సెప్టెంబర్ 2022

What is freedom of expression? Without the freedom to offend, it ceases to exist.” – Salman Rushdie.

ద్వేషం అనే విత్తనం మొలకెత్తితే అది ఎప్పటికీ చావదని, కలుపుమొక్కల్లా విస్తరిస్తూనే ఉంటుందని చాటడానికి రచయిత సల్మాన్ రుష్దీపై ఇటీవల జరిగిన హత్యాప్రయత్నం ఒక ఉదాహరణ. తమ స్వార్థం కోసం, గుర్తింపు కోసం, న్యూనతలను కప్పిపుచ్చుకోవడం కోసం, కొన్ని ప్రభుత్వాలు, మతసంస్థలు సమాజంలో ద్వేషాన్ని పెంచిపోషిస్తూనే ఉన్నాయి. ఆ విద్వేషానికి స్వ-పర భేదం లేదని, తమ లక్ష్యం నెరవేర్చడం దగ్గర ఆగిపోవాలని తెలీదని, అదుపు తప్పి, నిలబడ్డ నేలనంతా మహాభూతమై కబళిస్తుందని చరిత్ర ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. చేయిస్తున్నారు. చెడుపిలుపులకు, చర్యలకు సత్వరం ప్రతిస్పందించే జాంతవిక సమూహమొకటి సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. ముల్లాల ఫత్వాలు అమలు చేయడానికైనా, మసీదులు కూలగొట్టడానికైనా, కులమతాల పేరిట అసహాయులపై దాడికైనా ఈ మూర్ఖపు మూక సదా సన్నద్ధంగా ఉంటుంది. సొంత ఆలోచనంటూ లేని వీరికి ఎప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఎంతటి దేవుడినైనా విమర్శించగలిగే, చివరికి హేళన కూడా చేయగలిగే అధికారం -మహాభక్తులకు, కళాకారులకు- ఇద్దరికే ఉందని. నిఖార్సైన ఏ కళాకారుడూ మతసంస్కృతులలోని సత్సంప్రదాయాన్ని విమర్శించడు. హేళన చేయడు. కాని సంప్రదాయం అనే ముసుగులో జరిగే ఘోరాలను, అత్యాచారాలను; పవిత్రత, మర్యాద అనే పట్టుబట్టలు కప్పుకున్న మానవమృగాలను విమర్శిస్తాడు. మతం పేరిట నాయకులు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎత్తిచూపుతాడు. అందుకే, “Respect for religion has become a code phrase meaning ‘Fear of Religion’. Religion, like all other ideas deserve criticism, satire and yes, fearless disrespect” అంటాడు రుష్దీ. ఏ మతమూ విమర్శ, వ్యంగ్యం, నిర్భయాపూరితమైన తిరస్కారాలకు అతీతం కాదని, కారాదని నమ్మే వారి వల్ల నిజానికి సంస్కృతీసాంప్రదాయాలకు లేశమంతైనా హాని జరగదు. కాని, పదిమందిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే నాయకుల మనోభావాలు మాత్రం గాయపడతాయి. ఏ మతమైనా మొట్టమొదట బహిష్కరించవలసినది, మనోభావాలు గాయపడుతున్నాయని దౌర్జన్యానికి దిగేవారినే. ఎందుకంటే వీరికి నిజంగా ఏ మతంతోనూ, ధర్మంతోనూ సంబంధం లేదు. మమేకమవ్వగలిగిన గుణం లేదు. వీరి దౌర్జన్యానికి బలిపశువులు కావాలి అంతే. ఎమ్. ఎఫ్. హుసేన్ చిత్రాలు తగలబెట్టి అతన్ని దేశంనుంచి వెళ్ళగొట్టినా, పెరుమాళ్ మురుగన్‍ను వెంటాడి వేధించినా, రుష్దీని తిరిగి స్వదేశం లోకి రానియ్యకపోయినా, వాటి వెనుక వీళ్ళకున్న అసలు కారణాలు న్యూనత, అధికార దాహం, ఆలోచనాలేమి. కోహం రండే అని అప్పుడెప్పుడో మన దేశంలో ఉదారవాదం పరిఢవిల్లిన కాలంలో అన్నాడు కాబట్టి సరిపోయింది కాని అదే మాట ఇప్పుడంటే కాళీదాసుకూ కాళ్ళూ కీళ్ళూ విరిచేసి వుందురు కాషాయభక్తులు. ఎవడబ్బసొమ్మని కులికేవు రామా అన్న రామదాసుని తరిమితరిమికొడుదురు. తాలిబన్‍ల పాలనలో ఉన్న ఆఫ్గనిస్తాన్‍లోను, మతప్రభుత్వాలు రాజ్యం చేస్తున్న ఇతర ముస్లిమ్ దేశాలలోనూ స్త్రీలు, పిల్లలు, మైనారిటీలు, తదితరుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే ఎవరైనా ముందు చేయవలసింది మతాన్ని అధికారానికి దూరంగా పెట్టడం. మతం, దైవం పేరుతో సమూహాలను రెచ్చగొట్టి, విమర్శను హత్య చేసి, కళాకారులను పాత్రికేయులను నియంత్రించి, నిర్బంధించి నియంతృత్వం సాగిస్తున్న ప్రభుత్వాలున్నంతవరకూ ఈ పరిస్థితి మారుతుందని ఆశించడం కష్టం. హింస ఏ మతంలో జరిగినా, ఏ కారణంతో జరిగినా హింసే. రుష్దీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని నిరసిస్తూ మన దేశంలో ఏ గొంతూ బలంగా వినపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో అభ్యుదయవాదుల, ప్రగతిశీల ఉద్యమనాయకుల దృక్పథం వారి వర్గశత్రువుల దృక్పథమంత సంకుచితంగానే ఉందని, ఉంటుందని వారూ పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నారు. వెన్నుదన్ను ఇచ్చే మనుషుల సంఖ్యతో సంబంధం లేకుండా, ఇట్లాంటి సందర్భాల్లో గొంతెత్తి అసమ్మతిని, వ్యతిరేకతనూ బలంగా తెలపడమే సంఘంలో ఆలోచనాపరులింకా ఉన్నారన్న హెచ్చరిక!