పరేశ్ కె. పట్నాయక్ ఒడియా భాషలో కథలు, నవలలు రాస్తారు. ఇప్పటి వరకు సుమారు ఇరవై నాలుగు కథా సంపుటాలను, ఐదు నవలలను వెలువరించిన ఈయనను ఒడియా రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. వీరి కథలు, నవలలు సామాజికాంశాలను ఇతివృత్తాలుగా కలిగి ఉంటాయి. వాటిలో సహానుభూతి, హాస్యం, వ్యంగ్యం, దిగులు కలగలిసి ఉంటం వలన పాఠకులను బాగా అలరిస్తాయి, ఆకర్షిస్తాయి. ఫలితంగా ఒడియా భాషలోని కథారంగంలో ఈయన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఈయన ఒడియా భాషలో రాసిన ఒక కథాసంపుటిని Childhood Days – Growing up in a Village in Odisha అనే పేరుతో ఈప్సితా సారంగి, హరేకృష్ణ దాస్ లు సంయుక్తంగా ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కథలు గ్రామీణజీవితపు బాల్యజ్ఞాపకాలను అందంగా చిత్రిస్తాయి కనుక, పాఠకుల మనసుమూలలను స్పృశించి బాల్యంలోకి తీసుకుపోతాయి. వీటిని చదువుతుంటే, పాఠకుని మనసు కఠోర వాస్తవాలు నిండిన ఈ కాలపు చేదు అనుభవాలకూ గతకాలపు మధురానుభూతులకూ మధ్య చక్కర్లు కొడుతుంది. పాత జ్ఞాపకాల పట్ల బెంగ, ఊళ్లలో నివసించే చిన్నపిల్లల అమాయకత్వం, సాదాసీదాతనం, వారి కలలు – ఇవన్నీ పాఠకుని మనసులో కూడా బాల్యపు అనుభూతులను కలిగించి, వాటిపట్ల బెంగను రగిలిస్తాయి.
ఇట్లాంటి కథలు మన తెలుగులోని విక్రమార్క భేతాళ కథలను, పేదరాశి పెద్దమ్మ కథలను కొంతవరకు పోలివుంటాయి. చందమామ, బాలమిత్ర మొదలైన పాత పత్రికల్లోని కథలు కూడా వీటికి దగ్గరగా వస్తాయి. ఇవి కాక, చందమామ పత్రిక తర్వాతి మన బాలసాహిత్యంలోని కథలకూ వీటికీ మధ్య పాక్షికమైన సారూప్యం కనపడుతుంది. అయితే, వాటికీ ఈ అనువాద కథలకూ నడుమ ఒక భేదం ఉంది. మన బాలసాహిత్యం లోని కథలు ఎక్కువ వరకు పిల్లల కోసం మాత్రమే రాయబడినవి. కానీ, ఈ కథల్లో గ్రామీణజీవితపు బాల్యజ్ఞాపకాలు చిత్రించబడినా, అవి కేవలం పిల్లల కోసమే కాక పెద్దవారిని సైతం అలరించేవిధంగా ఉండటం ఒక విశేషం. వీటిలో రచనా చాతుర్యం ప్రస్ఫుటంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. ఈ అనువాద గ్రంథపు మూలరచయిత exclusively (కేవలం) బాలసాహిత్యకారుడు కాడని తెలిసిపోతుంది, వీటిని పరిశీలిస్తే.
జానపద గాథల వంటి వృత్తాంతాలు, వాటికి సంబంధించిన పుకార్లు, ముచ్చట్లు గ్రామాలలో ఎక్కువగా రాజ్యమేలడం మనదేశంలోని అన్ని ఊళ్లకు దాదాపు సమానంగా వర్తిస్తుందని చెప్పవచ్చు. మరీ వెనుకబడిన ప్రాంతాలలో, గిరిజన గ్రామాలలో అవి కొంచెం భిన్నంగా ఉంటాయేమో. తమకు అతీంద్రియ శక్తులున్నాయని చెప్పుకునే మంత్రగాళ్లు, వారి ‘మహత్యాలకు’ దృష్టాంతాలుగా భావించబడే సంఘటనలు, చేతబడికి సంబంధించిన కొన్ని విచిత్ర సంఘటనలు, ఇంకా గ్రహాలు మొదలైనవాటి ప్రకృతి వైపరీత్యాలు … ఇట్లాంటి రకరకాల విషయాలను ఎక్కువగా చర్చించుకుంటారు గ్రామీణులు. ఇటువంటి విషయాలే ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
పాఠకులను పాతకాలపు వాతావరణంలోకి తీసుకుపోవడంలో రచయిత సఫలమయ్యాడు. కృత్రిమత్వం లేని నెరేషన్ అటువంటి సాఫల్యాన్ని సాధించడంలో ముఖ్యపాత్రను పోషించింది. వెదురురాణి, ఇనుప మహిళ (The Bamboo Queen and the Iron Lady) అన్నది మూఢవిశ్వాలను ప్రతిబింబించే కథ. మోకాళ్లనుండి కాలివేళ్ల దాకా, మోచేతులనుండి చేతివేళ్ల దాకా ఇనుముతో చేయబడిన ఒక విచిత్రమైన అమ్మాయి సఖి గోపాల్ అనే గ్రామానికి వస్తుంది. ఆమె కబడ్డి ఆటలో దిట్ట. తనను ఆ ఆటలో ఓడించినవాణ్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా తన ఆస్తిపాస్తులన్నీ ఇచ్చేస్తానని పురుషులందరికి ఒక సవాలు విసురుతుందామె. ఇదే సవాలుతో దేశమంతా పర్యటించి పురుషులందర్నీ ఓడిస్తూ వస్తుంది. ఆమెను ఓడించదల్చుకున్నవాళ్లు సఖి గోపాల్ గ్రామానికి పోయి పోటీలో పాల్గొనాలి. అదే సమయంలో ఆ ప్రాంతంలో మరొక పుకారు చక్కర్లు కొడుతుంది. రాత్రివేళ ఆకాశంలో ఒక మంచం ఎగురుకుంటూ పోతున్నదనీ, దాన్ని నలుగురు మనుషులు మోస్తున్నారనీ, ముందర ఒక సన్యాసి నడుస్తాడనీ – ఇలా చిలవలుపలవలతో సాగుతుంది ఆ కథ. ఈ రెండు పుకార్ల గురించిన రకరకాల వ్యాఖ్యానాలు ఎలా వ్యాప్తి చెందుతాయో ఉత్కంఠభరితంగా, హాస్యస్ఫోరకంగా చెబుతాడు రచయిత. అందరివీ ఊహాగానాలే, కల్పిత కథనాలే కావడం నవ్వును తెప్పిస్తుంది. అయితే కథ ఆసక్తికరంగా కూడా ఉంటుంది.
