్రపంచంతో కలుపుదాం’ అని నేపాలు ప్రభుత్వానికి చెప్పి ఒప్పించారు. టూరిస్టులను అనుమతించడం మొదలయింది. కానీ అందుకు రుసుము 700 డాలర్లు. తర్వాత 500కు తగ్గించారు. అయినా ఆ పర్మిట్ కోసం అప్లై చెయ్యడం, అది తెచ్చుకోవడం, అదంతా ప్రయాస నిండిన పనిగా ఉండేది. రవాణా సౌకర్యాలూ, వసతి సౌకర్యాలూ అంతంత మాత్రంగానే ఉండేవి. అంచేత టూరిస్టులు అతి తక్కువగా వచ్చేవారు,’ చెప్పడం ముగించాడు ధోండుప్. ఇపుడు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. 2015లో మేము వచ్చిన కారు దారి ఆరంభమయింది. ఇపుడు ఏడాదికి నాలుగువేలమంది టూరిస్టులు ఎగువ ముస్తాంగ్ వస్తున్నారు. వారి రాక స్థానిక ఆర్థికవ్యవస్థకు ఊతమిస్తోంది.
‘మరి మీ రాజుగారు ఎక్కడ ఉంటుంటారూ’ అని అడిగాం. ఖాట్మండూలోనట. ‘వారు అక్కడ ఉన్నా తరచూ లోమాన్థాంగ్ వస్తూ ఉంటారు. స్థానిక సంస్కృతి పరిరక్షణ, పండుగలూ వేడుకల్లో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తారు. వచ్చినపుడల్లా ఇదిగో ఈ రాయల్ ముస్తాంగ్ హోటల్లోనే బస చేస్తారు,’ చెప్పాడు ధోండుప్.
రేపటి ఉదయం లోమాన్థాంగ్ వదలబోతూన్న మాకు ధోండుప్తో జరిపిన ఆ సుదీర్ఘ సంభాషణ ఎంతో తృప్తిని ఇచ్చింది. నిగూఢప్రాంతపు యాత్రకు అతి ఉత్తమమైన ముక్తాయింపు అనిపించింది.
మర్నాడు బాగా ఉదయాన్నే లేచాం. సూర్యోదయం అయీ అవగానే మళ్ళా పాతపట్నంకేసి వెళ్ళాం. వాతావరణం చలిచలిగా ఉంది. సూర్యకిరణాలింకా ఆ చలిని జయించే శక్తిని పుంజుకోలేదు. పదీ పన్నెండుమంది బౌద్ధభిక్షువులూ వారితోపాటు మరికొంతమంది స్థానికులూ కలసి ఆ ఉదయపు సమయాన ప్రాకారాన్ని అంటిపెట్టుకుని ఊరు చుట్టూ ప్రదక్షిణ చేయడం గమనించాం. వారందరి నోటా ‘ఓం మణి పద్మేహమ్’ అన్న మంత్రం.. ఆ ఊరూ, ఆ ప్రాకారం ఆ స్థలాన్ని ఆధ్యాత్మికశక్తితో నింపుతున్నాయన్నమాట. ఆ స్థలంలో ప్రదక్షిణ చేయడాన్ని మించిన ప్రార్థన ఏముంటుందీ? కాసేపు ఆగి ఆ ప్రదక్షిణా ప్రక్రియను గమనించాం. మరికాసేపు లోమాన్థాంగ్ వీధుల్లో తిరుగాడాం.. పెద్దగా మనుషులు
కనిపించలేదు. అయినా సోమేష్ తనతోపాటు తీసుకువచ్చిన SLR కెమెరాతో చక్కని ఫోటోలు తీసాడు.
తిరిగి హోటల్ చేరాక నింపాదిగా అల్పాహారం తీసుకున్నాం. ‘ఈ యాత్రకు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అన్నాడు సోమేష్. సహజంగానే నాకు అతని మాట సంతోషం, సంతృప్తి కలిగించింది. “నువ్వు నీ ప్రయాణాల్లో ఇలాంటి ప్రదేశాలు ఎన్నో చూసి ఉంటావుగదూ,” యధాలాపంగా అన్నాడు సోమేష్. “ఎగువ ముస్తాంగ్తోనూ లోమాన్థాంగ్తోనూ ఇంకే ప్రదేశాన్నీ పోల్చలేం. ఇది ఒక విలక్షణమైన ప్రదేశం. నేను ఇంతవరకూ చూసి ఎరుగని ప్రదేశం,” వెంటనే కాస్తంత చురుగ్గా స్పందించాను.
హోటల్ ఖాళీ చేసాక మా సామాన్లతోబాటు లాబీలోకి వచ్చి రేషమ్ దీపక్ల కోసం ఎదురుచూడసాగాం. అక్కడ ఉన్న పుస్తకాలు మమ్మల్ని ఆకర్షించాయి. ఈ హోటల్లో నేను ఇష్టపడ్డ అనేక విషయాల్లో వీళ్ళ పుస్తకాల సేకరణ ఒకటి. అందులో ఎగువ ముస్తాంగ్ గురించి రాసిన పుస్తకాలు ఐదారు ఉన్నాయి. సోమేష్ ఏం చేస్తున్నాడా అని చూస్తే ఏదో పుస్తకంలో నిమగ్నమై కనిపించాడు – పుస్తకప్రియుడు మరి! నేను 1967లో ప్రచురితమైన మైఖేల్ పిస్సెల్ పుస్తకం, ‘ముస్తాంగ్: ది లాస్ట్ టిబెటన్ కింగ్డమ్’ చేత పుచ్చుకుని తిరగేయసాగాను. అంతకుముందు చదివిన పుస్తకమే – ప్రపంచానికి కింగ్డమ్ ఆఫ్ అప్పర్ ముస్తాంగ్ను పరిచయం చేసిన పుస్తకమది.
1950లు 60లలో ఎగువ ముస్తాంగ్లోకి అడుగుపెట్టిన విదేశీయులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందులో మైఖేల్ పిస్సెల్ ఒకడు. తాను ఖాట్మండూలో ఉన్న రోజుల్లో నేపాల్ రాజుగారి అనుమతి పొంది లోమాన్థాంగ్ వెళ్ళి అక్కడి సంస్కృతిని అధ్యయనం చేసాడు. లోమాన్థాంగ్లోని సాధారణ పౌరులతోనూ బౌద్ధభిక్షువులతోనూ స్థానిక రాజప్రముఖులతోనూ కొన్ని వారాలు గడిపాడు. ఆయన 1967లో ప్రచురించిన ఈ పుస్తకం, ఆ ప్రాంతం గురించి సాధికారంగా బయట ప్రపంచానికి వివరాలు అందించిన మొట్టమొదటి పుస్తకంగా పేరు పొందింది.
పుస్తకాలతో మా ముచ్చట్లకు రేషమ్ దీపక్ల రాక స్వస్తి పలికింది. మేము హోటల్ వదిలి వెళుతోన్న సమయంలో ధోండుప్, అతని సహోద్యోగులు – అంతా వచ్చి ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. మా భుజాలమీద అంగవస్త్రం కప్పి గౌరవించారు. అందరం ఫోటోలు దిగాం. ఆ హోటల్, ఆ మనుషులు, ఆ అనుభవం – మనసులో సంతృప్తి నింపింది.
