తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి

సాహిత్యం మనం సృష్టించుకున్న రెండో లోకం.

ఈలోకంలో కొంత నిజం, కొంత అనిజం- కొంత జీవితం, కొంత కలా కలగలిసి వుంటాయి. ఈ లోకానికి పాఠకుడు ఒక వైపూ, రచయిత ఇంకో వైపూ. వీళ్ళిద్దరూ కలిసే చోటు పుస్తకం. పుస్తకాలు చదివే అలవాటు, పుస్తకాలు రాసే అలవాటు నిజానికి ఒకే ఆలోచనాత్మక ప్రక్రియకి రెండు కోణాలు. పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుడూ, పుస్తకం రాస్తున్నప్పుడు రచయితా ఒకే విధమైన ప్రక్రియలో భాగస్వాములవుతారు. ఇద్దరూ ఆలోచనలోకి ప్రవేశిస్తారు. ఆ ఆలోచనే రెండో లోకం.

కాని, ఈ రెండో లోకం చుట్టూ వున్న వాస్తవిక లోకంతో సంబంధం లేని లోకం కాదు. చుట్టూ వుండే పరిస్థితులూ, సంస్కృతి, ముఖ్యంగా భాష ఈ రెండో లోకానికి చాలా ముఖ్యం. మన పరిస్థితులూ, మన సంస్కృతి, మన భాష, పూర్తిగా మనకు తెలిసిన వాస్తవిక లోకంలో తిరగడం చాలా సౌకర్యంగా వుంటుంది. వాటి నుంచి వచ్చిన పుస్తకాల్ని చదవడంలోనూ చాలా సౌకర్యం వుంటుంది. కాని – మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య – మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.

1

ఇవాళ ప్రపంచం నలుమూలలా తెలుగువాళ్ళు వున్నారు. దేశదేశాల్లో తెలుగు మాట వినిపిస్తోంది. అనేక దేశాల్లో తెలుగు సమాజాలు గట్టిగా పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్‌ ఆ సమాజాలన్నిటినీ కలిపికుట్టే దారంగా పనిచేస్తోంది. అమెరికా నుంచి దుబాయి దాకా అనేక తెలుగు ఇంటర్నెట్‌ చర్చాబృందాలు చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. అయిదేళ్ళ క్రితం నలుమూలలా చెల్లాచెదురుగా పడి వుండి, ఎవరి దేశంలో వాళ్ళు అపరిచితంగా మాత్రమే మిగిలిపోయినట్టున్న తెలుగు వాళ్ళు ఇప్పుడు దూరాల్ని జయించి దగ్గిరవుతున్నారు. ఒకప్పుడు మహా అయితే ఒక వూళ్ళో ఏ పండగ సందర్భంలో అయితేనే కలిసేవాళ్ళు. ఇప్పుడు కలుసుకోడానికీ,మాట్లాడుకోడానికి అవకాశాలు పెరిగాయి. రకరకాల ఇంటర్నెట్‌ తెలుగు గ్రూపులు ఇప్పుడు వున్నాయి. అనేక విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. భావాలు వేగంగా బట్వాడా అవుతున్నాయి. వాటికి దేశాల సరిహద్దులు లేవు. కాల వ్యత్యాసాలు లేవు. మనోవేగానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేవు. దీనికి తోడు, పత్రికావ్యవస్థ మరింత చేరువయింది. తెలుగు పత్రిక చదవడానికి ఇప్పుడు పెద్ద కష్టపడక్కర్లేదు. అలాగే, తెలుగునాట ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోడానికి సౌకర్యాలు పెరిగాయి. ఆ మాటకొస్తే, అక్కడి వాళ్ళ కంటే దూరంగా ఏ అమెరికాలోనో వున్నవాళ్ళకే తెలుగుపత్రికలు కొన్ని గంటలు ముందుగా చేరుతున్నాయి. ఈ పరిస్థితి అక్కడి – ఇక్కడి తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవనాన్ని ఎట్లా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడే చెప్పలేం. కాని, దూరం తరిగిపోతుందని మాత్రం ఇప్పటికి చెప్పుకోవచ్చు.

ఇప్పుడు ఏర్పడిన ఈ కొత్త పరిస్థితుల్ని 1960 లలో కొత్తగా అమెరికా చేరిన తెలుగువాళ్ళ పరిస్థితులతో పోల్చితే ఏమనిపిస్తుంది? 60లకీ, 90లకీ మధ్య దూరాన్ని ఇప్పుడు చూడడం ఎలా? తెలుగు మాట వినిపించడమే బంగారమైన 60లు, ఎటు విన్నా తెలుగు సమూహాలు సందడి చేస్తున్న 90ల తరవాతి పరిస్థితులకి ఎంత తేడా? ఈ పరస్పర భిన్నకాలాల మధ్య తెలుగు వాడి భాష, సాహిత్యం, సంస్కృతి పరసీమలలో ఎంత పెనుగులాడింది? ఈ నాలుగైదు దశాబ్దాలలో తెలుగువాళ్ళు తమవి కాని దేశాల్లో తమ సాహిత్యాన్ని, భాషనీ కాపాడుకోడానికి ఎన్ని బాధలు పడ్డారు? ఏ ఏ సాధనాలు సమకూర్చుకుని, వాటిని కాపాడుకున్నారు? ఈ సంఘర్షణ అంతా ఇప్పుడు వొక చరిత్ర. మరచిపోలేని తీయని గతం. గర్వంగా చెప్పుకునే వొక అందమైన జ్ఞాపకం. చిన్నప్పుడు తెలుగువాచకంలో దాచుకున్న నెమలికన్ను. ఆ కన్ను తెరిచి గతంలోంచి వర్తమానంలోకి వచ్చే ప్రయత్నం ఈ వ్యాసం. అయితే, మిగిలిన దేశాల్లో తెలుగు వాళ్ళ సాహిత్య సంగతులు చాలా ముఖ్యమే అయినప్పటికీ – ప్రస్తుతం అమెరికాలోని తెలుగువాళ్ళ సాహిత్య సంస్కృతిని పరిచయం చేయడమే ఈ వ్యాసం పరిమితి.

2

‘డయాస్పొరా ’ సాహిత్యసంస్కృతిగా మనవాళ్ళ కృషిని చెప్పుకోవచ్చా లేదా అన్న చర్చకి ముందు – సంక్షిప్తంగా – అమెరికా తెలుగు సాహిత్యసంస్కృతి ఎట్లా ఏర్పడిందో చూడడం అవసరం. నిజానికి 1960లలో వచ్చిన తెలుగు సాహిత్యాభిమానులు ఏం చదివేవాళ్ళో, ఏం రాసేవాళ్ళో ఇప్పుడు మనకి గుర్తులేదు. అలాగే, అప్పటి తెలుగు సమూహాలు ఎలా వుండేవో, వాటి స్వభావం ఏమిటో మనకి తెలియదు. అయితే, పూర్తిగా కొత్త లోకంలోకి, కొత్త వ్యవస్థలోకి వచ్చిన పరిస్థితుల్లో విపరీతమైన మానసిక, శారీరక వొత్తిళ్ళస్త్ర సాహిత్యం జోలికి రానివ్వవు. చదవాలన్న ఆసక్తి వున్నా దానికి కావలసిన తీరుబాటు దొరకదు. రాయాలన్న ఉత్సాహం ఏ మూలనో వున్నా, రాయడానికి కావలసిన తక్షణ ప్రేరణనిచ్చే వాతావరణం వుండదు.

ఇలాంటి వాతావరణం అమెరికన్‌ తెలుగు సమూహాల్లో 1970లలో కాస్త ఏర్పడడం మొదలైంది. దీనికి కారణం – 60లలో కంటే 1970లలో తెలుగువాళ్ళకి అమెరికాకి రాకపోకలు పెరిగాయి. మెడికల్‌, సైన్సు రంగాల వాళ్ళు అమెరికా వచ్చి, కాలు నిలదొక్కుకోవడం మొదలైంది. ముఖ్యంగా- వైద్యరంగంలో వున్నవాళ్ళు. ఈ రంగంలో వున్నవాళ్ళకి బయటి సమాజంతో సంబంధాలు తప్పనిసరి. ఆ సంబంధాల సంఘర్షణ చెప్పాలన్న తపన కొంతమందిని రచనలవైపు మళ్ళించింది.

‘ప్రతిక్షణం డాక్టరుగా పనిచేస్తున్నప్పటికీ చాలా సంగతులు చూసినప్పుడు మనస్సు కలవరపడేది. మా ఇండియాలో అయితే ఇలా జరగదు అనిపించేది. ముఖ్యంగా డివోర్స్‌డ్‌ కపుల్స్‌ మానసిక సమస్యలతో వచ్చినప్పుడు ఎదుగుతున్నన యువతీయువకులు డ్రగ్‌ సమస్యలతో వచ్చినప్పుడు ‘ఛ’ అనిపించేది. వీళ్ళ అలవాట్లపై చిన్న చూపు. మెల్లగా దాని వెంటనే అసహ్యం పేరుకుంటూ వచ్చాయి. అందుకనే అందరికీ ‘హాయ్‌’ చెప్పి ఆమడదూరంలో వుంటూవచ్చాను..’ (రాణీ సంయుక్త కథ ‘వంచన’)

‘ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా వున్నాను. ఇక్కడ పనివారెవరూ వుండరు. మావారు మా అమ్మాయిని తీసుకుని ఏదో పార్టీకని వెళ్ళారు. నాకు ఇష్టం లేక వెళ్ళలేదు. వెళ్ళే ముందు దానికో పెద్ద గొడవ. నన్నూ రమ్మంటారు. ఆ పార్టీలు ఎంత రొటీనుగా, ఎంత కృత్రిమంగా వుంటాయో…సీతాపురంలో పేరంటాళ్ళు, పట్టుచీరల గరగరలు, కమ్మని పలకరింపులు, తియ్యని ఆప్యాయతలు రుచిచూసిన నాకు ఇక్కడి వాతావరణంలోని చేదు నచ్చడం లేదు..’(నోరి రాధిక కథ ‘పొరుగింటి పుల్లకూర’)

బయటి జీవితం కేవలం బయటి విషయాలకే పరిమితం కాదు. అది వ్యక్తి మానసిక జీవితాన్నికూడా ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించిన సంఘర్షణ ఈ దశలో ఎక్కువగా కనిపిస్తుంది. రచయితకి ఇది చాలా ముఖ్యమైన సన్నివేశం. ఈ సన్నివేశమే మన భాషనీ, మన సంస్కృతినీ బలంగా గుర్తు చేస్తుంది. 1970లలో వచ్చిన సాహిత్యానికి ఈ తలపోత ప్రధానమైన ముడిసరుకు. గతాన్ని తలచుకునే ప్రయత్నంలో భాగంగా రాయడం. వాటిని రాత పత్రికల్లో తామే ప్రచురించుకోవడం ఈ దశలో కనిపిస్తుంది. ఆలా మొదలైంది ‘తెలుగు భాషా పత్రిక’. మొదట అది రాతపత్రిక. ఆ తరవాతే అచ్చుపత్రిక. ఈ సాహిత్యసంస్కృతికి ‘నాస్టాల్జియా’ ముఖ్యనేపధ్యం. అది తెలుగునాట తమ గతజీవితాన్ని గుర్తుచేసుకోవడంతోనే పరిమితం కాలేదు. తమ భాషనీ, సంస్కృతినీ తలుచుకోవడం అందులో ముఖ్యమైన అంశం.

పండగ లేదు పబ్బం లేదు
తినాలంటే కొబ్బరి కజ్జం లేదు
సుప్పులు లేవే, సెగోడీలు లేవు
జనపనార లేదు, జున్నుపాలు లేవు
జముకులోల్లు లేర
జోగి దండడాలు లేవ
జీవుడు! నా జీవుడు గిలగిలా గింజుకుంటున్నాడ
(పాలన కవిత ‘సికాకెత్తిపోయినాదే ఈ సికాగో బతుకు’)

మొదటి తరాల అమెరికన్‌ తెలుగువాళ్ళ మీద సామాజికంగా, సాంస్కృతికంగా అనేక వొత్తిళ్ళున్నాయి. మొదటిది: సంఖ్యాపరంగా

