పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము

ఇంచుమించుగా గురజాడ వారు, గుత్తునా ముత్యాల సరములంటూ నూత్నకవితా ద్వారానికి తోరణాలు కడుతున్న కాలంలో శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి వల్ల వెలుగులోకి వచ్చిన పురాతన కృతి నన్నెచోడుని కుమారసంభవం. ఈ కవి నన్నయకు పూర్వపు వాడని, కాదు తరువాతి వాడని, సాహిత్యప్రపంచంలో వాదోపవాదాలు జరిగాయి. పొంగులు చల్లారేక, నన్నయకు తరువాతి వాడన్నవాదం ప్రస్తుతానికి నిలిచింది. భవిష్యత్తులో మరి కొన్ని పరిశోధనలు జరిగి, రుజువులు, ఆధారాలు దొరికి, కొత్త సిద్దాంతం వచ్చే వరకు ఇదే ప్రస్తుతానికి ప్రామాణికం అనుకోవాలి. నిజానికి, కవి ఏకాలం వాడు? అన్నది అతని కావ్యాన్ని మరింత బాగా అర్ధం చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది గాని, కవితామాధుర్యాన్ని ఆస్వాదించడానికి కవికాలం అంత ముఖ్యం కాదు అనే చెప్పాలి.

నన్నెచోడునికి వర్ణనలంటే వల్లమాలిన అభిమానం. తెలుగులో అష్టాదశ వర్ణనలు ఇమిడిగ్గా పొందుపరుచుకున్న ఏకైక కావ్యం అని కుమారసంభవం పేరు తెచ్చుకుంది. దీనిని మించిన విశేషం ఏమిటంటే సాధారణంగా, వర్ణన అన్న మాటకి ‘వివరించి చెప్పే విషయం’ అనే అర్థం లోక ప్రసిద్ధం అయినా, చాలా సందర్భాలలో నన్నెచోడుని వర్ణనలు మాత్రం క్లుప్తత, రమణీయ భావనాశ్రయత అనే మరో రెండు ప్రత్యేక లక్షణాలకి లక్ష్యాలుగా నిలిచి పోయాయి. ‘వర్ణనలెల్లచో వర్ణనకెక్కంగ’ వ్రాస్తానని చెప్పుకున్న ఈ కవి కావ్యంలో ఉన్న వర్ణనల గురించి మనం మాట్లాడుకోవాలంటే… ఎక్కడ మొదలు పెట్టాలి? పర్వత వర్ణనా? పురవర్ణనా? ఋతువర్ణనా? ప్రకృతి వర్ణనా? యుద్ధవర్ణనా? విరహవర్ణనా? సిరిగల వారింటి విందుభోజనంలా ఉన్న వీటిని అన్నిటినీ ఒక్కసారి ఆస్వాదించి, అరిగించుకునే శక్తి మనకి లేదు కనుక, ప్రస్తుతానికి పార్వతి తపోవర్ణనని మాత్రం ఆకళింపు చేసుకుని, ఆస్వాదించేందుకు ప్రయత్నం చేద్దాం.


ప్రబంధయుగానికి కొన్ని వందల ఏళ్ళు ముందుగా పుట్టిన సలక్షణమైన ప్రబంధం కుమారసంభవం. కవితామార్గంలో కొత్తపుంతలను తొక్కడమే ఆధునికతకు నిర్వచనం అయితే అప్పటి సాహితీ ప్రపంచానికి కొత్తవైన ప్రబంధ లక్షణాలనే ముత్యాలతో కుమారసంభవకావ్యమాలను ఆనాడే గుచ్చాడు నన్నెచోడుడు.

ఇందులో కథావస్తువు హిమవంతుని కూతురుగా జన్మించిన పార్వతి పరమేశ్వరుని సేవించడం, మన్మథదహనం, పార్వతి తపస్సు, శివపార్వతుల కల్యాణం, కుమారస్వామి జననం, తారకాసుర సంహారం. దీనికి పూర్వరంగంగా సతీపరమశివుల ప్రణయం, గణపతి జననం ఆదిగా గల కథలు. తరతరాల కవులను ప్రభావితం చేసిన మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత కుమారసంభవ కావ్యంలోని పార్వతిజననం మొదలుగా గల కధావృత్తాంతం తన కావ్యంలో వస్తువైనా, దీన్ని తనదైన రచనగా రచించడమే కాదు, కొన్ని కొన్ని చోట్ల కాళిదాసు చేతనే ‘శెభాస్’ అనిపించుకునేటట్లు వ్రాశాడని మహామహులెందరో అభిప్రాయపడ్డారు.

పార్వతి తపోవర్ణన ఘట్టం కుమారసంభవంలోని ఆరవ ఆశ్వాసంలో ఉంది. జంగమ మల్లికార్జునుని వద్ద పాశుపతదీక్ష పొందిన దగ్గరనుండి ఇంచుమించు 75 గద్యపద్యాలలో ఋతువర్ణనతో కలిపి పార్వతి తపోవర్ణన కొనసాగింది. సంస్కృత కుమారసంభవంలో ఐదవ సర్గలో ఈ తపోవర్ణన దాదాపు ఇరవై శ్లోకాలలో జరిగింది. ప్రకృతే అమ్మ వారు. అమ్మవారే ప్రకృతి – ఇలా ఆ జగజ్జనని కంటే అభేద్యమైన ప్రకృతిని వర్ణించడంలో ఆమె తపోవర్ణనని పొందుపరచడం ఎంతో సమంజసం. మహాకవి కాళిదాసు పరిచిన ఈ దారిని ఎంతో ఠీవిగా నడిచాడు రాచకవి నన్నెచోడుడు.

తపఃకాంక్ష

మన్మథ దహనానంతంరం విరహాగ్నిలో వేసారిన గౌరి, తపోమహిమతో పరమేశ్వరుని పతిగా పొందుతాను అనే నిశ్చయానికి వచ్చింది. ఇది విన్న తల్లిదండ్రులు, హితవుకోరిన వృద్దాంగనలు పరిపరివిధాల నచ్చచెప్పినా వినక, “నాకు ఈ భవమున ఈశ్వరుండ పతి. ప్రాణము, దేహము, చిత్తవృత్తులున్ శివపదపంకజార్పణము సేసితి” అని బదులు ఇచ్చింది. గతంలో నారదుడు, ‘ఈ దేవి లోకజనని, మహాదేవునకు అగ్రమహిషియై, పేర్మి సురేంద్రాదులకు అర్చితయగును,’ అని చెప్పిన మాటలను స్మరించిన హిమవంతుడు కుసుమకోమలి యైన తన కుమార్తె తపోదీక్ష వహించడానికి అనుమతించాడు.

తపోవన ప్రవేశం

ఈ తపస్సుకు నాంది ఆ దేవి అడవిలో అడుగుపెట్టడం. అరుణాంఘ్రితలదీప్తిన్ అవనీతలంబెల్ల పద్మరాగస్థల భాతిన్ ఒనర… అన్న పద్యంలో ఇలా వర్ణిస్తాడు నన్నెచోడుడు:

అడవిలో అడుగు పెట్టిన అగజాత ఎర్రని పాదాల కాంతి వల్ల భూమి అంతా పద్మరాగాలతో నిండినట్టు ఉందట. దిక్కులనే కలువలు ఆమె ముఖచంద్రికలతో అకాలంలో (పట్టపగలు) వెన్నెల వెలుగులను పొందాయాట. ఆమె పెదవుల కాంతితో అడవిలో ఉన్న తీగెలన్నీ చిగురించినట్టు ఉందట. ఆమె శరీరం మీద ఉన్న పరిమళాలను గ్రహించడం వల్లే గాలి గంధవాహనుడనే పేరు తెచ్చుకున్నాడట. అక్కడ తిరుగుతున్న నెమళ్ళు, మెరుపు తీగెల్లాంటి ఆమె కన్నుల కాంతులను చూసి, వర్షం రాబోతోందని ఉత్సాహ పడుతున్నాయిట.

ఇలా తన ‘ప్రకృతి’ అంటే తన సహజ స్వభావం లాంటి ప్రకృతి (వనప్రదేశం)లోకి పార్వతిని ప్రవేశపెట్టడం అన్నది ఎంత ఉదాత్తమైన భావం?

ఇలా అరణ్యాన ప్రవేశించిన ఉమ శబరులు, ఎఱుకలు, భిల్లులు ఆదిగా గల ఆటవీకుల్ని చూసింది. అటుపై వెదురుబియ్యాన్ని దంచుతూ, చుట్టూ చేరిన లేళ్ళను పరవశింప జేస్తూ, మనుష్యరూపాన ఉన్న శివుని వంటి జంగమ మల్లికార్జునుని స్తుతిస్తూ, పెక్కు రాగాల్లో ఎంతో అతిశయంగా పాటలు పాడుతున్న శబర వనితలను చూసింది. అటుపై ముని పల్లెను చేరుకుంది. అక్కడ వేదజ్ఞాన సంపన్నుడు, ఆత్మజ్ఞాని, మోక్షాసక్తుడు అయిన మల్లికార్జునుని దర్శించింది.

నన్నెచోడుడు సప్తసంతానాలలో ఉత్కృష్టమైన ఈ కావ్యకన్యకకు తన గురువు జంగమ మల్లికార్జునుని కృతిభర్తగా నిర్ణయించుకున్నాడు.

నింగి ముట్టియున్న జంగమ మల్లయ
వరమునందుఁ గనిన వస్తుకవితఁ
దగిలి వారియంద నెగడింతు రవికి దీ
పమున నర్చ లిచ్చు పగిది వోలె.

మహోన్నతుడైన మల్లికార్జునుని దయ వల్ల ప్రాప్తించిన తన వస్తుకవితను, దీపంతో సూర్యుడికి అర్చనలు చేసిన విధంగా తిరిగి ఆయనకే సమర్పించుకుంటాను
, అంటూ తన గురుభక్తిని ప్రకటించాడు. గురువు, ప్రభువు, ఇష్టదైవము అయిన జంగమ మల్లికార్జునుని స్తుతించి ఉన్నతస్థానంలో ఉంచి, అంతటితో ఆగకుండా, ఈ కథాసందర్భంలో తన గురువును సాక్షాత్తూ మహేశ్వరియైన ఆ పార్వతీదేవికే దీక్షా గురువును చేశాడు.

జంగమ మల్లికార్జునుని సమీపించిన ఆ ఈశ్వరి అతని వద్ద శైవాగమనియతి ప్రకారం శివదీక్షను పొంది, పరమశివుని శీఘ్రంగా ప్రసన్నం చేసుకునే మంత్ర ధ్యాన వ్రతాచారాలను ఉపదేశాలుగా పొంది, ఆయన అనుమతితో తపశ్చర్యకు సంసిద్ధురాలయింది.

తపోవేష ధారణ

ముందుగా, విభూతి పూత, నారచీరలు, రుద్రాక్షలు, జటలు మొదలైన వాటితో తపోదీక్షకు తగిన వేషధారణ చేయవలసి వుంది. ఈ సందర్భంలో పార్వతి వర్ణన:

పవడంపులత మీదఁ బ్రాలేయపటలంబు
        పర్వె నా మెయి నిండ భస్మమలఁది,
లాలితంబగు కల్పలత పల్లవించె నాఁ
        గమనీయ ధాతువస్త్రములు గట్టి,
మాధవీలత కలిమాలికల్ ముసరె నా
        రమణ రుద్రాక్షహారములు వెట్టి,
వర హేమలతికపైఁ బురినమ్మి యూఁగె నా
        సన్నుతంబగు నెఱిజడలు పూని,

హరుఁడు మాహేశ్వరీరూపమైన చెలువ
మభినయించెనొ యని మును లర్థిఁ జూడ
గురుతపశ్శక్తి మూర్తి సేకొనిన కరణిఁ
దగిలి యుమ తపోవేషంబుఁ దాల్చి పొల్చె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 82)

పగడపు తీగె మీద మంచు కప్పుకుందా అన్నట్లు శరీరమంతా తెల్లని విభూతిని పూసుకుని, చిగురించిన అందమైన కల్పవృక్షపులత అనిపించేటట్లు చక్కని కావిరంగు నారచీరలను కట్టుకుని, మాధవీలత మీద నల్లని తుమ్మెదలు ముసురుకున్నాయా అన్నట్లు రుద్రాక్షమాలలు ధరించి, శరీరమనే బంగారు తీగెపై నెమలి పురి విప్పి ఆడుతోందా అన్నట్టు చక్కని జడలు ధరించి, మహత్తరమైన తపశ్శక్తే ఈ ఆకారంతో వచ్చిందేమో అనిపించే విధంగా ఆ గిరిజ తపోచితమైన వేషధారణ చేసింది. ఆ రూపాన్ని, సాక్షాత్తూ పరమేశ్వరుడే మనోహరమైన స్త్రీరూపాన్ని ధరించి వచ్చాడేమోనని మునులందరూ కోరికతో ముచ్చట పడి మరీ చూస్తున్నారు.

