పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. పడమట సంధ్యారాగం గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:

    07/13/2009 6:41 am

    ఈ కథ గురించి కిరణ్ గారి అభిప్రాయం పై నేను ముందు వ్రాసిన అభిప్రాయంలో వ్రాద్దామనుకున్నాను కానీ, కథ గురించి నేను చెప్పదలుచుకున్నది మరుగున పడుతుందని ఆపేశాను:

    పొడుపు కథలు, భేతాళ కథలు, కాశీ మజిలీ కథలు, ఇత్యాదులన్నీ ముఖ్యంగా కొస మెరుపు కథలు. ఈ కథలో కొస మెరుపున్నా, అంతవరకూ సాగిన కథకు ఆఖరి సన్నివేశం కంటే ఎక్కువ విలువుందని నా అభిప్రాయం. ఆఖరి సన్నివేశం 360వ డిగ్రీ మాత్రమే! పుస్తకం వెనకాల ఉన్న కోట్ దగ్గర్నుంచి, ఇల్లీగల్ ఇమ్మోరల్, అంత ఇల్లీగల్ కాదు గాని ఇమ్మోరల్, అంత ఇమ్మోరల్ కాదు, నుంచి స్లై డాగ్, స్లై బి_ వరకు సాగిన ప్రస్థానంలో రచయిత వదిలిన క్లూలు నిజంగానే పాఠకుణ్ణి ‘హింట్లు చూసి కథ రాసుకో’ మనడమే! పాఠకుల మీద ఎంత నమ్మకం, గౌరవం లేకపోతే రచయిత తన కథను అలా ఊహలకొదిలేస్తారు చెప్పండి?

    సాఫ్ట్‌వేర్ తయారు చేసేవారు చేసేది పనిముట్లన్న సంగతి మరచిపోకూడదు. పనిముట్లే ఇల్లు కాదుగదా! (వాడే సాఫ్ట్‌వేరే వ్యాపారం కానట్టు). ఇక్కడ రచయిత చేసింది పనిముట్టు కాదు. చైతన్య స్రవంతి అనే సాహిత్య పనిముట్టుతో వేసిన చిత్రం. అందులో పాఠకులాక్కావల్సింది వారినే వెతుక్కోమంటున్నారు!

    కృష్ణారావు

  2. పడమట సంధ్యారాగం గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:

    07/13/2009 5:39 am

    ఒక సంఘటన, ఒక సంఘర్షణ కథెందుకు కాగూడదు? “సంధ్య ఇంట్లో లేదు” అనే వాక్యానికి పొడిగింపు, వివరణ ప్రతి పాఠకుడు ఈ కథలో తనకు తాను ఇచ్చుకునే ముగింపు మీద ఆధారపడి ఉంటుందేవో కదా. అల్లికలో మరికొంచం జాగ్రత్త అవసరవే కానీ, కథ బాగనే వుంది.

  3. పడమట సంధ్యారాగం గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/13/2009 12:26 am

    పై వ్యాఖ్యలు చూసాక ఇది రాయాలానిపించింది. వెస్ట్రన్ కథ పరిణామం చెందినంతగా తెలుగు కథ కాలేదు. కధంటే ఇలాగే వుండాలని మన పెద్దలు నిర్ణయిచేశారు. కథంటే మొదలుండాలి. నాయకుడుండాలి. శిల్పం వుండాలి. ముగింపుండాలి. చివర్లో ఓ సందేశముండాలి. సూక్తిముక్తావళుండాలి. ఏ మాత్రం బుర్రకి పదును పెట్టకుండా అరటిపండొలిచినట్లుండాలి. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. చెప్పడమే కాదు, మనకలాంటి కథలు చదవడమే నేర్పించారు. అందువల్ల తెలుగు కథ వారు ఏర్పరిచిన చట్రంలోనే ఇరుక్కుని ఊపిరాడకుండా వుంది.

    ఈ కథ చాలా మంచి కథని అనను కానీ వైవిధ్యమున్న కథ. డయాస్పోరా కథల కోవకి చెందిన కథ. ఎవరికీ తెలియదనుకుంటూ తప్పులు చేసుకు పోయే ఒక పాత్రకొచ్చే మానసిక సంఘర్షణ కనిపించింది. తను చేసే ప్రతీ దానికీ ఒక కారణం ( జస్టిఫికేషన్ ) వెతికే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ కారణం ఏదైనా కావచ్చు. అది అనుమానమవ్వచ్చు. భయం కావచ్చు. లేదా తనకి తను సర్దిబుచ్చుకునే మనస్తత్వం కావచ్చు. ఇవన్నీ ఈ సుందరం పాత్రలో కనిపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనలోనే ( అంటే ప్రవాస భారతీయులు ) కనిపించే పాత్ర. సుందరానికి సఫూరాతో అక్రమ సంబంధమున్న సంగతి ఎవరికీ తెలియదనుకుంటూ గడిపే క్యాజువల్ మనస్తత్వ చిత్రీకరణలో, చేసే పనిని సమర్ధించుకునే నైజం చూపించారు. చాలామంది మగాళ్ళు భార్యలు వెర్రిబాగుల ఇల్లాళ్ళుగా జమకట్టి, తాము ఏం చేసినా గ్రహించలేరు. పైగా వారూ ధైర్యం చెయ్యరని అనుకుంటూ వుంటారు. వారు పరస్త్రీతో ఎలా అక్రమ సంబంధ పెట్టుకుంటారో మరో మగాడు కూడ తమ స్త్రీలతో అలా చేసే అవకాశముంది కదా? అన్న చిన్న విషయాన్ని విస్మరిస్తారు. పైపెచ్చు తమ తమ క్రియలకి కారణాలు వెతుకుతారు. ఇదీ ఈ కథలో నాకు కనిపించిందీ, అనిపించిందీ!
    ఈ కథలో సుందరం యాంటీ హీరో! ఒక నెగిటివ్ షేడ్సున్న వ్యక్తి. ముగింపు మరీ ఒక్క వాక్యంలో తేల్చేయడంతో పాఠకుల్ని ఆలోచించ నీయకుండా అయోమయంలో నెట్టేసింది. “సంధ్య ఇంట్లో లేదు. ” అన్న వాక్యం ఏ రకంగానైనా ఊహిచుకునేలా చేసిందంతే! బహుశా కథలో వున్న అతి క్లుప్తతవల్ల ఈ అయోమయం ఏర్పడిందేమోనని నా అభిప్రాయం. ప్రతీ వాక్యమూ ఓపిగ్గా చదివి అర్థం చేసుకుంటేనే ఈ కథ ఎక్కుతుంది. లేదా ఇదీ కధేనా అనిపిస్తుంది.

  4. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:41 pm

    ప్రసాదు గారూ,

    మీరిలా పద్యాలు కట్టి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏదో నాకు తెలిసింది రాసానంతే! వ్యాసం నచ్చిందని చెప్పారు. సంతోషం. నే పడ్డ కష్టాన్ని తీసేయడానికి ఆ రెండు ముక్కలు చాలు. మీలాగ నేనూ సంగీత విద్యార్థినే! కాబట్టి అంతేసి పెద్ద మాటలనవసరం.

