నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం

చం.  అడరు నవాంబు ధారలు జటాటవిలోబడి విభ్రమించె వె
         ల్వడి చనుదెంచి రాలుగొని పక్ష్మములన్ వెడనిల్చి మోవిపై
         బడి కుచఘట్టనం జెదరి పాఱి రయంబున ముత్తరంగలన్
         మడుఁగులు వారి నాభి కెడమానక చొచ్చె ననుక్రమంబుగన్

ఈ పద్యం నన్నెచోడ మహారాజు రచించిన కుమార సంభవము అనే కావ్యం లోది. కాళిదాసు కుమారసంభవం ద్వారా కథ బాగా ప్రసిద్ధమైనదే. కానీ కావ్యం మాత్రం కాళిదాసు కావ్యానికి అనువాదం కాదు. వ్యాసభారతానికి కవిత్రయం చేసిన అనువాదం లాంటిది కాదు. అసలు అనువాదమే కాదు. స్వతంత్రంగా రాసిన చక్కని ప్రబంధం ఈ నన్నెచోడుని కుమార సంభవం. ఈ పద్యాన్ని గురించి మాట్లాడుకొనే ముందు కవిని గూర్చి కొంచెం ప్రస్తావన అవసరం.

ఎందుకంటే, నన్నెచోడునికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానమున్నది. అసలు 1909 వరకూ తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యం గురించి గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. 1909లో మానవల్లి రామకృష్ణ కవి తాను సంపాదించిన కుమార సంభవాన్ని ప్రకటించేసరికి ఆంధ్ర సాహిత్యలోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, సంతోషించింది గూడా. ఉలికిపాటు ఎందుకంటే నన్నెచోడుని కాలం క్రీ.శ. 940 అని మానవల్లి కవి చెప్పడం వల్ల. అంటే, మనం ఆదికవి అనుకుంటున్న నన్నయ భట్టు కన్నా రెండు వందలేండ్లు ముందువాడు అవుతాడన్నమాట. ఈ వాదం వల్ల నన్నయగారి ఆదికవి పీఠం కొంచెం కదిలింది. దీని మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగాయి.

అయితే, నన్నెచోడుడు కూడా తనకు పూర్వపు తెలుగు కవుల నెవర్నీ పేర్కొనలేదు. చాలా వాదాల తర్వాత, శాసనాలు కొన్నింటి ఆధారంగా నన్నెచోడుడు నన్నయకు వంద సంవత్సరాల తర్వాతి వాడని నిశ్చయం చేశారు. ఇది ఎక్కువ మంది పండితుల ఆమోదం పొందింది గానీ వివాదం మటుకు పూర్తిగా సమసిపోలేదు. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే పరిశోధకులు గానీ, విమర్శకులు గానీ, వారి వారి ప్రొత్సాహకులూ అనుమోదకులూ వ్యతిరేకులతో సహా, కులాభిమాన దురభిమానాలకు అతీతులేమీ కాకపోవడం. ఇందువల్ల సాహిత్యేతర కారణాలు చర్చల్లోనూ, నిర్ణయాల్లోనూ ముఖ్యపాత్ర వహించడం జరుగుతున్నది. పోనిండి, కవి గారి కాలచర్చ చరిత్ర పరిశోధకులకే వదిలిపెడదాం. నా ఉద్దేశం ఈ వివాదాన్ని మీకు పరిచయం చేయడమే. మనం ఇక కేవలం పద్యం సంగతి చూసుకుందాం. నన్నెచోడుడు ఆదికవి అయినా కాకపోయినా తెలుగు కవిత్వాన్ని మార్గ కవిత, దేశి కవిత అని వింగడించిందీ, కవిత్వ స్వభావంలో వస్తు కవిత అనేదాన్ని మొదట పేర్కొన్నదీ ఆయనే. నన్నెచోడుడు చాలా గొప్ప కవి.

కుమార సంభవం కథ మనకు పరిచితమే. గిరిరాజ తనయ శివుణ్ణి ప్రేమించడమూ, ఆయన కోసం తపస్సు చేయడమూ, ఆ క్రమంలో మన్మథ దహనమూ, తరువాత శివ పార్వతులకు కళ్యాణం జరగడమూ, కుమారుడు (కుమార స్వామి) సంభవించడమూ,, కుమార సంభవానంతరం తారకాసుర సంహారమూ, ఇలా సాగిపోయే కథ ఇది.

శివుణ్ణి భర్తగా పొందగోరి పార్వతి హిమాచల శృంగాల మీద తపస్సు చేస్తున్నది. గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. ఆమె అవయవాల అందాలన్నీ వేరే వేరే చోట్ల ఇల్లడ పెట్టి వచ్చిందట. ‘అలకల పొల్పు తేటిగములందు, మదాలస యాన లీల హంసల కడ, వక్త్రభాతి జలజంబులపై…’ – ఇలా అన్నమాట. తపోచర్య వల్ల రోజుక్కొంచెం రోజుక్కొంచెం శుష్కిస్తున్న ఆమె శరీరం ఎలా ఉన్నదంటే ‘అర్ధనారిగా తన దేహము అభవుమేన నల్పమల్పము నంటించునట్ల వోలె వుందట. ఎంత చక్కటి ఊహ. ఇలా తపస్సు చేస్తూ వుండగా వర్షాకాలం వచ్చి తొలకరి వానలు కురవడం మొదలైన సందర్భం లోనిది పై పద్యం.

