Comment navigation


15867

« 1 ... 1040 1041 1042 1043 1044 ... 1587 »

  1. వేటూరి పాట గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:

    08/13/2011 7:59 am

    విశ్లేషణ బాగానే ఉందికానీ వారు ఉన్నప్పుడు వ్రాసి ఉంటే బాగుండేది. కొంత మెచ్చుకోలూ, కొంత అక్కసూ కనిపిస్తున్నాయి.

  2. స్మరణ: కథ నచ్చిన కారణం గురించి Dr.Sudhakar గారి అభిప్రాయం:

    08/13/2011 7:15 am

    మా గొఖలే గారి ‘స్మరణ’ కధ క్లుప్తము గానూ గొప్ప గానూ వున్నది.
    It narrates how jealousy, greed and domination overtake human values.
    Gokhale was a great artist and story writer too.
    I am fortunate enough to see the print of one of M. Gokhale’s paintings titled ‘పెళ్ళి చూపులు’.
    I still remember that beautiful picture reflecting telugu culture vividly.
    I am not aware of any museum exibiting this great telugu artist’s works.
    Thanks for Veluri Venkateswara rao gaaru for introducing Maa Gokhale to telugu people via EEMAATA.

    Dr.Sudhakar
    UK.

  3. గానభారతి గురించి yasasvi గారి అభిప్రాయం:

    08/13/2011 3:07 am

    దేశికాచారి గారూ! “గానభారతి” మీదకి చర్చని మళ్ళించినందుకు మీరు నన్ను మెచ్చుకోవాలి:) ఇటువంటి చర్చ అనివార్యంగా కవితారూపం మీదకి మళ్ళే పరిస్థితి వస్తుంది. పద్యం రాసే వారిగా మీకు పద్యరూపం మీద ఇష్టమ్ ఎక్కువ ఉండటం సహజమే అయినా మీరు మీ వ్యక్తీకరణ పరిమితులని కూడా తప్పక ఒప్పుకోవాలి.

    తెలుగువారికి గర్వకారణమతాది పద్యం. అందులో ఎటువంటి విభేదమూ లేదు. కానీ ప్రతీ అంశమూ పద్యానికి వ్యక్తీకరణలో నప్పదన్నదే నా అభిప్రాయం. అలాగే పద్యంలో రాసినదంతా కవిత్వమేనన్న ఊహ పొరపాటు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంక కధలకి “పద్యాన్ని” వాడటం కొత్తేముందీ?? మన మహాభారతం మొదలుకుని కొనసాగిన ప్రాచీన తెలుగు సాహిత్యం అంతా కధల్ని ఛందోరూపంగా గద్య పద్యాత్మకమైన రీతిలోనీ మణిప్రవాళ భరిత భాష లోనీ చెప్పినదే కద!! మీరు ఇతివృత్తం ఆధునికం కాలం రీత్యా అని చెప్పడమే తప్ప కధని చెప్పడం పద్యాల్లో కొత్త ఏమీ కాదు.

