ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

1. ప్రవేశిక

ఆంధ్రులు ప్రాచీన కాలంనుంచి నివసించిన ఏక భూఖండమే నేటి ఆంధ్రప్రదేశ్‌. దీని విస్తీర్ణం దాదాపు రెండు లక్షల డెబ్భై యేడు వేల చదరపు కిలోమీటర్లు. ఇందు నివసించే ఆంధ్రుల జనాభా నేడు సుమారు ఎనిమిది కోట్లు. మొదటిసారిగా ఆంధ్రపదం జాతిని సూచించేదిగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఇది క్రీస్తు పూర్వపు శతాబ్దాల్లో వెలసిన గ్రంథం కాబట్టి ఆంధ్రజాతి ఆనాటికే ఉన్నట్టుగా మనం నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ కథనం ప్రకారం ‘‘ఆంధ్రజాతి బలమైన జాతి. వాళ్ళకు చుట్టూ ప్రాకారాలు కలిగి బురుజులతో శోభించే పటిష్ఠమైన 30 పట్టణాలుండేవి. ఒక్కొక్క పట్టణంలో లక్ష కాల్బలం, 2000 అశ్విక బలం, 1000 గజ బలం ఉండేవి’’ అని రాశారు. ఇంకా అశోకుని ధర్మ శాసనాలలో వాయు పురాణంలో, రామాయణ భారతాది పురాణాలలో ఆంధ్రజాతి ప్రసక్తి ఉంది.

క్రీస్తు శకం 340కు చెందిన మల్లిదేవ నందివర్మ దాన శాసనంలో ‘ఆంధ్రమండలే ద్వాదశ సహస్రనామ సంపాదిత సప్తార్థ లక్ష విషయాథిపత్ణే’ అని ఉంది. అందులో ఆంధ్రమండలే అంటే ఆంధ్రదేశమనే మనం భావించడం సముచితం. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఆంధ్రరాష్ట్రం నేడు తెలంగాణ, కోస్తాంధ్రా, రాయలసీమ అను మూడు విభాగాలుగా ఇరువది మూడు జిల్లాలతో తెలుగు మాతృభాషగా విరాజిల్లుచున్నది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గండ, ఖమ్మం జిల్లాలు, కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. మన భాషకు ఆంధ్రం, తెనుగు, తెలుగు, అను పర్యాయ పదాలున్నట్టు భాషా పరిశోధకులు నిర్ణయించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఆంధ్రప్రదేశ్‌ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. ఐతరేయ బ్రాహ్మణ కాలంనుంచి నేటివరకు ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, కళలు మొదలగు వానిని సమగ్రంగా పరిశోధిస్తే మన ఆంధ్రజాతి ఔన్నత్యం తేటతెల్లమౌతుంది. అదేవిధంగా బుగ్వేద కాలానికి పూర్వమే ‘సంగీత’ స్వరాల ఆవిర్భావం జరిగినట్టు తెలుస్తున్నది. సామవేద కాలానికి అవి పూర్ణ స్వరత్వాన్ని పొందాయి. ‘గరసనిద’ అనే పంచస్వరాలతో గ్రామం అని వ్యవహరించబడ్డాయి. కాలక్రమంలో ‘సరిగమపదని’ అనే సప్తస్వరాలు రూపుదిద్దుకన్నాయి. ఈ స్వరాలే సంగీతానికి జవము, జీవమై నాటికి నేటికి రేపటికి వైజయంతికలవుతున్నాయి. భరతుడు, నారదుడు, మతంగుడు, మమ్మటుడు, పార్శ్వదేవుడు, చాళుక్య సోమేశ్వరుడు, సోమనార్యుడు, జాయాప సేనాని, శారదేవుడు, సింహభూపాలుడు, గోపాల నాయకుడు, హరిపాలదేవుడు, విద్యారణ్యుడు, కుమారగిరి వసంతరాజు, పెదకోమటి వేమారెడ్డి, గోపేంద్ర తిప్ప భూపాలుడు, చతుర కల్లినాథుడు, అన్నమాచార్యుడు, పురందరదాసు, భండారు లక్ష్మీనారాయణ, రామామాత్యుడు, అహోబల పండితుడు, సోమనాధుడు, చతుర దామోదరుడు, పుండరీక విఠలుడు, మాధవభట్టు, భావభట్టు, గోవింద దీక్షితుడు, వేంకటమఖి, గోవిందామాత్యుడు, జయదేవుడు, లీలాకుశుడు, పురందరదాసు, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు, పెదకెంపరాయడు, శివనారాయణ తీర్థులు, సిద్ధేంద్రయోగి, కంచెర్ల గోపన్న, క్షేత్రయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, రఘునాథ నాయకుడు, పసుపులేటి రంగాజమ్మ, మన్నారు దేవుడు, కంఠీరవరాజు, శ్రీధర వేంకటేశార్యుడు, రామస్వామి దీక్షితులు, త్యాగరాజు, ముద్దస్వామి దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్ధప్ప, ఎడ్ల రామదాసు, ఆదిభట్ల నారాయణదాసు, తుమరాడ సంగమేశ్వర శ్రాస్తి, బాలమురళీకృష్ణ, ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి తదితరులు సంగీత సరస్వతిని అర్చించి తరించారు. ‘సంగీతమపి సాహిత్యం సరస్వతీ స్తనద్వయం’ అన్నారు. సంగీతాన్ని వదలి సాహిత్యం, సాహిత్యాన్ని వదలి సంగీతం మనుగడ సాగించలేవు. ఇవి రెండూ కూడా ప్రధానమైన కళలే. సంగీతానికి సాహిత్యం తోడై ప్రదర్శింపబడునదే రంగస్థల కళారంగం. ఆంధ్రజాతి ఎంత ప్రాచీనమైనదో కళలు కూడా అంతే ప్రాచీనమైనవి.

2. కళ

సౌందర్య తృష్ణను వ్యక్తీకరించుట ద్వారా కళ ఏర్పడినది. కళావిర్భావమునకు మానవునిలోని పంచమయకోశాలలో ఆనందమయ కోశము మూలము. కళలు మిగిలిన వస్తువులు ఇవ్వలేని ఉదాత్తమైన అనుభూతిని, అలౌకికమైన ఆనందాన్ని మనకు ఇచ్చుచున్నవి. ప్రకృతి పరిమాణమే భగవంతుని కళ. అది అనుకరణ ఫలము. కళకు భావ వ్యక్తీకరణమే గమ్యము. కళలు 64గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్ఠి కళలంటారు. అవి వరుసగా: 1. గీతం, 2. వాద్యం, 3. నృత్యం, 4. అలేఖ్యం, 5. విశేష కచ్ఛేద్యం, 6. పుష్పాస్తరణం, 7. తండుల కుసుమబలి వికారం, 8. దశనవ సనాంగరాగం, 9. మణి భూమికా కర్మ, 10. శయన రచనం, 11. ఉదక వాద్యం, 12. ఉదకాఘాతం, 13. చిత్రయోగాలు, 14. మాల్య గ్రథన వికల్పాలు, 15. శేఖర కాపీడయోజనం, 16. నేపధ్య ప్రయోగాలు, 17. కర్ణపత్ర భంగాలు, 18. గంధయుక్తి, 19. భూషణ యోజనం, 20. ఇంద్రజాలం, 21. కౌచుమారం, 22. హస్తలాఘవం, 23. వంటకాలు, 24. సూచీవాన కర్మ, 25. సూత్ర క్రీడ, 26. వీణా డమరుక వాద్యాలు, 27. ప్రహేళికలు, 28. ప్రతిమాల, 29. దుర్వాచక యోగాలు, 30. పుస్తక వాచనం, 31. నాటకాఖ్యాయికా దర్శనం, 32. కావ్య సమస్యా పూరణం, 33. పట్టికా వేత్ర వాసవికల్పాలు, 34. తర్కు కర్మలు, 35. తక్షణం, 36. వాస్తువిద్య, 37. రూప్యరత్న పరీక్ష, 38. ధాతువాదం, 39. మణిరాగాకర జ్ఞానం, 40. వృక్షాయుర్వేద యోగాలు, 41. మేష కుక్కుట లావట యుద్ధ విధులు, 42. శుకశారికా ప్రలాపాలు, 43. ఉత్సాదనే, సంవాహనే, కేశమర్దనేచ కౌశలం, 44. అక్షర ముష్టికా కథనం, 45. మ్లేచ్చిక వికల్పాలు, 46. దేశభాషా విజ్ఞానం, 47. పుష్పశకటిక, 48. నిమిత్త జ్ఞానం, 49. యంత్రమాతృక, 50. ధారణ మాతృక, 51. మానసీక్రియ, 52. సంపాఠ్యం, 53. కావ్యక్రియ, 54. అభిధానకోశం, 55. ఛందోజ్ఞానం, 56. క్రియాకల్పం, 57. చలితక యోగం, 58. వస్త్రగోపనం, 59. ద్యూతవిశేషాలు, 60. ఆకర్షక్రీడం, 61. బాల క్రీడనకాలు, 62. వైనయికే జ్ఞానం, 63. వైజయికీ విద్యలు, 64. వ్యాయామికీజ్ఞానం. వీటిని వాత్సాయన ముని తన కామశాస్త్రంలో వివరించాడు. వీనిలో కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రకళ, శిల్పం అనువానిని లలిత కళలంటారు. పాశ్చాత్యులు. వీనిని Fine Arts అన్నారు. మనోహరత్వం, విశ్వజనీనత, అనుకరణం అనునవి లలితకళల ధర్మాలు. చిత్రకళ, శిల్పకళలు దృశ్యకళలు, సంగీతం, కవిత్వం శ్రవ్యకళలు, నాట్యం ఉభయ ప్రయోజనము కలది.

3.రంగస్థలం

రంగస్థలమనగా వేదిక అని అర్థం. పూర్వం జరిగిన వృత్తాంతాన్ని గాని, ప్రస్తుతం జరుగుచున్న విషయాలను గాని, జరుగబోవు విషయాలనుగాని ఆట – పాట ద్వారా ప్రేక్షకుల మనోఫలకంపై చెరగని ముద్రవేయు కళారంగ ప్రదేశమే రంగస్థలం. ప్రదర్శన విషయం సాంఘిక, ఆర్థిక, చారిత్రక, పౌరాణిక, రాజకీయ తదితరాలలో ఏదైనా కావచ్చును. విషయానికి తగినట్టు వేదిక అలంకరణ ఉండాలి. ఆహార్యం, అభినయం, సంగీత వాద్యాలు, స్పష్టమైన వాచికం ఉండాలి. అప్పుడే ఆ కళ రక్తిగడుతుంది. పాశ్చాత్యులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మన పూర్వులు వివిధ కళలను సృష్టించి పోషించారు. సర్వకళల సృష్టికర్తలు పోషకులు నాడు నేడు రేపటికి కూడా జానపదులే. ఉన్నత వర్గాల వారు కళలను విని చూచి తరిస్తారు. మధ్య తరగతి, పేదవారు కళలను అనుసరించి, కళలలో జీవించి తమ జీవితాలను కళలకే అంకితం చేస్తున్నారు. వీరిని స్థూలంగా జానపదులు అనవచ్చు.

4.జానపదులంటే?

