అట్లా
ఆ నది ముందున్న చెట్టు మీద
వాన చినుకులా వాలిన పిట్ట
గాథాసప్తశతిలా ధ్వనిస్తోంది
కూత కూతకి గొంతు
సానబెట్టిన కత్తి అంచులా
మోగుతోంది
అరవగా అరవగా
పోగొట్టుకున్న జ్ఞాపకాల జాడలతో
ఆ స్వరంలో
దుఃఖపు జీర
ఏ పిట్టా
గొంతు కలపడం లేదు
పిట్ట వేదనకు
చెట్టు సాక్ష్యం
బాధితుడి భుజాన
ఏ మనిషీ చెయ్యి వేయనట్టు
పక్షి పాటకి
ఎవరూ శ్రుతి కలపరు.
రచయిత సుంకర గోపాలయ్య గురించి:
సుంకర గోపాలయ్య గత 15 సంవత్సరాలనుంచీ కవిత్వం రాస్తున్నారు. ‘మా నాయన పాట’ పేరుతో కవితాసంకలనం వెలువరించారు. ఇది రెండు ముద్రణలు పొందింది. ‘రొట్టమాకురేవు’ అవార్డు, కవి సంధ్య, పురస్కారం పెన్నా పురస్కారం, ఇలా ప్రస్తుతానికి 12 పురస్కారాలు వచ్చాయి. అన్ని పత్రికలలోనూ సాహిత్య విమర్శా వ్యాసాలు వచ్చాయి. ‘కవి సంగమం’లో కవిత్వకాంతి శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు.