అనువాద ప్రస్థానం

రామారావుగారితో నా పరిచయం ఇప్పటిది కాదు. ఒక ఇరవై ఏళ్ల నాటిది. “కాలో క్రీడతి, గచ్ఛత్యాయుః” ఎంతో కాలం గడిచిపోయింది. దాదాపు మూడు దశాబ్దాల క్రిందట వారి ‘వలస పోయిన మందహాసం’ ( 1995) వచ్చింది. ఎంతో ఆదరణ పొందింది. ఇతరభాషల్లో అనువాదాలు కూడా వచ్చాయి. కారణం, కవిత్వం రాయవలసింది, కడుపులో చల్ల కదలకుండా కూచుని, చేతికందిన సిద్ధాంతాల ధూపంలో మసకబారిన ఆత్మ గలవారు కాదు. నిండుగా జీవించిన పిమ్మట, ఆ జీవితంలోంచి పుట్టుకొచ్చిన అరుదైన అనుభవాలను, అక్షరబద్దం చేయగల చేవ ఉన్నవారు రాయాలి కవిత్వం. అప్పుడు ఆ కవిత్వం వింతకాంతులతో వెలిగిపోతుంది.

వారి రెండవ పుస్తకం – మరో మజిలీకి ముందు ( 2000), యాదృచ్చికంగా నా చేతిలోకి వచ్చిపడింది. అదెలాగు అంటే -2001 జనవరి 14 న ( సంక్రాంతి నాడు ) నేను ఉద్యోగ రీత్యా అమెరికాలోకి అడుగుపెట్టాను. ‘ఇంటర్నెట్ విప్లవం’ అప్పటికే మొదలయింది. అమెజాన్ 1995 లో ఆన్లైన్ లో పుస్తకాలు అమ్మడం మొదలు పెట్టి, 2001 లో మొదటిసారి లాభాలు చవి చూసింది. ఇంటర్నెట్ ను వినియోగించుకుని పత్రికలు నడపాలి అన్న ఉత్సాహం అమెరికా తెలుగువారిలో బయల్దేరి, సరిగ్గా పాతికేళ్ల క్రిందట 1998 లో ‘ఈమాట’ పత్రిక మొదలయింది. అప్పుడే వచ్చిన నా కవితాసంకలనాన్ని ( నిశ్శబ్దంలో నీ నవ్వులు) వారి పత్రికలో సమీక్షించి అప్పటి ‘ఈమాట’ సంపాదకులు కేవీఎస్. రామారావు గారు ‘వర్తమాన తెలుగు కవిత్వం పై సరైన విమర్శ రావడం లేదు, మీరెందుకు రాయకూడదు ‘ అన్నారు ‘ అదెంత పని, నేను రాస్తాను “ అని మాట ఇచ్చాను. హైద్రాబాదునుండి ఎవరో సరిగా తెలుగు రాని వ్యక్తి వస్తుంటే – విశాలాంధ్ర లో గత ఏడాది వచ్చిన కవిత్వ సంకలనాలు పట్టుకురమ్మని పురమాయించాను. అలా వచ్చి పడిన పుస్తకమే – ‘మరో మజిలీకి ముందు’.

‘నేటి కాలపు కవిత్వం’( 2002) -అన్న నా విమర్శా వ్యాసంలో నేను రాసిన నాలుగు వాక్యాలు:
‘ముకుందరామారావు గారి “మరో మజిలీకి ముందు” చాలా నిరాడంబరంగా, సాంధ్య తారలా సున్నితంగా ఆకట్టుకొంటుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం, పూలు, వర్షం, ఆకాశం, సంబంధ బాంధవ్యాలు అన్నీ ఒద్దికగా ఒక చోట నిలిచి చేర బిలుస్తాయి. అనుభవజ్ఞుడైన గృహస్థులా ఈయన దేన్నీ దుబారా చేయడు. మాటలు, భావాలు, పదచిత్రాలు అన్నీ సరిగ్గా అమరుతాయి. తనకు తెలిసిన ప్రపంచాన్ని మనముందు దృశ్యమానం చేస్తాడు.’

‘ఏకాంత వేళ’ అన్న కవితలో

‘గతాగతాలు
ఊహాతీత ఉదయాలు
ఆలోచనంతా పాకిన
అల్లకల్లోల ప్రశాంతం
దినాంతపు ఏకాంతం చీకటి.’

అటువంటి “దినాంతపు ఏకాంతం చీకటి” లో నుంచి బయల్దేరి ఎన్నో మజిలీలు చేశారు. వారి జీవితంలో మొదటి మజిలీ కవిత్వం అనుకుంటే రెండవ మజిలీ అనువాదం. రెండు మజిలీల అనుభవాలను స్వీయ చరిత్రగా రాసుకొమ్మని నేను చాలా కాలంగా వారికి సూచిస్తున్నాను.

2.