మా వాహనం మెల్లగా లోమాన్థాంగ్ వదిలిపెట్టింది. బహుశా నేను ఆ ప్రాంతానికి మరోసారి రాకపోవచ్చు – అయినా అక్కడ గడిపిన సమయం మరపురాని అనుభవాలకూ అనుభూతులకూ హేతువయింది. అసలు అక్కడికి వచ్చి వెళ్లడమన్న విషయమే నాకెంతో అధివాస్తవికంగా కనిపించసాగింది. కలా మెలకువా కాని స్థితిలోకి నన్ను చేర్చింది. సోమేష్ గొంతు విప్పి రేషమ్ను ఏదో అడిగేసరికి మళ్ళా ప్రపంచంలో పడ్డాను. ‘తిన్నగా వెళ్లిపోవడమేనా మధ్యలో ఎక్కడైనా ఆగుతామా’ అని అడుగుతున్నాడు సోమేష్. దారిలో త్సారంగ్ గొంపా అన్న ప్రాచీన ప్రముఖ మఠం ఉందనీ, తప్పక చూడవలసిన ప్రదేశమనీ చెప్పాడు రేషమ్.
కొన్ని గంటల ప్రయాణం తర్వాత త్సారంగ్ గొంపా చేరుకున్నాం. సుమారు ఏభైమంది భిక్షువులతో కళకళలాడుతోన్న మఠం అది. లోమాన్థాంగ్ గొంపా తర్వాత ఎగువ ముస్తాంగ్లో ఇదే పెద్ద మఠమట. చిన్న కొండ మీద ఉందా మఠం. ఒక పక్క లోతైన అఖాతం, చదునుగా ఉన్న మరో వైపున బొంగరాలు తిరిగిన రాళ్ళు – బలంగా వీచే గాలీ ఇతర ప్రాకృతిక శక్తులూ కలసి రూపొందించిన ఆసక్తికరమైన శిలాకృతులు అవి.
మఠం ప్రాంగణం నడుమన ముదురూ ఎరుపు రంగు బౌద్ధమందిరం.. దానిచుట్టూ ఓ ప్రార్థనా ప్రాంగణం, భిక్షువుల నివాసగృహాలు. పక్కనే ఉన్న మరో కొండమీద ఏదో శిధిలమైన కోట.. దూరాన త్సారంగ్ పట్టణం.
ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మంత్రోచ్ఛారణా దానికి అనుగుణమైన సంగీతం వినిపించాయి. పూజా సమయమన్న మాట. మెల్లగా అటువేపు వెళ్ళాం. అక్కడి భిక్షువులు స్వాగతం పలికి పూజలో పాల్గొనమని ఆహ్వానించారు. పాదరక్షలు విడిచి వెళ్ళి భిక్షువుల సమూహంలో కలిసాం. లయబద్ధమైన మంత్రాలు, బాకా ఢంకా చేగంటలు సృష్టిస్తోన్న సంగీతం – అతిలోక పారవశ్యం కలిగించే వాతావరణమది.
మేమంతా అక్కడ పదిహేను ఇరవై నిముషాలు కూర్చున్నాం. మెల్లమెల్లగా పరిసరస్పృహలేని స్థితిలోకి వెళ్లిపోతున్నాననిపించింది. చూడగా సోమేష్ కూడా అలాంటి స్థితిలోనే కనిపించాడు. ‘ఇహ మనం బయటపడితే మంచిది’ అన్నాను. సంప్రదాయ బాణీలో చేతులు జోడించి మూలవిరాట్టుకూ, ముఖ్యమైన లామాకూ ఇతర భిక్షువులకూ నమస్కరించి మెల్లగా బయటపడ్డాం. అక్కడి ముఖ్యభిక్షువు తానూ చేతులు జోడించి మా వందనాలు స్వీకరించాడు. ప్రాంగణంలోంచి బయటకు వస్తున్నపుడు ఓ చిన్నగదిలో బాగా వడలిపోయిన చర్మం ఉన్న – గడ్డి కూరిన – మంచు చిరుతపులి బొమ్మ ప్రదర్శించబడి కనిపించింది. ఈ మంచుచిరుత అంతరించిపోతోన్న జీవజాలానికి చెందిన జంతువు. బౌద్ధమఠంలో ఆ జంతుప్రదర్శన నాకు బాగా వింతగా తోచింది.
మా ప్రయాణం కొనసాగింది. దారిలో ఘెమి అన్న గ్రామంలో బౌద్ధమంత్రాలతో కూడిన పొడవాటి మణికుడ్యం దగ్గర ఆగాం. అది ఆ ప్రాంతంలోకెల్లా ఎక్కువ పొడవు ఉన్న మణికుడ్యమట. ఘే లింగ్, సయాంగ్ బోచె అనే మరో రెండు గ్రామాలు దాటాం. దారిలో ప్రకృతి చెక్కిన సహజ వర్ణచిత్రాలను చూసి అబ్బురపడుతూ ఆనందిస్తూ ముందుకు సాగిపోయాం. ప్రకృతికి మించిన కళాకారులు ఉంటారా!
మా గైడు రేషమ్తో నాకు రెండేళ్లుగా మంచి పరిచయం ఉంది. హిమాలయాల లోతుపాతులు బాగా తెలిసిన మనిషి. చిరకాల సహకారి. మామధ్య గత రెండేళ్లలో చనువూ బాంధవ్యాలు ఏర్పడినా అదంతా పాతికముప్ఫైమందితో కలసి వెళ్ళినపుడు ఏర్పడ్డ సంపర్కం. ముఖాముఖి మాట్లాడుకొనే అవకాశం దాదాపు లభించలేదు. ఇపుడు ఈ ఎగువ ముస్తాంగ్ యాత్ర ఆ లోటు తీర్చింది. గత మూడు రోజులుగా అతనితో కలసి తిరగడం, మనసారా కబుర్లాడటం జరిగింది. తన గురించీ, తన సెక్యూరిటీ గార్డ్ నేపథ్యం గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు రేషమ్. నేపాల్ యువకులకు ప్రపంచవ్యాప్తంగా రక్షక దళాలలో ఉద్యోగావకాశాలు బాగా ఉన్నాయట. టూరిజం, మౌంటెనీరింగ్ రంగాలు సరేసరి. చక్కని శారీరక పటుత్వం కలిగిన నేపాలీ యువకులకు బ్రిటిష్, సింగపూర్ ఆర్మీలలోనూ, భారత సైన్యంలోనూ ఉద్యోగావకాశాలు ఎక్కువట. నేపాల్ సైన్యం, నేపాల్ పోలీస్ డిపార్ట్మెంట్లలో అవకాశాలు కూడా తక్కువేంగాదు. ఇహ ప్రపంచవ్యాప్తంగా సెక్యూరిటీ ఏజెన్సీలలో నేపాల్ యువకులకు మంచి గిరాకీ ఉంది.
రేషమ్ ఆఫ్ఘనిస్తాన్లో కొన్నాళ్ళు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసాడట. అందులో కొంతకాలం కాందహార్లో – మహా ప్రమాదభరితమైన సమయమది అంటాడతను. పొరపాటున ఆపరాని వ్యక్తిని ఆపాడో, ఒంట్లో గుండు దిగిపోయే అవకాశాలు మెండుగా ఉండే ప్రదేశమది! తాలిబాన్ నుంచి వచ్చే ఎడతెగని ప్రమాదాలు ఉందనే ఉన్నాయి. 2023 నుంచి రష్యన్లు ఉక్రెయిన్లో పోరాడటానికి నేపాలీ యువకుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారట. జీతనాతాలు మామూలుకన్నా ఎక్కువ అని వ్యాఖ్యానించాడు రేషమ్. ‘ఏదేమైనా ఇప్పటికీ బ్రిటిష్ సైన్యంలోని గూర్ఖా రెజిమెంటుకు ఎంపిక కావటమన్నది సగటు నేపాలీ యువకుడు కనే కల’ అన్నాడు రేషమ్. పొఖారాలో బ్రిటిష్ ఆర్మీ వాళ్ళ రిక్రూట్మెంట్ కేంద్రం ఉందట. వారి పరీక్షా పద్ధతి ఎంతో నిర్దుష్టంగా ఉంటుందట. నెగ్గడం అంటే మాటలు కాదట. నెగ్గాక వారు ఇచ్చే శిక్షణ అగ్రశ్రేణికి చెందినదట. ఏదేమైనా తనకు ఇప్పటికీ ఏదేనీ దేశం వెళ్ళి సెక్యూరిటీ విభాగాల్లో పని చేయాలని ఉందనీ కాకపోతే ఆ పని, ఘర్షణలూ పోరాటాల మధ్య మాత్రం కాకూడదనీ అన్నాడు రేషమ్.
మా మాటలు వింటోన్న దీపక్కు ఉత్సాహం కలిగింది. తన వృత్తివిశేషాలు చెప్పడం మొదలెట్టాడు. ‘నేను ఎంతో రొటీన్గా జోమ్సోమ్నుంచి ముక్తినాథ్కు యాత్రికులను తీసుకెళుతూ ఉంటాను. అందులో పెద్ద ఆసక్తికరమైన సంఘటనలేం ఉండవు. ఎంతో అరుదుగా ఇలా ఎగువ ముస్తాంగ్కు వస్తూ ఉంటాను. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇదిగో ఈ మహింద్రా బొలెరో కొని మూడేళ్లయింది. కొన్న తర్వాత ఈ రూట్లో అరడజనుసార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారీ వృత్తిని మించిన సంతృప్తి కలుగుతూ ఉంటూంది. ఇపుడు మీతో గడిపిన ఈ మూడు రోజులూ ఎప్పటికీ మరచిపోలేను,’ అంటూ మనసు విప్పాడు. భార్యా ఇద్దరు చిన్నపిల్లలూ ఉన్న చిన్న కుటుంబమతనిది.
కాలీ గండకి నది దాటి కాసేపటికల్లా కాగ్బెని చేరుకున్నాం. పర్మిట్లవీ మరోసారి తనిఖీ చేసాక మమ్మల్ని ముందుకు వెళ్ళడానికి అధికారులు అనుమతించారు. సాయంత్రానికల్లా జోమ్సోమ్ చేరుకున్నాం. మాలో ఒకడుగా కలసిపోయి మా బాగోగులు శ్రద్ధగా చూసుకున్నందుకు రేషమ్కు ధన్యవాదాలు చెప్పాం. చక్కని డ్రైవింగ్ నైపుణ్యం, ఆహ్లాదకరమైన సాహచర్యం అందించిన దీపక్కు అభినందనలు తెలిపాం.
షాంగ్రి-లా!
టీనేజి దశలో ఆ ప్రదేశం మీద ఉన్న అవగాహన, వ్యామోహం వేరు. ‘యవ్వనోత్సాహం’ వేరు. జీవితం తెలియడం మొదలెట్టాక జేమ్స్ హిల్టన్ నవల కలిగించిన ఊహా, ఉత్సాహం వేరు. నడివయసు తొలి దశలో నేపాల్ యాత్రలు మొదలయ్యాక ఆ ప్రాంతం గురించి కలిగిన ‘కోర్స్ కరెక్షన్’ వేరు. అయినా ఆ భావనకు దగ్గరగా ఉన్న ఎగువ ముస్తాంగ్ వెళ్ళి రావాలన్న కోరిక రెండు దశాబ్దాలుగా మనసులో నిండి ఉండటం వేరు. నిజంగా ఇపుడు లోమాన్థాంగ్లో
మూడు రోజులు గడిపి రావడం వేరు. ఈ వేరువేరు అంశాలన్నిటికీ ఒకటే కేంద్ర బిందువు – నా ఊహ,
నా కాంక్ష, నా మనస్సు!
