20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక


20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల
పరిచయ గ్రంథం

20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం పేరుతో ఫిబ్రవరి 2009 లో ప్రచురించబడ్డ ఈ సంకలనం 2010 జనవరిలోనే అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఈ బృహత్సంకలనంలో 116 కథలున్నాయి. ఇవన్నీ 1964 నుంచి 1999 వరకూ అమెరికా నుంచి ప్రచురించబడ్డ తెలుగు కథలు. ఇందులో 11 కథలు మినహా మిగిలినవన్నీ మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రచురించబడినవే! మిగిలినవి: వంగూరి ఫౌండేషన్‌ వారు వార్షీకంగా నిర్వహించే కథలపోటీల్లో బహుమతి పొందినవి, వారు ప్రచురించిన అమెరికా తెలుగు కథా సంకలనాలనుంచి, అమెరికాలో తెలుగు పత్రికలనుంచి, తానా, ఆటా వార్షిక సంచికలనుంచీ పోగుచేసినవి. ఈ సంకలనంలో ఇరవయి ఇద్దరు రచయితలకు పరిమితమై నలభైఏడు కథానికలున్నాయి. ముత్యంగా ముగ్గురు రచయితలవి మూడేసి కథలు, పంతొమ్మిదిమందివి, రెండేసి కథలూ ఉన్నాయి. పుస్తకం చివర 106 పేజీలకు పరిమితమై అమెరికా తెలుగు రచయితల చిట్టా ఉన్నది.

ఈ సంకలనం అమెరికా నుండి ప్రచురించబడిన అమెరికా తెలుగువారి కథల సంకలనం. కాబట్టి, ముందుగా అమెరికాలో అమెరికన్‌ కథాసంకలనాల చరిత్ర గురించి క్లుప్తంగా ముచ్చటించడం కనుతెరుపని నా ఉద్దేశం.


1915 లో ఇరవైమూడేళ్ళు నిండిన హార్వర్డ్‌ పట్టభద్రుడు ఎడ్వర్డ్‌ జె. ఓ’బ్రైన్‌ (Edward Joseph Harrington O’Brien) మొట్టమొదటి ఉత్తమ అమెరికన్‌ కథానికా సంకలనం ప్రచురించాడు. అప్పటినుంచి, ప్రతి సంవత్సరం ఉత్తమ అమెరికన్‌ కథల సంకలనాలు వెలువడుతూ వచ్చాయి. అమెరికా చరిత్రలో 20వ శతాబ్దం మొదటిభాగంలో అమెరికాకి యూరప్‌ నుంచి జనం ఉప్పెనల్లా వలసకొచ్చారు. అప్పట్లో అమెరికా నుంచి వచ్చిన కథలు అమెరికా జీవన కథలు. ఆ కథల్లో అమెరికా వలస జీవితం ముఖ్య కథావస్తువుగా ప్రతిధ్వనించింది. అందుకనే కాబోలు, ఇంగ్లండ్‌ లోను, యూరప్‌ లోనూ విమర్శకులు అమెరికన్‌ కథలో తర్కం లేదు, శిల్పం అసలే లేదు, కథా కథనం సున్న అని న్యూనతాభావంతో తీసిపారేశారు. సరిగ్గా అదేపని ఇప్పుడు అమెరికన్‌ తెలుగుకథ గురించి తెలుగునాడులో అగ్ర సింహాసనాలపైన బైఠాయించిన సంకలనకర్తలు, విమర్శకులూ చేస్తున్నారని అనడం అతిశయోక్తి కాదు. అయితే, ఓ’బ్రైన్‌ అమెరికన్‌ కథలో ఉన్న నవ్యతని చూశాడు; ఆ నవ్యతని గుర్తించవలసిన ఆవశ్యకతా చూశాడు. అమెరికన్‌ కథని ప్రోత్సహించవలసిన అవసరం గుర్తించాడు.

ఆ తరువాత ఓ’బ్రైన్‌ పాతిక సంవత్సరాల పాటు అమెరికన్‌ కథా సంకలనాలు ప్రచురించి ఎంతోమంది కొత్త కథకులని ప్రోత్సహించాడు. విలియమ్‌ ఫాక్నర్ (William Faulkner), ఎర్స్కిన్‌ కాల్డ్వెల్‌ (Erskine Caldwell), స్కాట్ ఫిట్జ్గెరాల్డ్ (F. Scott Fitzgerald) , విలియమ్‌ సారోయన్‌ (William Saroyan) , జాన్‌ స్టైన్‌బెక్ (John Steinbeck), రిచర్డ్ రైట్‌ (Richard Wright) మొదలైన వారి కథలు ఉత్తమ కథలుగా గుర్తించి తన సంపాదకత్వంలో అచ్చయిన వార్షిక సంకలనాలలో ప్రచురించి ప్రోత్సహించబట్టే, ఇప్పటికీ మనం వాళ్ళ కథలు చదవి ఆనందించగలుగుతున్నాం.

ఓ’బ్రైన్‌ 1923లో స్విట్జర్లెండ్‌లో ఒక చిన్న పత్రికకి విలేఖకుడుగా పనిచేస్తున్నఒక అమెరికన్‌ రచయితని కలిశాడు. అతను చెప్పుకున్న గోడు విన్నాడు. అప్పటికి ఆ రచయిత పంపిన కథలన్నీ పత్రికలు తిరస్కరించి తిరుగుటపాలో పంపాయట! దానికి తోడు, బోలెడు రాతప్రతులన్నీ ఉన్న సూట్‌కేస్‌ కాస్తా పోయింది. నిరాశతో ఇక తను కథలు రాయటం మానుకుంటానని ఓ’బ్రైన్‌తో చెప్పాడు. ఓ’బ్రైన్‌ అతని దగ్గిర మిగిలివున్న రెండు రాత ప్రతులు తీసుకొని చదివి, మొట్టమొదటిసారిగా ఆ రచయిత రాసిన కథ, My Old Man, తన సంకలనంలో ప్రచురించాడు. ఓ’బ్రైన్‌ తన నిబంధనలని తానే ఉల్లంఘించి, అంతకుముందు ప్రచురణ కాని కథని కథాసంకలనంలో ప్రచురించటం, ఆ కథా సంకలనం ఆ రచయితకే అంకితమివ్వడం అదే మొదటిసారి. ఓ’బ్రైన్‌ ఆ సాహసం గనక చేసి ఉండకపోతే, ఎర్న్‌స్ట్ హెమింగ్‌వే (Ernest Hemingway) ఎవరో మనకెవ్వరికీ తెలిసేదే కాదనుకుంటాను.

ప్రతి యేటా ఎంపిక చేసిన కథలు ప్రచురించటమే కాకుండా, ఆ సంవత్సరంలో అచ్చైన అన్ని కథల పట్టిక, సమీక్షల పట్టిక, రచయితల వివరాలు, కథలు అచ్చువేసే అమెరికన్‌ పత్రికల చిరునామాలు, వగైరా ఇవ్వడం ఓ’బ్రైన్‌ చేసేవాడు. మొట్టమొదటి సంకలనంకోసం ఓ బ్రైన్‌ ఇరవైరెండు వందల కథలు చదివి ఎంపిక చేశానని రాశాడు. అమెరికన్‌ కథ పరంగా అది అతని నిబద్ధత అని చెప్పాలి. అది, అతని పట్టుదలకి, అతను కథల ఎంపికకై పెట్టుకున్న ప్రమాణాలకీ తార్కాణం.

1941లో లండన్‌పై కురిసిన బాంబుల వర్షానికి ఆహుతైన వారిలో ఓ’బ్రైన్‌ ఒకడు. అతని తరువాత, అమెరికన్‌ కథానికా సంకలనాలు మార్థా ఫోలె (Martha Foley), సంపాదకత్వంలో వెలువడినై. సాల్‌ బెల్లొ (Saul Bellow), ఫిలిప్ రాత్ (Philip Roth), వ్లాదమీర్‌ నబకోవ్ (Vladamir Nabakov) , జాయ్స్ కెరోల్‌ ఓట్స్‌ (Joyce Carol Oats), బెర్నార్డ్‌ మాల్మూద్‌ (Bernard Malamud) వగైరా ప్రసిద్ధ రచయితల కథలని గుర్తించి సంకలనాలలోకి తీసుకొవచ్చింది ఫోలే. సంవత్సరంలో ఆవిడ సుమారు రెండువేల కథలు చదివి వాటినుంచి ‘మంచి’ కథలు ఎంపిక చేసేదట! మూడు శతాబ్దాలపాటు ఆవిడ పని ఇదే!

అమెరికన్‌ కథాసంకలనాల ప్రచురణలో రాను రాను రకరకాల మార్పులు వచ్చాయి. 1978నుంచీ ప్రతిసంవత్సరం అతిథి సంపాదకుడో, అతిథి సంపాదకురాలో ఆఖరి ఎంపిక చెయ్యడం, తన ఎంపికపై వ్యాఖ్య రాయడం ఆనవాయితీ అయ్యింది. 2008 లో సల్మాన్‌ రష్దీ (Salman Rushdie) ఉత్తమ అమెరికన్‌ కథానికల సంకలనానికి అతిథి సంపాదకుడు.

కథాసంకలనాల కూర్పుకి పడవలసిన శ్రమ, కావలసిన ఓపిక గుర్తుకి తేవడంకోసమే ఈ పై ఉపోద్ఘాతం చెప్పాను. ఓపిక, శ్రమా చాలవు ; ఆ రెండింటికన్నా కన్నా ముఖ్యంగా
కావలసిన గుణం: Selectivity. ఈ Selectivity గనక లేకపోతే ఎంత శ్రమ పడి తెచ్చిన కథాసంకలనమైనా రాణించదు. కథలని ఒక సంకలనంలోకి ఎంపిక చెయ్యడానికి ఎన్నిగుణాలు, లక్షణాలు, నిబంధనలూ ఎంచుకున్నా, ఆ సంకలనంలో కథ కానిదేదో, చెడ్డకథ ఏదో చెప్పడం బహుశా తేలికేమో గాని, “ఇది మంచి కథ,” అని చెప్పడం కష్టమే! ఇది “గొప్ప కథ,” అని చెప్పడం అంతకన్నా కష్టం అని నేను అనుకుంటాను. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సంకలనాన్ని సమీక్షించడానికి ప్రయత్నిస్తాను.


ఓ’బ్రైన్‌ అమెరికన్‌ కథని ప్రోత్సహించవలసిన ఆవశ్యకతని గుర్తించాడని ఇదివరలో చెప్పాను. ఆ ప్రోత్సాహం మేరకు వంగూరి ఫౌండేషన్‌ వారికి, ఓ’బ్రైన్‌కీ ఉన్న పోలిక నిజంగా చెప్పుకోదగిన పోలిక. అంతేకాదు. 1995 లో మొదలుపెట్టి, వంగూరి ఫౌండేషన్‌ వారు ఇప్పటివరకూ పది అమెరికన్‌ తెలుగు కథా సంకలనాలు ప్రచురించి మార్గదర్శకమైన పని చేశారని ఒప్పుకొని తీరాలి. అందుకు ఆ సంస్థ నిర్వాహకులని అభినందించి తీరాలి.

ఆగస్టు 2000 లో చికాగో సాహితీ సదస్సులో నేను ఒక కొత్త పాట పాడాను. క్లుప్తంగా ఆ పాట సారాంశం ఇది: ” అమెరికాలో మనం తెలుగు డయాస్పోరా కమ్యూనిటీ
(diaspora community). మనం రచయితలుగా డయస్పోరా రచయితలం,” అని (డయాస్పోరా లో చిన్న ‘d’ గమనించండి). అప్పట్లో చాలామందికి డయాస్పోరా అన్నపదం ఒక వింత పదం! తరువాత, 2002లో డెట్రాయట్‌లో జరిగిన సదస్సులో నా భావనలో తెలుగు డయాస్పోరా అంటే ఏమిటో వివరణ ఇచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే, అది వివరణ కాదు; సంజాయిషీ! ఆ తరువాత, తెలుగు డయాస్పోరా సాహిత్యం పై, మాచిరాజు సావిత్రి, అఫ్సర్, రెంటాల కల్పన‌ వ్యాసాలు రాసారు. ఈ డయస్పోరా అన్న పదం అమెరికా సంకలనాలలోకి ఎక్కింది. ఒక్కొక్కసారి నా మటుకు నాకే అనుమానం వస్తుంది: “అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలయ్యిందా? లేదా, డయాస్పోరా రచన అంటే నాకున్న అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలా?” అని.

షికాగో సదస్సులో జంపాల చౌదరి అమెరికాలో తెలుగు డయాస్పోరా కథ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “… కొన్ని కథలలో కథాస్థలం మాత్రమే అమెరికా; వస్తువు, పాత్రలు, చిత్రీకరణ మొత్తం ఇండియా నుంచే. కథా స్థలాన్ని హ్యూస్టన్‌ బదులు హైదరాబాద్‌, చికాగో బదులు శ్రీకాకుళం చేసి ఈ కథల్ని పెద్దమార్పులు లేకండా తిరగవ్రాస్తే, పాఠకులకు తేడా ఏమీ తెలియదు. వీటిని డయాస్పోరా కథలు అనలేము” (రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, సభా విశేష సంచిక, షికాగో, ఆగస్టు, 19-20, 2000). ప్రస్తుతం సమీక్షకున్న సంకలనంలో అచ్చైన 116 కథలూ మరోసారి చదివిన తరువాత, చాలా కథల గురించి ఈ అభిప్రాయాన్ని ఖండించడం కష్టం. అయినా, ఈ సంకలనంలో అధ్యక్షుల ముందుమాటలో “డయస్పోరా ఇతివృత్తాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం,” అన్నమాటలు చూసిన తరువాత, ఈ డయాస్పోరా అనే ‘వింత పదం’ ఊత పదంగా తయారయ్యిందా అన్న అనుమానం వస్తుంది. అసలు డయాస్పోరా కథలు లేవని నేను అనడం లేదు. డయాస్పోరా సాహిత్యం గురించి మనకి కొంత ధృఢమైన అవగాహన అవసరం. ఇది చర్విత చర్వణం. అయినా తిరిగి చెప్పక తప్పదనిపిస్తున్నది.


20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
ధర, ఇతర వివరాలు

సింగపూరు చైనావారితో పోల్చి చూసుకుంటే మనకీ వాళ్ళకీ సన్నిహితమైన పోలికలున్నాయి. సింగపూరు చైనావారు డయాస్పోరా కమ్మూనిటీలకి సాహిత్యావశ్యకతని ఎలా అర్థం చేసుకున్నారో, ఏవిధమైన చర్యలు తీసుకొని వారు డయస్పోరా సాహిత్యాన్ని సృష్టించుకున్నారో – ఇత్యాది విషయాలు రెండు సాహితీ సదస్సులలో చెప్పింది నాందీ ప్రస్తావనలు అనుకుంటే, ఇప్పుడు చెప్పేది విష్కంభం అనుకోవచ్చు. విష్కంభంలో సాధారణంగా ఒక తక్కువ స్థాయిలో ఉన్ననటుడు (inferior actor) రంగస్థలం మీదికొచ్చి ఈ మధ్యకాలంలో, అంటే అంకానికీ అంకానికీ ఉన్న మధ్యకాలంలో జరిగిన కథ చెప్పుతాడు. ఆ పాత్రకి నేను తగుదనే అనుకుంటున్నాను. డయాస్పోరా సాహిత్యం గురించి ఈ కథా సంకలనం నేపథ్యంలో, కథలకు మాత్రమే పరిమితంచేసి సూచనగా పరామర్శిస్తాను.

డయాస్పోరా కమ్యూనిటీలలో సహజంగా కనిపించే కొన్ని లక్షణాలు మరొకసారి గుర్తు చేసుకోవటం అవసరం. ఈ లక్షణాలు:

  1. మాతృదేశపు జ్ఞాపకాలు ( నాస్టాల్జియా),
  2. ఈ పెంపుడుదేశంలో మనం ఏనాటికీ పూర్తిభాగస్వాములం అవలేమనే గాఢమైన నమ్మకం,
  3. మాతృదేశ సాహితీ సంస్కృతుల్లో వచ్చే మార్పులలో, విప్లవాలలో భాగస్వాములమవాలనే ఉబలాటం,
  4. సామూహిక సృహ, ఉమ్మడితనం, దృఢమైన ఏకత్వ నిరూపణ, వగైరా.

కారణాలు ఏమయితేనేం, సాధారణంగా డయాస్పోరా కమ్యూనిటీలన్నిటిలో ఈ పైన చెప్పిన అన్నిలక్షణాలూ కనిపించవు. ఏ కొన్నిలక్షణాలు ఉన్నా, దానిని డయాస్పోరా గా చెప్పవచ్చు.

ఉత్తర అమెరికాకి వలసవచ్చిన తెలుగు వారిని కాలక్రమానుసారం మూడు తరాలుగా, లేకపోతే మూడు తరహాలుగా విభజించవచ్చు. 1950 నుండి 1970ల వరకూ ఉత్తర అమెరికాకు వచ్చినవారు అందరూ ఉన్నతవిద్యాభాసం కోసం విద్యార్థులుగా వచ్చినవారు. అట్లా వచ్చిన వారి సంఖ్య కూడా చాలా పరిమితమైనదే! ఇక్కడ స్థిరపడి పోయిన కొద్దిమందీ ఈ మొదటి తరహా జనాభా. వీరికి వ్యక్తిగతంగా తెలుగు వారం అనే భావన ఉన్నా, ‘మేం తెలుగువాళ్ళం, తెలుగు వారిగా మనం ఉమ్మడిగా కలిసి ఏదో చేద్దాం’ అనే గాఢమైన వాంఛ ఉండి ఉన్నా, సామూహికంగా ఏవో కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు లేవనే చెప్పాలి. మొదటి కారణం: సామూహిక సృహతో ఏకత్వనిరూపణకి కావలసిన మంది బలం లేదు. రెండవకారణం: ఏ కొన్ని ముఖ్యనగరాలలో మందిబలం ఉన్నా, ఆర్థిక బలం లేదు. అయినప్పటికీ కూడా కొద్దిమంది ఉత్సాహవంతులు తెలుగు భాష, తెలుగు సాహిత్యపరంగా ఏదో సాధిద్దామని కుతూహలం చూపించారు. వీళ్ళని పయనీర్లని అనవచ్చు.

తరువాత, 1970 – 1990 లలో అమెరికాఖండానికి వచ్చిన తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది వైద్యులు, ఇంజనీర్లు, కొంతమంది వ్యాపారరంగంలో పట్టాలు పుచ్చుకున్నవారు. ఈ ఇరవై ఏళ్ళలో వలసకొచ్చిన జనబాహుళ్యానికి మంది బలమే కాకుండా, ఆర్థిక బలం కూడా కలిసి వచ్చింది. అప్పుడే చాలా పట్టణాలలో తెలుగు సంఘాలు స్థాపించడం, సామూహికంగా పండగలు, పబ్బాలు జరుపుకోవడం మొదలయ్యింది. ఊరూరా వెలిసిన తెలుగు సంస్థలు వ్రాత పత్రికలు – ముఖ్యంగా కమ్మ్యూనిటీ వార్తలకోసమే ననండి – నడపడం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఒక సరికొత్త వాతావరణం సృష్టించబడిందని ఒప్పుకోవాలి. అయితే చెప్పుకోదగిన వలస సాహిత్యం రావడానికి కావలసిన హంగులేవీ ఏర్పడలేదు. అటువంటి సాహిత్యానికున్న ఆవశ్యకత సృహలోకి కూడా రాలేదేమో అనిపిస్తుంది. అందుకు చాలాకారణాలున్నాయి. నాకు తోచిన ఒక ముఖ్య కారణం: ఈ సమయంలో వచ్చిన వారందరి ప్రావీణ్యత, వైద్య, యాంత్రిక సాంకేతిక విజ్ఞాన రంగాలకే పరిమితమై ఉండడం, సాహితీరంగం గురించి స్వతహాగా అవగాహనలేకపోవడం. అంతమాత్రం చేత వాళ్ళు సాహితీప్రియులు కాదనడంలేదు; సాహితీసృహ లేదనే అంటున్నాను. అయితే వీరు సాహితీపరంగా ఏవిధమైన ప్రయత్నాలు చెయ్యలేదనడం కూడా నిజం కాదు. సాధ్యమయినంతలో, తెలుగునాడునుంచి సాహితీపరులని, అంటే పేరుమోసిన కవులని, రచయితలనీ ఆహ్వానించడం, వారిచ్చే ఉపన్యాసాలు, ఉద్బోధలు ఆనవాయితీగా వినడం, వినిపించడం జరుగుతూనేవచ్చింది. ఈ ఉద్బోధల ద్వారా వచ్చింది, డయస్పోరా కమ్యూనిటీ సాధించిందీ, నిజానికి ఏమీ లేదని తరువాత గానీ తెలిసిరాలేదు. ఈ సమయంలో వచ్చిన వారిని ప్రాక్టీషనర్స్‌ అని చెప్పవచ్చు. సంఘస్థాపన, సామూహిక ఉత్సవాలూ భారీఎత్తున జరిపించి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఒక రకమైన ఉమ్మడితనం ఉన్నదని చూపించారు. అయితే, సంస్కృతి పేరుతో ఎక్కువభాగం సినిమారంగానికే అంకితమవడం కూడా జరిగింది.

1990నుంచి ఇప్పటివరకూ వలసవచ్చిన వాళ్ళు పూర్తిగా సాంకేతికవిజ్ఞానశాస్త్రంలో పట్టాలు పుచ్చుకున్న నిపుణులు. ముఖ్యంగా కంప్యూటరు రంగంలో పనిచేస్తున్నవారు. ఈ తరం వారి రాకతో అమెరికాలో తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది. వీరి సగటు ఆర్థిక స్థోమత పైన చెప్పిన రెండవ తరహావారితో సరితూగుతుంది. సాంకేతికంగా ఈ సమయంలో చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనికేషను విప్లవం వచ్చింది. ముఖ్యంగా, తెలుగువారికి సంబంధించినంతవరకూ, తెలుగు సినిమాలు, తెలుగు సినిమా పాటలు సమృద్ధిగా, తెలుగునాడుతో సమతూకంలో తేలికగా లభించడం మొదలయ్యింది. అటు, ఇటు రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఈ తరం వారిలో చాలామందికి ఎనిమిది గంటలు మాత్రమే ఉద్యోగరీత్యా మనది కాని పరాయి వాతావరణం; అంతే! మిగిలిన సాంఘిక వ్యాపకాలు అన్నీతెలుగు దేశంలో ఉన్నట్టే జరుగుతూ వున్నాయి. ఇది కృత్రిమంగా కనిపించవచ్చు. లేదా భ్రమ కావచ్చు! దానికి తోడు ఈ తరం వాళ్ళు చదువుకున్న పాఠ్యభాగాలలో తెలుగు చాలా పరిమితం అవడంతో, మొత్తం మీద చాలామందికి సాహిత్యపరంగా ఆసక్తి తక్కువేనని చెప్పాలి. అయితే ఒక సుగుణం. తెలుగు భాషపై, తెలుగు సాహిత్యంపై స్వయం కృషితో ఆసక్తి పెంచుకున్నవారు, కేవలం భాషపై మమకారంతో ఇక్కడి తెలుగువారికి సాంకేతికంగా ఎంతో ఉపకారం చేస్తున్నవారు ఈ భాగం నుండే వచ్చారు. ఈ ఉపకారం వ్యాపారాభిలాషతో కాకుండా, స్వఛ్ఛందంగా పనికట్టుకొని చేస్తున్నవాళ్ళు ఈ తరం వారే!