నేను ఇండియా లో ఉండగా నాకు దొరకని పుస్తకాల చిట్టా ఒకటి ఉండేది. అమెరికా వచ్చాక, ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని అమెజాన్ లో దొరకని పుస్తకమే లేదు. ఆ రకంగా, పుస్తకాలు పలకరించని రోజంటూ ఒకటి ఉండేది కాదు. నా స్నేహితుడు – ‘ఇవన్నీ ఎక్కడ సర్దాలి రా బాబు’ అని విసుక్కునే దాకా వచ్చింది. నాకు నచ్చిన కథలు, కవితలు అనువాదం చేసే అలవాటు నాకు చదువుకునే రోజుల నుండి ఉంది. ఒక రచయిత అంతరంగం అనువాదకుడికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ఒక కవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిష్ఠగల అనువాదకుడు వినగలడు. ఆ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన కవితలు తెలుగులోకి రాలేదు అన్న విషయాన్ని గుర్తించి – ఒక ప్రణాళిక వేసుకుని- అనువదించాలి అనుకున్న ఒక పది మంది కవులు: జింబోస్కా, స్టిక్ నీ, రిల్కే, కవాపీ, నెరుడా, సెలాన్, బ్రాడ్ స్కీ, మొంటాలే, బషో, ఇస్సా, బుసాన్. అందునా నేను పెట్టుకున్న నియమం: వారి కవిత్వం, శైలి, వారి కవిత్వాలపై వచ్చిన విమర్శ, పరామర్శలు, జీవిత చరిత్రలు, దేశకాల పరిస్థితులు, సమస్తమూ సమగ్రంగా అధ్యయనం చేసి గాని ముగ్గులోకి దిగరాదు.

ఒక కవిని మూలవిధేయంగా అనువదించాలంటే ఆ మాత్రం పరిశ్రమ అవసరం. ఆంగ్లేతర భాషల కవిత్వం అనువదించేటప్పుడు – తప్పనిసరిగా మూలంతో అనువాదాలు తరచి చూడాలి. కారణం, జర్మన్ లాంటి శబ్దాధిపత్యం నెరిపే భాషల ఇంగ్లీషు అనువాదాలు తేలిపోతాయి. కాబట్టి, మూలాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మూలంలో నడక తెలుగులో వచ్చి తీరాలి. రిల్కే, స్టిక్ నీ లాంటి వారు అల్పాయుష్కులైనా, ఎంతో లోతైన కవులు- వారు రాసిన Sonnet లు శబ్ద వైభవంతో, అర్థ గౌరవంతో అలరారుతుంటాయి. తెలుగు కావ్యభాషలో పట్టు రావాలే గాని, ప్రపంచంలోని అనువైన ఏ కవితనైనా, ఏ నడకలోనైనా తెలుగులోకి దించవచ్చు. ఈ నియమాలకు లోబడినప్పుడు, మన అనువాదాల్లో దోషాలను సులభంగా పరిహరించవచ్చు. ప్రతి కవిత అనువాదానికి లొంగదు, ఎంతో కష్టపడి చేసిన అనువాదం తేలిపోవచ్చు. అటువంటి దోషాలతో కూడుకున్న అనువాదాలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలి. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్న చందంగా పరిపుష్టమైన అనువాదాలు సాధ్యం.

ఈ అనువాదాలు ధారావాహికంగా ( 2001-2003) ఈమాట లో వస్తుండేవి. మరొక వైపు, నేను Tao Te Ching చైనీస్ అనువాదాల్లో తలమునకలుగా ఉన్న సమయమది. ఆ కాలంలో రామారావు గారితో పరిచయం కాస్త స్నేహంగా మారింది. వీటన్నిటిని చూసి వారికి లేశమాత్రం ప్రేరణ కలిగి, తర్వాత అనువాద మార్గంలో పడ్డారు. నాకు బాగా గుర్తుంది, Billy Collins కవితలు కొన్ని అనువదించారు. బిల్లీ కొలిన్స్ తో గొడవేమిటంటే యుక్తి, హాస్యోక్తి, అభివ్యక్తి అన్నీ బావుంటాయి గాని, ఆ ఆధునిక స్వరాన్ని తెలుగులోకి దించడం అంత సులువు కాదు. రామారావు గారు న్యూయార్క్ లో ఉన్నప్పుడు నానా దేశాల కవిత్వాలు, వాటి అనువాదాల్లో మంచిచెడ్డలు – ఇటువంటి విషయాలు మేమిద్దరం చర్చించుకునే వారము. వారి కవితా సంకలనం “ఎవరున్నా లేకున్నా” ( 2004) కు కలిసి కవితలు ఎంపిక చేయడం నా స్మృతి పథంలోంచి ఇంకా చెరిగిపోలేదు.

3.

రామారావు గారు డిసెంబర్ 2006 లో పదవీవిరమణ తీసుకున్నాక, సాహిత్యపరంగా ఎన్నో పనులు చేయగలిగారు. ముఖ్యంగా ‘అదే ఆకాశం’ (2010) తో అనువాదరథాన్ని సాహిత్య పథంలో ప్రవేశపెట్టారు. ఒక పుష్కర కాలంలో భూనభోంతరాలు నిండిపోయేలా అనువాదాలు చేశారు – ఒకటా రెండా? తెలుగులోకి రాని భాష లేదు, ప్రాంతం లేదు, కేవలం అనువాదాలే లేదు – కవుల చుట్టూ, కవితల చుట్టూ ఉన్న భోగట్టాను పట్టుకొచ్చారు. సామాన్య తెలుగు పాఠకునికి అనువాదాలను చేరువ చేశారు. పంచ భూతాలను అనువాదంలో భాగం చేశారు. సహజంగా వారు భాషల్లో నిష్ణాతులు బెంగాలీ, హిందీ తెలుగుతో సమానంగా మాట్లాడగలరు.. ఆంగ్లమా సరే సరి, ఏ భాషలోనైనా, తమ అనుభవాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు. అంతే కాకుండా – సహానుభూతి వారిలో సజీవంగా ఉంది. కావున, ఇతర కవుల్లోకి పరకాయ ప్రవేశం చేసి, వారి రంగుల ఊహలను, చీకటి లోతులను తెలుగు చేయగలిగారు. అనువాదాల నాణ్యత పెంచుకోవడానికి వారు ఎంతో కృషి చేశారు. ‘చర్యా పదాలు’ అనువాదాలు చేస్తున్నప్పుడు అస్సామీ భాష బాగా వచ్చిన నా స్నేహితుడు గరికపాటి పవన్ కుమార్‌ను సంప్రదించారు. టాగోర్ తన స్వంత చిత్రాలకు రాసుకున్న 16 కవితలు (నమ్హారా రేఖాపథ్ బెయె) 2009 లో బయటపడ్డాయి. అదే సంవత్సరం, విశ్వభారతి ప్రచురించింది. రామారావు గారు వాటిని కనుగొని – తెలుగులోకి అనువదించి సమీక్షార్థం, బెంగాలీ మూలంతో సహా నాకు పంపించారు. సాహిత్య ప్రపంచంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు వారి దృష్టినుండి తప్పించుకోలేవు. తాము చేసిన అనువాదాలను ఆఖరు అని వారు ఎప్పుడూ భావించలేదు, ఇతరులకు పంపి అభిప్రాయం కనుగొనేవారు. అవసరమైన చోట్ల తగు సవరణలు చేసుకొనేవారు.

ఈ సందర్భంలో, ఆంగ్లంలోకి అవలీలగా తెలుగు కవిత్వాన్ని, వచన రచనలను అనువాదం చేసిన కేశవరావు గారిని స్మరించుకోవాలి. అనువాదాల విషయంలో ఆయన ధోరణి ఎంతో శాస్త్రీయం, ఇతరుల సూచనలో గుణం ఉంటే బేషరతుగా స్వీకరించేవారు – దాని వల్ల అనువాదం బాగుపడితే అంత కన్నా కావలసినది ఏముంది అనేవారు. తెలుగులో అనువాదకులకు పెద్ద గుర్తింపు లేదు. అనువాద పుస్తకాలు వేసే నాథుడే లేదు. ఇస్మాయిల్ గారి అనువాదాలు (Tree, My Guru) పుస్తకరూపంలో రావడానికి ఎంతో కాలం పట్టింది. ‘వలసపోయిన మందహాసం’ ను కేశవరావు గారు ‘The Smile That Migrated And Other Poems’ గా అనువదించారు. ఆ రకంగా రామారావు గారి కవిత్వం కూడా ఎక్కువమంది చదవగలిగారు. ఆ సందర్భంలో, ప్రఖ్యాత సాహిత్య పత్రిక – Indian Literature సంపాదకులు రామారావుగారి కవిత్వం గురించి విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

“Mukunda Ramarao’s poetry is primarily meditative: the poet meditates on nature, art, human relationships, aging, time and death in his characteristically crisp and suggestive style shorn of excessive ornamentation and flamboyant imagery. There is wisdom in these poems and robustly lean language of detachment fit to express the poet’s philosophy of life.” – K. Satchidanandan

“Mukundaramarao’s poems are brief, packed, stimulating and metaphysical. They are replete with myriad feelings and images. It is a pleasure and profit to read his poems”. D. S. Rao

జీవితంలో ఒక సగం ఉద్యోగం, కుటుంబం, పిల్లలు బాధ్యతలు లాంటి వాటిల్లో తలమునకలుగా ఉన్నా – రెండవ సగాన్ని కవిత్వం, అనువాదాలకు వెచ్చించి – ఇరు వ్యాసంగాల్లో జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం గొప్ప విషయం. వారి 80వ పుట్టినరోజుకు ముందు, వారి కృషికి ‘అజోవిభో ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం’ లభించడం మాలాంటి చిరకాల మిత్రులకు ఎంతో ఆనందదాయకం.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

 ...