‘జానపదుల్‌ పురీ జనుల్‌’ అన్నాడు ఎర్రన. ‘జనపదం’ అంటే ఒకప్పుడు పల్లెటూరు అని అర్థం. అందులో నివసించు వారు జానపదులు. వారికి సంబంధించిన విజ్ఞానమే జానపద విజ్ఞానం. ఇందులో వారికి సంబంధించిన వాఙ్మయమే గాక జానపదకళలు, భాష, నృత్యం, సంగీతం, నాటకం, జానపద వైద్యవిధానం, జానపదుల ఆచార వ్యవహారాలు, వేషభూషణములు, సాహిత్యం మొదలైనవి అన్నియు జానపద విజ్ఞానంలో చేరును. పురాణ ప్రబంధాదులు శిష్టసాహిత్యమందురు. ఇవి నాగరికులలో పండిత లోకంలో పుట్టి ప్రచారం పొందును. జానపద సాహిత్యం మాత్రం సామాన్య జనులలో పుట్టి ప్రచారం పొంది జీవించును. శిష్టసాహిత్యం కంటే జానపద సాహిత్యమే ముందుగా పుట్టినది. శిష్టసాహిత్యంలో జానపద సాహిత్య ప్రస్తావన కనిపిస్తుంది. ఆదికవి నన్నయ మూలభారతంలో లేకున్నను ఆంధ్రమహా భారతంలో ‘నాగ గీతముల’ను పేర్కొన్నాడు.

నీ గుణములు దొల్లియు
నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమును జూడఁ
గంటిని, భాగీరధియందు నిన్నుఁబరహిత చరితా.
(ఆంధ్రమహాభారతము- ఆదిపర్వము – అష్టమాశ్వాసము – 131వ పద్యము.)

అటు తరువాత కాలంలో శిష్టకవులెందరో జానపదుల వాఙ్మయాన్ని ప్రస్తావించారు. ఇచ్చట వారందరిని ప్రస్తావించుట అప్రస్తుతమని భావించి మచ్చుకు నన్నయను మాత్రమే ఉటంకిస్తున్నాను. నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేది జానపద కవిత్వం. సంతోషం, విషాదం, కరుణ, శృంగారం తదితర మానసిక భావాలను వెలిబుచ్చడానికి, పనిపాటలు చేసుకొనేటప్పుడు కలిగే శ్రమను మరిచిపోవడానికి, తీరిక సమయాల్లో వేడుకల్లో సంబరాల్లో పాడుకునే పాటలు, కథాగేయాలూ వంటివి జానపద కవిత్వ శాఖలోకి వస్తాయి. నైసర్గికంగా భావ ప్రకటన ఆధారంగా వెలువడుతుంది కాబట్టి జానపద కవిత్వానికి ఛందోబంధాలూ, అలంకార సంప్రదాయాలూ అడ్డురావు. జానపద కవిత్వం మౌఖికము, ఆశువుగా పుట్టడం. లయ, అను లక్షణాలను ప్రధానంగా కలిగియుంటుంది. జానపద సాహిత్యం దృశ్య రూపమైన ఆకృతిని పొందినప్పుడు అది నాట్యం, నృత్యం, నాటకం, శిల్పం తదితర కళలుగా రూపాంతరం చెందుచున్నది. మన భారతదేశం సకల కళలకు కాణాచి, అందులో ఆంధ్రదేశం ఎన్నో కళలకు జన్మస్థానమై విరాజిల్లుచున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సంగీత రంగస్థల కళారంగాన్ని నాటినుంచి నేటి వరకు పర్యావలోకనం చేయుట ప్రస్తుత వ్యాస ఉద్దేశము.

5.రంగస్థలంపై జానపదుల కళలు

జానపద సంగీతం, నృత్యం, రూపకమూ అనునవి రంగస్థలంపై జానపదులు ప్రదర్శించు కళలలో ముఖ్యమైనవి. ఈ కళల ప్రదర్శనలో స్థల కాలాల్లో స్వల్ప తేడాలుంటాయి. కళాసృజన మానవ సహజం. నాగరికుల్లోనూ అనాగరికుల్లోనూ జ్ఞానపదుల్లోనూ, జానపదుల్లోనూ ఈ లక్షణం స్వతస్సిద్ధంగానే ఉంటుంది. జానపదుల కళాభేదాలు ఎంత ప్రాచీనమైనపో అంత వినూత్నమైనవి కూడా. వీరి కళల సెలయేర్లు ఎన్ని నాగరికతలకు మూలకేంద్రాలయ్యాయో మన ఊహకందవు. జానపదుల ప్రతిమాట, ప్రతి కదలిక కళారూపమేననుటలో సందేహించాల్సిన అవసరం లేదు.

అ) జానపద సంగీతం: వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయకంగా ప్రజా సముదాయంలో ప్రచారం పొందినది జానపద సంగీతం. అరువది నాలుగు కళల్లో సంగీతం విశిష్ఠమైనది. ఇది జానపదుల్లో సామూహికంగా వికాసం పొందిన కళగా భావించవచ్చు. శిష్ట సంగీతానికి సంకీర్తనకారులుంటారు. అయితే జానపద సంగీతం మాత్రం అందరి సొత్తు. శిష్టసంగీతం కంటే ఇది చాలా సరళమైనది. దీనికొక ప్రామాణిక కొలబద్ద లేదు. వివిధ తాళాలతో జానపద సంగీతాన్ని పాడుదురు. ఏదైనా తంత్రీవాద్యమో, చర్మవాద్యమో ఉంటే చాలు. వీటిద్వారా వారు పరమానందాన్ని పొందుదురు. వాద్యసంగీతం, గాత్ర సంగీతమని జానపదుల సంగీతం రెండు విధాలుగా ఉంటుంది. జానపదుల వాద్యాలు తంబుర, మృదంగం, వీణ, ఫిడేలు, నాదస్వరం, తంతార, ముఖవీణ, శంఖం, గంట, నగారా, జేగంట, భేరి, దుందుభి, ఏకనాదరి, కొమ్ము, పిల్లనగ్రోవి, డప్పు మొదలగునవి ఉన్నాయి. ఇవన్నీ వాద్యసంగీతం కోవకు వస్తాయి. జానపద కళాకారుడు ఆయా వాద్యాలకు అనుగుణంగా తన గాత్రంతో గానం చేస్తాడు. వీరి గాత్రగానానికి వాద్యం తోడైతే బంగారానికి తావి అబ్బినట్టు – ఉంటుంది. జాతరలు, రథోత్సవాలు, వివాహాది శుభకార్యాలు, చావు, రాజకీయ ఊరేగింపు తదితర కార్యక్రమాలలో జానపదులు తమ సంగీత ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శిస్తారు. జానపద సంగీతం సామాజిక స్పృహతో వెలువడుతుంది. జానపదులు సంతోషాన్నో, దు:ఖాన్నో వ్యక్తం చేయడానికి కూనిరాగాలు తీసిననాడే సంగీతం పుట్టుకకు కారణమై ఉంటుంది. తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల వారు, బవనీలు, జక్కులవారు, బొమ్మలాటకాండ్రు, జానపద సంగీతాన్ని గాత్ర సంగీత రూపంగా కాపాడుతున్నారు. తమ సంగీత పరికరాలను వారే తయారు చేసుకొనుట విశేషం.

జానపదుల సంగీతాన్ని ‘ఇంట్లో సంగీతం, బయట సంగీతం’ అని రెండు విధాలుగా విభజించవచ్చు. పొద్దున మజ్జిగ చిలుకుతూ స్త్రీలు పాడే పాటల్లో, పూజ ముగిసిన తర్వాత పాడే మంగళహారతులు, పిల్లలను నిద్రపుచ్చటానికి పాడే లాలి. జోల పాటలు ఇంట్లో సంగీతానికి, వరికోత సమయంలో, కపిలె తోలునప్పుడు, బరువులు మోయునప్పుడు తదితర సందర్భాల్లో పాడేపాటలు బయట సంగీతానికి ఉదాహరణలు. జానపదుల సంగీతంలో పల్లవి ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథా గేయాలు గాయకులు ఆలపించునప్పుడు పల్లవి గొప్ప ఊపునిస్తుంది. బొబ్బిలి యుద్ధం, రాణి రుద్రమ దేవిగాథ మొదలగునవి ఆలపించునప్పుడు పల్లవి గాయకుల్లో ప్రేక్షకుల్లోను గొప్ప రసానుభూతిని కలిగిస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి’ అను పెద్దలమాట శిష్టుల, జానపదుల విషయంలో శిలాక్షర సత్యంగా నిలుస్తున్నది. వినోదానికి, విజ్ఞానానికి, ప్రజాచైతన్యానికి, ప్రజా ఉద్యమాలకు జానపద సాహిత్యం పెట్టనికోట వంటిది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి జానపద బాణీల్లో గేయాలద్వారా ప్రచారం చేస్తున్నది. కుటుంబ నియంత్రణ, పొదుపు మొదలగు కార్యక్రమాలు దీనికి ప్రబల ఉదాహరణలు. విశ్వవిద్యాలయాల్లో, రాజకీయ సభల్లో జానపద గేయాలను వినోదానికి ఆలపిస్తున్నారు. సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించడానికి ప్రజలను చైతన్య పరచుటకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పాటలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలైన రోడ్డు రవాణా సంస్థ, ఆప్కో తదితర యాజమాన్యాలు ప్రజా సమూహాన్ని చైతన్యపరచి తమ సంస్థ సదుపాయాలను ఉపయోగించుకోవాలని బహుళ ప్రచారం చేస్తున్నాయి. సామాన్య జనాన్ని దళితులను ఆకర్షించి తమ ఉద్యమం వైపు తిప్పుకోవడానికి విప్లవ సంస్థలు కూడా జానపద గేయాలను పాడుతున్నాయి. మాన్యుల నుంచి సామాన్యుల వరకు, పండితుల నుంచి పామరుల వరకు, ఆబాల గోపాలాన్ని ఆకర్షించి చైతన్యపరచే శక్తి యుక్తి జానపద గేయ సంగీతానికే ఉన్నదనుట నిర్వివాదాంశం.

నేడు ప్రజా గాయకుడైన గద్దర్‌, వంగపండు ప్రసాదరావు, వందేమాతరం శ్రీనివాస్‌, గోరటి వెంకన్న, గూడ అంజయ్య తదితరులకు ప్రజలు నీరాజనాలు అర్పించుటకు వారు ఎన్నుకున్న జానపద గేయ బాణీలే ప్రధాన కారణం. జానపద గేయాల్లోకి సంగీతం ఫిరంగి గుండులా మనసును తాకుతుంది. తల్లి కౌగిలిలా హృదయానికి హత్తుకుంటుంది. మనం అణుయుగంలో నివసిస్తున్నా, నాగరికత పెరిగిందని ఎంతగా విర్రవీగినా మన నరనరాల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది. దాని ఆకర్షణ శక్తి నుంచి బయటపడడం అసాధ్యం. ఇది కేవలం మన ఆంధ్ర జాతీయులకే గాదు సర్వభాషీయులకు కూడా.

ఆ) జానపద నృత్యం: క్రీస్తుశకమునకు పూర్వమే ఆంధ్రదేశంలో నృత్యం ప్రచారంలో నున్నట్టు హాలుని గాథా సప్తశతి ద్వారా మనకు తెలుస్తున్నది. అటుపిమ్మట భరతుని నాట్యశాస్త్రాదులలో నృత్యమునకు సంబంధించిన లక్షణాలు ప్రస్తావన ఉన్నప్పటికి పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలో దేశినృత్య పద్ధతుల వర్ణన ఉంది. అదేవిధంగా సోమనాధుని బసవ పురాణంలో పూజానృత్య వర్ణన కలదు. అది ఇలా ఉంది.