    ఇహ, మీరడిగిన ప్రశ్న – కృష్ణా ముకుందా మురారి పాట గురించి. తెలుసున్నది చెబుతాను. రాగమాలిక ప్రధాన లక్ష్యం వివిధ రసాలని వివిధ రాగాలతో సంయమనం చేయడం. రస ప్రధాన రాగాలనెన్నుకొని పాట కట్టడం. ఇక్కడ రసమే పాటకి దిశానిర్దేశకం చేస్తుంది. కాబట్టి రసం మారినప్పుడల్లా పాటకి సంబంధిచిన శృతీ, లయా తదనుగుణగా మార్చుకోవచ్చు. అది సంగీత దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడుంటుంది. చరణాంతం పల్లవి మొదలుపెట్టిన శృతిలోనే వుండాలన్న నియమం రాగమాలికకి లేదు. సాంబమూర్తి గారు ఒక రాగమాలిక రాసారు. పేరు గుర్తురావడంలేదు. అందులో రాగం మారినప్పుడల్లా పల్లవి కూడా అదే రాగంలో మారుతూ వస్తుంది. ఇదేవిధంగా మీరుదహరించిన పాటా కట్టుండే అవకాశముంది. ఆ పాటలో శృతి మార్చడానికి కారణం సన్నివేశానికనుగుణంగా జరిగిందనే అనుకుంటున్నాను. ఎక్కడైనా దొరికితే బాలమురళి స్వరపరిచిన శృతి భేద రాగమాలిక వినండి. మీకు మరింతగా అర్థమవుతుంది.
    సినిమా పాటలో రాగమాలిక నాకు నచ్చిన రాగమాలికల్లో ఇదొకటి.

  5. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:14 pm

    రమ గారూ,

    మీరు చెప్పిన అన్నమయ్య “దేశ సూళాది” రాగమాలిక, తాళమాలిక నాకు లభ్యం కాలేదు. మీ వ్యాఖ్య చూసాక, అన్నమయ్య కీర్తనల పుస్తకాలన్నీ తిరగేసినా దొరకలేదు. మీదగ్గరుంటే పంపగలరా? లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. తెప్పించుకుంటాను.
    అన్నమయ్య రాగమాలికని గుర్తుచేసినందుకు మరోసారి ధన్యవాదాలు.

  6. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:08 pm

    మోహన రావు గారూ,

    మీకు శ్రీనివాసన్ గారి వ్యాస దొరికితే నాకూ ఒక కాపీ పంపించండి. కర్ణాటక సంగీతంలో గణితం/ధ్వని శాస్త్రం గురించి రాయాలని ఎప్పటినుండో ఉన్న కోరిక. వీలయితే చెప్పండి. ఇద్దరం కలిసి రాద్దాం.
    మీకు రాగమాలిక నచ్చినందుకు సంతోషం.

  7. పడమట సంధ్యారాగం గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:

    07/12/2009 7:56 pm

    చైతన్యస్రవంతి శైలిలో సాగిన కథపై ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి అభిప్రాయాలు రావడం వింత కాదనుకుంటాను. ఇలాంటి కథలు బాగా నచ్చనైనా నచ్చుతాయి లేకపోతే అసలు అర్ధంకాక చిరాకైనా కలిగిస్తాయి. శైలిని సరిగా నిర్వహించలేకపోతే రెండవ రియాక్షన్‌కు రచయిత బాధ్యత అవుతుంది. కానీ, సరిగా అర్ధం చేసుకోవడంలో పాఠకుల బాధ్యత కూడా చాలానే ఉంటుంది. ఉదాహరణకు, ఈ కథను అర్ధం చేసుకోవడానికి/అనుభవించడానికి పాఠకులు సుందరం పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. కథకు నాయకుడు, పరమార్ధం, ముగింపు, నీతి, వగైరా సూత్రాలు (లక్షణాలు?) ఖచ్చితంగా ఇలా ఉండాలి అనుకునే పాఠకులకు ఈ కథ నచ్చకపోవచ్చు. కానీ సుందరం ‘మొరాలిటీ జారుడు బల్ల’పై ప్రయాణం అతని వ్యక్తిత్వాన్ని ఊహింపజేస్తుంది. దానికి సాపేక్షంగా సఫూరా, సంధ్య ల వ్యక్తిత్వాలనూ విశదీకరిస్తుంది. కథలో చెప్పినదానికంటే పాఠకుల ఊహకు ఒదిలేసిందే ఎక్కువ. ఐతే ఆ ఊహలను నడిపించే మార్గాన్ని ఎన్నెన్నో పొరల్లో చూపిస్తున్నారు రచయిత. ఇంతకన్నా ఎక్కువ చెప్పుంటే కథ క్షీణించిపోయుండేదని నా అభిప్రాయం. తిరిగి చదివినకొద్దీ పొరల్లో దాక్కున్న కథ కనిపిస్తూంది. చక్కటి డయాస్ఫోరా కథనిచ్చినందుకు హేట్సాఫ్ మాష్టారూ!