వింత దొంగతనపు కథ (Tale of a Strange Theft) నిజంగానే చాలా వింతగా, నవ్వు తెప్పించేదిగా ఉంది. సోమనాథ్ మహారాణా అనే మోతుబరి రైతుకు చెందిన పొలంలోని వరికట్టలు దొంగిలిపబడతాయి. దొంగను పట్టుకునేందుకు ఒక మాత్రికుణ్ని రప్పిస్తారు. తన ‘నడిచే మంచం’ అసలు దొంగను పట్టుకుంటుందని చెప్తాడతడు. తీరా చూస్తే మంచాన్ని నలుగురు మనుషులు భుజాలపై మోసుకుపోతుంటారు! మంచం నిజానికి తనంతట అదే కదులుతున్నదనీ, వాళ్లు తమ భుజాలను దానికి కేవలం ఆనించారనీ వివరణ ఇచ్చుకుంటారు ఆ సంఘటనను చూసిన ప్రజలు! మోసేవాళ్లు కూడా అవునని ధ్రువీకరిస్తారు! ఇక ఆ మంచం ఎక్కడెక్కడికో పోయి, నిరపరాధులైన అమాయకులకు తగిలి, వారిని దొంగలుగా నిర్ధారిస్తుంది. వాళ్లు అసలైన దొంగలు కారని వెల్లడయ్యాక దాని ప్రయాణం కొససాగి, ఆఖరుకు సోమనాథ్ మహారాణాకే తగులుతుంది! ఇది అసంబద్ధం అని కొందరు, లేదు మహారాణానే దొంగ కావచ్చు అని మరి కొందరు రెండు వర్గాలుగా ఏర్పడి, వారిమధ్య పెద్ద గలాటా జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో నెరెషన్ సాధారణ బాలల కథలకు విరుద్ధంగా ఉన్న సంగతిని గమనించవచ్చు, కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే. మా ఊళ్లో దొంగతనం జరిగితే దొంగను పట్టుకునేందుకు ఐదు భిన్నమైన మార్గాలున్నాయి అని చెప్పి, వాటిని వివరిస్తాడు రచయిత. ఈ వివరణలో కొంత మేధాపరమైన పరిణతి, రచనా చాతుర్యం కనిపిస్తాయి.
సుమారు అన్ని కథల్లో జానపద గాథల సరళి, చిన్నపిల్లల ఊహల వైఖరి దర్శనమిస్తాయి. పిల్లలనూ పెద్దలనూ సమానంగా అలరించే కథలు ఇవి. అనువాదం అంత పరిపూర్ణంగా లేకపోయినా కథల బలం కారణంగా అంతగా అది ఇబ్బందిని కలిగించదు. బాలసాహిత్యాన్ని రాస్తున్న తెలుగు రచయితలు ఈ పుస్తకాన్ని చదవితే వారికి లాభం కలుగుతుందని ఈ సమీక్షకుని అభిప్రాయం. దీన్ని రాసిన పరేశ్ పట్నాయక్ అభినందనీయుడు. ఈ గ్రంథాన్ని Authors’ Press, New Delhi వారు ప్రచురించారు.
మూలరచయిత పరిచయం:
పరేశ్ పట్నాయక్ ఒడియా భాషలో రాసే ప్రసిద్ధ కథారచయిత. మూడు దశాబ్దాలకు పైగా కథలు, నవలు రాస్తున్నారు. ప్రధానంగా మూఢవిశ్వాసాలు, మతం పట్ల మూఢభక్తి అనే సామాజిక అంశాల మీద విమర్శనాత్మకంగా, వ్యంగ్యాత్మకంగా అల్లుతారు కథలను. పిల్లలకోసం, యువకులకోసం, ఇంకా పెద్దవాళ్ల కోసం రకరకాల కథలు రాస్తారు. కథా రచనలో చక్కని ఒడుపును ప్రదర్శించే రచయిత ఈయన. ఒడియా సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పుకున్నారు. ఇప్పటివరకు 24 కథా సంపుటాలను, 5 నవలలను వెలువరించారు. ఒడియా రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్నీ, మరికొన్ని అవార్డులనూ గెల్చుకున్నారు. వీరి కథలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషలలోనికి అనువదింపబడినాయి (రెండు కథలను తెలుగులోకి అనువదించింది నేనే.). ఒక కొడుకుతో భువనేశ్వర్ లో నివసిస్తున్నారు.
***