నిశ్శబ్దాన్ని దాటుకుని…

నాకు శబ్దం కావాలి
ఇలా చెబుతున్నానని నాకు రణగొణధ్వనులంటే ఇష్టం అనుకునేవు!
లేదు, లేదు…

ఇన్నాళ్ళూ నిశ్శబ్దాన్ని ప్రేమించానన్నది నిజమేను!
దాన్ని నా చుట్టూరా పరచుకుని పహరా కాసాను కూడా.

ఆరుబయలు ఆటస్థలాలు,
ఆకుపచ్చని పరిసరాలు,
సుతిమెత్తని నీటి ప్రవాహాలు
పంచే సందడిని ప్రేమించాను.

ఇంట్లో, ప్రయాణాల్లో, సినిమాహాళ్ళలో,
అక్కరలేకుండా ఉక్కిరిబిక్కిరి చేసే
ఓటి మాటల చప్పుడు జొరబడకుండా
కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను!

కానీ చూస్తున్నంతలో
తెల్లవారి వాకిళ్ళలో సందడిచేసే కళ్ళాపులు
ఆధునికత అద్దుకుని చరిత్రలోకి జారుతున్నాయి.
‘పాహిమాం ప్రభో’ అంటూ ప్రొద్దుప్రొద్దున్నే
గొంతు సవరించుకునే ఆకాశవాణి ఎక్కడికో బదిలీ అయ్యింది.
పిల్లలు తూనీగలై జుమ్మనే పార్కులు మౌనాన్ని మోస్తున్నాయి.
వీధి గుమ్మాల్లోనో, ప్రహరీగోడల అంచునో మొదలయ్యే
అంతులేని కబుర్లు అదృశ్యమయ్యాయి.
టీచరు అడుగుపెట్టేంతలోనో కన్నుతిప్పేంతలోనో
క్లాసురూములో అలుముకునే అల్లరిమాటలు ఇప్పుడెక్కడ?
కాలేజీ క్యాంపస్‌లోనూ నూటనలభైనాలుగు సెక్షన్ అమలవుతున్నట్టుంది.

మాటలై మొలకెత్తి అడవులై విస్తరించే స్నేహాలు మూగభాషని నేర్చుకుంటున్నాయి.
ప్రపంచం దూరదూరాల వరకూ ఖాళీగా పరుచుకున్నట్టుందెందుకు?
సమూహాలుగా సంచరిస్తూనే జనమేదో ధ్యానంలో ఉన్నట్టున్నారు
తదేక దీక్షతో నిశ్శబ్ద తరంగాల మీద శబ్దాల్ని రచిస్తున్నట్టున్నారు
తమచుట్టూ మౌనపు కందకాలు తవ్వుకుంటున్నారు

శ్వాస సంగతి సరే శబ్దాన్నే మరచేలోపు
ఈ నిశ్శబ్దాన్ని దాటుకుని వచ్చి, ఓసారి మాట్లాడవూ?
రా, పాపాయిలకి మళ్ళీ మాటలు నేర్పుదాం!


అనూరాధ నాదెళ్ళ

రచయిత అనూరాధ నాదెళ్ళ గురించి:

నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ప్రతిరోజూ ప్రపంచం కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తూనే ఉంటుంది. దిగులు పుట్టిస్తూనూ ఉంటుంది.

 ...