    కాలంలో మార్పు అనేక విషయాల్లోనూ మార్పుకి కారణమ్ అయితీరుతుంది. దాన్నించి.. ఏ కళారూపమూ తనతీరుని మార్చుకోకుండా ఉండలేదు. శ్రీనాధుడి కవితా వస్తువునించి విడివడడానికే పెద్దన కొత్తదైన వస్తువుని ఎన్నుకోవలసి వచ్చింది. దానికి ఒక కొత్త పేరునీ పెట్టుకుని తనకవిత్వమ్ తత్పూర్వమ్ కన్నా భిన్నమైనదని చెప్పుకోవలసీ వచ్చింది. ఇది కాలంరీత్యా వచ్చిన రాక తప్పని మార్పై కన్పిస్తుంది సాహిత్యంలో !! అయితే వస్తువులో కొత్త అడుగు వేసిన అల్లసాని కవితా రూపంలో మాత్రం కొత్త అడుగు వేయలేకపోవడానికి కారణం తత్భిన్నమైన కవితా రూపం ఒకటి తేవొచ్చని తెలియకపోవడమేనని అనుకోవాలి. అలా తెలియడానికీ వస్తువులోనూ కధని చెప్పవలసిన ఒక తప్పనిసరి పరిస్థితిని వదుల్చుకోవడమ్ లోనూ ఆధునిక కాలం, ఇతర దేశాల సంపర్కం ఉపయోగపడ్డాయి 19వ శతాబ్దపు కవులకి. కధన రితిని వారు విసర్జించి భావప్రధానమైన వస్తువుని కవిత్వంలో తీసుకుని రావడమూ, రూపంలో సైతమ్ ఎంతోకొంత మార్పుకి తొలినాళ్ళలో ప్రయత్నించడమూ భావకవులు చేసారు. అది కూడా ఒక మూసగా మారిన స్థితిలోనే పఠాభి ఆరీతి మీద తిరుగుబాటు కవిత్వమ్ రాసేడు. వీళ్ళంతా పద్యాలు రాయలేక కాదు వచనకవిత్వమ్ వేపు మళ్ళింది. శ్రీశ్రీ గాని పఠాభి గాని కృష్ణశాస్త్రి గానీ చాలా మంచి పద్యాలు రాయగల్గినవాళ్ళూ.. రాసినవాళ్ళే! వాళ్ళు కవితా రూపాన్ని మార్చుకోవలసిన ఆవశ్యకతని గుర్తించారు గనక మారేరు. ఇది ఒక సాహిత్య వాస్తవం! పద్యం ఎన్నిటికో అనువైనది కాదు.ఆధునిక జీవితలోని సంక్లిష్టతకి ఆ కవితా రూపం ఏమీ నప్పలేదు. చందస్సుల నడ్డి విరగ్గొడతానని పఠాభి ప్రకటించింది ఆ ఇరుకునించి తన భావప్రకటనా విధానాన్ని తప్పించుకుందికి మాత్రమే! అంతేగానీ పద్యరూపం ఆయనకి తెలియకా కాదు. పద్యం రాయలేకా కాదు.

    ఈ తెగతెంపు వల్ల కవితావస్తువులోనీ కవితా వ్యక్తీకరణలోనీ కవికి అపారమైన స్వేచ్చ లభించడమ్ వల్లనే మనకి ఆధునిక కవిత్వంలో ఎన్నో ప్రయోగాలూ ఎన్నో మంచి వచనకవితలూ కూడా రాగలిగాయి. అయితే వచన కవితా రూపాన్ని సైతమ్ ఒక నిరర్ధక స్థితికి కవులు తీసుకు రాలేదా అన్న ప్రశ్న వస్తే అందుకు ఔననే జవాబు చెప్పాలి. ఎలాగైతే చంధస్సులో రాసినదంతా కవిత్వం కాదో రూపాన్ని మార్చుకుని వచనకవిత్వాన్ని స్వీకరించి రాసినదంతా కూడా కవిత్వమ్ కాలేదు. అందుకు కవుల భావన, ఊహల లోపమ్ కారణమ్ తప్ప కవితా రూపం కారణమ్ కాదు. మంచి చంధో నిబధ్ధ పద్యమూ రాయవచ్చు. మంచి వచన కవితా కూడా రాయవచ్చు. వ్యక్తీకరణ ఊహా భాష గొప్పవి అయితే!! కాలం రీత్యా కవితా రూపం మారడమ్ కారణంగా అనేక వర్గాల వారూ అనేక జాతుల వారూ తమ తమ వ్యక్తీకరణలని స్వేచ్చగా సాహిత్యం లోకి తీసుకుని రాగలిగారు. అలాగే ఆ సందర్భాన్ని నిరుపయోగం కూడా చేసుకున్నారు.

    దానాదీనా చెప్పొచ్చేదేమంటే ఆధునిక భాషని వాడడానికి చాలని కవితా రూపంలో ఆధునిక కధానిక మీరు రాస్తే అది మీ శ్రమని వృధా చేసుకోవడమే తప్ప “బాగా” రాయగలగడం ఏమంత వీలు కాదు. అయితే రాసే స్వేచ్చ మీకుంటుంది. కానీ మీరు ఇతరత్రా రాసిన పద్యాలంత బలమ్ ఇందులో ఉండే వీలు లేదు.