ద్విపద: ‘మంగళ హర్షోదితాంగ విక్రియల సంగతి నాత్మనుప్పొంగి యుప్పొంగి
భయభక్తి యుక్తిదద్భక్తాంఘ్రి చయము పయిు జక్కజాగిలబడి మ్రొక్కి మ్రొక్కి
పటుతర సద్భక్త పాదాబ్జరేణు పటల పర్యంకంబుపైబొర్లి పొర్లి
…………………..
సెల్లించుచును భక్తిసేయుచున్నెడను

ఈ కవి కవిత్వం మొత్తం జానపదులను ఆలంబనంగా చేసికొని రచించినట్టున్నది. జానపద విజ్ఞానంలోని అత్యంత ప్రాచీన విభాగాలలో నృత్యం కూడా ఒకటి. జానపదులు నిత్యజీవితంలో అనుభవించే సంతోషం, దు:ఖం, వేదన, ఆప్యాయత, పుట్టుక, చావు మొదలైనవి లయాత్మకంగా కదిలి నృత్యమనిపించుకున్నాయి. నృత్యం మానసికమైన ఆనందాన్ని కలిగిస్తుంది.

మానవుడు నృత్యాన్ని నెమలి వంటి జంతువులను చూచి నేర్చుకున్నాడనవచ్చును. గణ వ్యవస్థలోనున్న మానవులు సామూహికంగా నృత్యం చేసినట్టు మనం ఊహించగలము. వీరి నృత్యం ముఖ్యంగా చిందులతో గూడి ఉంటుంది. జానపదుల నృత్యాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వానిలో మొదటిది ధార్మిక నృత్యం. రెండవది లౌకిక నృత్యం. గుడుల వద్ద, పురాణ కార్యక్రమాల వద్ద చేసే నృత్యాలు ధార్మిక నృత్యాలు. పండుగలు, పెళ్ళిళ్ళు తదితర కార్యక్రమాల సందర్భంగా చేసే నృత్యాలు లౌకిక నృత్యాలు. జానపదుల నృత్యాలను సంస్కరించడం ద్వారా శ్రాస్తీయ నృత్యమైనదని పరిశోధకుల అభిప్రాయం. మొసలి నృత్యం, తాబేలు నృత్యం, ఎలుగుబంటి నృత్యం, పక్షి నృత్యం, గోండుల గూసాడి నృత్యం, కండరెడ్ల మామిడి నృత్యం, అరకు ప్రజల దిమ్సా నృత్యం, లంబాడీ నృత్యం, సిద్ధి నృత్యం, బతుకమ్మ నృత్యం, బడ్డెమ్మ నృత్యం, తప్పెట గుళ్ళ నృత్యం, డప్పు నృత్యం, పులివేష నృత్యం, బుట్ట బమ్మలాట నృత్యం, గొబ్బి నృత్యం, గుర్రపు నృత్యం, కరువ నృత్యం, కోలాట నృత్యం, గరగ నృత్యం, వీరనాట్యం, చెక్క భజన, పండరి భజన, ఘట నృత్యం మొదలగు నృత్యరీతులు జానపదుల కళావైదుష్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. శ్రీనాథ మహాకవి పల్నాటి వీరచరిత్రలో రాజాస్థాన నృత్యాన్ని విపులంగా వర్ణించాడు. నృత్యం జనులందరికీ ఆనందాన్ని, వినోదాన్ని, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బుగ్వేదం నందలి దశమ మండలము పద్దెనిమిదవ సూక్తం మూడవ బుక్కునందు ‘నృతయే’ శబ్దం ప్రయోగింపబడినది. నర్తనాయ కర్మణి, గాత్రవిక్షేపాయ అని వ్యుత్పత్తిని విద్యారణ్యులు వ్యాఖ్యానించారు.

చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మున్నగునవి జానపదుల జోస్యానికి ప్రతీకలు. నృత్య కార్యక్రమాల వద్ద, తిరునాళ్ళ వద్ద వీరు జోస్యం చెప్పించుకొందురు.

ఇ) జానపద రూపకములు: జానపదుల నోటి వెంట మొదట పాట, మాట, నృత్యం, సంగీతం, వేషధారణ, చిత్రలేఖనం, సంభాషణలు మొదలగునవన్నీ కాలక్రమంలో క్రమానుసారంగా వెలువడి వికాసము చెందియుండవచ్చును. జానపదుల సంగీతం, నృత్యం కలసి జానపదుల రూపకాన్ని సుసంపన్నం చేసినవి. రూపకాన్ని జానపదులు ఆట అంటారు. భరత ముని తన నాట్యశాస్త్రంలో రూపకాలను, వాటి లక్షణాలను వివరించాడు. దీనినిబట్టి చూస్తే అప్పటికే జానపదుల్లో రూపక ప్రదర్శనలున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. నాటకం, ప్రకరణము, సమవాకారము, ఈహమృగము, డిమము, వ్యాయోగము, అంకము, ప్రహసనము, భాణము, వీధి అనునవి భరతముని తెలిపిన దశరూపకాలు. జానపదుల రూపకాలకు శిష్టుల రూపకాలకు భేత సాదృశ్యాలున్నాయి. ఎలుగుబంటి వేషం, కప్పల కావడి, కరగనృత్యం, కరువ నృత్యం, కలాపం, కురవంజి నృత్యం, చెంచుల కథలు, జట్టిజాము, జేగంట భాగవతులు, జోకుమార సంప్రదాయము, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలాట, దాసర్లు, పగటి వేషము, పాముల వాళ్ళు, పులివేషము, బయలాట, బహురూపులు, బాలసంతువారు, బుట్టబొమ్మలు, బుడబుక్కలవారు, బుర్రకథ, భజన కూటాలు, మారెమ్మ ఉత్సవం, మెరవణి, మోడి, యక్షగానం, గిరిజనుల కళలు, వాలకము, వీధి భాగోతం మొదలగునవి జానపద కళా రూపాలుగా పరిగణించవచ్చును.

1. ఎలుగుబంటి వేషము: మానవుల పురోగతికి పక్షులు, జంతువులు, ప్రకృతి దృశ్యాలు ఎంతగానో తోడ్పడ్డాయి. పక్షులు జంతువులను మానవుడు అనుకరించి అనుసరించసాగాడు. ప్రకృతి దృశ్యాలను చూచి కళానైపుణ్యాన్ని పెంచుకున్నాడు. మానవునికి దగ్గరి పోలికలున్న జంతువులలో ఎలుగుబంటి, కోతి ప్రధానమైనవి. ఎలుగు క్రూరజంతువు అయినప్పటికీ దానిని మచ్చికచేసుకొని, దానిచేత గంతులు వేయిస్తూ ఆబాల గోపాలాన్ని ఆనందింజేస్తారు జానపద భిక్షుకులు. మరికొందరు ఎలుగుబంటి వేషమే ధరిస్తారు. జానపదులకు ఎలుగుకు చాలా అవినాభావ సంబంధమున్నది. చిన్నపిల్లలు భయపడకుండా ఉండుటకు వారి మొలతాడుకు ఎలుగు వెంట్రుకలు కట్టుదురు. మరికొందరు తాయెత్తులలో వెంట్రుకలు కట్టుకని ధరిస్తారు. విజయదశమి, దీపావళి, వినాయకచవితి, సంక్రాంతి, మొహర్రం తదితర పర్వదినాలలో జానపదులు ఎలుగుబంటివేషం ధరించి నృత్యం చేయుదురు. అచ్చంగా ఎలుగుబంటి లక్షణాలతో ప్రవర్తింతురు.

2. కప్పల కావడి: సకాలంలో వర్షాలు పడక పొలాలకు పశువులకు నీటికొరత ఏర్పడినప్పుడు కరువు పరిస్థితులు ఎదురౌతాయని భావించి జానపదులు ‘కప్పల కావడి’ కార్యాన్ని చేయుదురు. మట్టి మూకుడులో తంగేడాకు పెట్టి దానిలో కప్పల నుంచి నెత్తిన పెట్టుకొని గాని కావడికి తగిలించుకొని గాని ‘వానల్లు కురవాలి వానదేవుడా! పంటల్లు పండాలి వానదేవుడా! మా గరిసె నిండాలి వానదేవుడా! మా చెరువు నిండాలి వానదేవుడా! అంటూ పాటపాడుతూ గ్రామమంతా ఇల్లిల్లూ తిరిగి పూజచేయుదురు. కప్ప ఉభయ చరమైనప్పటికిని జానపదుల దృష్టిలో అది బావుల్లో, చెరువుల్లో ఉంటుందని, దాని మనుగడ కోసమైనా వర్షాన్ని కురిపించమని ప్రార్థిస్తారు.

3. కరిగ: మట్టితో కుండను చేసి దానిని పూలతో అలంకరించి తలపై ధరించి పాటలు పాడుతూ నృత్యం చేయుటను కరిగ నృత్యం అంటారు. జానపదులు దీనిని గరిగ నృత్యమని కూడా అంటారు. దీనికొక కథ కూడా బహుళ ప్రచారంలో ఉంది. ద్రౌపది పంచపాండవులను వివాహమాడే సమయంలో సంతోషంతో చేతిలోని కలశాన్ని తలపై పెట్టుకున్నదని, దానికి గుర్తుగా వీరు గరిగ పెట్టుకుంటున్నారు. రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులో ఈ గరిగ నృత్యం బహుళ ప్రచారంలో ఉంది. దేవాలయ ఉత్సవ కార్యక్రమాలందు ఉత్సవ విగ్రహాలకు ముందు ఊరేగింపుగా గరిగ నృత్యకారులు నృత్యం చేస్తూ ముందుకు కదులుదురు. కొన్ని ప్రాంతాలలో గరిగ కుండను పసుపు కుంకుమలు, వేపాకులతో కొత్త గుడ్డలతో అలంకరించి తలపై ధరిస్తారు.

4. కరువ నృత్యం: ఎనిమిది మంది మగవారు శ్రీకృష్ణుని వేషాన్ని, ఎనిమిది మంది సత్యభామ రుక్మిణి మొదలగు అష్టభార్యల వేషాలను గాని, గోపికల వేషాలను గాని ధరించి వర్తులాకారంగా నిలబడగా మధ్యలో రాధాకృష్ణుల వేషాలు ధరించి నిలబడతారు. అందరూ లయబద్ధంగా నృత్యం చేస్తారు.

5. కలాపము: దీనినే భామాకలాపమని కూడా అంటారు. కూచిపూడి నృత్యానికి ఇది అనుకరణమని కొందరు భావిస్తారు. దీనిని ముఖ్యంగా స్త్రీలు నిర్వహిస్తారు.

6. కురవంజి: పిల్లనగ్రోవులూదుతూ డమరకము వాయిస్తూ పాటలు పాడుతూ కుండలాకారంగా నృత్యం చేస్తారు. ఇందులో ఎందరైనా పాల్గొంటారు. పర్వదినాలలోను, ఇలవేల్పుల తిరునాళ్ళలోనూ ఈ నృత్యం చేస్తారు. కురబలు, పాల ఏకరులు ఈ కురవంజి నృత్యం చేస్తారు. ఈ నృత్యాన్ని రాయలసీమ ప్రాంత జానపదులు చేస్తున్నారు. తంజావూరు రఘునాథరాయలు కాలంలో (క్రీ.శ 17వ శతాబ్ది) కురవంజి పేరుతో కొన్ని యక్షగానాలు కూడా వెలువడ్డాయి. వీటిలో కులపెద్ద స్త్రీకి ప్రాధాన్యముంటుంది. ఈమె జాతకం కూడా చెబుతుంది. దీనినే ‘గద్దె’ అంటారు. వర్తమాన భూత భవిష్యత్తులను కూడా వీరు చక్కగా చెబుతారని జానపదుల నమ్మకం. వీరు కోరిన వారి చేయి, వీపులపై పచ్చ పొడుస్తారు. ఆ పచ్చ చెరిగిపోదు. ఆకు పసరుతోనే వారు పచ్చ (రసము) తయారుచేసి సన్నని ముల్లుతో చుక్కలుగా పొడుస్తూ తాము కోరుకున్న చిత్రాన్ని గాని, పేరును గాని పొడుచుటలో నిష్ణాతులు. వీరు చాలా తక్కువ చదువుకున్న వారే.