వాళ్ళు చాలా తక్కువమంది. ఇలాంటి సందర్భాల్లో ‘నాస్టాల్జియా’ బలంగా పనిచేయడంలో ఆశ్చర్యమేం లేదు. ఇప్పటికీ ఆ తరంవాళ్ళ మాటలకీ, ఆలోచనలకీ ఆ నా,స్టాల్జియానే పునాదిగా కనిపిస్తుంది. వాళ్ళ భాష నుంచి అలవాట్ల వరకూ వొక గిరి గీసుకుని వుంటాయి, అంటే ‘గడ్డ కట’ి్ట వుంటాయి. ఆ తరం వాళ్ళ కథలూ ఇతర రచనల్లో తెలుగు చూస్తే మనకీ విషయం అర్ధమవుతుంది. అలాగే, వాళ్ళు తీసుకునే ఇతివృత్తాల్లో తెలుగు సంస్కృతికి వొక పరిధి గీయాలన్న తాపత్రయం కనిపిస్తుంది. కొత్త దేశంలో తాము ఎదుర్కొంటున్న ప్రతి స్థితినీ స్వదేశంలో పరిస్థితితో బేరీజు వేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ పరిస్థితికి వొకే సాంస్కృతిక విలువ వున్నట్టు భావించుకునే వాళ్ళు. కొన్ని కథల్లో పాత్రలు ఇక్కడి ప్రతి సన్నివేశాన్నీ అర్ధం చేసుకోడానికి దాన్ని ‘సనాతన హిందూ’ ధర్మంతో పోల్చుకోవడం కనిపిస్తుంది. ఈ ధోరణి భాషలోకి వెళ్తే, ఏ ఇంగ్లీషు/ఉర్దూ ప్రభావమూ కనిపించని అచ్చతెనుగు వాడకంలోకి వెళ్తుంది. ఆ విధంగా నిజంగా స్వదేశంలో వాడే తెలుగుకీ, ఇక్కడి తెలుగుకీ వొక తేడా ఈ తరం రచయితల్లో కనిపిస్తుంది. వేలూరి వేంకటేశ్వరరావు ‘నా భావనలో తెలుగు డయాస్పోరా’ అనే వ్యాసంలో ఈ పరిస్థితిని ఇట్లా చెబుతారు:

‘దేశం విడిచిపెట్టాకనే దేశం బాగా అర్ధమవుతుంది. దీపం కింద ఉన్నంత కాలం నీడలో తెలియదు…దీపానికి కాస్త దూరంగా వుంటేనే దీపకాంతి మన మీద బాగా ప్రసరిస్తుంది. ఇక్కడికి రాకముందు మనలో చాలా మందిమి తెలుగు మీద, తెలుగు సాహిత్యం మీద ఏమంత శ్రద్ధ చూపించిన వాళ్ళం కాదని మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు. దానికి తోడు, మొదటి తరం వాళ్ళం చాలా మందిమి, భౌతిక రసాయన శాస్త్రాల్లోను, ఇంజనీరింగు, మెడిసిన్‌లలోనూ పట్టభద్రులమై వచ్చినవాళ్ళం. ఇక్కడికి వచ్చాక, మన చుట్టూ వున్న ఇంగ్లీషు వాతావరణం, తెలుగు పాఠం ఎప్పుడూ శ్రద్ధగా వినని మనని మరింత తెలుగువాళ్ళని చేసింది. మనని, మరింత భారతీయులుగా చేసి దగ్గిరకు రప్పించింది. తెలుగుదేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయనివాళ్ళం, గట్టిగా తెలుగు చదవనివాళ్ళం, గట్టిగా తెలుగు పత్రికలు కూడా చూడని, చదవని వాళ్ళం – ఇక్కడికొచ్చాక మనకి ఇంగ్లీషు కన్నా తెలుగే బాగా వచ్చునని గుర్తించాం. మనం తెలుగులో రచయితలం, కవులం అయ్యాం’.