    కాలానికీ సాహిత్య రూపానికీ ఉన్న సంబంధాన్ని మీరు గానీ నేను గానీ కాదని అనలేము మరి.

    యశస్వి.

    [యశస్వి గారూ – తెలుగులో సున్నా రావాలంటే m కాకుండా M టైపు చేయండి. అలానే మీరు రాసిన అభిప్రాయం మీరే మరొక్కసారి చదివి ఒక్కసారి అచ్చుతప్పులు దిద్దుకుంటూ వుంటే మాకు ప్రతిసారీ శ్రమ కొంచెం తప్పించినవారవుతారు. -సం]

  4. నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    08/12/2011 9:41 pm

    యశస్విగారూ, నేను రాసినది సరిగా అర్థం కాకపోతే వదిలెయ్యండి. సంగీతం, సాహిత్యం అనేవాటి ప్రాముఖ్యత ఎక్కడ, ఎలా ఉంటుందో నాకు (మీ అంత కాకపోయినా) కొంత తెలుసు. అదంతా ఇక్కడ వర్ణించడం అనవసరం. అయినా దీన్ని గురించి అభ్యంతరం ఉండవలసినది జయప్రభగారికేనేమో. నేను నా అభిప్రాయం రాసేటప్పుడు ఆవిడ వ్యాసం చదవనైనాలేదు.

  5. గానభారతి గురించి దేశికాచారి గారి అభిప్రాయం:

    08/12/2011 5:08 pm

    గానభారతి ఇటువంటి చర్చలకు మూలం కావడం ముదావహంగానే ఉన్నది. నేను పేర్కొన్నట్లుగా కాల మేదైనా మానవుల ప్రకృతులు కాలాతీతములు. యశస్వివంటివారు ఇటువంటి ఇతివృత్తం గల కథను ఇంకా వివరంగా “తెల్గీషు” గద్యంలోవ్రాస్తే ఆనందిస్తారనటంలో సందేహంలేదు. కాని ఒకవిషయం గమనించాలి. తెల్గీషులో చదివి ఆనందించవలసిన భాషా సౌందర్యం గాని, పదశిల్పంగాని, ఆలంకారికప్రయోగాలు గానీ, వర్ణనావైదగ్ధ్యం గాని, లయవిన్యాసాలు గాని వెతకడం పొరపాటే ఔతుంది. అట్లాగే గానభారతివంటి కవితా కథానికలలో ఈ అంశాలను విస్మరించి, తెల్గీషుభాషలో పద్యం వ్రాయలేదే అని వాపోవడంకూడ పొరపాటే ఔతుంది. అందుచేత వ్రాసిన మాధ్యమంలో ఆ మాధ్యమానికి లక్షణభూతమైన అంశాలను దృష్టిలో నుంచుకొని అందాన్ని ఆస్వాదించడం సహృదయుల ధర్మం. ఉదాహరణానికి పొడిమాటలతో సాగే డ్రామాను ఓపెరాగానో, బ్రాడ్వే సంగీతరూపకంగానో వ్రాసినప్పుడు వీనిని ఆస్వాదించే ప్రేక్షకులు, వాటిని తోలనంచేసే ప్రమాణాలూ వేఱుగా ఉంటాయి. గద్యేతర కవితామాధ్యమంలో కథను వ్రాసినప్పుడు (ఈనాటి వ్వవహారికభాష వాడటం లేదే అని వాపోకుంటే) ఈనాటి వచనకవిత్వంకంటె పద్యమే కథాకథనానికి సమర్థంగా, హృద్యంగా ఉంటుందనటంలో సందేహం లేదు. నేను వ్రాసినది సమర్థంగా ఉన్నా లేకున్నా ఇటువంటి కవితాకథానికా ప్రయోగాలు ఇంకా విరివిగాసాగాలనే ఉద్దేశ్యంతోనే నేనీ ప్రయోగాన్ని చేస్తున్నాను.
    లైలాగారి సందేహాలకు సమాధానాలు:
    1. రోమంథము = నెమరువేయుట . పోతనభాగవతంలోను, ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణంలోను ఈ పదం థకారయుక్తంగా ఉన్నది గాని సూర్యరాయాంధ్రనిఘంటువులో రోమంధము అని ధకారయుక్తరూపమున్నది. ఈ పదాన్ని వాడిన శ్రీకృష్ణమురళీగానపరవశములైన గోవులను వర్ణించే పోతనగారి పద్యం:

    మమతన్ మోములు మీఁది కెత్తుకొని, రోమంథంబు సాలించి, హృ
    త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి, మురళీగానామృతశ్రేణి క
    ర్ణములం గ్రోలుచు మేఁతమాని, గళితానందాశ్రులై చిత్రితో
    పమలై గోవులు చూచుచున్న వదిగో పద్మాక్షి! వీక్షించితే!

    2. సత్సంప్రదాయముకురాయితమైన = సత్సంప్రదాయమునకు అద్దమువలె నాచరించుచున్న, అనగా సత్సంప్రదాయమునకు అద్దము బట్టినట్లున్న, ముకుర మనగా అద్దము.

    3, గానభారతిలో దౌహృదవర్ణనపద్యాన్ని మార్చి నేను మాదవ్ గారికి సంస్కృతప్రతిని జూలై సంచిక రాకముందే పంపినాను గాని, ప్రాతప్రతియే అంతర్జాలంలో వారు ప్రచురించినారు. ఈ సంస్కృతపద్యరూపాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో దౌహృదవర్ణన వాచ్యంగా కాక చాలా మట్టుకు సూచ్యంగా మార్చబడ్డది.

    ఆ మఱునాఁటినుండియె మదంగమునం దెవొ నూత్నచిహ్నముల్
    గోముగఁ గాననయ్యెఁ, బలుగొంచెపుఁగౌఁను క్రమక్రమంబుగా
    లేమినిఁ బాయఁజొచ్చె, లవలీదళపాండురమయ్యె గండముల్,
    కామవరప్రసాదమనఁగన్ సమకూడిన గర్భమందునన్.

    4.విశ్వనాథవారు చెప్పినది అక్షరాలా నిజం. “తినగ తినగ వేము తియ్యనగును” అనే వేమనలైనుకూ ఇదేఅర్థం.

  6. గానభారతి గురించి మోహన గారి అభిప్రాయం:

    08/12/2011 2:56 pm

    మనుచరిత్ర నాయిక పేరు వరూథిని, వరూధిని కాదు. ఆమె ప్రవరునితో మాట్లాడుతూ తన్ను వరూథిని అని పిలువమంటుంది 🙂

    పేరు వరూథిని విప్రకు-
    మార, ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే-
    మా రంభా శశిరేఖ లు-
    దారగుణాఢ్యలు మదీయ లగు ప్రాణసఖుల్ – మనుచరిత్ర (2.44)

    విధేయుడు – మోహన

  7. పిల్లల కోసం గురించి Sreenivas గారి అభిప్రాయం:

    08/12/2011 2:52 pm

    Chaala Baagunnai.

  8. గానభారతి గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    08/12/2011 1:41 pm

    రోమంథము = నెమరు (గుర్తుకు రావటం అనే అర్థంలో వాడినట్లున్నారు)
    ముకురాయితమనే మాట కొరుకుడు పడలేదింకా (ముకురము = అద్దము/మల్లెపూవు; ఆయితము = సన్నాహము, సిద్ధము). సత్సంప్రదాయానికి “అద్దం పట్టే “అని అర్థం లాగవచ్చునా?

  9. నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి yasasvi గారి అభిప్రాయం:

    08/12/2011 2:17 am

    “తెలుగువారి సంగీతాభిరుచి పెరగాలంటే వారు సాహిత్యం పై శ్రధ్ధ పెట్టడం తగ్గించి…” ఇదేం వ్యాఖ్యానం ?? సంగీతం మీద అభిరుచిని పెంచుకోవడానికీ సాహిత్యాన్ని పట్టించుకోనఖ్ఖరలేదని ఓ సలహా పారేసే ముందు అసలు ఆ వాక్యానికి ఉన్న బలం ఏమిటోనన్నా ఆలోచించుకోలేదే రోహిణీ ప్రాసాదు గారు? సరిగ్గా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న జయప్రభ గారి అన్నమయ్య విశ్లేషణ పదంలోని సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో చెప్పకనే చెబుతోంది మరి!! సంగీతంలో ఎప్పుడైనా రాగాలూ స్వరాలూ ఇవి మాత్రమే ముఖ్యమైనవట!! దీని అర్ధమేమో రోహిణీ ప్రసాదు గారు వివరించాలి. ఆయన సాహితీ విశ్లేషకులని చూసి ఇబ్బంది పడుతున్నారా?? లేక సంగీతానికి ఆ పదాల్లోని సాహిత్యం ప్రతిబంధకం అని అనుకుంటున్నారా?? ఆయన సమస్య ఏమిటో నాకు స్పస్టం కాలేదు.

    ఒకసారి రాజమండ్రిలో పద్యనాటకాల ప్రాభవం బాగా ఉండే రోజుల్లో సంగీతం ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా అని చర్చలు చేసుకునే రోజుల్లో భమిడిపాటి కామేశ్వరావు గారు స్టేజీ మీద ఏకబిగిన రాగాన్ని ఆలాపన చేసి ఊరుకున్నారట!! పద్యం పాడటం అయిపోయింది అని చెప్పేసేరట. అదేమిటీ పద్యం అంటే సాహిత్యం ఏదీ అది వినిపించకపోతే ఇంక అందులో సొగసేమిటి పద్యం చదవండి మొర్రో అని జనం మొత్తుకున్నారట!! అలా ఆయన సంగీతంలో రాగం చాలు సాహిత్యం అనవసరమ్ అని భావించేవారికి తనదైన తరహాలో జవాబు చెప్పి ఉన్నారు. ఇది ఏనాడో ముగిసిపోయిన చర్చ. అలాగే ఘంటసాల గారికి ప్రియ శిష్యుడైన సంగీతరావు గారు సాహిత్యం లో ఉండే ప్రాముఖ్యతకి సదా ముగ్ధులైన వ్యక్తి. పాట తాలుకు బలం అంతా ఆ పాటలోని సాహిత్యానిదే నని తాను స్వయంగా సంగీతకారుడై ఉండిన్నీ.. గాయకుడై ఉండిన్నీ బలంగా నమ్మిన వ్యక్తి. సాహిత్యం తాలుకు ప్రాభవం అంత సరిగ్గా తెలియని వారెవరో అక్షరాన్ని గురించి ఆలోచించలేకపోయి ఉంటారు. కానీ సంగీతంలో అక్షరమే ముందు నడిచేదనీనీ స్వరం ఎప్పుడైనా దాన్ని అనుసరించే సాగవలసినదనీనీ సాహిత్యం తెలిసిన వారెవరైనా భావిస్తారు. అందుకనే అన్నమయ్య సాహిత్యం అంత ప్రాచుర్యం పొందగలిగింది. ఆయన పదాన్ని ఎవరేయే రాగాలలో.. పాడుకుంటున్నా కూడా ఆయన పదాలలోని ఆ కవితామాధుర్యమే చెవికింపుగానూ మనసుకి సుఖంగానూ ఉంటుంది. అక్షరాన్ని మినహాయించే సంగీతం మనలేదు. అందువల్ల రోహిణీప్రసాదు గారు ఒక పక్షపాత ధోరణితో ఆ మాటలు అన్నారని భావించేలా ఉంది. ఆయనకి సాహిత్యం మీద మక్కువ లేనంత మాత్రాన తెలుగువారికందరికీ ఉండకూడదని ఏమీ లేదు.

    యశస్వి.

