గీతులు

సంగ్రహము

ఉపగణములతో, మాత్రాగణములతో నిర్మింపబడిన ఛందస్సులు గానయోగ్యమైనవి. తెలుగులో ఆటవెలది, తేటగీతి, సీసము, ద్విపద మున్నగునవి ఈ కోవకు చెందినవే. కాని ఈ ఉపగణములతో ఇంకను ఎన్నియో ఛందస్సులను సృష్టించి, అందులో వ్రాసిన గీతములను పాడుకొనవచ్చును. ఒకటి నుండి ఐదు సూర్యేంద్ర గణములతో కల్పించిన 62 గీతులను సోదాహరణముగా వివరించుట మాత్రమే కాక ఈ గీతులకు ఒక పటిష్టమైన గణిత శాస్త్రపు పునాది కూడ నిర్మించబడినది. వీటితో అర్ధసమగీతులను నిర్మించు విధానము, వృత్తములలోని ఉపగణముల చాయలు, క్రొత్త తాళవృత్తములను కనుగొనుటకు ఉపయోగపడు పద్ధతులు ఈ వ్యాసములో చర్చించబడినవి. గణములకు తగినట్లు పదముల విఱుపుయొక్క అవసరము ఉద్ఘాటించబడినది. తెలుగు కన్నడ భాషల ఛందస్సులో గీతులపై ప్రప్రథమముగా యిట్టి క్రమబద్ధమైన పరిశోధనలు చేయబడినవి.

పరిచయము

గీతులు అనగా గానయోగ్యములైన ఛందస్సులు. అన్ని భారతీయ భాషలలో పాటలకు అనువైన ఛందస్సులను లాక్షణికులు కల్పించినారు. సంస్కృతములోని ఆర్య (1, 2) తొమ్మిది విధములు, అందులో ప్రత్యేకముగా నాలుగింటిని గీతులు అని పేర్కొన్నారు. అందులో ఆర్యాగీతి కన్నడ తెలుగు భాషలలోని కంద పద్యమే. అంతే కాక వైతాళీయములు తాళయుక్తముగా పాడుకొనదగినవే. ప్రాకృతములో[1] కూడ గేయములకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. సంస్కృత నాటకములలో కూడ ఇట్టి గేయ ఛందస్సులు ఉన్నాయి. తమిళములో కవితను పాట్టు (పాట) అని కూడ అంటారు. అనాదినుండి కన్నడ తెలుగు భాషలలో కూడ ఇట్టి గానయోగ్య ఛందస్సులు గలవు. కన్నడములో త్రిపద, అక్కరలు, రగడలు, తెలుగులో ద్విపద, తరువోజ, సీసము, ఆటవెలది, తేటగీతి, అక్కరలు, రగడలు ఇట్టి ఛందస్సులే. ప్రాఙ్నన్నయ శాసనములలో కూడ మనము దేశి ఛందస్సుల వాడుకను గమనించవచ్చును. శాసనములలో మొట్టమొదట మనకు కనబడిన దేశి ఛందస్సులను[2, 3, 4] క్రింది పట్టికలో చూడవచ్చును.

571 ఎఱికల్ ముత్తురాజు ఎఱ్ఱగుడిపాడు సీసము
575 ఎఱికల్ ముత్తురాజు తిప్పలూరు ద్విపద
575 ధనంజయుడు కలమళ్ళ రగడ
600 చోడ మహారాజు ముత్తుకూరు అక్కర పోలిక
600 చోడ మహారాజు కోసినేపల్లి తేటగీతి (సీస భాగము)
700 విక్రమాదిత్య చోడుడు నల్లచెరువుపల్లె ఆటవెలది (సీస భాగము)
750 రెండవ మహేంద్రుడు బూదినగడ్డపల్లి విడి ఆటవెలది
770 పండరంగడు అద్దంకి తరువోజ
8వ శతా. పెద్దముడియము విడిగా తేటగీతి
850 నలజనంపాడు ఉత్సాహ
930 యుద్ధమల్లుడు బెజవాడ మధ్యాక్కర
945 జినవల్లభుడు కుర్క్యాల కందము

