ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!
Category Archive: వ్యాసాలు
నేను ఉదహరించబోతున్న కవిత్వ పద్ధతులు కేవలం సూచన ప్రాయమే, స్థాలీపులాకమే అని గమనించండి. ఈ ఉదాహరణలు ఇవ్వడం మీకు ఇటుకలు పేర్చడం చూపించడం వంటిది. ఆపైన మీరు పదాలు ఎలా పేరుస్తారు అన్నది మీకే ఒదిలేస్తున్నాను. ఈ ఉదాహరణలు అలానే పాటించవచ్చు, లేదూ ఏ కొన్ని పద్ధతులైనా మిశ్రమించి ఒక కొత్త కవితాపద్ధతి మీరు సృష్టించవచ్చు. మీ సృజనే మీ దారిదీపం. మీ కవిత్వ కాంక్షే మీకు కాలిబాట.
కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ఈమాటలో ప్రతిపాదించాను. ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే అని, ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.
ఈ ప్రయత్నం అంతా ఎందుకు? అంటే లిఖిత గ్రంథానికి తోడుగా వేరే పాఠ్యగ్రంథం ఉంది అని గుర్తిస్తే ఫలితాలు ఎలా వుంటాయో చూడ్డానికి. తెలుగులో, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలో, పాఠ్యగ్రంథానికే ప్రామాణిక గౌరవం, లిఖిత గ్రంథానికి కేవలం ఆనుషంగిక గౌరవం వున్నాయి. ప్రామాణికమైన గురువుగారు తనకి కంఠస్థంగా వున్న పాఠం చెప్పినప్పుడు శిష్యులు లిఖిత ప్రతిలో వేరే పాఠం వుంది అని చూపిస్తే ఆయన తనకి కంఠస్థంగా వున్న పాఠాన్నే ప్రామాణికంగా చెప్తాడు. లేఖకుడికి పాఠాలు చెప్పే గురువులకున్న ప్రామాణికత లేదు.
గంగనార్యుడు, పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా పద్యాన్ని కదనుతొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువుతీరింది. అనువాదకళలో మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.
జీవి నాడిని పట్టి జీవతత్త్వాన్ని ఒక డాక్టరు ఎట్లా గ్రహిస్తాడో చేరా తెలుగు భాషా తత్తాన్ని ఇంకా చెప్పాలంటే ద్రావిడ భాషా తత్త్వాన్ని నామ్నీకరణాలతో ఆవిష్కరిస్తారు. విభక్యర్థక నామ్నీకరణంలో ఏయే నామాలు సాధ్యమో, నామ్నీకరణ ప్రక్రియల్లో నామ విభక్తుల లోపాన్నిబట్టి అంతరువులు ఉన్నాయని ఏడవ దశకంలోనే నిరూపించిన ఘనత ఆయనది.
చెడును మరవటం, మంచిని తలవటం – ఒకరి విషయంలో; మంచి గుర్తించక పోవటం, చెడును వెతికి కెలకటం – మరొకరి విషయంలో; ఎందుకు జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? అన్నది ప్రశ్న. వీటిల్లో ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పే ప్రమాణాలు ఎవరు రూపొందించారు అన్న విచికిత్స లేకుండానే మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన దిగులు కాళోజీది.
దుర్భిణిని అంతరిక్షంలో ఉంచటం వల్ల చాల లాభాలు ఉన్నాయి. భూమి వాతావరణం వల్ల చెదరకుండా ప్రతిబింబాలు ఖణిగా కనిపిస్తాయి. నక్షత్రాల దగ్గర బయలుదేరిన విద్యుదయస్కాంత తరంగాలలో కొన్ని భూమిని చేరలేవు కనుక మన దుర్భిణిని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి.
రెండు దక్షిణ భాషల సాహిత్య సంపద ఈ శార్దూలవిక్రీడితములో ఒక కవి చేసిన ఒక చిన్న మార్పుతో ముడివేయబడినది. పడమటి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి సత్యాశ్రయుని కాలములో రవికీర్తి అనే ఒక కవి ఆ రాజును పొగడుతూ వ్రాసిన పద్యములు ఐహొళె శిలాశాసనములలో ఉన్నాయి. ఇది క్రీస్తుశకము 634 కాలము నాటిది.
దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటే బాగుంటుంది కాని దేశంలో ఉన్న కులాలు అన్నీ, ‘ఎవరి కులం వారి ప్రధాన మంత్రి వారికే’ అంటూ, కులానికొక ప్రధాన మంత్రి కావాలంటే ఏమి సబబు? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ద్యోతకమయే దృగ్విషయాలని అన్నిటిని ఒకే ఒక సిద్ధాంతంతో అభివర్ణించగలిగితే బాగుంటుందనేది శాస్త్రవేత్తల చిరకాల వాంఛ.
బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగ పడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిర్శకంగా పరిశీలించి బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.
“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్,” అన్నాడో సినీకవి. అయితే, అనేక మానవ సమాజాల్లో కుడిచెయ్యిని మంగళప్రదమైనది గానూ, ఎడమచెయ్యిని అమంగళకరమైనదిగా భావించడం కనిపిస్తుంది. ఎన్నో ఇండో-యూరోపియన్ భాషలలో కుడిచేయి అంటే దక్షిణహస్తం అని, దక్ష- అంటే నేర్పుగల (dexterous), బలం కలిగిన- చెయ్యి అన్న అర్థాలున్నాయి. లాటిన్ భాషలో ఎడమ అన్న అర్థంలో వాడే పదం sinister. అదే పదానికి వక్రమైన-, చెడ్డ, దుష్ట- అన్న అర్థాలున్నాయి.
అయినా నిరీక్షించడమంటే ఏమిటో మనకు తెలియనిది కాదు. దేనికోసం ఎవరెవరం ఎదురుచూస్తున్నామో అదే వచ్చేస్తే మనమంతా తప్పకుండా భంగపడేవాళ్ళం. అది ఆదర్శరాజ్య మైనా, కమ్యూనిస్టు సమాజమైనా, సాంస్కృతిక విప్లవమైనా సరే. అయినప్పటికీ, ‘నిరీక్షించువారు ధన్యులు. వారికన్నియును నొసగబడును,’ అని చెపుతూనే ఉంది. కొత్తదో, పాతదో ఓ నిబంధన గ్రంథం.
తెలుగు సాహిత్యపు ఛందోగగనములో మిక్కిలి ప్రకాశవంతముగా మెరిసే మినుగుతార కందపద్యము. ఒక చిన్న పద్యములో అనేకానేక భావములను సంతరించుకొనే శక్తి సామర్థ్యములు గలిగిన పద్యము కందపద్యము. ఇట్టి కంద పద్యపు పుట్టు పూర్వోత్తరాలను, అందచందాలను, భూతభవిష్యత్తులను నా శక్తి మేరకు ఈ రెండు వ్యాసములలో తెలిపినాను.
అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు.
నాకు వెండీ డానిగర్ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది.
క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు.
సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు.
సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు.