మధ్యలో ఎందుకో ఆ కనురెప్పలు తెరచి
ఎరుపు మొగ్గల్లోంచి
నిను చూస్తో, చిన్నగా నవ్వినప్పుడు

నీ చేతిని తమ చేతిలోకి తీసుకుని, తిరిగి
కళ్ళు మూసుకుని
ఆ భద్రతలో ఎటో తేలిపోయినప్పుడు!

భావపూరితమైన ప్రకృతివర్ణనతో మొదలై, ఒక కవిమృతిజనితదుఃఖం నింపుకొని, ఆ కవిని స్మరిస్తూ, వియోగాన్ని వర్ణించి, కవి వ్రాసిన కావ్యం కవిస్మృతి కన్నా బలీయంగా యెదను పట్టి లాగుతూంటే దాన్ని తల్చుకొని, ఆ స్థితి నుంచి కావ్యనాయికతో సల్లాపమాడి, తిరిగి తేరుకొని మళ్ళీ సత్కవిని స్మరించి ముగిసిన ఈ కవిత వంటి ఎలిజీని నేను మరొకదాన్ని చూడలేదు. చరిత్రకారులు గుర్తింపని ఆధునికాంధ్రయుగంలోని మొట్టమొదటి మాలికాస్మృతిగీతమిది.

ఇక్కడికి ఇలా రావడానికి ఏదైనా కారణం ఉందా? లోపలెక్కడో తెలీని ఆలోచనల నుంచి ఇక్కడికి రావాలని, ఇలా ఈ క్షణాన్ని గడపాలని, ఈ పరిసరాలను చూడాలని, ఇలా ఒక మనిషిని కలవాలని అనిపించి ఉంటుందా? లోలోపలే ఏదైనా జరిగి ఉంటుందా? ఇదేదీ కాకపోవచ్చు! మనుషుల జీవితాలు చాలా చిన్నవి. దేనికీ ఎవరికీ అక్కర ఉండదు. బతికుండే క్షణాలను కల్పించుకోడం కోసం మనస్సు పడే వెంపర్లాటేమో ఇదంతా!

వేసవికాలపు సాయంత్రం
విరగకాసిన మావిడి తోటలో
వేలకొద్దీ కాయల్ని చూస్తూ
విరాగివై కూర్చుంటే

‘సహస్ర శీర్షాపురుషః’ అర్ధం కోసం
వేరెక్కడో వెతకక్కరలేదు నువ్వు!

నేడు తెలుగులో వందకుపైన గౙల్ రచయితలు ఉన్నారని అంచనా. కాని ఆ గౙలులలో గౙల్ ఛందస్సు మాత్రము మృగతృష్ణగా మిగిలినది. ఈ పరిస్థితి ఎందుకు తెలుగు గౙలులకు అనే ప్రశ్నకు గౙల్ ఛందస్సు విదేశీయము, మన తెలుగు భాషకు సరిపోదు అన్నది ఒక ముఖ్య వాదము. ఇందులో ఇసుమంత కూడ సత్యము లేదు. అసలు ఈవాదమును లేవనెత్తినవారు గౙల్ ఛందములను చదివినారా అనే సందేహము కలుగుతుంది.

ఒక్కోసారి ఎవరూ దొరకనప్పుడు
పెరుగన్నం దక్కని గండుపిల్లిలా
జాలి మరకతో తిరిగినట్టుండే
వాడి కంతిరి ముఖం మీద పోలికలు
గంపలు గంపలుగా పోగుపడతాయ్.

మెట్ల మీద లయగా నా మెట్టెల ధ్వని
పాదరక్షలు లేని కాళ్ళకి చీరకుచ్చిళ్ళే గొడుగు
కంటి చూపుకి లంకె వేసే ఇరు వైపుల పచ్చదనం
నడక ఆగి సేద తీరి – అచ్చంగా నాదనిపించే సమయం.

నన్ను నేను బయటేసుకోవాలనే వుంటది.
నన్ను మోసిన తల్లికి నా నిస్సహాయతను,
నా బిడ్డల్ని మోస్తున్న తల్లికి నా నిర్లక్ష్యాన్ని తప్ప
ఏమీ ఇవ్వలేని అసమర్థుడిలా మిగిలిపోతుంటాను.
ఇద్దరు తల్లుల దీవెనార్తులే ఊపిరిగా శ్వాసిస్తుంటాను.

వేళ్ళ సందుల్లో
పట్టి ఉంచే బిగువు వదిలేసి
అనుకరిస్తున్నట్టు
లేచిన కాలితో పాటు లేచి
కిందికి దిగే సమయాన్ని
చిన్న చప్పుడుగా మారుస్తుంది.

అంతఃపురస్త్రీల అపహరణము అనునది యోహాన్ గాట్లియబ్ స్టెఫనీ డి యోంగర్ అను నాటకకర్తచే రచింపఁబడి, వుల్ఫ్‌గాంగ్ అమెడెయుస్ మొజార్టు అను సుప్రసిద్ధుడైన ఆస్ట్ర్రియను సంగీతకారునిచే సంగీతబద్ధము చేయఁబడిన గేయవచన సంభాషాత్మకమైన రూపకము. అట్టివాటిలో నన్నింటికంటె ప్రసిద్ధమైనది ఈ మోజార్టు ఓపెరా.

సామాజిక చరిత్ర నిర్మాణానికి కేవలం సాహిత్యం పైనే ఆధారపడవలసిన అవసరం ఉండకూడదు. కానీ సాహితీగ్రంథాలను ఆలంబన చేసుకున్నప్పుడే ఆ సమాజం గురించి సరైన అవగాహన సాధించగలుగుతున్న ఈ నేపథ్యంలో రాజగోపాల్, ఆత్మకథలను ఆధారం చేసుకుని వలసవాద సమాజాన్ని విశ్లేషించాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం.

భక్తి ఉద్యమం రోజుల్లో ప్రజలకి దేవుని ఉనికి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. అప్పటికి శాస్త్రవిజ్ఞానం ఇంకా బాల్యావస్థలోనే ఉంది. ప్రజానీకంలో అత్యధిక భాగానికి దేవుని చూడాలని, స్మరించాలని, అందుకోవాలనీ తపన ఉంది. తమ నిస్సహాయ స్థితినుండి బయటపడటానికి సంసిద్ధత ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జీవిక ముఖ్య సమస్య.

క్రితం సంచికలోని గడినుడి-81కి మొదటి ఇరవై రోజుల్లో సరిచూపు సచేతనం చేసిన తరువాత ఇరవైయొక్కరి నుండి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-81 సమాధానాలు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

మీ కథలలో ప్రస్ఫుటమయ్యే సృజన, కథనాశైలిలో నూతనత్వం, ఎంచుకునే అంశాలలో వస్తువైవిధ్యం, రచనావిధానంలో నేర్పు సాహిత్యాభిమానులని అలరిస్తాయని మా నమ్మకం. ఈ సంకలనానికై మీరు రాసే కథ మేము అందించాలనుకున్న ప్రమాణాలకి న్యాయం చేస్తుందనే నమ్మకంతో మీకు ఈ ప్రత్యేక ఆహ్వానం.