వృత్తములు ఎనిమిది త్రిక గణములతో, నాలుగు ద్వ్యక్షర గణములతో, రెండు ఏకాక్షర గణములతో నిర్మింపబడగా, సీసము, ఆటవెలది, తేటగీతి, ఉత్సాహ, అక్కరలు అంశ లేక ఉపగణములతో (సూర్యేంద్రచంద్ర గణములు), కందము, రగడలు మూడు, నాలుగు, ఐదు, ఏడు మాత్రలతో నిర్మింపబడినవి. త్రిపదలు, షట్పదలు కన్నడములో అంశ, మాత్రాగణ నిర్మితములు, తెలుగులో ఇవి వాడుకలో లేవు. అంతే కాదు, తెలుగులో చంద్ర గణముల ఉపయోగము మృగ్యము. దీని సారాంశము ఏమనగా తెలుగు ఛందస్సులో గానయోగ్య ఛందస్సులు కొన్ని సూర్యేంద్ర గణములతో, మఱి కొన్ని మాత్రా గణములతో సృష్టించబడ్డాయి. ఈ వ్యాసములో నేను సూర్యేంద్ర గణములతో కల్పించ వీలగు ఛందస్సులను గుఱించి చర్చిస్తాను. ఇంతవఱకు ఇట్టి ఛందస్సులు చాల తక్కువ సంఖ్యతో ఉండే గీతులకు, సీసమునకు మాత్రమే పరిమితము. కాని గానయోగ్యమైన ఛందస్సుల విరివి వృత్తాదులవలె అనంతము. ఒకటి నుండి ఐదు ఉపగణములతో నిర్మించ వీలగు అన్ని ఛందస్సులను సోదాహరణముగా వివరించి, మఱి కొన్ని ఛందస్సులను చూచాయగా తెలుపుతాను. వృత్తములకు ఒక అక్షరపు ఉక్త నుండి 26 అక్షరముల ఉత్కృతి వఱకు ఏ విధముగా ఛందములు గలవో, అదే విధముగా సూర్యేంద్ర గణములతో ఒక గణము నుండి తొమ్మిది గణముల వఱకు గల ఛందములకు నవ రత్నముల నామములను పెట్టాను.

తెలుగులో గీతులు

తెలుగు ఛందస్సులో తొమ్మిది విధములైన గీతులను ప్రత్యేకము తెలిపియున్నారు. అవి (1-2) గీతులుగా పరిగణించబడుతున్న ఆటవెలది, తేటగీతులు, (3-5) ప్రాసతో ఉండే విషమ గీతులైన ఎత్తుగీతి, పవడగీతి, కమలనగీతి లేక మేలనగీతి (దీనికి బదులుగా మలయగీతి అను గీతిని పొత్తపి వేంకట రమణకవి పేర్కొన్నాడు), (6-9) ఆర్య యందలి నాలుగు గీతులైన గీతి, ఉపగీతి, ఉద్గీతి, ఆర్యాగీతులు. ఆటవెలదికి ప్రసన్నగీతి, నటి యని కూడ పేరులు గలవు[5]. కన్నడములో దీనిని ఆటగీతి యని నాగవర్మ తెలిపినాడు[6]. తేటగీతిని పవడి, శుభ్రగీతి అని పొత్తపి కవి చెప్పినాడు[5]. ఆర్యలోని కందము తప్ప మిగిలినవి తెలుగు ఛందస్సులో వాడుకలో లేవు. పొత్తపి వేంకటరమణకవి సీసము, గీతులకు ఋగ్వేదబ్రాహ్మణములు మూలములని భావించినాడు.

జయకీర్తి ఛందోనుశాసనములో అక్కర, త్రిపది, ఏల, అక్కరికా, షట్పది, చతుష్పది, ఛందోవతంసము, మదనవతి, గీతికాదులను కర్ణాటక భాషలోనివని పేర్కొన్నాడు[7]. తెలుగులోవలె గాక, కన్నడములో బ్రహ్మ (సూర్య), విష్ణు (ఇంద్ర) గణములతోబాటు రుద్ర (చంద్ర) గణములు ఉండే ఛందస్సులు కూడ విరివిగా ఉపయోగించబడ్డాయి.

కన్నడ, తెలుగు భాషలలో వృత్తములలోని ఒక విశేషము ఏమనగా – సంస్కృతములోవలె ఇక్కడ పాదాంత యతి లేదు, అనగా ఒక పదము మొదటి మూడు పాదముల చివరలో అంతము కానవసరము లేదు. పాద మధ్యములో కన్నడములో పదవిచ్ఛేదయతి ఉన్నా, దానిని కవులు పాటించలేదు. కాని తెలుగులో పాదమునకు పది అంతకన్న ఎక్కువ అక్షరములు ఉండే వృత్తములలో పాదము మధ్యలో పదవిచ్ఛేదయతికి బదులు అక్షరసామ్య యతి లేక వడి యున్నది. ఈ నియమములవలన వృత్తములలో కథాగమనమును, వర్ణనలను సులభముగా చొప్పించవచ్చును.

గీతులకు అవసరములైన నియమములు గీతులు అనగా పాటలు. పాటలలో పదముల విఱుపునకు ప్రాముఖ్యము ఎక్కువ. ఇది ఉన్నపుడు పాట నడక చక్కగా ఉంటుంది, ఇది లేనప్పుడు అది కుంటు పడుతుంది. దీనిని దృష్టిలో నుంచుకొని గీతులకు మనము కొన్ని నియమములను అనుసరించవచ్చును.

  1. ఒక్కొక్క గీతికి ఒక్కొక్క విధమైన గణముల అమరిక ఉండును, పదములను ఆ గణములకు తగినట్లు విఱిచి వ్రాసినప్పుడు మాత్రమే ఆ గీతియందలి గానయోగ్యత, సౌందర్యము బాగుగ ప్రతిఫలించును. వృత్తములలో దీర్ఘ సంస్కృత సమాసములను వాడు తెరగును కవులు అంగీకరించారు. ఇంద్రగణములకు మూడు లేక నాలుగు అక్షరముల నిడివి, సూర్య గణములకు రెండు లేక మూడు అక్షరముల నిడివి. రెండు నుండి నాలుగు అక్షరములు ఉండే తెలుగు పదములు ఎన్నో ఉన్నాయి కనుక గీతులలో గణములకు తగ్గట్లు పదములను ఎన్నుకొనుట అంత కష్టతరమైన పని కాదు. ఈ పదముల విఱుపుగుఱించి అక్కరలను నిర్వచించునప్పుడు జయకీర్తి ఛందోనుశాసనములో[7] ఈ విధముగా అంటాడు –

    పాదే పాదేఽత్ర ప్రతిగణమపి యతిర్లక్ష్యతే సర్వేషామక్షరాణాం

    (అక్కరలో ప్రతి పాదములో ప్రతి గణమునకు యతి, అనగా పదపు విఱుపు, గలదు)

  2. పాదాంత యతి, అనగా పదము పాదముతో ముగియుట, గానయోగ్యతకు సౌలభ్యమును ఇస్తుంది. అందువలన ఈ పాదాంతయతి నిక్కచ్చిగా లక్షణగ్రంథములలో చెప్పబడకపోయినా, దీనిని కవులు గీతులలో ఎక్కువగా పాటించినారు. ద్విపద, రగడలకు మాత్రము ఇది తప్పని సరి.
  3. ద్వితీయాక్షర ప్రాస కూడ పాటకు ఒక ఆభరణము వంటిదే. జాతులకు నియతమైనా, ఉపజాతులకు ఇది ఐచ్ఛికము. అందులకు బదులు, వడితోబాటు ప్రాసయతిని కూడ ఉపజాతులకు సరియని కవులు, పండితులు, లాక్షణికులు నిర్ణయంచినారు. ఈ యతి స్థానము వద్ద క్రొత్త పదము ప్రారంభమయినప్పుడు ఇది ఇంకను శోభస్కరముగా నుంటుంది.

గణములకు తగునట్లు పదముల విఱుపుతో కొన్ని పద్యములను ఇక్కడ ఉదాహరణములుగా ఇచ్చుచున్నాను –

ఆటవెలది
అక్షమాలఁ బూని – యలమటఁ జెందక
కుక్షి నింపుకొనుట – కొదువఁ గాదు
పక్షి కొంగరీతిఁ – బైచూపు లేఁటికో
విశ్వదాభిరామ – వినుర వేమ – (వేమన పద్యములు, 49[8])

తేటగీతి
ఇష్ట మానస మయిన యా – హేమ ఖగము
నలుని మానస మానంద – జలధియందుఁ
గర్ణ శష్కులి కలశంబుఁ – గౌగిలించి
యీఁదఁ జేయుచు మృదుభాష – నిట్టు లనియె – (శ్రీనాథుని శృంగారనైషధము, 2 -7[9])

ద్విపద –
బసవని శరణన్నఁ – బ్రత్యక్ష సుఖము
బసవని శరణన్న – భవరోగ హరము
బసవని శరణన్న – నసలారుఁ గీర్తి
బసవని శరణన్న – ఫలియించుఁ గోర్కి
బసవని శరణన్న – నెసఁగు వాక్సిద్ధి
బసవని శరణన్న – భ్రాజిల్లు బుద్ధి – (పాల్కురికి సోమనాథుని బసవపురాణము – పీఠిక[10])

కొన్ని సమయములలో రెండు గణములను చేర్చి కూడ కవులు వ్రాసినారు. అట్టి దానికి ఒక ఉదాహరణము –

ఆటవెలది
కమలనయను వదన-కమల “మరందంబుఁ”
దవిలి నయన”షట్ప-దముల”వలనఁ
ద్రావి దినవియోగ – తాపంబు మానిరి
గోపకాంత లెల్ల – గోర్కు లలర – (పోతన భాగవతము, 10.1-627[1])

క్రింద నిచ్చిన పద్యమువంటి పద్యములలో మొత్తముగా గీతి లక్షణములు సరిపోయినను పదములకు గణములకు పొంతన తక్కువ.

ద్యుమణి | పద్మాకరము | విక-చముగఁ | జేయుఁ
గుముద | హర్షంబు | గావించు |- నమృత | సూతి
యర్థితుఁడు | గాక | జలమిచ్చు | – నంబు | ధరుఁడు
సజ్జనులు | దారె | పరహి | తా-చరణ | మతులు – (భర్తృహరి సుభాషితములు, ఏనుగు లక్ష్మణ కవి, నీతి – 63[12])