మే 2019

ఏ కొద్దిమందో ఉంటారు. వారి భావాలు, ఆశయాలు, ఎంచుకున్న దారులు వంటివాటితో మనకు మమేకత ఉండకపోవచ్చు. పైపెచ్చు విరోధమూ ఉండవచ్చు. కాని, వారిని మనస్ఫూర్తిగా గౌరవించకుండా ఉండలేం. తమ ఆశయం పట్ల వారికున్న నిబద్ధత, అది సాధించడం కోసం చేసే నిరంతర పోరాటం, అహోరాత్రాలు జ్వలించిపోయే తపన, ప్రాణాలైనా అర్పించగల త్యాగశీలత, వారిని ప్రత్యర్థులు కూడా గౌరవించేట్టు, అభిమానించేట్టు చేస్తాయి. అలాంటి కొద్దిమందిలో ఒకరు శివసాగర్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కంభం జ్ఞానసత్యమూర్తి (15 జులై, 1931 – 17 ఏప్రిల్, 2012). సమాజపు అసమానతల పట్ల అసహనంతో విప్లవోద్యమ మార్గాన్ని ఎంచుకున్న ప్రతీ యువతీయువకుడి నోటా కదను తొక్కే కవితా పంక్తులు ఇద్దరు కవులవి. ఒకరు శ్రీశ్రీ, మరొకరు శివసాగర్. అయితే కేవలం కవిగా కలమే కాకుండా సైనికుడిగా ఆయుధమూ పట్టినది, ‘ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ కవి నేడు’ అంటూ విప్లవకవిత్వానికి దారి వేసినది శివసాగర్ మాత్రమే. వయోవిద్యాప్రాంతీయభేదాలనేవి లేకుండా జనవాహినిలో నినాదస్థాయికి చేరుకున్నది ఆయన కవిత్వం మాత్రమే. కవిత, పాట రెండు దారులుగా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానంలో మొదటగా 1983లో ప్రచురించిన ఉద్యమం నెలబాలుడు ఎందరినో ప్రభావితం చేసింది. ప్రజలను కదిలించడంలో పాటకున్న బలాన్ని తెలుసుకున్న శివసాగర్ కలంనుంచి నరుడో భాస్కరుడో, చెల్లీ చెంద్రమ్మా, నల్లాటి సూరీడూ, ఓ విలుకాడ! వంటి పాటలు ఇప్పటికీ ప్రముఖంగానే ఉన్నాయి, ఇక ఎప్పటికీ ఉంటాయి. భూమీ ఆకాశం కలిసే చోట/ పొన్నపూలు రాలిపడిన చోట/ వీధిదీపాలు ఉరిపోసుకున్న చోట/ నేలమాళిగ కన్నీరు కార్చిచ్చు అయినచోట/ తిరిగి వస్తాను/ తిరిగి లేస్తాను/ నాకోసం ఎదురు చూడు/ నాకోసం వేచి చూడు అని చాటిన ఆ విప్లవకవి వర్ధంతి సందర్భంగా ఈ సంచిక ఆయన స్మృతిలో వెలువరిస్తున్నాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అడగగానే నివాళి రాసి పంపిన నరేష్కుమార్ సూఫీ, బొమ్మ పంపిన అన్వర్, అరుదైన శివసాగర్ జైలు డైరీ ప్రతి పంపి సహాయం చేసిన గుర్రం సీతారాములుగార్లకు మా కృతజ్ఞతలు.