జనవరి 2020

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఒక కొత్త సంవత్సరమే కాదు, ఒక కొత్త దశాబ్దమూ మొదలవుతున్నది. గడిచిన పదేళ్ళూ ప్రపంచమంతటా లాగానే మన దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయార్థిక కళాసాంస్కృతిక రంగాలాదిగా ఎన్నో మార్పులు సంభవించాయి. మతోన్మాదం, సంకుచితత్వం రాజ్యమేలుతున్నాయి. మనిషిని మనిషి కులమతప్రాంత భేదాల విచక్షణతో చూడడం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. నిర్మూలించబడవలసిన సామాజిక రుగ్మతలు వ్యక్తుల అస్తిత్వాలకు గర్వచిహ్నాలుగా మారి సమాజానికి హాని చేసే ఆయుధాలవుతున్నాయి. ప్రభుత్వాలు చెదపురుగుల లాగా ప్రజాస్వామ్యాన్ని తొలుచుకు తింటూ, పౌరుల ప్రాథమిక రాజ్యాంగహక్కులను కాలరాస్తూ నియంతృత్వం చెలాయిస్తున్నాయి. నిలదీసి నిజాన్ని నిగ్గు తేల్చవలసిన పత్రికలు ప్రభుత్వాలకూ, పార్టీలకూ భజంత్రీలుగా మారిపోయాయి. అసత్యప్రచారాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయి. నోరువిప్పి ప్రశ్నించగల హక్కు ఎన్నడో అఘాయిత్యపు దాడులకు బలి అయింది. సామాజిక కార్యకర్తలు, కళాకారులు, రచయితల గొంతులు మునుపెన్నడూ లేనంతగా నొక్కివేయబడుతున్నాయి. చివరికి ఆటవిక న్యాయాన్ని హర్షించి ఆమోదిస్తూ, కాపాడవలసిన చట్టాన్నే కాలరాసే అధికారులకు సన్మానాలు చేసే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. కళాసాహిత్యకారులు తమ కనీస స్వేఛ్ఛకోసం పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో సమాజపు పోకడలను, ప్రభుత్వాల తీరును ప్రశ్నించే విమర్శించే ఏ పాత్రికేయులకైనా, సామాజిక కార్యకర్తలకైనా,  కళాసాహిత్యకారులకైనా ఆందోళన, నిరాశానిస్పృహలు సహజం. కాని, ఇలాంటి చీకట్లు కమ్మడం ఇది మొదటిసారి కాదు. ఆఖరుసారీ కాబోదు. తిరిగి కొత్త ఉదయం రాక తప్పదు. మార్పుకోసం పోరాడేవారు ఎప్పుడూ ఉంటారు. కళాకారులు రచయితలపట్ల అనాగరికమూ అప్రజాస్వామ్యమూ అయిన దాడులను ఖండించి, ఒకనాడు పోరాడి సాధించుకున్న భావప్రకటనాస్వేచ్ఛ కోసం ఈనాడు మళ్ళీ పోరాడుతున్న ప్రతీ గొంతుక ఒక గడ్డిపోచలానే కనపడవచ్చు; కాని, అవన్నీ ఒక్కటిగా కూడినప్పుడు ఆ త్రాటి బలానికి మదపుటేనుగులైనా లోబడక తప్పదు. కట్టి లాగితే ఏ పీఠాలైనా కదిలి కుదేలు కాకతప్పదు. ఆ గొంతుకలు చీకటిని పారదోలడానికి ప్రయత్నించే చిరుదీపాలే కావచ్చు; కాని, అన్నీ కలిసి వెలిగితే చీకటి పటాపంచలు కాకతప్పదు. ప్రతిఘటించాలన్న ఎరుక ముఖ్యం. సమైక్యత అవసరమన్న స్పృహ అవసరం. మార్పు అనివార్యం.