    కథలో రెండు చిన్న టెక్నికల్ తప్పులున్నాయని నాకనిపించింది. మొదటిది ఫోన్ 30 సార్లు మ్రోగడం. నాకు గుర్తున్నంత వరకూ, ఉత్తర అమెరికా టెలిఫోన్లు ఇదివరలో 15 సార్లకంటే ఎక్కువ రింగయ్యేవి కాదు. (ఇప్పటి సంగతి నాకు తెలియదుగాని, ఇదివరలో కొన్ని ఆన్సరింగు మెషీన్లు ఆపేసి ఉంటే 15వ రింగుకి ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి, మెసేజి తీసుకునేవి!). ఇప్పుడూ అంతేనో కాదో టెస్టు చెయ్యాలి! రెండవది, హేండ్ కారీ మరచిపోయి విమాన ప్రయాణం చెయ్యడం. సాధారణంగా టిక్కెట్లు అందులోనేగా ఉంచేది. పోనీ టిక్కేట్టు కోటు జేబులో ఉన్నాయనుకుందామంటే, మరీ చేతులూపుకుంటూ విమానం ఎక్కే వాళ్ళనెంతమందిని చూశాం? ఇవి పెద్ద లోపాలని అనలేను గాని, కథా గమనంలో పంటికింద రాయై అనవసరంగా భూమార్గం పట్టించాయి నన్ను!

    కృష్ణారావు

  8. పడమట సంధ్యారాగం గురించి అఫ్సర్ అభిప్రాయం:

    07/12/2009 4:32 pm

    వేలూరి కథ మీద జరుగుతున్న చర్చలో వొక ముఖ్యమయిన అంశాన్ని గుర్తు చెయ్యడానికి ఈ రెండు ముక్కలూ రాస్తున్నాను. కథలో వర్ణనాత్మకత , నాటకీయతల మీద ఇంకా మనకి చాలా మోజు వుంది. తెలుగు కథ తక్షణం వదిలించుకోవాల్సిన లక్షణాలు ఇవి రెండూను. వేలూరి కథ గొప్ప కథ అవుతుందా లేదా అన్నది కాసేపు పక్కన పెట్టి, ఈ కథ శిల్ప పరంగా వొక అనాటకీయ/ అవర్ణనాత్మక శిల్పాన్ని మన ముందు పెడుతుంది. వస్తువు పరంగా డయాస్పోరా కథ అంటే నాస్టాల్జియా మాత్రమే అన్న పరిమితిని దాటి, ప్రవాస జీవితంలోని ఇప్పటి సంక్లిష్టతని ఈ కథ తాకుతుంది. ఇందులో సఫూరా ముస్లిం దేశం నించి రావడం ఈ కథలో అదనపు సంక్లిష్టత. ఈ కథలో రచయిత వర్ణించిన సెట్టింగు నించి , ఇంకా నాటకీయతనీ, వర్ణనల్ని గుప్పించి దీన్ని వొక అనుభూతి కళా ఖండంగా మార్చవచ్చు. ఆ అవకాశాన్ని రచయిత చేజేతులా వదులుకున్నట్టు మనకి అర్ధం అవుతూనే వుంది.

