
తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ప్రతి సమాజంలోనూ ఉంటాయి. వారి సమాజంలోని ఆచార వ్యవహారాలను, వారు నమ్మే విలువలను కథలుగా చెప్పుకొనే పురాగాథలే వారి తాతముత్తాతలు అందజేసిన వారసత్వ సంపదగా భావించడం కద్దు. అనేక తరాలుగా చెప్పుకునే ఇటువంటి పురాణాలు, ఇతిహాసాలు కేవలం కాలక్షేపానికి కాదు — అవి ఆ సమాజపు నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక చింతనలలో భావసమైక్యతను కలిగించే మూలస్తంభాలు. జీవితపు మూలాలను విశ్లేషించడానికి, సత్యాసత్యాల స్వభావాన్ని అన్వేషించడానికి, మానవ సంబంధాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ పురాగాథలు మూలప్రాతిపదికలుగా పనిచేస్తాయి. భారతదేశంలో పురాణాలు, ఇతిహాసాలు కూడా సమాజంలోని ధర్మాధర్మాలను, నైతిక నియమాలను సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా కథల రూపంలో వివరించడమే వాటి ముఖ్యోద్దేశ్యమని ప్రకటించాయి (“కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్” — భాగవతం). భారతదేశంలోని పురాణాలే కాదు, గ్రీకు, జర్మన్, కెల్టిక్ జాతులతో సహా అనేక నాగరిక సమాజాలకు వారివైన పురాగాథలున్నాయి. అయితే, ఆధునిక పాశ్చాత్య ప్రపంచం తమ పూర్వ పురాగాథలను తృణీకరించడం ద్వారా ప్రమాదకరమైన పౌరాణిక శూన్యాన్ని (mythological vacuum) సృష్టించిందని ప్రపంచ సమాజాలలో పురాగాథలపై లోతైన పరిశోధనలు చేసిన జోసెఫ్ క్యాంప్బెల్ సిద్ధాంతీకరించాడు. దీనివల్ల ప్రజలు సరైన మానసిక మార్గనిర్దేశం లేక ఆధునిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ప్రతిభావంతంగా ఎదుర్కోలేకపోతున్నారని ఆయన వాపోయాడు. అయితే, ఈ పురాగాథలు తమ ప్రభావాన్ని కోల్పోకుండా, ఎప్పటికీ మార్గనిర్దేశం చేయాలంటే, వాటిని సమకాలీన భాషలో, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం పునఃసృష్టించాలని జోసెఫ్ క్యాంప్బెల్ ప్రతిపాదన. లేకపోతే, అవి తమ శక్తిని కోల్పోయి, నేటి తరానికి మార్గదర్శనం చేయడంలో విఫలమై, కేవలం ప్రాచీన కళాఖండాలుగా మిగిలిపోతాయి. ఒక సమాజం తన పురాగాథలను అక్షరాలా నిజమని (literal truths అని) నమ్మడం మొదలుపెట్టినప్పుడు, అవి తమ ప్రతీకాత్మక శక్తిని కోల్పోతాయని ఆయన సిద్ధాంతం. మారుతున్న కాలంతో పాటు, భాషా, కథల నేపథ్యం, యుగధర్మాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి, కొత్త యుగానికి, కొత్త అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదర్శాలను విప్పి చెప్పే కొత్త కథలు కూడా ప్రతియుగానికి అవసరం అవుతాయి. అందుకే, జేమ్స్ జాయిస్ ‘యులిసెస్’, ‘ఫినెగన్స్ వేక్’లో ఆధునిక కథలను ఉద్దేశపూర్వకంగా ప్రాచీన పురాగాథల నమూనాలో అల్లాడు. సిసిఫస్ పురాణగాథను అబ్సర్డిస్టులు, అస్తిత్వవాదులు జీవితంలోని రోజువారీ కార్యకలాపాలలో అర్థరాహిత్యాన్ని స్పష్టం చేయడానికి ఉపయోగిస్తారు. డబ్ల్యూ.