చక్కనమ్మ చిక్కినా అందమే గదా. ఆమె నిటారుగా కూర్చుని తపశ్చర్యలో వున్నది. వాన చినుకులు ముందు ఆమె తలపై పడ్డాయి. అక్కణ్ణుంచి జారి ఆమె కనురెప్పల పైకి వచ్చాయి. కనురెప్పల వెండ్రుకల మీద కొంచెం ఆగి, ఆమె మెత్తటి ఎర్రటి మోవి మీద పడి అక్కడ కాసేపు మజిలీ చేశాయి. అక్కణ్ణించి ఆమె ఉరోజాల మీద పడి ధారలై ప్రవాహ వేగం సంతరించుకున్నాయి. మూడు కాల్వలుగా పాయలు కట్టి ఆమె నాభీ దేశం వద్ద మడుగులు కట్టినై. ఇదీ, ఆ వానజడి అంచెలంచెలుగా చేసిన ప్రయాణపు అనుక్రమం.

అవి నవాంబు ధారలు, అంటే తొలకరి వానలు. మొదట ఆమె తల మీది కచపంక్తిపై పడ్డాయి. జటాటవిలో, అంటే తల వెండ్రుకల నుంచి ‘విభ్రమించి వెల్వడి చనుదెంచి పక్ష్మములన్ వెడనిల్చి’నాయి. పక్ష్మములు అంటే కనురెప్పల మీది వెంట్రుకలు. ఆ వాన చినుకులు కనురెప్పల మీద కొంతసేపు నిలిచి, ఆపైన ఆమె పెదాల మీదకి జారి పడ్డాయి. ఆమె అధరాల మీద నుంచి ‘కుచఘట్టనన్ చెదరి పాఱి’నవి. కనురెప్పలూ,మోవీ సున్నితాలు. వక్షాలు అలా కాదు కాబట్టి ‘ఘట్టనం జెదరి’ అంటే తాకిడికి ఆ చినుకులు చెదరి, చెదరిన రయంబున పారినవి. అక్కడ ఆ ప్రవాహం ‘ముత్తరంగలై’, మూడు ధారలైనవి. ఒక్కో కుచం మీద నుంచి ఒక్కో ధార కారితే రెండు ప్రవాహాలు కావాలి. లేదూ, రయఘట్టనం వలన అటూ ఇటూ చెదరితే నాలుగు ధారలు కావాలి. కానీ, మధ్యలోని రెండు ధారలు కలిసి ఒకే ధారగా మారి ముత్తరంగలైనాయి. ఈ మూడు ప్రవాహాలూ మడుగులు వారి, ఎడము ఆనక, అనుక్రమంబుగా నాభికి చొచ్చినవట. అందుకు నాభి వద్ద పెద్ద మడుగు అయింది. మన కవుల కవిసమయాల్లో నాభి లోతుగా ఉండటం అనేది స్త్రీ సౌందర్య సూచన. పెద్దన గారి వరూధిని ‘నతనాభి’.

ఇక్కడ ఒక చిన్న విషయం. స్త్రీ అంగాంగాలూ కొలతలూ వర్ణించడమనే చాపల్యం నుంచి ఏ కవీ తప్పించుకోలేక పోయినాడు. దౌర్భాగ్యం. అయితే అలాంటి వర్ణన స్త్రీ కైనా పురుషుడికైనా ప్రతీసారి తప్పే అనలేం కూడానూ. శృంగారాత్మక సన్నివేశంలో అటువంటి వర్ణన సమంజసమే కావచ్చును, కాని చోట అశ్లీలాత్మకంగా స్ఫురించవచ్చు. ఒక కావ్యాన్ని చదివేటప్పుడు వర్ణనౌచిత్యాన్ని గమనించుకోవాలి కవి, పాఠకులు కూడా. సరే, ఈ వర్ణనల ఉచితానుచితాల చర్చను కాసేపు అలా పక్కన ఉంచితే –

తొలకరి చినుకుల ప్రయాణాన్ని ఎంత సౌందర్యాత్మకంగా రూపు కట్టించాడో చూడండి, కవి ఈ పద్యంలో. తల మీద నుంచి కనురెప్పల పైకి, మోవి పైకి జారి ఆపై ఉరోజముల మీదకు దూకి ధారలై నాభి దాకా పారి – ఇలా జలధారలతో విన్యాసం చేయించాడు. ఒక సామాన్య దృశ్యానికి కళాకృతి కల్పించాడు. వాన చినుకుల్లానే పద్యం లోని పదాలు కూడా విభ్రమించి వెల్వడి వెడనిల్చి పడి చెదరి పారుతున్నట్టు పద్యధార కూడా ఆ చినుకుల ధార లాగా ఆగుతూ విరుగుతూ నడిచింది. మిక్కిలి ప్రౌఢకావ్యం నన్నెచోడుని కుమార సంభవం. కేవలం పద్యాలు రాయడం కాకుండా, పదాలు ఏవి ఎప్పుడు ఎందుకో వాడాలో తెలిసిన కవి రచించిన కావ్యం. ఈ కావ్యంలో ఇలాగే మరిచిపోలేని పద్యాలు చాలా ఉన్నాయి.