లయ

రోజూ అదే దారిలో వెళ్తుంటావు
ముందు కారుని అధిగమించాలనో
వెనకవాడికి దారి ఇవ్వకూడదనో
ఒకటే జోరు

ముందున్న రైలు గేటు మూసుకుంటే తప్ప
ఈ మలుపులో ఆగే అవసరమే రాదు
ఆ ముళ్ళకంపని అల్లుకున్న తీగకి పూసిన
ముచ్చటైన పూలని చూసే అవకాశమే లేదు

ఏదో ఒక రోజు గేటు పడుతుంది
వాహనాలన్నీ బుద్దిగా
ఒక వరసలో నిలబడిపోతాయి
కారు వేగంలో అప్పటిదాకా వినబడని
రేడియోలో పాటని వింటూ
బద్దకంగా మెటికలు విరుచుకుంటూ
కిటికీలోంచి బయటకి చూస్తావు

లోపలి పాటకు లయబద్దంగా నర్తిస్తున్నట్టు
బయట చెట్లూ పూలూ లతలూ-
వాటితో పాటు
నీ మనసు కూడా కాసేపు

అంతా ఒకే లయ అని
మొదటిసారి తెలుసుకుంటావు
కొన్ని మూసుకుంటే
ఎన్ని తెరుచుకుంటాయో అని
అప్పుడే నువ్వు అబ్బురపడతావు!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...