ఇక్కడ పార్వతి సౌకుమార్యాన్ని సూచిస్తూ పగడపు తీగె, కల్పవృక్షపు తీగె , మాధవీలత, హేమలత వంటి ఉపమలతో వర్ణించడం, ముందుముందు ఈ లతాంగి, ఈ కుసుమకోమలి చెయ్యబోయే ఘోరమైన తపస్సును కన్నవారిలో, విన్నవారిలో — ఆ పార్వతా? ఈ తపస్సు చేస్తోంది! అనే అబ్బురపాటుకు — పూర్వరంగాన్ని అమరుస్తున్నట్టు ఉంది. అంతేకాదు, పరమేశ్వరుడే స్త్రీ రూపం ధరించాడా? అనడంలో ఆమె మనసంతా నిండి అంతర్గతమైన ఉన్న శివుని రూపం ప్రత్యక్షంగా చూసే వారికి కనబడుతూ, శివసాక్షాత్కారం తథ్యం అని చెప్పుతున్నట్టుంది.

తపోదీక్ష పూనిన వారు వీతరాగులు కావాలి. అంటే అన్నిటి మీద మమకారాన్ని లేదా అనురాగాన్ని వదలిపెట్టాలి. రాగ శబ్దానికి ఉన్న రంగు, అనురాగము, అనే రెండర్థాలతో దీని సమర్ధన ఎలా ఉందో చూడండి.

మేని కుంకుమరాగంబు, మెలత తోఁపు
మోవి తాంబూలరాగంబు మొగిన పాసి,
చారుతర మయ్యెఁ జూడ నా శైలతనయ
వీతరాగంబు ప్రకటించు విధము వోలె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 84)

పర్వత రాజపుత్రి తాపసియై శరీర లేపనాలు, తాంబూల సేవనం విడిచిపెట్టటం వల్ల శరీరంపై ఉండే కుంకుమరాగము, పెదవిన ఉన్న ఎఱ్ఱని తాంబూలపు రంగు, రెండు ఆమెని వీడి పోయాయి. అలంకరణలకు దూరం అయినా, తపోదీక్ష పూనిన గౌరి, దానికి అనుగుణంగా, అనురాగము లేదా మమకారాన్ని వదిలి వేసిన దాని వలె మరింత శోభాయమానంగా కనబడుతున్నది.

పార్వతి తపస్సు

గౌరివనంలో గౌరీదేవి స్నానార్చన హోమాదినిత్యకర్మలతోను, శాకాహార, ఫలాహార, పర్ణాహార, జలాహారాది మహాతపోవ్రతాలతోను, బొటనవేలిపై నిలబడి, బాహువులను పైకెత్తి, నాలుగగ్నుల మధ్యన నిలుచుండి, మార్తాండుని కేసి చూస్తూ, ప్రాణాయామాది నియమాలను పాటిస్తూ, ఇంకా ఎన్నెన్నో నిష్ఠలను ఆచరిస్తూ, నిరంతరం పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఘోరతపోదీక్షలో ఉంది. ఇలా తపోదీక్షలో ఉన్న ఆ నారీమణి శరీరం నుంచి ఆమె సహజసౌందర్యం తొలగిపోతోంది. ఇది ఎలా ఉందంటే — ముంగురుల అందాన్ని తుమ్మెదలలోను, మందగమనాన్ని హంసలలోను, ముఖకాంతిని తామరలలోను, శరీరకోమలత్వాన్ని తీగెలలోను, చంచలమైన చూపులను లేళ్ళలోను, దాచి పెట్టిందా అన్నట్టుగా ఇవన్నీ తపస్సు చేస్తున్న కారణంగా ఆమెలో కనబడటంలేదు.

కఠోరతపోదీక్షలో శాంభవి శరీరం నానాటికి కృశించడాన్ని నన్నెచోడుడు ఈ క్రింది పద్యంలో అత్యద్భుతంగా వర్ణించాడు.

ఉగ్రతపమునఁ దోడ్తోన విగ్రహంబు
చాల శోషించెఁ బ్రాలేయశైల తనయ
యర్ధనారిగాఁ దన దేహ మభవు మేన
నల్ప మల్పము నంటించునట్ల వోలె. — (కుమారసంభవం. షష్ఠాశ్వాసము. ప. 92)

ఆమె శరీరం శుష్కించిపోవడం ఎలా ఉంది? హిమవత్పుత్రి ఆ పరమేశ్వరుడి శరీరంలో సగభాగం కావడానికి గాను తన దేహాన్ని కొద్దికొద్దిగా ఆ శివుని శరీరానికి అంటిస్తోందా, అన్నట్టుగా ఉగ్ర తపస్సు వల్ల క్రమక్రమంగా తన శరీరాన్ని శుష్కింప జేస్తున్నది. ఇలా మహోన్నతమై, అత్యద్భుతమై, మనసుని స్పందింప జేసే భావాన్ని వ్యక్తం చెయ్యడానికి కందాన్నో, గీతాన్నో ఎంచుకోవడం నన్నెచోడుని ప్రత్యేకత.