7. కొండరెడ్లు: ఆయా బుతువులలో ఫలించే వృక్షాలను వీరు పూజిస్తారు. ముఖ్యంగా వీరు మామిడి చెట్లను పూజిస్తారు. ముత్యాలమ్మ, కొండదేవత వీరి ఆరాధ్య దైవాలు. వారు ఎక్కువగా కొండ ప్రాంతాలలో నివసిస్తారు. వీరు వివిధ రోగాలకు మూలికా వైద్యం చేస్తారు. తంబుర మీటుతూ ప్రశ్న చెబుతామని ఊరూరూ తిరుగుతారు. చేతికి కడియాలు కర్ణకుండలాలు, నుదుట పెద్ద నామము, తలపాగాకు నెమిలి పింఛాలు పెట్టుకొని ధరిస్తారు. వీరిని కొండ మామలని కూడా పిలుస్తారు. వీరు ఎక్కువగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కిన జిల్లాలలో తక్కువ సంఖ్యలోనూ నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి ‘ప్రశ్న’ చెప్పడం.

8. కొయ్యకాళ్ళు: కాళ్ళకు కొయ్యలు కట్టుకొని ఉత్సవాలు, జాతరలు, పండుగలలో నడుస్తూ, నృత్యం చేస్తారు. కాలి ఆకారంతో కొయ్యలను తయారుచేసి కాళ్ళకు కట్టుకుంటారు. అవి సుమారు మూడడుగుల పొడవుంటాయి. కొయ్యకాళ్ళు కట్టుకుని నృత్యం చేయడం అంత సులభం కాదు. ఎంతో అభ్యాసం చేయాలి. డప్పు శబ్దానికి అనుకూలంగా నృత్యం చేస్తారు. కయ్య కాళ్ళతోనే వంగి ప్రేక్షకుల వద్ద డబ్బులు వసూలు చేసుకుంటారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మే నెలలో జరిగే గంగజాతరలో కయ్యకాళ్ళతో నృత్యం చేసే కళాకారులు ఎక్కువగా కనిపిస్తారు.

9. కొయ్య బొమ్మలాట: అరువది నాలుగు కళల్లో సూత్రక్రీడ అనే ఆట ఉంది. జానపదుల దృష్టిలో అదే కొయ్యబొమ్మలాటగా రూపుదిద్దుకొన్నది. సూత్రధారుడు తెరవెనుక ఉంది బొమ్మలను సూత్రాల (దారాలు) సహాయంతో ఆట ఆడిస్తాడు. దీనిలో బొమ్మలను కొయ్యలతో తయారుచేస్తారు. తేలికైన బూరగ, ప్రత్తి, మునగ మొదలగు కొయ్యలతో తయారుచేస్తారు. బొమ్మ ముఖం, చేతులు, కాళ్ళు చేయడానికి ‘సరివి’ కొయ్యను ఉపయోగిస్తారు. మగ, ఆడ, నకిలి అను మూడు రకాల బొమ్మలుంటాయి. మగ బొమ్మలు ఒకటిన్నర అడుగుల నుంచి రెండున్నర అడుగుల వరకు పొడవుంటాయి. ఆడబొమ్మలు కొంచెం చిన్నవిగా ఉంటాయి. సాత్వికము, రౌద్రము మొదలగు రసాలు పోషించడానికి పాత్రలకు తగిన రంగులు వేస్తారు. స్త్రీ పాత్రలకు గాజులు, హారాలు మొదలగు ఆభరణాలుంటాయి. మగ పాత్రలకు విల్లు, గద, చక్రం, కిరీటం మొదలగు ఆయుధాలుంటాయి. ప్రతిబొమ్మకు తలకు రెండు దారాలుంటాయి. వీటిని సూత్రధారుడు తలకు కట్టుకుంటాడు. చేతులకు కక్కీలుంటాయి. వాటిని చేతితో పట్టుకుంటాడు. పాట, మాట, కథకు తగినట్టుగా బొమ్మలను ఆడిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారు. ఈ బొమ్మలాటలను గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించాడు.

‘‘భారతాది కథలు జీరమఱుగల
నారంగ బొమ్మల నాడించువారు
కడు నద్భుతంబుగుగంబ సూత్రంబు
లడరంగ బొమ్మల నాడించువారు’’
-పండితారాధ్య చరిత్ర – ప్రథమ ప్రకరణము –

ఇందులో కంబసూత్రముల ఆడే కొయ్య బొమ్మలాట. దీనినిబట్టి చూస్తే క్రీ. శ. 13వ శతాబ్దానికి పూర్వమే ఈ ఆట ఉన్నట్టు తెలుస్తుంది. కొయ్యబొమ్మలాటకు ఆంధ్రదేశంలో కొండపల్లి బొమ్మలు బహుప్రసిద్ధం. కొండపల్లి కొండమీద దొరకెడి ప్రత్యేకమైన కఱ్ఱతో బొమ్మలను తయారుచేసి రంగులు వేయుదురు. ఈ కొయ్య బొమ్మలు పాశ్చాత్య దేశాలలో గూడా ప్రచారం పొందాయి. కృష్ణరాయ విజయంలో గూడా ఈ కొయ్య బొమ్మల ప్రస్తావన కలదు.

‘‘మదనుడను బొమ్మలాటగాడదనెఱింగి

రాజు నెదుటికి దెరలోన రహిజెలంకు

మెచ్చు బంగారు ప్రతిమను దెచ్చె ననుగ

వచ్చె బెండ్లి కుమారి చెల్వంబు మీఱి’’

ఒకానొకప్పుడు కొయ్యబొమ్మలాటలకు రాయలసీమ పెట్టింది పేరు. కడప జిల్లా కమలాపురం మండలం చిడిపిరాల గ్రామాన్ని బొమ్మలాట రైతు చంద్రయ్య, బొమ్మలాట అమృతకవి తెరనాటకం ఆడడానికి పెద్ద చిట్టయ్యకు ఇచ్చారని ఒక శాసనంలో ఉన్నట్టు ఆర్‌.వి.ఎం. సుందరం గారు తన జానపద విజ్ఞానం అనే గ్రంథంలో తెలిపారు. ఇవేగాక ‘కీలుబొమ్మలాట’ అనే మరొకటి కలదు. ఇవికూడా కొయ్యతో బొమ్మలను చేసినవే. కీలుబొమ్మలాటలో వెనుక తెర మాత్రమే ఉండును. కథానుసారంగా బొమ్మలు తెరచాటు నుంచి వచ్చుచుండును. సరస్సు నుంచి వెలుపలికి వచ్చెడి స్త్రీలు తెరవాసివచ్చు జిగి బంగరు జంతువు బొమ్మలటులు ఉన్నారని అబ్బయామాత్యుడు తన అనిరుద్ధ చరిత్రలో 11-59 వచనములో తెలిపాడు.

10. తోలుబొమ్మలాట: జానపదుల రూపకాలలో విశిష్ఠమైనది, వారి కళానైపుణ్యానికి గీటురాయి వంటిది తోలు బొమ్మలాట. దీనిలో చిత్రకళ, ఆట, సాహిత్యం, గాత్ర సంగీతం, వాద్య సంగీతం ఉండుట వలన ఇదొక సమాహారకళగా జానపదులను అలరిస్తుంది. బొమ్మలాడించే వారు తెర వెనుక ఉండి పద్యాలు, పదాలు, దరువులు చెబుతూ ఆయా పాత్రలకు తగినట్టు సంభాషణలు, సంధివచనాలు పలుకుతూ కథను నడుపుతారు. దీనిలో గద్యపద్యాలలో పద్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. గేయాలకు కూడా తగిన స్థానముంది. తెలుగువారి తోలుబొమ్మలాటకు రామాయణ భారత ఇతివృత్తాలే ప్రధాన ఆలంబనాలుగా ఉన్నాయి. పాండవ జననం, లంకాదహనం, కీచక వధ, ప్రహ్లాద చరిత్ర, మైరావణ చరిత్ర మొదలగు ఇతివృత్తాలతో తోలు బొమ్మలాటను ప్రదర్శిస్తారు. సూత్రధారులు ముఖారి, మధ్యమావతి, ఆరభి, ఆనంద, భైరవి రాగాలలో గేయాలను ఆలపిస్తారు. తోలుబొమ్మలాట ఊరి బయట ఖాళీ బీడు ప్రాంతంలో వేదిక నేర్పాటుచేసి ప్రదర్శిస్తారు. కృత్రిమంగా వేదికను నిర్మిస్తారు. ముందు భాగాన తెరగా (screen) తెల్లచీర ఉంటుంది. మగపాత్రల వెనుక మగవారు, ఆడపాత్రల వెనుక ఆడవారు ఉండి బొమ్మలను కదిలిస్తూ కథను నడిపిస్తారు. ఆట రాత్రి సుమారు పది గంటలకు ప్రారంభమై తెల్లవారు జాము వరకు జరుగుతుంది. మొదట వినాయకుని తరువాత సరస్వతిని, విష్ణువును ప్రార్థించి ఆట ప్రారంభిస్తారు. బంగారక్క, కేతిగాడు ముఖ్యంగా వినోదాన్ని ప్రదర్శిస్తారు. వీరు baffoon లాంటివారు. ఈ తోలు బొమ్మలను తయారుచేయుటకు జింక, దుప్పి, కణితి, గొర్రె, గాడిదల చర్మాన్ని ఉపయోగిస్తారు. మొదట తోలును పారదర్శకముగా చేసి కలతలు గీసుకని కత్తిరిస్తారు. రంగులను ఒక్కసారిగా వేయకుండా దశల వారిగా వేస్తారు. జిగురు పూసి దారము పురిపెట్టి బొమ్మల అవయవాలను కీళ్ళ దగ్గర కుట్టి కలుపుదురు. ఏ కోణములోనైనా త్రిప్పుటకు అనుకూలముగా కుట్టుదురు. తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తే తమ ఊరికి పట్టిన శనిపీడ విరగడౌతుందని జానపదుల గట్టి నమ్మకం. దీనివల్ల కరువు కాటకాలు నశించిపోతాయని విశ్వసిస్తారు. ఈ తోలు బొమ్మలాట ప్రదర్శకులు ముఖ్యంగా దేశ దిమ్మరులు. నేటి చలనచిత్రాల రూపకల్పనకు తోలుబొమ్మలే ఉత్ప్రేరకాలనుటకు సందేహం అవసరం లేదు.

తోలుబొమ్మల తయారీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట ఖండాంతర ఖ్యాతినార్జించినది. ఈ జిల్లాలో సుమారు ఐదు వందలకు పైన కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. ఈ కళను కాపాడుకుంటూ వస్తున్నారు.

