బైరాగిని తలచుకుంటే ‘నూతిలో గొంతుకలు’ వినిపిస్తాయి. చుట్టపు చూపుగా వచ్చి, అట్టేసేపు వుండని ‘ధూమకేతువు’ కనిపిస్తుంది. “రాయప్రోలు, విశ్వనాథ వంటి ధ్రువతారలేకాదు, శిష్ట్లా, నారాయణబాబు, బైరాగి వంటి నక్షత్రాలు కూడా సాహిత్య రోదసికి అలంకారాలే” అన్నాడు శ్రీశ్రీ.

బైరాగిది కవితాశిల్పం కాదు. రచనాశిల్పం, కవితాశిల్పం ఏకదేశ పర్యాప్తమైన ఉక్తివైచిత్రిలో అంతర్లయిస్తుంది. రచనాశిల్పం ఆద్యంత హేలగా ఉండే కూర్పు. వాగర్థ సంపృక్త భావ బంధురమైన తీర్పు. దానికి కడలికెరటంలా ఆటుపోటులుండవు; ఆవిచ్ఛిన తైలధారగా ప్రవహించే సమతానిర్ఝరి అది. ఇందుకు ఆయన రచనలన్నీ ప్రత్యక్షరసాక్ష్యాలే.

అతని గొంతుక నూతిలోనుంచి కాదు, హేతిలోనుంచి వినబడింది. భీతిలేనివాడు, ఖ్యాతికోరనివాడు, నేతలను నమ్మనివాడు, భూతలాన్ని అకాలంలో వదిలేసి వెళ్ళగలిగినవాడు బైరాగి.

తానెందుకు రాసాడో, ఏమి రాసాడో, ఎవరి గురించి రాసాడో, తన సంశయాలేమిటో, తన తాత్త్విక భూమిక, తన విచారధార, అన్నింటినీ స్థిరంగా తెలిసినవాడు బైరాగి. జీవితకాలమంతా తన రచనల్లో ప్రస్ఫుటించినవాడు బైరాగి. భాషని, శైలిని, సంవిధానాన్ని నిర్దేశిత భావాల ప్రకటనకు సమర్థంగా ప్రయోగించినవాడు బైరాగి.

మహోజ్వలమైన కావ్యకాంతులు వెదజల్లిన దీపశిఖ అతను. అన్నిటా ఉన్నా దేన్నీ అంటని విరాగి. విషాద విషాన్ని పుక్కిట పట్టిన విశ్వయోగి బైరాగి. మానవతకు మకుటమైంది అతని కవిత! కవిగా బైరాగి చరితార్థుడు!

నలభయ్యేళ్ళ కిందట నా తొలియవ్వన కాలంలో నన్ను నేనూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగిన ప్రశ్నలే, ఇప్పుడు ఈ విద్యార్థిని తనని తానూ, తను చుట్టూ ఉన్న వాళ్ళనీ అడుగుతోంది కదా?! ప్రశ్నలూ, వాటి స్వగతాలూ, విషాద యోగాలూ ఏం మారాయి?!

ఈ మార్పు కోసం పాడే ఆగమగీతి దాకా బైరాగి మనకి తోడుగా వస్తాడు.

శ్రీశ్రీ ప్రపంచం దీనుల, హీనుల ప్రపంచం; పతితుల, శ్రామికుల, బాధా సర్ప దష్టుల ప్రపంచం. బైరాగి ప్రపంచం అదికాదు; అది హామ్లెట్ల, రాస్కల్నికోవ్ల ప్రపంచం. వీళ్ళది ధర్మాధర్మాల సంశయం వల్ల కలిగిన మనఃక్లేశం, పాపపుణ్యాల విచికిత్సవల్ల కలిగిన హృదయ శోధన.

వేదన, సంశయం, మనిషిని పనికిమాలిన వానినిగా మార్చకూడదు. బాధకు, అన్యాయానికి, మనిషి కొంత కాలం తల ఒగ్గుతాడేమో కాని అంతకాలమూ కాదు. అతనిలోని మానవత్వం, అతనిలోని మనీషి మేల్కొంటాయి. నవమార్గానికై వెదుకుతాయి.

బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్పృహ మౌలికమైన ఆవేశాలు. అయితే బైరాగి నైరాశ్యం మనసును క్రిందికి దిగలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూతలూగించే ప్రభంజనం వంటిది.

ఏ దశలోనైనా బైరాగి సామాజిక భావాలు స్ఫటికంలాగా విస్పష్టంగానూ, నిర్మలంగానూ ఉండేవి. అందుచేత అతని కవితలు చదివి ఆనందించటానికి అతని భావాలతో ఏకీభవించనవసరం లేకపోయేది. ఇది కవిలో చాలా అపూర్వమైన గుణం అనుకుంటాను.

ఎక్కడా దిక్కు తోచక, ఏ దారీ దొరక్క, అంధతమిస్రం వంటి ఈ ప్రపంచాన్ని ఎలా తరింపజెయ్యాలా అన్న పెనుభారాన్ని మోస్తూ కరుణతో ప్రేమతో కవిత్వం రాశాడు బైరాగి.

ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామ్సన్‌కు ఎంత ప్రత్యేక ప్రాముఖ్యం ఉందో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యమూ ఉంది. “స్వర్గ భైరవం” (Hound of Heaven) గొప్ప గీతం అంటారు. ఆ స్వర్గ భైరవాన్నే నేను బైరాగిలో చూస్తాను.

బైరాగిపై బెంగాలీ కవి జీవనానంద్ దాస్ ప్రభావం ఉందని అంటారు. ప్రభావం అన్నది చాలా పెద్ద మాట. కానీ, స్వంత గొంతుక బైరాగికి ఉంది. ఆయన బాణీ ఎవరినీ అనుకరించినదీ, అనుసరించినదీ కాదని ఆయన కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది.

అతడు ఆదిమ మానవుడి నుండి అత్యాధునిక మనీషి పర్యంతం మధ్య కాలంలో మానవాళిని వెంట తరుముతున్న నిరవధిక భ్రంశాన్ని సమగ్రంగా చిత్రీకరించాడు. అందువల్లనే అతడు కవులకు కవి. పూర్ణకవి.

ప్రత్యేక కంఠస్వరం ఆలూరి బైరాగిది. అది దేనికీ అనుకరణప్రాయం కాదు. ఆత్మవేదనను, ప్రపంచ బాధను సమానంగా పలికించిన కంఠస్వరం. ఆశ, నిరాశల అపురూప సమ్మేళనం. నిష్కల్మషమైన, ఆర్ద్రమైన, ప్రేమపూర్వకమైన, గాద్గదికమైన గొంతు.

సాంప్రదాయిక కవిత నుండి వచన కవితా వసుంధర మీదకు వచ్చిన బైరాగి అన్ని దారులూ చూపి, బ్రతుకులో నుంచి బ్రతుకుకు పరిస్థితులను మానవీయం చేయాలన్న తనదైన బాటనే తొక్కాడు.