ఈ సంకలనంలో అమెరికాకి వలసవచ్చిన ఈ మూడుతరాల వారూ తయారుచేసిన కథా సాహిత్యం, వలస కథాసాహిత్యం పొందుపరచబడింది. ఎవరినీ కించపరచకండా, ఎవరినీ అందలం ఎక్కించకండా, స్థూలంగా ఈ సంకలనంలో కథలగురించి ముచ్చటిస్తాను.

తెలుగు దేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయని వాళ్ళు, గట్టిగా తెలుగు చదవనివాళ్ళు, ఏదో ఊసుపోకకి తెలుగు పత్రికలని చూసీ చూడనట్టు చూసి పడేసేవాళ్ళు, ఇక్కడికొచ్చాక ‘రచయితలు, కవులూ’ అయ్యారు. కారణం: బహుశా నాస్టాల్జియా అవచ్చు. డయాస్పోరాకి ఉండే లక్షణాలలో నాస్టాల్జియా ఒకటి కదా! పైన చెప్పిన మూడు తరాల తెలుగువారు తెలుగులో రాయడం బాగా పెరిగింది. సాంకేతికంగా తెలుగులో రాయడం సులువవడం, ప్రచురణ తేలికవడం, పాఠకుల సంఖ్య పెరగడం, అక్కడి పత్రికలు – దిన వార మాస పత్రికలు – సమృద్ధిగా ఇంటర్నెట్లో దొరకటం, అక్కడ పత్రికలలో అచ్చవుతున్న కథాసాహిత్యం అచ్చయిన వెంటనే చదవడానికి అవకాశాలు పెరగటం, మొదలైన కారణాలు ‘రచయితల’ సంఖ్యని ముమ్మరంగా పెంచాయి. అమెరికానుండి రచనలు సాగిస్తున్న వారి సంఖ్య సుమారు నాలుగు వందల పైచిలుకేనట! వీరిలో చాలామంది కథానికలు అల్లుతున్నవారే! అయితే ఒక్క విషయం స్పస్టంగా కనబడుతుంది; చాలామందికి రాయడం వచ్చు, కానీ వాళ్ళు రచయితలు కారు. అంటే, రాయటం వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కడూ రచయిత కాలేడని అర్థం.

కథలు అల్లుతున్న వారిలో, నూటికి తొంబది మందికి కథావస్తువు, ఇతివృత్తం, ఇక్కడి భార్యాభర్తల సంసార వ్యాపకాలు. అమెరికాలో తెలుగు సంసారాల పోకడ, వారి దినచర్య. చక్కని కథావస్తువు. కాదనలేం. కాని, దురదృష్టవశాత్తు ఈ కథలు చాలా మటుకు ఫార్ములా కథలుగా రూపొందుతున్నాయి. కథ జరిగే స్థలం ఒక్కటే: అమెరికా, అదీ పేరుకే! ఆయన, ఆవిడ ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటారు. అంతవరకూ బాగానే ఉన్నది. ఆవిడ ఉద్యోగం చేస్తున్నా, పనినుంచి తిరిగి రాగానే ఇంటిలో వంట చేయాలి. ఇంటికి తిరిగి రాగానే తెలుగు ఆడపడుచుగా మారిపోవాలి. అది ఆయన కోరిక. అది అన్నివేళలా సాధ్యం కాదు, సులభం కూడా కాదు. దానితో సంసారంలో ఘర్షణలు ప్రారంభం!

కొన్నికథల్లో ఈ కొత్తకాపురంలోకి అత్తమామలు వస్తారు. వాళ్ళకి వీళ్ళ పద్ధతులు సుతరామూ నచ్చవు. చికాకు! అయితే, ఈ రకం కథలు అల్లే వాళ్ళల్లో చాలామందికి తమ కథలని ఏదోరకంగా సుఖాంతం చెయ్యాలనే మథన కనిపిస్తుంది. కథకుడు ఆమెనీ అతన్నీ తాత్కాలికంగా వేరుచేస్తాడు. అప్పుడు ఈ కథ ఆంధ్రాలో కూడా అచ్చయ్యే అవకాశాలు ఎక్కువ. అక్కడ పత్రికలలో అచ్చవడం గొప్పగా భావించడంతో, అక్కడి కథల్లా ఇక్కడి కథలని బలాత్కారంగా మలచడం కొందరి కథకుల్లో కొట్టవచ్చినట్టు కనబడుతుంది. మరి కొన్ని కథల్లో ఆవిడ ఇండియా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఈ తరహా కథల్లో, అంటే ఫార్ములా కథల్లో, జంపాల చౌదరి చెప్పినట్టుగా ఆస్టిన్‌, అట్లాంటాకి బదులు హైదరాబాదో, అనకాపల్లో అని మారిస్తే కథకి ఏ విధమైన ఢోకా లేదు.

మరికొన్ని కథలలో వస్తువు ఇదే! ఇక్కడి ఫామిలీ లైఫ్! అయితే కథలో మరొక ట్విస్ట్. అతను మరోకులం వాడు. ఉదాహరణకి అగ్రకులం వాడనుకోండి. ఆమె కులం వేరు! అయినా, ఆమెను ప్రేమించి పెళ్ళాడతాడు, అక్కడే, ఆంధ్రాలో! ఆమె పేద కుటుంబం నుంచి వచ్చింది. ఇద్దరి తల్లిదండ్రులూ పెళ్ళికి కూడా రారు. ఇంతవరకూ సహజత్వంలో లోటులేదు. ఇటువంటివి జరుగుతున్నాయి కదా! ఆ భార్యా భర్తలిద్దరూ అమెరికా వచ్చేస్తారు. అతనికి ఉద్యోగం. ఆమెకు ఉద్యోగం వచ్చేటంత చదువు లేదు. ఏదో వానాకాలం చదువే! ఇక్కడ చదువుకుంటానంటుంది. అతను సరేనంటాడు. అక్కడిదాకా బాగుంది. ఆమె కాలేజీలో ఎవరో మరో తెల్లవాడితో – వాడిపేరు జాన్‌ అనుకోండి! – ఆమెకు వాడితో చనువుగా ఉండటం మొదలవుతుంది. ఇటువంటి సంఘటనలు అమెరికాలో మాత్రమే జరుగుతాయనే భ్రమకి కారణం తెలియదు! కథని మరింతబాగా బాగా అమెరికనైజ్‌ చెయ్యాలనే దృష్టితో, భర్తకి భార్యపై అనుమానం కలిగించాలి. ఇద్దరి మధ్యా అపార్థాలూ, పోట్లాటలు. వేరుపడటం, విడాకులు. అతను వెంటనే ఇండియా వెళ్ళి ఈ సారి అమ్మా నాన్నలు కుదిర్చిన డాక్టర్‌ అమ్మాయిని, తనకులస్తురాలిని, యధావిధిగా శాస్త్రయుక్తంగా తిరపతిలో పెళ్ళి చేసుకొని వస్తాడు. అరేంజ్డ్ మేరేజస్‌ మంచివనే నీతి బోధతో, కథ అతనికి సంబంధించినంత మటుకూ సుఖాంతం!

మరొక పెద్ద సినిమాటిక్‌ ట్విస్ట్. మొదటి భార్యని జాన్‌ వంచన చేస్తాడు! అంతకన్నా పెద్ద ట్విస్ట్. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని కథల్లో ఆమెని చంపెయ్యవచ్చు. కొన్నిటిలో ఆమె వికలాంగి అయి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ జాన్‌ అన్న తెల్లవాడిని జగన్నాధం అనే జగ్గయ్యపేట వాస్తవ్యుడిగా చేస్తే ఈ కథ తెలుగు సినిమాకథే అవుతుంది! ఇలాంటి కథలు తెలుగు సినిమాలు చూసి రాస్తున్నట్టుగా కనిపిస్తాయి. లేదా, తెలుగు సినిమా తయారీ కోసం రాస్తున్నట్టుగా ఉంటాయి.

అమెరికాని భూతలస్వర్గంగా ఊహించుకొని మోసపోయిన వైనాలు, అమెరికా కృత్రిమజీవితం నికృష్టం అని చెప్పే నీతి కథలు – ఇవి ఇంకో రకం. అమెరికాలో నైతిక జీవనం అరసున్న అని కథలో ప్రతిబింబించాలి. అమెరికా కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు చెప్పాలి. కథకుడు ఈ విషయం నమ్మినా, నమ్మకపోయినా, అది కథకుడి అనుభవంలో ఉన్నా లేకపోయినా, కథకోసం అల్లిక! భోగభాగ్యాలు, డాలర్లూ నిజమైన సుఖాన్నివ్వవు అనే నీతి బోధ! మానసిక సుఖం అక్కడే సాధ్యం! ఇదీ వరస. ఇటువంటి కథల్లో మనది కర్మభూమి అని, మన ప్రాచీన సంస్కృతి, మన సంప్రదాయాలూ ఎంతో గొప్పవని ఒక పాత్రచేతో – ఒక్కొక్క సారి ముఖ్యపాత్ర చేతో, కథకుడో, కథకురాలో – ఉపన్యాసం ఇప్పిస్తారు! వస్తువు సమకాలీనమైనదైనా కథకుడికున్న దృక్పథం మూలంగా కథా, కథనం రెండూ కూడా చప్పగా తయారవుతాయి. మరికొన్ని కథల్లో డేటింగ్‌ తెచ్చే దౌర్భాగ్యం కథావస్తువు. మెలికలు తిప్పి, ఏదో రకంగా అది తప్పు అని నిరూపించడానికి పడే వ్యధ స్పష్టంగా కనిపిస్తుంది! కథలో కృతకత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఇటువంటి కథలు చాలా భాగం కథాకథనంలో ఉన్న లోపాలతో ఉంటాయి.


20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల
పరిచయ గ్రంథం

మరోరకం కథలు. ఇక్కడి వాళ్ళు రాసినవే! పూర్తిగా అక్కడి వాతావరణం. ఆ చక్కని పల్లెటూరి వాతావరణం, ఆ మమకారాలు, ఈతచెట్టులూ, అరిటి తోటలు! పైరగాలి! అక్కడి పేదవారి అన్యోన్యత, సహృదయత్వం, కలుపుగోలుతనం! వాటిని ఇక్కడి హుందాలతో పోల్చి, ఈ అమెరికన్‌ జీవనవిధానాన్ని ఈసడించుకోవడం, తూలనాడటం, కథా వస్తువు! అంతమాత్రం చేత, కథనం బాగున్న కథలు లేవని అనను. కొద్దిమంది కథని చాలా అందంగా చెప్పగలిగారు. నిర్మాణ చాతుర్యం మూలంగా కథ చదివిస్తుంది. నా బాధల్లా డయస్పోరా జీవితం ఇతివృత్తంగా తీసుకొని అల్లిన కథలు, చక్కని కథానిర్మాణంతో మరోసారి చదివించే కథలు, చాలా తక్కువగా వున్నాయి. కాని, దురదృష్టవశాత్తు, ఈ సంకలనంలో (ఇతర అమెరికన్‌ కథాసంకలనాలలో కూడా!) ఏ విధమైన సెలెక్టివిటి లేకపోవడం మూలంగా అటువంటి కథలు పూర్తిగా మరుగున పడిపోతున్నాయి.