మేధావులు, నిత్యయవ్వనులు, చిరకాల జీవులు, దివ్యసంతోషసీమవాసులు – ఈ అతిశయోక్తులని పక్కన పెడితే మా మూడు రోజుల లోమాన్థాంగ్ – ఎగువ ముస్తాంగ్ యాత్ర దానికదే చెప్పుకోదగ్గది. రంగురంగుల పరిసర సీమలు, విశాలమైన నదీ గర్భాలు, ప్రకృతి చెక్కిన శిలాశిల్పాలు, నదులను ఒడిలో పెట్టుకొని ముద్దు చేస్తున్నట్టు కనిపించే అఖాతాలు, అందమైన గ్రామాలు, సహృదయులైన గ్రామస్తులు – వీటికి తోడు అణువణువునా వికసించి కనిపించే టిబెటన్ బౌద్ధం, శతాబ్దాలనాటి గొంపాలు, ఆరువందల ఏళ్ల చరిత్ర, తమకే ప్రత్యేకమైన సంస్కృతి.. కింగ్డమ్ ఆఫ్ లో – ఇవన్నీ కలసిన ఎగువ ముస్తాంగ్ దానికదే ప్రత్యేక ప్రపంచం. మిగిలిన ప్రపంచానికి యోజనాల దూరాన ఉన్న ప్రపంచం. ఇంకా చెప్పాలంటే నాగరిక ప్రపంచం మరచిపోయిన ప్రదేశం. ఎక్కడెక్కడి దేశాలూ తిరిగిన నాకు కూడా మామూలుగా అందనంత దూరాన ఉన్న ప్రదేశం. వందలాది సంవత్సరాలుగా ఏ మార్పూ లేకుండా కాలపుటంచున స్థిరపడి మనుగడ సాగిస్తోన్న ప్రపంచం. ఇపుడు వెళ్ళిరావడం మునుపటికన్నా సులువయింది. అయినా టూరిస్టుల పదఘట్టన మొదలవలేదు. భవిష్యత్తులో అదీ జరగవచ్చు. ఆ మార్పు రాకముందే, నాగరికజీవితం తరతరాల జీవనసరళిని గుర్తు లేకుండా మార్చకముందే – నేను వెళ్ళి, చూసి రాగలిగాను. గొప్ప సంతోషం.
ఎగువ ముస్తాంగ్ అనే ఏముందీ, అసలు హిమాలయాలే ప్రపంచంలోకెల్లా మారుమూల ప్రాంతాలు. ఏకాంత నిలయాలు. వందేళ్ల క్రితం దాకా కాలినడకన తప్ప చొరలేని ప్రాంతాలు. అలాంటి మారుమూల ప్రాంతాలలో ఇంకా మారుమూల ప్రాంతం ఎగువ ముస్తాంగ్. దుస్సాధ్యమైన హిమాలయాలకు అవతల, ఆ అన్నపూర్ణ ధౌళగిరి పర్వతశ్రేణుల అవతలి గట్టున, ప్రపంచపు పై కప్పులాంటి టిబెట్ పీఠభూమిలో, ఎడారి ప్రాంతంలో ఉన్న లోమాన్థాంగ్ వెళ్ళి రావడం ఎంతో సంతృప్తి కలిగించింది. అరవై ఏళ్ల క్రితం మైఖేల్ పిస్సెల్ చూసిన పట్టణాన్ని యధాతథంగా చూడగలిగాను. ముందే అన్నట్టు ఆ పట్టణాన్ని జేమ్స్ హిల్టన్ చెప్పిన ఇలలో స్వర్గం ఇదే ఇదే అని కీర్తించలేం. అయినా అనేక మానవీయకోణాలలోంచి చూసినపుడు; చరిత్ర, సంస్కృతి, మతాభినివేశం, సరళ జీవనసరళి, మెలికలు ఎరుగని మానవ ప్రకృతి – ఇలాంటి కోణాలలోంచి చూసినపుడు ఇదే షాంగ్రి-లా అనిపిస్తుంది. నావరకూ ఇదే నా షాంగ్రి-లా!