బి. యీట్స్ ‘ఎ విజన్’, ‘ది సెకండ్ కమింగ్’, ‘బైజాంటియమ్’ లలో ఒక నూతన పురాణ వ్యవస్థను సృష్టించాడు. ఈ రకమైన పునఃసృష్టి గతాన్ని నేపథ్యంగా చేసుకొని సమకాలీన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, సమకాలీన దృక్కోణం నుండి గతాన్ని వ్యాఖ్యానించడానికి వారికి విస్తృతమైన అవకాశాన్ని ఇచ్చింది. అలాగే, మన పక్కరాష్ట్రమైన కర్ణాటకలో గత వారం కాలధర్మం చేసిన ప్రముఖ కన్నడ రచయిత భైరప్ప కూడా తన నవలలలో పురాణ ప్రతీకలను ఉపయోగించుకొని ఆధునిక జీవితాలకు ఆ పురాగాథలను, కథలను అన్వయం చేసే ప్రయత్నం చేసాడు. తనకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన ‘పర్వ’ నవలలో మహాభారతం కథను మనుష్యుల మధ్య జరిగిన కథలాగా పునఃసృష్టించాడు. అందులో ఏ మంత్రాలు, దైవత్వం, అతీత శక్తుల ప్రస్తావన లేకుండా భారత కథలో పాత్రల స్వభావాలను, వారివారి భావోద్వేగాలను, ఆవేశాలను, బలహీనతలను మరింత బలంగా తీర్చిదిద్దగలిగాడు. తద్వారా ఆయన మహాభారతానికి ఒక నూతన భాష్యాన్ని అందించాడు. దైవత్వాన్ని పక్కనపెట్టినప్పుడు, పాత్రల నైతిక సందిగ్ధతలు, వారి నిర్ణయాల వెనుక ఉన్న మానసిక సంఘర్షణలు మనకు మరింత దగ్గరగా, మరింత వాస్తవికంగా అనిపిస్తాయి. ఈనాటి మన సమస్యలకు, ఆనాటి పాత్రల సందిగ్ధతలకు మధ్య ఒక వారధిని నిర్మించాడు. ఇది పురాగాథను పునఃసృష్టి చేసి బ్రతికించుకొనే ఒక పద్ధతి.
అయితే, ‘పర్వ’ వంటి రచనలను నేటి వాతావరణంలో సృష్టించడం సాధ్యమేనా? నేటి అతిజాతీయవాదం మన పురారాణేతిహాసాలను ప్రశ్నించరాని పవిత్ర గాథలుగా శాసించే ప్రయత్నం చేస్తోంది. భైరప్ప 1979 లో వ్రాసిన ‘ పర్వ’ లాంటి నవలను ఈ రోజుల్లో రాసినట్లయితే, విడుదలైనప్పటి కంటే చాలా ఎక్కువ వివాదాలను, వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చేది అనడంలో సందేహం లేదు. ఇందులో కృష్ణుణ్ని దేవునిగా కాకుండా ఒక తెలివైన నాయకునిగా, కొన్నిసార్లు కుటిలమైన వ్యూహకర్తగా చిత్రించడం, నేటి వాతావరణంలో హిందూ ధర్మాన్ని అవమానించే ప్రయత్నంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగి పెద్ద దుమారం చెలరేగేది. పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్లు వచ్చేవి. పుస్తకాన్ని వెనక్కి తీసుకొమ్మని రచయితకు, ప్రచురణకర్తకు బెదిరింపులు వచ్చేవి. ఈ రకమైన గొడవలలో ఆ పుస్తకానికి ఇప్పుడు వచ్చిన గుర్తింపు, భారత సంస్కృతిని, పురాగాథల ఆత్మను లోతుగా అర్థం చేసుకొన్న తత్త్వవేత్తగా భైరప్పకు గౌరవ పురస్కారాలు కానీ వచ్చి ఉండేవి కావు. ఈ రకమైన వాతావరణం తాత్కాలికమేనని, పురాణాల ఆత్మను గౌరవిస్తూనే, వాటికి కొత్త దేహాన్ని, కొత్త స్వరాన్ని ఇవ్వగల ఎస్. ఎల్. భైరప్ప వంటి రచయితల సాహసాన్ని, విమర్శనాత్మక ఆలోచనను, సృజనాత్మక స్వేచ్ఛను ప్రోత్సహించే వాతావరణం తిరిగి భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ నెలకొంటుందని ఆశిద్దాం. శుభం భూయాత్!