పెద్దగా ఏమీ ఏదీ అక్కర్లేదు. ఒక వెయ్యి నూట పదహార్లు మొదలుకుని, రెండు మూడు శాలువాలు పూలదండలు ఒక సాయంత్రంలో మూడు నాలుగు గంటలు కలుపుకొని, కొంత మొత్తం తనది కాదనుకుంటే, తెలుగునాట ఎవరైనా పురస్కార ప్రదాత కాగలరిప్పుడు. అమ్మలో నాన్నలో అక్కలో అన్నలో పెంచి పెద్ద చేసినవాళ్ళో దయతో చదువు చెప్పించినవాళ్ళో గురువులో పెంపుడు జంతువులో – ఎవ్వరి పేరు మీదైనా ఇప్పుడు ఒక సాహిత్య పురస్కారం ఆరంభించనూ వచ్చు, ఆ పక్క ఏడాదే ముగించనూ వచ్చు. ఇచ్చుకునేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు తప్ప వీటికి అర్హతలింకేమీ అక్కర్లేదు. ఏ సాహిత్య విలువలు, ప్రమాణాలతో ఎందుకిస్తున్నారో తెలియకుండా దానంలా ఇచ్చే ఈ పురస్కారాలను ఏమనలేం. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటు ఇష్టాలు కాబట్టి ఏమీ అనకూడదు కూడానూ. ఇలా వ్యక్తిగత ఇష్టాలు, కారణాలతో వీధికొకటిగా దొరికే పురస్కారాల మధ్యలో ప్రభుత్వం అందించే సాహిత్య అకాడెమీ అవార్డుకు ఒకప్పుడు కొంతయినా విలువ ఉండేది. అది అందుకున్న వారి పట్ల గౌరవం ఉండేది. ఆ రెండూ బహుశా ఇకపై ఉండవు, ఉండబోవు. సంస్థాగత బాధ్యత ఎంత గురుతరమైనదైనా, ఆ సంస్థను నియంత్రించే సాహిత్యకారులు అందరిలా అల్పమానవులే అన్న మేల్కొలుపు, గడియారం గంటలా ఇన్నేళ్ళుగా మోగుతూ వస్తున్నా, తెలుగు సాహిత్య ప్రపంచాన్ని చరిచి నిద్ర లేపింది ఈ ఏటి సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ అవార్డు ప్రకటన, అదీనూ సోషల్ మీడియా చలువ వల్లనే. ఒక పుస్తకాన్ని పురస్కారానికి ఎలా ఎన్నుకున్నారన్న సందేహం కలిగించే రచనలు మునుపూ లేకపోలేదు. సాహిత్యవిభాగాల నుండి అందుకున్న పుస్తకాల్లో నుండి కమిటీ ఉత్తమమైనవి ఎన్నుకోవాలన్నది అకాడెమీ పురస్కారం తాలూకు ప్రాథమిక ఎంపికకి సంబంధించిన ఒక నియమం. కానీ ఏ రకంగా చూసినా ఏ సాహిత్యవిలువలూ కనపడని రచనలను పదేపదే ఎన్నుకోడం ద్వారా తెలుగు భాషలో వస్తున్న ఉత్తమసాహిత్యం ఇంతమాత్రమే అని తెలుగు అకాడెమీ దేశానికంతటికీ చాటి చెప్తూ వస్తోంది. ఏ విభాగంలో పురస్కారాలైనా ఆయా విభాగాల్లో చెప్పదగ్గ కృషి చేసిన కవులు, రచయితలు, సాహిత్యకారులకు, నిజమైన సృజనాత్మక శక్తి ఉన్నవాళ్ళకి ఇస్తే, వాళ్ళకి జాతీయంగా గుర్తింపు వస్తుంది, వాళ్ళ సాహిత్య ప్రపంచం విశాలమవుతుంది. సృజన యొక్క నాణ్యత ఎంచడం అనేది ఎంత సాపేక్షికమైనా, పోల్చి చూసినప్పుడు సాధారణ పాఠకులు కూడా అద్భుతమైన విచక్షణ చూపిస్తూ ఏది మంచి కవితో కథో విమర్శో ఏది కాదో వివరించి మరీ చెప్పగలిగినప్పుడు, కేవలం నాసిరకం రచనలనే ఎంచుకుంటున్న అకాడెమీ పెద్దలను తూర్పారపట్టడం ఒక బాధ్యత. మచ్చుకైనా కనపడని వాళ్ళ నిబద్ధతను వేనోళ్ళ ప్రశ్నించక పోవడం నేరం. స్వార్థ రాజకీయ సమూహాలు, అనుయాయులైన కవిరచయిత బృందాల భజనల కోలాహలం తోడుగా, ఏళ్ళకు ఏళ్ళ తరబడి జులుం చేయడం హక్కుగా పీఠాలను ఆవహించుకుని కూర్చున్నారు కొందరు అజ్ఞానవృద్దులు. ఆ పీఠం ఇచ్చే గౌరవం కోసం దాన్నే పట్టుకు వేలాడే ఈ కుకవుల ఆధిపత్యాన్ని గుడ్డిగా ఆమోదించే అకాడెమీ కమిటీల దౌర్భాగ్యం వల్ల తెలుగు సాహిత్యంలో ఈ పురస్కారాల విలువ చెప్పుకంటుకుంటే రాయికి తుడుచుకొని పోయే స్థాయికి చేరిపోతోంది, ఇప్పటికే చేరిపోకుంటే. సాహిత్యకారులకి కావలసినది వారి ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వని సమాజం, సృజనను బ్రతికించే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. సాహిత్యం విలువ తెలిసిన సమాజానికే సాహిత్యకారులను ఎందుకు కాపాడుకోవాలో, ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. అలాంటి అవకాశం లేని చోట సాహిత్యకారులకు రెండే దారులుంటాయి. ఈ రొచ్చు తమది కాదని ఛీ కొట్టి, అలౌకిక స్థాయిలో రచనను ప్రాణశకలంలా ఏకాంతికంగా సృజించుకోవడం. లేదూ, సామాజిక స్థాయిలో ఈ కుళ్ళిపోయిన సంస్థలను ప్రతిఘటిస్తూ, ఎవరిదైనా సరే ఒక మంచి సాహిత్యానికి గుర్తింపు తేవడమొక బాధ్యత అని నమ్మి నడుములోతుకు ఈ బురదలోకి దిగి పోరాడడం. ఈ రెండూ కాని లోకంలో అకాడెమీ పెద్దల ఉచ్చిష్టాన్ని ప్రసాదంలా చేతులు చాచి స్వీకరించడమే ప్రతీ ఒక్కరి సాహిత్యనియమం అవుతుంది.

జీవితాలు వ్యర్ధంగా గడిచిపోతున్నాయి, త్వరపడండి, సార్థకం చేసుకోండి, అన్న హెచ్చరిక. ‘ఎ గేమ్ అఫ్‌ కోర్స్‌’ ప్రారంభదృశ్యం లోని సంపన్నస్త్రీ అయినా, ముగింపుదృశ్యం లోని లిల్ అయినా జీవితాల ముగింపు ఒకటే. క్లియోపాత్ర లాగానో ఒఫీలియా లాగానో కథ విషాదాంతమే – మరణమో, సదృశమైన జడజీవనమో. కాని జీవితచదరంగం యిద్దరికీ సామాన్యమే.

అడవి వృక్షాలు, వాటిని ఆనుకున్న దట్టమైన పొదలూ లతల మధ్య ఉన్నాయా శిథిలాలు. మేము వెళ్ళినప్పుడు మరికొంత మంది సందర్శకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ లేనట్టయితే అదంతా వింతగా, కాస్తంత భీతి కొలిపేలా అనిపించేదే. అక్కడ అవన్నీ చూపించడానికి సహాయకులు, గైడ్‌లూ లేరు. కనీసం సమాచారం చెప్పే బోర్డులన్నా లేవు.

నడీన్ గోర్డిమర్ కంటే చాలా ముందే దక్షిణాఫ్రికాలో తెల్ల, నల్ల జాతుల గురించి వ్యాసాలను, అక్కడి స్త్రీల జీవితాల గురించి ఒక నవలనూ రచించిన 19వ శతాబ్ది రచయిత్రి ఆలివ్ ష్రైనర్ ఎక్కువమంది పరిశోధకులకు కూడా అపరిచితురాలే. ఈ రచయిత్రి మన గాంధీజీని కలుసుకుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించిందనీ చదివినపుడు కలిగే ఉత్సాహం వేరు.

థియరీ లోను, ప్రాక్టికల్స్‌ లోను, దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే టాపర్. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేట్లుండే మనిషికి అంతంతసేపు ఏకబిగిన కూర్చుని చదివే ఓపిక ఎలా వుందో అర్థమయ్యేది కాదు. బారక్‍లో లైట్‍ని ఆఫ్ చెయ్యడం లేదని రూమ్మేట్లు తరచూ కంప్లైంట్ చేస్తున్నా భట్ మాత్రం రాత్రి మూడింటివరకూ చదువుతూనే ఉండేవాడట. అతను తినేదెప్పుడో, పడుకునేదెప్పుడో కనిపెట్టడం పక్కవాళ్ళక్కూడా కష్టమయ్యేదట.