  10. గానభారతి గురించి yasasvi గారి అభిప్రాయం:

    08/11/2011 2:02 pm

    లైలా గారూ !! మీరు రాసిన కొన్ని వాక్యాలకి నేను ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాను.” కడుపొచ్చ్చినంత సులువుగా సంగీతం రాదు” 😉

    మనుచరిత్ర ప్రభావం అన్నది ఒంటిగా ఉన్న అమ్మాయిని వెళ్ళి పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అమ్మాయి యోగక్షేమాలు కనుక్కునే నెపంతో సంభాషణ మొదలుపెట్టడం..ఇంకా గర్భిణీ స్త్రీ లక్షణాలు వర్నించడం ఇత్యాదుల్లో !! అంతదాకానే !!

    ఇకపోతే పద్యరచనలో తిరుమల దేశికాచార్యులవారిది అందె వేసిన చెయ్యే !! అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. అయితే, ప్రతీదీ పద్యంలోకి ఇరికిస్తే అది నప్పదు. అందుకు ఉదాహరణ గానే ఈ “గానభారతి”. లైలా అన్నట్టూ ఇది ఈ కాలం కధ అయితే ఈ కాలం ఆడపిల్ల వ్యవహారం ఇందులో ఏం లేదు. ఈ గానభారతి కవి గారి ఊహల్లో రూపొందిన అమ్మాయి. ఇవాళ్టి సమాజంలోని అమ్మాయే అయితే లైలా చెప్పినట్టూ ముందుగా గైనకాలజిస్టునే సంప్రదిస్తుంది మరి.

    చాదస్తం భాష లో ఉన్నప్పుడు కవి సహజం గానే విషయాన్ని సైతం అంతే చాదస్తమ్ గా రాయక తప్పదు. dress code ని మార్చుకున్నారు గానీ భాష విషయలోనూ కధా కల్పనలోనూ మాత్రం ఈ చాలా మంది పద్య కవులు కాలాన్ని ఇంకా శతాబ్దాల పొలిమేరని దాటనివ్వడం లేందే?? పద్యం బాగుంటుంది కదా అని అన్నిటికీ పద్యాన్నే వాడితే అది ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా కాలం ఆధునికం అన్న సూచన స్వయంగా చేస్తూ కవి ఆ ఆధునిక కాలం లో స్త్రీని మాత్రం బేలగా కవి సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేని దానిగా చిత్రించడం ఏమిటీ??

    ముక్తకాలైన భావాలకి పద్యం నప్పుతుంది. ప్రకృతి వర్ణనలకి కూడా ఇప్పటికీ పద్యమ్ నప్పుతుంది. దేశికాచార్యులవారే జలప్రపాతాన్ని వర్ణించే పద్యాలు రాసేరు. కానీ ఆధునిక కధ అందునా సంక్లిష్టమైన ఇతివృత్తం తప్పని సరిగా ఆధునికమైన భాష లోనే ఉండటం సముచితంగా ఉంటుంది. లేనప్పుడది కృతకంగానే ఉంటుంది. మన బతుకులో చాలా ప్రాంతాల ప్రమేయం చాలా నాగరికతల ప్రమేయం ఉన్నప్పుడు “తెల్గిష్” నప్పినంతగా మణిప్రవాళమ్ నప్పదు. పైగా ఇదివరలో వేరే భాషలని తెలుగు గ్రహించనట్టూ ఇప్పటికిప్పుడే ఇటువంటి పరిస్థితి ఏదో తెలుగులో తలెత్తినట్టూ దేశికాచార్యుల వారు అనడం వింత . భాష జీవద్భాష అయితే అది అన్నిటినీ కలుపుకుని నడుస్తుంది. లేకపోతే చస్తుంది. అప్పారావు గారి కన్యాశుల్కం లోని వాక్యాలకి ఆ ప్రాచుర్యం వచ్చిందీ అంటే అందుకు కారణం ఆయన సుబ్బరంగా “తెల్గిష్” ని తన నాటకంలో వాడటమే కద!!

    యశస్వి.

« 1 ... 1040 1041 1042 1043 1044 ... 1587 »