ఈ మాటల్లో రెండు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఒకటి: ఉనికికి సంబంధించిన స్పృహ. రెండు: ఆ ఉనికికి ఒక భౌతిక రూపం స్థిరపరచాలన్న తపన. ఆ తపనకి వొక రూపం – భాష. కొత్త దేశంలో కొత్త సంస్కృతీ, భాషా కలిగించే వొత్తిడిలో వాటి ప్రభావానికి దూరంగా మనదే అయిన సంస్కృతినీ, భాషనీ ఏర్పర్చుకోవాలన్న ప్రయత్నం. ఏదో వొక రూపంలో ఆ తేడాని నిలబెట్టుకోవాలన్న పట్టుదల. ఈ ప్రయత్నానికీ, పట్టుదలకీ స్వదేశంలో వస్తున్న మార్పులతో సంబంధం లేదు. ముఖ్యంగా – స్వదేశంలో మనవాళ్ళు మాట్లాడే తెలుగులో ఇంగ్లీషు/ఉర్దూ పదాలు తగినన్ని వుంటాయి. అచ్చతెలుగు అనేది అక్కడ లేదు. కాని మొదటి తరం రచయితలు వాడిన తెలుగు 1960లకి ముందు తెలుగు. పరభాషల్లో, పరసంస్కృతుల్లో మెలుగుతున్నప్పుడు ఏర్పడే కాస్మోపాలిటన్‌ మిశ్రమ సంస్కృతికి ఇంకా అమెరికన్‌ తెలుగువాళ్ళు అలవాటు కాని స్థితి. ఇటీవల అంటే – 1990ల నుంచి కొంతా, 2000ల తరవాత ఎక్కువగా వస్తున్న రచనల్లో ఈ కాస్మొపాలిటన్‌ మిశ్రమ భాషా, సంస్కృతీ కనిపిస్తాయి (దీన్ని నేను డయాస్పొరా లక్షణం అనుకుంటున్నాను, దీన్ని తరవాత వివరిస్తాను).

మొదటి రెండు తరాల తెలుగు సాహిత్య సంస్కృతికి ఇంకా ‘అమెరికన్‌ తెలుగు’దనం అబ్బలేదని మనకి అర్ధమవుతుంది. ఆ సంస్కృతికి గతజీవితం తలపోతలు, వర్తమాన జీవితంతో సమన్వయించుకోలేని సంఘర్షణా, మన సంస్కృతి విలువైందన్న స్థిరాభిప్రాయం – అప్పటి రచనల్లో కనిపిస్తాయి. ఈ కారణాల వల్ల అమెరికన్‌ సంస్కృతి మీద ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తాయి. రెండో బలమైన కారణం – అమెరికాలో స్థిరపడాలన్న కాంక్ష బలంగా లేకపోవడం. రెండో తరవంవాళ్ళ వొత్తిడి వల్ల తరవాత తరవాత ఈ కాంక్ష బలపడింది తప్ప, మొదటి తరంలో ఎక్కువ మంది తెలుగువాళ్ళకి ఇంకా అమెరికాతో కేవలం ‘వృత్తి’గతమైన అనుబంధం మాత్రమే వుండేది. ఆ ప్రతిఫలాలే వాళ్ళ రచనల్లో, సాంస్కృతిక చరిత్రలో కనిపిస్తాయి.

1970ల రెండో దశలో అమెరికన్‌ తెలుగువాళ్ళు అచ్చుపత్రికలు తీసుకురావడానికి అమెరికన్‌ సమాజంలో వాళ్ళు లీనమయ్యే ప్రక్రియ బలపడడానికీ దగ్గిర సంబంధం వుంది. రాతపత్రికలు సాధించిన ప్రధానమైన విజయం: అమెరికాలో తెలుగు రచనల పఠనాభిరుచిని పెంచడం. ముఖ్యంగా స్త్రీలకి ఇవి చాలా ప్రధానమైన పఠనసాధనమయ్యాయి. షికాగోలో ఒక సాహిత్యసమావేశం తరవాత మాటల సందర్భంలో ఈ లిఖిత పత్రికల ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా వీటి ప్రభావం ఆ రోజుల్లో వుండేదా అని ఒక పాఠకురాల్ని నేనడిగాను. ‘వ్యక్తిగతంగా నామీద ‘తెలుగు వెలుగు’ ప్రభావం చాలా వుంది. ఇప్పుడు నాకు రీడింగ్‌ ఒక అలవాటుగా మారిందంటే దానికి కారణం ఆ రాతపత్రికే. ఆ పత్రిక ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేదాన్ని. రావలసిన రోజు రాకపోతే వెంటనే పత్రికవాళ్ళని ఫోన్‌ చేసి అడిగేదాన్ని. మరీ ఆలస్యమయితే – చెడామడా తిట్టిపోసిన సందర్భాలు కూడా లేకపోలేదు.’ అన్నారామె. ఇప్పటిలా అప్పుడు తెలుగుపుస్తకాలు, తెలుగు ఛానళ్ళు, ఇంటర్నెట్‌ పత్రికలు వగైరా అందుబాటులో లేకపోవడం దీనికి ప్రత్యక్షంగా కనిపించే కారణం. ఇక పరోక్షంగా – తక్కువ సంచికలే వేసినా, తక్కువ పేజీలే వున్నా, ఈ రాతపత్రికలు మంచి సాహిత్యాభిరుచి వున్నవాళ్ళు నిర్వహించడం నిర్వహించడం వల్ల దాని ప్రభావం తగినంత పడింది. ఆ విధంగా అచ్చుపత్రికలు తీసుకురావడానికి కావలసిన సాంస్కృతిక వాతావరణాన్ని ఇవి సమకూర్చిపెట్టాయి.

రాతపత్రికల నిర్వహణలో పెమ్మరాజు వేణుగోపాలరావు పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. 1971లో ఆయన ‘తెలుగు భాషాపత్రిక’ని ప్రారంభించారు. అయిదేళ్ళపాటు నడిచిన ఈ పత్రికలో మొదట సైన్సుకి సంబంధించిన రచనలు ప్రధానంగా ప్రచురించేవారు. మొదటి తరం అమెరికన్‌ తెలుగువారిలో ఎక్కువమంది ఆ రంగానికి సంబంధించినవాళ్ళే కాబట్టి, ఆ విధంగా ఒక కొత్త పాఠకవర్గాన్ని తయారుచేయగలిగింది. ‘ఆ పత్రికలో ఏమున్నాయన్నది అంత ముఖ్యం కాదు. కాని, తెలుగులో చదవడం, తెలుగు పత్రికని చదివే అలవాటు చెయ్యడం ఆ పత్రికే నేర్పింది‘ అని ఆ పత్రికలో రాయడం ద్వారా రచయితగా మారిన ఓ ప్రముఖుడు అన్నారు.ఆ తరవాత 1977-82లో ‘తెలుగు అమెరికా’ షికాగో నుంచి వెలువడింది. ఈ పత్రిక ఇంకో అడుగు ముందుకు వేసి, ఆంధ్ర దేశం నుంచి కూడా రచనలు తెప్పించి వేయడం మెదలుపెట్టింది. అమెరికన్‌ తెలుగు పత్రికలు అచ్చు వేపు సాగించబోతున్న తరవాతి మజిలీకి ఈ పత్రిక దారి చూపించింది. తెలుగు కమ్యూనిటీ బలపడే కొద్దీ ప్రతి నగరం నుంచి ఒక తెలుగుపత్రిక రావడం ఈ దశలో పెద్ద మార్పు. అలాగే, రాతపత్రికల నుంచి అచ్చుపత్రికలకి సాగిన ప్రయాణం కేవలం భౌతిక సాధనాల్లో వచ్చిన మార్పు కాదు. తెలుగు సమాజాల విస్తరణ, సాంస్కృతిక ఉనికి కోసం అన్వేషణ… వీటితోపాటు డయాస్పొరాగా రూపుదిద్దుకోబోతున్న కమ్యూనిటీల సంఘర్షణ కనిపిస్తుంది. రాత పత్రికల రచనల్లో కనిపించే భావాల ‘వూగిసలాట’ అచ్చుపత్రికల్లో కనిపించదు. ఇక ఆలోచనల పరంగా – తాము కేవలం తెలుగు వాళ్ళం కాదనీ, అమెరికన్‌ తెలుగువాళ్ళమనీ అనుకోవడం అచ్చుపత్రికలు వచ్చాక వెలువడిన రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రాత పత్రికల నుంచి అచ్చుపత్రికల దాకా సాగిన ప్రయాణంలో ఇంకా చాలా ముఖ్యమైన అంశాల్ని కూడా గమనించవచ్చు. అందులో కొన్ని అమెరికన్‌ తెలుగుసాహిత్య వికాసాన్ని చెబుతాయి, మరికొన్ని అమెరికన్‌ తెలుగు సాహిత్య సాంస్కృతిక క్రమాన్ని వివరిస్తాయి.