పోతే, కథకి ప్రయోజనం ఉండాలని, అది జీవితాన్ని విమర్శించాలనీ, సాంఘికన్యాయాన్ని కూర్చాలనీ కొంతమంది కథకుల దృఢనమ్మకం. వాస్తవాన్ని చిత్రించని రచనలు, ఎంత అందంగా ఉన్నా అవి సమాజానికి మేలు చెయ్యవు; హాని చేస్తాయనే ఒక రకమైన భ్రమ! కాగా కథలో సందేశం ఉండాలనే నమ్మిక! ( హెమింగ్వేని ఎవరో అడిగారట! ఫలానా కథలో మీ సందేశం ఏమిటీ అని. ఆయన, సందేశం కావాలంటే పోస్టాఫీసుకి పోవాలి; కథ దగ్గిరకి కాదు, అన్నాట్ట!)

తమాషా ఏమిటంటే, అక్కడనుండి (అంటే తెలుగునాడు నుండి) ప్రచురించబడే కొన్ని పాక్షిక సంకలనాలలో (biased collections) కథలు చదివినా, లేదా కనీసం సంపాదకుల పరిచయవాక్యాలు చదివినా మనకు ఈ పై సమాధానాలే వస్తాయి, కథ గురించి! కథా వస్తువు, కథాస్థలం మాత్రం వేరు! మనవాళ్ళు రాస్తున్న కొన్ని కథలకీ, అక్కడ పత్రికల్లో వస్తున్న చాలా కథలకీ తేడా ఏమీలేదనిపిస్తుంది. స్థలం తప్ప!

కారణం? నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్‌ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు. లేదా, డయాస్పోరా కథ అంటే, నాకున్న అవగాహన తప్పేమో తెలియదు.

Paul Gilroy (The Black Atlantic : Modernity and Double Consciousness, Harvard University Press, 1993) ఆఫ్రికన్‌ డయాస్పోరా గురించి అన్న ఈ క్రింది మాటలు మనకి కూడా వర్తిస్తాయని అనుకుంటాను.

“… Diaspora invariably leaves a trail of collective memory about other times and places. Most displaced immigrant people frame these attachments with the aid of living memory and the continuity of cultural traditions. It is not uncommon for some diasporas to have these memories refracted through a prism of history to create maps of desire and attachment.”

అయితే గాజుఫలకంలో తెల్లని వెలుగు రేఖకి వచ్చే వక్రీభవనం, ఆ పంచరంగుల అందం, అన్నీ మనకథలలో మరీ మరీ వక్రీకరించబడుతున్నాయేమోనన్న అనుమానం రాక మానదు.


ఈ సంకలన ప్రచురణతో నాకున్న కొన్ని ‘పేచీలు’ చెపుతాను. కొన్ని ఉచిత సలహాలు కూడా మనవి చేస్తాను. ఈ సలహాలు పాటిస్తే, పుస్తకం స్థాయి తప్పకుండా పెరుగుతుందని నా విశ్వాసం.

ముందుగా, అచ్చుతప్పులు – ఈ సంకలనంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రూఫ్ రీడింగ్లో కాస్త శ్రద్ధ చూపిస్తే పడ్డ శ్రమకి ఫలితం బాగుండేది. జనరల్‌ ఎడిటర్‌ గారి పరిచయ వాక్యాలలోనే ముద్రారాక్షసాలు కొంచెం బాధాకరం. కథల సూచికలో కథకుల పేర్లలో అచ్చుతప్పులు. కొన్ని కథలలో, మధ్యలో ఇంగ్లీషు మాటలు ఎగిరిపోవడం, ఫుట్ నోటులు మాయవవడం జరిగింది. ఇకపోతే విరామచిహ్నాల (punctuation) గురించి చెప్పనవసరం లేదేమో! విరామ చిహ్నాలపై ఒక హాస్య సంభాషణ చెప్పి మీకు రిలీఫ్ ఇస్తాను. ఎల్మోర్‌ లెనర్డ్ (Elmore Leonard) రాసిన గెట్ షార్టీ (Get Shorty, Delta, New York 1995) నవలలో ఒక వంచకుడికి మరొకడితో సంభాషణ ఈ పద్ధతిలో సాగుతుంది.

“…నన్నడుగుతున్నావా? నీకు మాటలు కాగితం మీదపెట్టడం వచ్చా అని? …నీ బుర్రలోకి వచ్చిన మాటలన్నీ ఒకదాని తరువాత ఒకటి వెంటనే కాగితం మీద పెట్టు. నువ్వు చెయ్యాల్సింది అంతే. స్కూల్‌ లో రాయడం నేర్చుకున్నావా లేదా? … తరువాత, కామాలు గట్రా పెట్టడానికి ఎవడో ఒకడు దొరుకుతాడు. ఆ పని చేసే వాళ్ళు బోలెడుమంది ఉన్నారు, తెలుసా?”

ఇది, ఎడిటర్లమీద విసురు! సీరియస్‌గా నామనవి. పుస్తకంలో అచ్చుతప్పులు రెండవ ముద్రణలో సవరిస్తే బాగుంటుంది. “స్వచ్చంద సేవకులుగా మేము ఈ సాహితీ సేవ చేస్తున్నాం,” అని తప్పుకొపోవడం తప్పు. ఎందుకంటే, ఈ పుస్తకానికి పూర్వం ముప్ఫైఎనిమిది ప్రచురణలు చేసిన సంస్థ అలా అని సర్దుకోవడం, cop out అనక తప్పదు.

ప్రచురణ కర్తలకి ఏదోవిధంగా వంద పైచిలుకు కథానికలు అచ్చువెయ్యాలనిపించింది. అందులోనూ, నూటపదహారయితే మరీ బాగుంటుదనిపించి ఉండాలి. లేదా పవిత్రత మీదో, పుణ్యత మీదో వ్యామోహం అయిఉండాలి. అందుకేనేమో, ఇరవై ఇద్దరు రచయితల రచనలు నలభైఏడు ప్రచురించారు. తిరిగి మరొకసారి ఈ రచనలు చదివితే, ఆయా రచయితలకి (మి టూ!) అంత జాగా ఇవ్వనవసరం కనిపించలేదు. అధ్యక్షులు, ఇలా రాశారు: “…తమ సృజనాత్మక రచనలద్వారా – అంటే తాము రచించిన కథలూ కవితలద్వారా – చరిత్రను సృష్టిస్తున్నట్టుగానీ, చరిత్రని పదిల పరుస్తున్నట్టుగానీ తెలుగు రచయితలకీ – ముఖ్యంగా ఉత్తర అమెరికా తెలుగు రచయితలకి – తెలియజేయడం, వారి రచనలని పదిలపరచడం నా దృష్టిలో చాలా ముఖ్యమైన విషయం,”

రచనలు పదిలపరచడమే ముఖ్యమైన విషయమైతే, ఆ ఇరవై ఇద్దరి రచనలూ ఒక్కొక్కటే అచ్చువేసి ఉంటే, మరొక ఇరవై ఐదు రచయితలకి చోటు దొరికి ఉండేది కదా! అంతే కాదు. కథల పోటీలలో నెగ్గిన కథలు, కొంతకాలం తరువాత మళ్ళీ చదివితే, ఇవి మరోసారి ఒక బృహత్సంకలనంలో ప్రచురించడానికి తగినవేనా అన్న అనుమానం రాక మానదు. పైగా, ఇవన్నీ ఇదివరకు వంగూరి ఫౌండేషన్‌ వారు ప్రచురించిన ఇతర సంకలనాలలో అచ్చులో పదిలపరచబడ్డాయి కదా? సంస్థ అధ్యక్షులు, సంపాదకుల ఇష్టాఇష్టాలను ప్రశ్నించి వాళ్ళకి కోపం తెప్పించడం, విసుగెత్తించడం నా అభిమతం కాదు అని మనవి చేసుకుంటున్నాను.

‘రచన’ శాయి గారిచ్చిన యోగ్యతా పత్రం మీద రెండు మాటలు. అమెరికాలో చాలా మంది తెలుగు కథకులకున్న కోరికే ఈ సంకలన ప్రచురణ కర్తలకు కూడా ఉన్నట్టు కనపడుతున్నది. అక్కడి పత్రికల్లో తమ కథలని అచ్చు వేయించుకోవడం, అక్కడి సంకలనాలలో ఎంపిక కావాలన్న వ్యామోహం, అక్కడి వారి మెప్పు కావాలని ఊరట పడటం, వగైరా. నిజం చెప్పండి. ఇప్పుటికీ అక్కడనుంచి యోగ్యతా పత్రం ఇక్కడి కథలకి అవసరముందా? ఆంధ్రదేశం నుంచి వస్తూ ఉన్న సంకలనాలని చూస్తూనే ఉన్నాము. ఆ సంకలనాలలో కథల ఎంపిక వెనుక ఉన్న రాజకీయ పక్షపాతం, వాళ్ళ ఉద్దేశంలో కథకి ఉండవలసిన ప్రయోజనం గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు – వీటి గురించి ఇప్పుడు ముచ్చటించడం అప్రస్తుతం. ఒక విషయం మాత్రం నిజం. అక్కడి సంపాదకులకు అమెరికా తెలుగు సాహిత్యంపై ఏర్పడ్డ condescending వైఖరి కొత్తదేమీ కాదు. ఈ విషయం శాయిగారు ఉదహరిస్తూనే, వరసగా ఒక పాతిక తెలుగుదేశపు కథల జాబితా ఇచ్చారు. కావాలంటే ఇలాంటివి ఒక వంద కథలు చెప్పగలనన్నారు. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు. అభ్యంతరం లేదు. కానీ, ప్రతిసారీ, అమెరికా తెలుగు కథలని ఆంధ్రదేశం నుంచి ప్రచురించబడే తెలుగు కథలతో పోల్చటం అక్కడి సంపాదకులకి, విమర్శకులకి, సమీక్షకులకీ, ఒక అసంకల్ప ప్రతీకార చర్యలా తయారయ్యింది. విసుగు పుట్టిస్తూన్నది. అక్కడి ధోరణి ఇప్పుడిప్పుడే మారదు కూడా. ‘రచన’ శాయి గారంటే మీకెంత గౌరవం ఉన్నదో నాకూ అంతే గౌరవం ఉన్నది. అయితే, ఒక్క విషయం నిక్కచ్చిగా చెప్పుకోవాలి. అమెరికా తెలుగు కథ అమెరికా కథ. పీరియడ్. అందుకనే నేను ఎడ్వర్డ్ ఓ’బ్రైన్‌ గురించి అంత వివరంగా ముచ్చటించాను.

అమెరికా సాహితీవేత్తల పరిచయ గ్రంథంలో నాలుగు భాగాలున్నాయి. మొదటిభాగంలో ఉన్న అందరు రచయితల సాహిత్య చరిత్ర ఎడిట్‌ చేసి, కుదించి అచ్చువేసి ఉంటే బాగుండేది. రెండు, మూడు నాలుగు – ఈ భాగాలు ఎందుకో నాకు అంతుపట్టలేదు. అమెరికాలో తెలుగు ‘రచయితలు’ వెరసి 450 పైచిలుకు ఉన్నారని చెప్పటానికా?

ఆఖరిగా ఒక మాట.

ఈ పుస్తకం వంగూరి ఫౌండేషన్‌ వారు ఎంతో శ్రమకోర్చి కూర్చారు. అందుకు వారికి మరోసారి ధన్యవాదాలు. అయితే, ఎంపిక పరంగా మరికొంత శ్రద్ధతో ఈ పుస్తకం ప్రచురించి ఉంటే, అమెరికాతెలుగుకథానిక పై పరిశోధన చేద్దామనే ఉబలాటం ఉన్న ముందుతరాల పరిశోధకులకి యెంతో ఉపయోగపడేది.