    నా ప్రశ్న ఏమిటంటే: కథలో వర్ణన/ నాటకీయత పరిమితులు ఏమిటి? తెలుగు కథ ఆ రెండిటి మధ్య ఆడుతున్న దాగుడు మూతల్లో చాలా కాలంగా అసలయిన వాస్తవికతకి దూరం అవుతోంది. వొక్క అనవసరమయిన వాక్యమూ లేకుండా కథ రాయడం ఇవాల్టి అవసరం. వేలూరి కథ ఆ అవసరాన్ని గుర్తు చేసింది. ఈ లక్షణం ఇంకా కొంత పరిపక్వ దశలో ఇదే సంచికలోని మాచిరాజు సావిత్రి కథలో కనిపిస్తుంది.
    ఈ కథకి పెట్టిన శీర్షిక గురించి నాకూ అభ్యంతరం వుంది. మొదట: అది డయాస్పోరా మీద వచ్చిన వొక సినిమా పేరు కావడం. రెండు: ఈ కథ పరిధిని ‘సంధ్యా పాత్రకి మాత్రమే పరిమితం చేస్తుంది ఈ శీర్షిక. ఇందులో సంధ్య ఎంత ముఖ్యమో, సఫూర కూడా అంతే ముఖ్యం. సుందరం యాంటీ- హీరో లక్షణం అంత కంటే ముఖ్యం.

    యాంటీ హీరో తనం ఈ కథలోని వర్ణనా , నాటకీయతల వ్యతిరేకతలో భాగమే. పెట్టె బయటి నించి ఆలోచిస్తే ఈ కథ కొంత అర్ధం అవుతుందేమో? ఈమాట పాఠకులకు ఆ మాత్రం సహనం వుందని నా నమ్మిక.

    అఫ్సర్

  9. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    07/12/2009 10:19 am

    మొదటివిషయం:

    తెలుగునాడి పత్రిక నిర్వాహకులు ఆంధ్రదేశంలో రచయితలకు పారితోషికం ఇస్తూనే ఉన్నారు. తెలుగునాడి డైజెస్ట్ పద్ధతిలో పత్రిక. ఆంటే, అందులో అచ్చయిన చాలా వ్యాసాలు, చాలా కథలు — ఇవన్నీ రెండవసారి ప్రచురించబడ్డాయి. ఒకసారి ప్రచురితమైన ప్రచురణలు తిరిగి ప్రచురించి తెలుగుదేశంలో పత్రికలతో సమానంగా ( అంతకన్నా ఎక్కువగానే అని విన్నట్టు గుర్తు) తెలుగునాటి రచయితలకు వాళ్ళు పారితోషికం ఇస్తున్నారు. అయినా తెలుగునాడి మూతపడింది. అచ్చుపత్రికలు మూతపడటానికి కొన్ని ముఖ్యకారణాలు నేను సంపాదకీయంలో ముచ్చటించాను.

    రెండో విషయం :
    I request the eemaaTa readers to read an article by Malcolm Gladwell, titled, Priced To Sell, in the most recent issue of The New Yorker
    (The New Yorker, July 6 & 13, 2009) . I wish I had the issue at hand when I was writing my editorial.

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  10. హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/12/2009 4:40 am

    బాబ్జీలుగారి కష్టాలను మరింత పెంచుతాను!

    హంసానందితో పోలిస్తే సోహనీ రాగంలో స్వరాలన్నీ ‘సమానం’గా ఉండవు. వాది, సంవాది స్వరాలైన ధైవతం, గాంధారం ఎక్కువగా వినిపిస్తాయి. ఉత్తరాంగప్రధానమైన రాగం. అంటే మంద్రస్థాయిలో ఎక్కువసేపు సంచారం జరగదు. అదుకే పల్లవి ఎత్తుగడలోనే తారషడ్జమానికి చేరడం కనిపిస్తుంది. హంసానంది ఆరోహణ, అవరోహణ ఒకలాగే ఉటాయి. (సరిగమధనిస). సోహనీ వివరాలకు ఇది పనికొస్తుంది:
    http://www.swarganga.org/raaga_details.php?raagid=172