11. కోలాటము: జానపదులకు అత్యంత ప్రియమైన వినోదాన్ని కలిగించేది కోలాటము. పాట, దానికి తగిన లయ, దానికి తగిన నృత్యం, దానికి తగిన సంగీతం, దానితోబాటు వినోదం కలగలసిన క్రీడ కోలాటం. కోలాటమనేది నృత్తభేదాల్లో ఒకటి. అన్నమయ్య కీర్తనల్లో కోలాట కీర్తనలు అనేకం ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహోత్సవాలలో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ స్త్రీపురుషులు, బాలలు కోలాట నృత్యం చేయుదురు. కోలాటంలో ఎనిమిది లేదా పన్నెండు మంది పాల్గొంటారు. సరిసంఖ్యతో ఇంకెంతమందైనా ఉండవచ్చు. ఆటలో రాటుదేలినవాడు నాయకుడుగా ఉంటాడు. ఇతన్ని పెన్నుద్ది, అయ్యగారు, మేళగాడు అంటారు. వెలుపల కక్ష్యలో సవ్యంగా తిరిగే వారిని వెలియుద్దులని, లోపలి కక్ష్యలో అపసవ్యంగా తిరిగే వాళ్ళను లోయుద్దులని అంటారు. జట్టులోని వారందరూ కాళ్ళకు గజ్జలు, చేతికి గజ్జలు కట్టిన కోలాటం కట్టెలు ధరిస్తారు. మొదట ‘తయ్యక తద్ధిమితా’ అని పెన్నుద్ది విలంబగతిలో కోలాటం మొదలు పెడతాడు. నిలబడి, తిరుగుతూ, మోకాలి మీద కూర్చుని కూడా కోలాటం వేస్తారు. సాధారణంగా కోలాటాలు గణనాయకుని పాటతో మొదలౌతాయి. రాముడు, కృష్ణుడు మొదలగు దేవతల కీర్తనలతో కోలాటం వేస్తారు. పల్లవి కోలాటం పాటలో లయాత్మకంగా కోలల శబ్దానికి తగినట్టుగా ఉంటుంది.

‘‘శివశివ మూర్తివి గణనాథా నీవు
శివుని కుమారుడవు గణనాథా’’

అనే తెలుగు కీర్తన జానపదుల కోలాటంలో అత్యంత ప్రసిద్ధమైనవి. గ్రామ దేవతలు, పండుగలు, ఉత్సవ ఊరేగింపులు సందర్భంగా ఈ కోలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

12. గంగిరెద్దు మేళము: జానపదులు తమ పొట్టకూటికోసం కొన్ని జంతువులకు విద్యలు నేర్పారు. కోతి, ఎలుగుబంటు, ఎద్దు అందులో ప్రధానమైనవి. సీతారామ లక్ష్మణులని ఆవు, ఎద్దులకు పేర్లుపెట్టి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. ఎద్దుకు కళ్ళకు గంతలు కట్టి సంగీతం వాయిస్తూ ఎక్కడో దూరంగా వదలి వచ్చిన దానిని వేదిక వద్దకు రప్పిస్తారు. గంగిరెద్దుల వాడు ఎద్దు నాలుగు కాళ్ళను తనపై పెట్టుకొంటాడు. ఎంతో బరువైన ఎద్దు ఊపిరి బిగబట్టి వాని తొడలపై నిలబడుతుంది. అది బరువు మోపితే వాని పిక్కలు ఊడిపోతాయి. కాని తన యజమానికి ఎంతమాత్రం అది భారం మోపదు. ఇది నోరులేని ఎద్దుకు వారు నేర్పిన విద్య. ‘సీత’ పేరుతో ఉన్న గోవు రాముని పేరుతో వున్న ఎద్దును పెళ్ళి చేసుకోకుండా అలిగి దూరంగా పోతుంది. రాముడు నల్లగా ఉంటాడని మా సీతమ్మ అలిగిందంటాడు ఒకడు. ‘మా రాముడు మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు’ అని ఇంకొక్కడు బుజ్జగిస్తాడు. అపుడు దూరంగా వెళ్ళిపోయిన ఆవు తిరిగి వస్తుంది. వీటికి పెళ్ళి చేసే ఘట్టం చూచుటకు కన్నులు చాలవు. ‘అయ్య గారికి దణ్ణం పెట్టు’ అంటే ఎద్దు తలతో నమస్కరిస్తుంది. గంగిరెద్దులను రకరకాల బట్టలతో, రంగులతో చక్కగా అలంకరిస్తారు. గంగిరెద్దు మేళంలో తోలు, నాదస్వరమూ ఉంటాయి. వాద్య సంగీతమూ, జంతువుల నృత్యం వారి మేళంలో విశిష్ఠమైనవి.

13. గుర్రపు నృత్యం: కీలు గుర్రం అనే పేరుతో గుర్రపు నృత్యాన్ని పర్వ దినాలలో జానపదులు ప్రదర్శిస్తారు. జానపదుల కథల్లో గూడ కీలు గుర్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుర్రపు ఆకారాన్ని వెదురు దబ్బలతో తయారుచేస్తారు. గుర్రపు తల మాత్రం కాగితాలు బాగా రుబ్బి, దానిలో కొన్ని మెంతులు కలిపి జిగురుగా ఏర్పడిన తరువాత తయారుచేస్తారు. గుర్రపు కాళ్ళకు కొయ్యలు కట్టుదురు. రంగురంగుల గుడ్డలను గుర్రం మీద వేస్తారు. గుర్రపు మధ్య భాగంలో ఖాళీ ఉంచుతారు. పురుషుడు రాజుగా, స్త్రీ రాణిగా వేషాలు ధరించి ఖాళీ భాగంగుండా దూరి నిలబడి నడుము వరకు గుర్రాన్ని లేపుతారు. ఈ దృశ్యం చూచు వారికి వారు గుర్రము నెక్కినట్టు కనిపిస్తుంది. వాద్యాలు కొందరు పాటలు పాడుతుండగా రాజు రాణి స్వారీ చేస్తూ నృత్యం చేస్తారు. కొయ్యలతో ఈ విధంగా చేసేది ఒక కళ అయితే గుర్రాలనెక్కి స్వారీచేస్తే నృత్యం చేస్తారు. ఇది మరొక కళ. స్వారీ చేసే వ్యక్తిని ‘వేమయ్య’ అంటారు. వీరు గుర్రమును స్వారీ చేస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ మిరిచ్చే భిక్షను స్వీకరిస్తారు. ప్రతి ఇంటి వారు గుర్రాన్ని పూజిస్తారు.

14. చెంచుల కథలు: వీరు పూర్తిగా ఆదివాసీలు. అప్పటికప్పుడే ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వీరి ఆటల్లో సింగి సింగడు ప్రధాన పాత్రధారులు, నాయికా నాయకులు. డప్పుకు తగినట్టుగా గంతులేస్తారు. ఇప్పపువ్వు సారాలు తాగితే మైమరచి కుప్పిగంతులేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి.

15. జట్టిజాము: జట్టిజాము తాళ ప్రధానమైన కళ. చేతులు చరపడము ఇందులో ప్రధానం. తిన్నగా నిలబడి ఇరుప్రక్కలందలి ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడి ప్రక్కకు. మరొకసారి ఎడమ ప్రక్కకు ఓరగా తిరిగి ఆయా ప్రక్కలనుండు వారి అరచేతులను తన అరచేతులతో తట్టుచూ పాటలు పాడేది జట్టిజాము. ఇది పూర్తిగా స్త్రీల ఆట. జట్టుజాములో నలుగురు గాని అంతకు ఎక్కువైనా సరిసంఖ్యలో గాని పాల్గొంటారు. వీరు రెండు జట్లుగా ఉంటారు. ఒక జట్టు వారు ఒక పాదం చెబితే, మరో జట్టు వారు వంత పాడుదురు. తుమ్మెద, నడియలో, వెన్నిటి, రామరామా, కోదండరామా మొదలగు పల్లవులు జట్టిజాముల్లోని పాటల్లో కనిపిస్తాయి.

16. జేగంట భాగవతులు: ఈ నృత్యంలో జేగంట ప్రధాన భూమిక కలిగియుంటుంది. రామదాసును తానీషా జైలులో బంధించిన ఇతివృత్తం ఇందులో ప్రధానమైనది. ‘ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో’ అనే పాట పాడుతూ పెద్ద జేగంటతో రామలక్ష్మణ సీతా విగ్రహాలతో కూడిన దీపపుస్తంభాన్ని పట్టుకని గజ్జల కాళ్ళతో నృత్యం చేస్తూ చిరుతలతో తాళంవేస్తూ స్తంభం చుట్టూ తిరుగుదురు.

17. జో కుమార సంప్రదాయము: బోయలు, తలార్లు జోకుమారుని విగ్రహాన్ని తయారుచేసి ఊరూరా తిప్పుదురు. ఏడు నుంచి తొమ్మిది రోజులలో వివిధ ప్రాంతాలు తిరిగి వస్తారు. ఆడవాళ్ళు తంగేడు ఆకు, తంగేడు పువ్వులు, జిల్లేడు ఆకులు పువ్వులతో అలంకారం చేసుకుంటారు. వర్షం కోసం ఈ పూజ చేస్తారు. జోకుమారుడు వినాయకుని తమ్ముడని జానపదుల విశ్వాసం. తిరిగిన ఊర్లలో వచ్చిన ధాన్యంతో వంటచేసి జోకుమారుణ్ణి పూజించి ఒక చోట నెలకల్పి అందరూ కలిసి భుజిస్తారు. ఈ పుజావిధానం రాయలసీమలోని అనంతపురము జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది.

18. తప్పెటగుళ్ళు: తప్పెటలు, గజ్జెలు ఇందులో ప్రధాన వాద్యాలు. పొట్టిచేతుల జుబ్బాలు, నిక్కర్లు వేసుకున్న కళాకారులు గుండెలకు ఆనుకన్న తప్పెటల్ని లయాన్వితంగా వాయిస్తూ నృత్యం చేస్తారు. కాళ్ళకు గూడా గజ్జెలు ధరిస్తారు. వీరు ఎక్కువగా ఎర్రరంగు వస్త్రాలు ధరిస్తారు. ఇది ప్రధానంగా పురుషులు ప్రదర్శించే కళ. తప్పెట గుళ్ళతో బాటు గాత్ర సంగీతం కూడా ఉంటుంది. వివిధ భంగిమలలో తప్పెట్లు వాయించడం ఇందులో చెప్పుకోదగ్గ విశేషం. ఒకరి మీద ఒకరు ఎక్కి ఇటకరిని అటకరిని వ్రేలాడదీస్తూ తప్పెటలు వాయించడం ఒక ఎత్తైతే, ఒక్కకసారి కళాకారులు రెండు జట్లుగా విడిపోయి తప్పెట్లు వాయిస్తూ నాట్యం చేయడంలో పోటీపడతారు. పెద్దకుండ పైన ఒకడు నిలబడుకని, అతని భుజాలపైన మరొకడు నిలబడుకని అతని తలపైన నీళ్ళ పాత్రను పెట్టి కూడా తప్పెట్లు వాయిస్తారు. ఈ ప్రదర్శన సుమారు ఐదారు గంటలు సాగుతుంది.

19. పగటి వేషం: యక్షగానాలు, వీధిభాగవతాలు రాత్రివేళ ప్రదర్శించే కళలైతే ఆ వేషాలనే కందరు పగలు ధరించి నాట్యనర్తన చేస్తారు. వీరినే పగటి వేషగాళ్ళు అంటారు. గ్రామ్య భాషలో వీరిని ‘పగలేసిగాళ్ళు’ అంటారు. వీరు వివిధ పురాణ పాత్రల్ని ధరిస్తారు. గాత్ర సంగీతం వాద్య సంగీతంతో ఇల్లిల్లూ తిరుగుతారు. వీరిలో పరిహాస ప్రియత్వం గూడా ఉంటుంది. వీరు దేశ దిమ్మరులు.

20. పాముల వాళ్ళు: బుట్టలో పామును తీసికని బుంగ ఊదుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్ష స్వీకరిస్తారు. వాడు బుంగ తిప్పినట్లల్లా పాము పడగవిప్పి తిరుగుతుంది. కందరు కండచిలువను మెడకు ధరించి ఇల్లిల్లూ తిరుగుదురు.

21. పులివేషం: పులివేషగాళ్ళు చెడ్డీ మాత్రం ధరిస్తారు. మిగిలిన శరీరానికంతా పులిలాగా శరీరానికి చారలు పూసుకుంటారు. పులి తలలాంటి విగ్గును తలకు ధరిస్తారు. అదే విధంగా తోకను గూడా ధరిస్తారు. తప్పెట మోతకు తగినట్టుగా ఆడుతాడు.

22. బయలాట: బహిరంగ ప్రదేశాల్లో ఆడే ఆటలే బయలాటలు. వీటిలో పాటలు, పద్యాలు, దరువులు ఉంటాయి. శబ్దాలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇందులో ఉంటుంది. వేషభూషణాలు, అభినయము యక్షగానానికి బయలాటకు ఒక్కటే. ఇందులో వాచికము ఎక్కువ. నాయకుడు వేదిక మీదకు రాగానే వంత పాటగాండ్రు దిష్టి (దృష్టి) తీయడానికి గుమ్మడికాయో, టెంకాయో కట్టి, ఊరిపేరు, సభలోకి రావడానికి కారణం అడుగుతారు. కథా వివరాలన్నీ అతడు చెబుతాడు. పిమ్మట కథ ప్రారంభమౌతుంది. వీరు ధరించే ఆభరణాలు తళతళ మెరుస్తాయి. ఆయుధాలను కయ్యతో తయారుచేస్తారు. కీచకవధ, ఉత్తర గోగ్రహణము, పాండవ జననము మొదలగు పౌరాణిక కథలను ప్రదర్శిస్తారు.

23. బహురూపులు: బహురూపులు, పగటి వేషగాళ్ళు ఒకటేనని విమర్శకుల అభిప్రాయం. భావుకత కలిగి ఉండాలని, కళా విమర్శకుడై ఉండాలని, యువకుడు అందగాడై ఉండాలని, అంతపొడుగు మరీ పొట్టి కాకూడదని కాకతీయుల కాలంనాటి జాయాపసేనాని నృత్తరత్నావళిలో బహురూపుల లక్షణాలను తెలిపాడు. బహురూపి బహుభాషాభిజ్ఞుడై ఉండాలి. బలశాలిగా, రూపధారణను వేగంగా చేయగలిగిన వాడుగా ఉండాలి. శివరాత్రి పర్వదినాల్లో శ్రీశైలంలో బహురూపులు తమ వేషాలను ప్రదర్శించే వారని పాల్కురికి సోమనాధుడు పండితారాధ్యుల చరిత్రలో (5-62) తెలిపాడు. వీరు మిమిక్రీ కళాకారుల వంటి వారై ఉండవచ్చు.

24. బాలసంతువారు: వీరు తెల్లవారు రaామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి జోస్యం చెప్పుదురు. ఇంటి యజమాని విన్నా వినకపోయినా వారు చెప్పేది చెప్పి వెళ్ళిపోవుదురు. వీరు ముఖ్యంగా శైవులు.

25 బుట్టబమ్మలు: వెదురు దబ్బలతో అల్లిన పెద్ద బమ్మలకు పైన కళ్ళు జిగేలుమనిపించే రంగులుంటాయి. ఈ బమ్మలు చాలా ఎత్తుగా ఉంటాయి. బమ్మల నడుము దగ్గర మనిషి తల పెట్టుకోవడానికి ఒక అడ్డు పలక వంటిది ఉంటుంది. అక్కడే కళ్ళు రెండు రంధ్రాల్లోంచి మిలమిల మెరుస్తుంటాయి. తప్పెటల వాద్య సంగీతానికి తగినట్టుగా అడుగులు కదిలిస్తూ నృత్యం కూడా చేస్తారు.

26. బుడబుక్కలవారు: ‘బుడబుడక’ అనేది ఒక వాద్యం. బుడబుడక అనేది చర్మ వాద్యం. వీరు భవిష్యత్తు చెబుతూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష కోరుదురు. వీరు తలకు పెద్ద రుమాలు ధరిస్తారు. అది వివిధ రంగులలో ఉంటుంది. ఒంటిపై రంగు రంగుల వస్త్రాలు ధరిస్తారు. నడుము కింద మాత్రం తెల్లపంచె ధరిస్తారు. నుదుట నామము పెట్టుకని గొడుగు ధరించి ‘బుడుకు బుడుకు’మని శబ్దం చేస్తూ తిరుగుదురు. అర్ధరాత్రి స్మశానంలో భవిష్యత్తు తెలుసుకని వచ్చి పొద్దునే వచ్చి చెబుదురు. శకునపక్షి భాష వీళ్ళకు తెలుసునని, స్మశానంలో ఆ పక్షి వీళ్ళకు చెబుతుందని జానపదుల విశ్వాసం.

27. బుర్రకథ: వీరు బుర్రతో పాటు గుమ్మెట వాద్యాన్ని ఉపయోగిస్తారు. వంతలు పాడటానికి ఇద్దరు ముగ్గురుంటారు. వీరు కథకునికి ఇరుప్రక్కలా ఉంటారు. వీర పురాణ కథలను, వీర గాథా గేయాలను గాత్రం నృత్యం ద్వారా ప్రదర్శిస్తారు. వినరా ఆంధ్రా కుమారా ధీరా విజయం మనదేరా, తందానా తాని తందనానా వంటి పల్లవి ప్రధానమైనది. తలకు కిరీటాకృతిలో పెట్టుకున్న వర్ణరంజితమైన కుళ్ళాయి ఉంటుంది. చెవులకు కుండలాలుంటాయి. గురువు లేక నాయకుడు కరపాల మేళములో ప్రధాన భూమిక పోషిస్తాడు.

28. భజనకూటాలు: ‘కూటమి’ అంటే గుంపు. ప్రతి ఊరిలోనూ భజన కూటములుంటాయి. గుడిలో పర్వదినాలలో భజనలు చేస్తారు. శివభజన, రామభజన, హరిభజన, పండరి భజన అనేవి ముఖ్య విభాగాలు. వీరు తాళాలు, చెక్కలు ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని భజనలలో నృత్యం కూడా ఉంది. గురువు పాటపాడి నృత్యం చేయగా శిష్యులు అతనిని అనుసరిస్తారు.

29. మారెమ్మ: పంట చేతికొచ్చిన రోజుల్లో చేసే ఉత్సవమిది. మారెమ్మ దేవతను పూజించి (విగ్రహాన్ని) ఊరి పొలిమేరల్లో వదులుతారు. స్త్రీ పురుషులు, వరుసలో నిలబడి నృత్యం చేస్తారు. ఇందులో ఎంతమందైనా పాల్గొనవచ్చు.

30. మోడి: ఇది చూస్తేమనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇది పూర్తిగా హస్తలాఘవముపై ఆధారపడినది. దీనినే ఇంద్రజాలమంటారు. మోడి చేసేవారు రెండు పక్షాలుగా ఉంటారు. తమ విద్యలను ఎదుటి పక్షంపై ప్రయోగిస్తారు. కాగితాన్ని రూపాయి నోటుగా మార్చడమూ, నీళ్ళలో మట్టివేసి రక్తంగా మార్చడం, వేపాకును తేళ్ళుగా మార్చడం మొదలైన విద్యలను ప్రదర్శిస్తారు. ఇది వంశపారంపర్యంగా వచ్చిన కళ. ఊరి బయట ఈ కళను ప్రదర్శిస్తారు. నల్లకోటు వేసుకొని తలపాగా చుట్టుకొని అంగవస్త్రం వేసుకోవడం వీరి సంప్రదాయం. కాలిన గుండును నోటితో తాకడం, ఇనుప కత్తిని మింగడం, కళ్ళు పీక్కోవడం, కళ్ళలో పుల్లలు గుచ్చడం వంటి భయంకర క్రీడలు ప్రదర్శింతురు.

31. యక్షగానము: ఊరి బయటనో, గుడి ముంగిటనో తాత్కాలికంగా నిర్మించిన పందిరి యక్షగానానికి వేదిక. రంగు వస్త్రాన్ని గాని, తెల్లని వస్త్రాన్ని గాని తెరగా కట్టుదురు. తెరకిరువైపుల నూనె దివిటీలు, తెరవెనుక హంగుదారులు, వంత పాటకులుందురు. తెరపై ముందుగా సూత్రధారుడు ప్రవేశించి కథామూలాలను తెలిపి నిష్క్రమిస్తాడు. పాత్రలకు తగిన వేషాలు ధరించిన వారు గాన నృత్య వాచికముతో అభినయింతురు. మధ్య మధ్యలో హాస్య ప్రసంగాలుంటాయి. ఒక రాత్రంతా ప్రదర్శన ఉంటుంది. యక్షగానాల ప్రస్తావన శిష్టసాహిత్యంలో గూడా చాలాచోట్ల గలదు.

32. గిరిజనుల కళలు: గిరిజనుల కళల్లో ముఖ్యమైనది చిందు నాట్యం. యానాదులు, ఎరుకలు, సుగాలీలు పండుగ పర్వదినాలలో చిందులేస్తారు. వివిధ పురాణ పాత్రలు గూడా ధరిస్తారు. వీరు ప్రయోగించే భాష పూర్తిగా గ్రామ్యమే. యానాదులు ‘రంగము’ అనే క్రీడ ఆడుదురు. ఏదైనా వస్తువు పోయినదని తెలిస్తే బాగా సారాయి తాగి వాద్యం వాయిస్తూ నృత్యం చేస్తూ వారి కులదైవాన్ని గొంతెత్తి ఆలపిస్తారు. వారి దేవత వారి శరీరంలో ప్రవేశించి పోయిన వస్తువు జాడ తెలుపుతుందట. దీనిని వారు పూనకము అంటారు.

33. వాలకము: నలుగురు జానపదులు గుమిగూడి ఆశువుగా మాట్లాడతారు. వారి మాటల్లో సమకాలీన సమస్యలుంటాయి. గ్రామల్లో పెద్దలు చేసిన మోసాలను వ్యంగ్యంగా బయటపెడతారు. విదూషకుడు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాడు.

34. వీధి భాగోతము: దీనినే వీధి నాటకమని కూడా అంటారు. యక్షగానం లక్షణాలు ఇందులో చాలా ఉన్నాయి. వివిధ పురాణ పాత్రలను నటులు ధరిస్తారు. నాటకం రాత్రి పది గంటలకు ప్రారంభమై సూర్యోదయం వరకు నడుస్తుంది. ఇందులో పాత్రలు అనేకం. వాద్య, గాత్ర, వాచిక, అభినయము ఇందులో ప్రధానం. భుజకీర్తులు, హారాలు, కర్ణాభరణాలు, కత్తి, డాలు, ఖడ్గం, గద మొదలగు వానిని ధరిస్తారు. వాటిలో అమర్చిన అద్దాల వలన అవి ధగధగ మెరిసిపోతాయి. పాత్రధారులు ఇందులో నటించడం కంటే జీవిస్తారు. ద్రౌపది వస్త్రాపహరణము నాటకంలో భీముని ఉగ్రరూపాన్ని అదుపు చేయుటకు తాళ్ళతో కట్టిపట్టుకుంటారు. వీరి వేషధారణ అచ్చం రాజుల లాగానే ఉంటుంది. పాటలు, పద్యాలు, హాస్యప్రసంగాలతో బాటు నవరసాలు పోషించబడతాయి. శాస్త్రసాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందినను, చలనచిత్ర రంగములో వచ్చిన సాంకేతికాభివృద్ధిని కూడా తట్టుకొని నిలబడిన జానపదకళ వీధి భాగవతం ఒక్కటే.

ఈ సంగీత రంగస్థల వగైరా కళల ఉద్ధరణకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది. సువిశాలమైన రాష్ట్రంలో అనంతాలైన కళల పోషణకు అటువంటి అకాడమీ, సంస్థలు మరికొన్ని నెలకొల్పితే గాని వాటిని సమగ్రాభివృద్ధి చేయడం సాధ్యపడదు.

6. జానపదుల ఇతర కళలు

పుట్టినది మొదలు గిట్టేవరకు జానపదుల ప్రతి కదలిక, మాట, పాట, చేష్ట, నడక, తిండి, వస్త్రధారణ అన్నీ కళాత్మకమైనవే. కాకిపిల్ల కాకికి ముద్దు, అత్తకాలము కొన్నాళ్ళు – కోడలి కాలము కొన్నాళ్ళు వంటి సామెతలు, చాపచుట్టనూ లేము రూకలెంచనూ లేమూ – (సమాధానం ఆకాశం, చుక్కలు) వంటి పొడుపుకథలు, కానివారితోను కావించు చెలిమి – కట్టి విరిచి పొయిని పెట్టినట్లుండు వంటి ఆలంకారిక వాక్కులు, దేవుడికి అర్పించిన టెంకాయ చెడిపోతే అశుభం, బాలింతరాలు చచ్చిపోతే తప్పక దయ్యమవుతుందనే విశ్వాసాలు, కులదేవతను పూజించే భక్తి, వివిధ పండుగలు జరుపుకొనే విధానం, (ఒక పండుగను శిష్ఠులు ఒక రకంగా జరుపుకుంటే జానపదులు అదే పండుగను మరో రకంగా జరుపుకొంటారు), వివిధ రోగాలకు గాయాలకు వారుచేసే మూలికా వైద్యం (గాయాలకు: ఊటి ఆకు, పిచ్చిక బీర ఆకు, రాగి చెక్క దంచి పూస్తారు), వారు ఆడే బొంగరాలాట, బిళ్ళంగోడు, పుట్టసెండు, ఉప్పరపట్టె, కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, తిరుగుడు జక్కీలు, చెడిగుడు తదితర ఆటలు, వారు ఆహారంగా తీసికొనే సజ్జ, రాగి, జొన్న అడవిలో దొరికే వివిధ కాయలు, ఆకు కూరలు, వారు సేవించే ఇప్పసారా, ఊటసారా వారు ధరించే కుప్పె, రాగతి బిళ్ళ, పాపట బట్టు, కమ్మలు, బావిలీలు, ముక్కర, కంకణాలు, గజ్జెలు మొదలగు ఆభరణాలు, వారు నిర్మించుకన్న పూరి గుడిసెలు ఇంటిముంగిట వేసే ముగ్గులు, గోడలపై చిత్రించే చిత్రాలు, వారుపయోగించే మట్టిపాత్రలు, పడుకునే చాపలు, జంతువులను అలంకరించే వస్తువులు, కొయ్యబొమ్మలు మొదలగునవన్నియు కూడా కళాత్మకమైనవే.

సంక్రాంతి కనుమ పండుగరోజు పశువులను అలంకరించి ఊరేగించడం, శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్టికట్టడం, వినాయకుని విగ్రహాలు తయారు చేయడం, పెళ్ళిళ్ళలో అలివేణి కుండలు తయారుచేయడం, మొలకల పౌర్ణమి (ఏప్రిల్‌ నెలలో) సందర్భంగా పెద్దల సమాధుల వద్ద కృత్రిమ బాణా సంచా (పెట్లుప్పు, బొగ్గులు, ఎండిన చక్కపొడితో చేసినవి) తయారుచేసి పేల్చడం, వ్యవసాయానికి అవసరమైన నాగలి, గొడ్డలి, కడవలి తదితర వస్తువులను కళాత్మకంగా చేయడం వంటివి కోకల్లులుగా జానపదుల కళలున్నవి. ‘కర్రతిప్పుట’ కూడా ప్రధానమైనదే.

7. సాంప్రదాయక, మధ్యతరగతి కళలు

కళలన్నిటికి జన్మస్థానం ప్రకృతి. ప్రకృతితో అనుబంధం పెంచుకుంటూ జీవితాన్ని గడిపే వారు జానపదులు. వారి పరిశీలన అనుకరణ ఫలితమే కళలకు ఆలంబనము. అట్టి కళలు సంస్కరించబడినప్పుడు వాటి ఔన్నత్యం పెరుగుతుంది. వాటిని ఆదరించే వారు ఉన్నత వర్గాల వారైతే, ఎన్నో ఆటుపోట్లకు గురౌతూ కాపాడుకుంటూ వచ్చే వారు మధ్య తరగతి ప్రజలు. కాల క్రమమున అవి సాంప్రదాయక కళలుగా పరిణామము చెందుతాయి. Art is the free play of the soul అన్నారు పాశ్చాత్యులు. కళ ఆత్మ యొక్క స్వైర క్రీడ. కళాస్రష్టచేత అది తీర్చిదిద్దబడును. కళాకారుడు వ్యసనమును ఉల్లాసమును గూడా పరిశీలన ద్వారా చిత్రీకరించును. కళాజగత్తులో నియమబద్ధత, హేతుబద్ధత, వైశిష్ఠ్యము కలవు. అట్టి కళకు భావవ్యక్తీకరణమే గమ్యస్థానం. కళ పుట్టుకకు మానవుని క్రీడా కుతూహలమే ప్రధాన కారణంగా చెప్పవచ్చును. “Art conducts us from the vestibule of reality into the innermost shrine and reveals itself” అన్నారు Shelling. కళ వాస్తవికత కక్ష్యద్వారా మనలను ఆంతరంగిక పరంధామమునకు చేర్చి స్వయం వ్యక్తమగును. కళకన్న సాధికారమైన వస్తువు లేదు. దాని అర్హతనదే గుర్తింపగలదు. ఈ మాటలు కళ విషయంలో అక్షర సత్యాలు. సాంప్రదాయక మధ్య తరగతి కళలన్నపుడు మనం ముఖ్యంగా నాటక కళనే తీసికోవాలి. నాట్యం, నృత్తం, నృత్యం, అభినయం. వాచికం, ఆంగికం, ఆహార్యం అన్నీ కలగలిసినది నాటకం. ఈ నాటక కళను పోషిస్తూ ఆయా పట్టణాలు నగరాల్లో నాటక సమాజాలు ఏర్పడ్డాయి. కళాకారులు వేర్వేరు వృత్తుల్లో ఉంటూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలలో కళాప్రదర్శనలిస్తూ నాటక కళను కాపాడుతున్నారు. విజయవాడకు చెందిన శ్రీ సాయిబాబా నాట్యమండలి వారు ‘ఉషాపరిణయం’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనస్సును దోచుకుంటున్నారు. శైవభక్తి, విష్ణుభక్తి మార్గాలలో తేడా లేదనే తత్వసారాన్ని రసరమ్యమైన ప్రేమ కథతో జోడించి చెబుతుంది ఈ నాటకం. ఇబ్రహీంపట్నంకు చెందిన వి.టి.పి.ఎస్‌.అసోసియేషన్‌ కళాకారులు ‘పరమాత్మ వ్యవస్థిత:’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అన్ని మతాల సారం ఒక్కటే అనేది ఈ నాటక ఇతివృత్తం. మతం, కులం, ఆచారం పేరుతో పట్టింపులకు పోవడాన్ని ఈ నాటకం వ్యంగ్యంగా విమర్శించింది. ఈ నాటక కళాకారులు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలోని ఉద్యోగులు కావడం చెప్పుకోదగ్గ విశేషం. నరసరావుపేటకు చెందిన ‘కల్పనా నికేతన్‌ సంఘ కళాకారులు ‘నోట్‌ దిస్‌ పాయింట్‌’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ బాలలకు కాస్తంత ఊరట ఇస్తే సమాజంలో మంచితనము వెల్లివిరుస్తుందని ఈ నాటకం ఉద్భోదిస్తున్నది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గరిడేపల్లి కళాకారుల సంఘం అనేక వ్యయప్రయాసల కోర్చి ‘శ్రీ సీతాకళ్యాణం’ అనే నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఇది పద్య నాటకం కావడం మరొక విశేషం. ఒంగోలుకు చెందిన శ్రీ విజయవాణి కళాసమితి వారు, సి.వి.ఎస్‌ కల్చరల్‌ వింగ్‌ వారు సంయుక్తంగా ‘సామ్రాట్‌ అశోక’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. కళింగ యుద్ధానంతరం సాత్వికుడై అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించి ప్రచారం చేసిన విషయం చూపరులను కట్టిపడేస్తున్నది. ఇది చారిత్రక నాటకం. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కళానికేతన్‌ కళాకారులు ‘వలస’ అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అరవింద్‌ ఆర్ట్స్‌ వారు ప్రదర్శిస్తున్న ‘ఏరువాక సాగాలి’ నాటకం రైతుల సమస్యలను కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. విశాఖపట్నానికి చెందిన కళాతరంగిణి సంస్థ ప్రదర్శించే ‘వరవిక్రయం’ నాటకం వివాహ వ్యవస్థ లోపాలను చాటి చెబుతున్నది. కడపకు చెందిన సవేరా ఆర్ట్స్‌ వారు ‘వాసవి కన్యక’ పద్య నాటకం రాజుల పాలనలోని నిరంకుశత్వాన్ని ఎండగడుతున్నది. హైదరాబాదుకు చెందిన అమృత వర్షిణి కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ప్రదర్శించే ‘అజమాయి‘షి’’ నాటకం మహిళల మనోగతాన్ని వెల్లడి చేస్తుంది. పెద కాకానికి చెందిన గంగోత్రి సంస్థ ప్రదర్శిస్తున్న ‘మిస్‌డ్‌ కాల్‌’ సాంఘిక నాటిక సెల్‌ఫోన్ల రాద్ధాంతాన్ని విచ్ఛిన్నమౌతున్న మానవ విలువలను వివరిస్తున్నది. పెద కాకానికి చెందిన గంగోత్రి సంస్థ ప్రదర్శిస్తున్న ‘పల్నాటి భారతం’ నాటకం గత చరిత్రను కళ్ళకు కట్టడమే గాకుండా సమైక్యతను ఉద్భోధిస్తుంది. కాకినాడకు చెందిన ది యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ ప్రదర్శించిన ‘‘మూడో పురుషోత్తముడు’’ నాటకం మానవ విలువలను బోధిస్తున్నది. హైదరాబాదుకు చెందిన విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ వారు ప్రదర్శిస్తున్న ‘వేట’ సాంఘిక నాటిక లైంగిక వేధింపులకు గురౌతున్న స్త్రీల స్థితిని తెలుపుతుంది. హైదరాబాద్‌కు చెందిన వంశీ నిరంజన్‌ కళాకేంద్రం వారు ‘‘న’కు దీర్ఘమిస్తే’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. వయస్సు మళ్ళిన వృద్ధుల దీన బతుకులను ఈ నాటకం చిత్రిస్తున్నది. ఇవేగాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాలు పల్లెల్లో వివిధ కళాసంస్థలు స్థాపించబడి సాంఘిక, పౌరాణిక, ఆర్థిక, సామాజిక ఇతివృత్తాలతో నాటకాలు రచింపబడి వివిధ ప్రాంతాలలో ఆర్ధికాపేక్ష లేకుండా ప్రదర్శిస్తూ నాటక కళను పోషిస్తున్నాయి.

8. గ్రామాలలో ఇతర కళలు

హరి కథ, గొల్లసర్దులు, పగ్గు కథలు, కావమ్మ – మారయ్య కథలు, ఎల్లమ్మ కథ, జాజర పాటలు, రంగుల్రాట్నము, పాచికలు (దాయాలు), కోడి పందెములు, మేష యుద్ధాలు, జంతు బలులు, గొండ్లినృత్యము, వైష్ణవ భాగవత వేషము, భోగముసాని వేషము, దాసరి వేషము, దసరా వేషములు, జంగాల వేషము, ఎరుకలి వాని వేషము మొదలగు వివిధ వర్గాల వారి వేషాలు అచ్చన గాయలు, పట్టె ఆట, మట్టి ఆట, దాగుడు మూతలు మొదలగు ఆటలు, వివిధ వర్గాల స్త్రీల అలంకరణలు, తాయెతలు ధరించుట, శకునాలు పాటించుట, బావులు, చెరువులు, నదుల వద్ద దేవర్లు చేయుట, మున్నగు సాంప్రదాయ కళారూపాలను జానపదులు పాటిస్తూ ఆదరిస్తూ ముందు తరాల వారికి వారసత్వంగా అందిస్తున్నారు. ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో జానపదుల ఆటలు, ఆచారాలు సమగ్రంగా వర్ణించాడు. వానిలో కనీసం యాభై శాతానికి పైగా కనుమరుగయ్యాయి. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ‘సిడిమ్రాను’ను తలపించే క్రీడలు నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్నాయి. సుమారు డెబ్బై(?) అడుగులు పొడవు ఒక సెంటీమీటరు మందము కలిగిన ఇనుప కమ్మిని దవడలో ఇటువైపు నుంచి అటువైపుకు దూర్చి సమంగా వేలాడదీస్తూ ఒక రోజంతా నడవడం, శరీరమంతా సూదులు గుచ్చుకోవడం, నూరు కిలోగ్రాముల బరువుగల బండరాతిని తాడుతో కట్టి ఒక కొనలో ఇనుప కక్కీ తగిలించి, ఆ కక్కీని వీపుకు తగిలించుకొని ఆ రాయిని కొండపైకి లాగడం, వీపు చర్మానికి కొక్కీలు తగిలించుకొని తాడు ద్వారా హనుమంతుని వలె గాలిలో ప్రయాణం చేయడం (సుమారు 20 అడుగులు) మొదలగు విన్యాసాలు చూచువారికి గగుర్పాటు కలిగించడంతో బాటు ఆశ్చర్యపడి ముక్కున వేలేసుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి గుడికి కావడి ఎత్తితే రోగాలు నయమౌతాయని నమ్మకం. మనకు వచ్చే రోగాలకు మూల కారణం దేవుళ్ళు కోపించారని భావించి మొక్కులు తీర్చుకోవడం, ఆడపడుచులకు ప్రతి ఏటా పసుపు కుంకుమ కొత్త వస్త్రాలు ఇవ్వడం, ఇండ్ల నిర్మాణం, గోడలపై బొమ్మలు గీయడం, గోమయముతో ఇల్లు అలకడం, సున్నిపిండితో ముగ్గులు వేయడం పండుగలు, ఉత్సవాలను సామూహికంగా జరపుకోవడం, వ్యవసాయానికి మూలస్తంభాలైన పశువులను సంక్రాంతి రోజు అలంకరించి ఊరేగించడం, గోవును తల్లిగా భావించి పూజించడం ఒకటననేమి జానపదుల కళలు, అనంతములు, విశిష్ఠములు, గత చరిత్రకు చిహ్నాలు, వర్తమానానికి ప్రతీకలు, భవిష్యత్తుకు వైజయంతికలు.

9. కళలు – నేటి స్థితి

ఆంధ్రదేశంలోని ప్రతిగ్రామం కళలకు పుట్టినిల్లే. ఒక గ్రామంలోని కళ మరో గ్రామంలో ఉండదు. కొన్ని కళలు ఆంధ్రా అంతా వ్యాపించడమే గాకుండా ఖండఖండాంతరాలకు విస్తరించి ఆంధ్రుల ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను మన చేనేత కళాకారులు నేత నేయడం, వీధి నాటకాలూ మనకు అట్టి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. విదేశీయులెందరో మన కళలపై సమగ్ర అధ్యయనం చేసి వారి దేశాల్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలోని కళలు గూడా మన రాష్ట్రంలో ప్రవేశించాయి. కళకు సరిహద్దులు లేవు. కళలు వారసత్వంగా మనకు ప్రాప్తించిన ఆస్తి. నేడవి ఒకటొకటిగా తెరమరుగౌతున్నాయి. ‘కర్ణుడీల్గె ఆర్గురి చేతన్‌’ అన్నట్టు కళలు తెరమరుగు కావడానికి కారణాలు అనేకం.

అ) కళలు తెరమరుగవడానికి కారణాలు

• నాగరికత పేరుతో సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రజలు పాటించక పోవడం.

• శాస్త్రసాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందడం వాని ద్వారా సినిమాలు ఎలక్ట్రానిక్‌ మీడియా అభివృద్ధి చెందడం.

• కరువు కాటకాల వలన కళాకారులకు దానధర్మాలు లభించకపోవడం, కళాపోషకులు లేకపోవడం.

• కళాకారులు అదే వృత్తిలో కొనసాగినను వారి సంతానం మాత్రం విద్యావంతులై వేరే ఉపాధి చూసుకోవడం.

• ముఠాకక్షలు, ప్రాంతీయ తత్వం, నగరీకరణ.

• కళాకారుల ఆదాయం వారి అవసరాలు తీర్చలేకపోవడం.

• కళాకారులకు సమాజంలో గౌరవం లభించకపోవడం, మరియు ఆదరణ లేకపోవడం – అనేవి ప్రధాన కారణాలు.

ఆ) కళల ఉద్ధరణకు తీసికోవాల్సిన చర్యలు

• కళలు ప్రజల ఉమ్మడి ఆస్తిగా ప్రభుత్వం ప్రకటించాలి.

• కళాకారులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి.

• వృద్ధ కళాకారులకు ప్రభుత్వం పింఛను ఇవ్వాలి.

• కళాకారులకు అవసరమైన ఉపకరణాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి.

• ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలో కళామందిరం నిర్మించాలి.

• ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కళల మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి.

• ప్రతి కళలో ప్రతిభ, నైపుణ్యం చూపే కళాకారులకు పంచాయితీ, మండలాల్లో ప్రతి ఏటా ఉగాది రోజు పురస్కారాలివ్వాలి.

• కళలకు ఒక మంత్రిత్వ శాఖను నెలకల్పాలి.

• మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని కళలు పరిచయమగునట్లు పాఠ్యాంశాల్లో చేర్చాలి.

• టెలివిజన్‌, ఆకాశవాణిలలో కళలను తరచూ ప్రసారం చేయునట్లు చూడాలి.

• కళా సంఘాలకు ఆర్థిక సహాయం చేయాలి.

• కళలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఒక మాసపత్రికను ప్రారంభించాలి.

• ప్రతి కళారంగంలోనూ ప్రతి ఏటా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలి.

• ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి కళాకారులను ఉపయోగించుకోవాలి.

• ఉన్నత మధ్య తరగతి ప్రజలు కళల ఉద్ధరణకు భాగస్వాములు కావాలి.

• ప్రవాసాంధ్రులు కళాపోషణకు విరివిగా విరాళాలివ్వాలి.

• శిల్పకళారామము, అర్బన్‌హాట్‌ వంటి కళాకేంద్రాలు అన్ని జిల్లాల కేంద్రాల్లో నెలకల్పాలి.

• స్వచ్ఛంద సంస్థలు కళోద్ధరణకు ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

• కులమత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు కళలను తమ వారసత్వపు ఆస్తిగా భావించి అనుకరించాలి, పోషించాలి.

• కళలలో ప్రతిభ చూపిన వారికి ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యమివ్వాలి.

10.ముగింపు

ప్రతి జాతికి కళలు అమూల్య సంపదలు. కళలు మరుగునపడితే ఆ జాతి చరిత్ర సంస్కృతి మరుగునపడినట్టే. గతమనేది వర్తమాన భవిష్యత్తులకు పునాది. పునాది లేకుంటే సౌధం నిలబడదు. ‘పురోభివృద్ధి కోరు వారు పూర్వ వృత్తాంతం మరువ రాదు’ అను సూక్తి సార్వకాలిక సత్యం. కాబట్టి మనం మన కళాసంపదను భద్రపరచాలి, ఆచరించాలి, భావితరాలకు అందించాలి. మన ముత్తాతలు కనిపించలేదు కాబట్టి వారులేరనుట ఎంత అవివేకమో, అదే విధంగా పూర్వపు కళలు లేవు ఉన్నవన్నీ నేటి సినిమాలు, టెలివిజన్‌లే అనుట కూడా అంతే అవివేకం. మన కళలలో ఆనందముంది. ఆరోగ్యముంది, ఐశ్వర్యముంది, అభివృద్ధి ఉంది, ఆహ్లాదమూ ఉంది, అనిర్వచనీయమైన రసానుభూతి ఉంది, నిరుపమానమైన మహత్తు ఉంది, వారసత్వముంది, విజ్ఞానముంది, విశాల దృక్పధముంది, వినూత్నమైన సృజన ఉంది. ఇటువంటి సకల కళల జీవనదులలో మునిగి పునీతులు కావడం మన ధర్మం, లక్ష్యం. ఆ దిశగా మన మందరం కలసికట్టుగా కళామతల్లికి సేవచేద్దాం.

ఈ వ్యాసరచనకు ఉపకరించిన గ్రంథాలు, పత్రికలు మొ॥వి

1. తెలుగునాటక వికాసము, డా॥ పోణంగి శ్రీరామ అప్పారావు

2. సాహిత్య భావలహరి, ఆచార్య యస్వీజోగారావు

3. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

4. కామసూత్రాలు, వాత్సాయన ముని

5. తెలుగు సాహిత్య సమీక్ష – రెండవ సంపుటము, ఆచార్య జి.నాగయ్య

7 బసవ పురాణము, పండితారాధ్యచరిత్ర, పాల్కురికి సోమనాధుడు

8 క్రీడాభిరామము, పల్నాటి వీరచరిత్ర, శ్రీనాథ మహాకవి

9 ఆంధ్రుల జానపద విజ్ఞానము, ఆర్‌.వి.ఎస్‌.సుందరం

10. దాక్షిణాత్య నాటకాల్లో హాస్యగాడు, ఆచార్య కె.ఆనందన్‌

11. జానపద కళారూపాలు – సాహిత్యం, ఆచార్య కె.ఆనందన్‌

12. హిందూ సంప్రదాయాలు, గాజుల సత్యనారాయణ

13. ఆంధ్రవాగ్గేయకార చరిత్రము, బాలాంత్రపు రజనీకాంతరావు

14. ఆంధ్రమహాభారతము – ఆదిపర్వము, నన్నయ మహాకవి

15. సాహిత్య శిల్పసమీక్ష, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం

16. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఖండవల్లి బాలేందుశేఖరం

ఇంకా ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రప్రభ, ఈనాడు తదితర పత్రికలలో వచ్చిన వ్యాసాలు – మొదలగునవి.g