గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం బలంగా నడుస్తున్న రోజులలో కూడా, దృష్టి అంతా పదాలు వాటి వర్ణక్రమాల మీదే ఉండింది. ఆ సమయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు అనే యువకుడు వ్యావహారభాషకు నియమాలు ఏర్పరుచుకోవాలా వద్దా అనే అంశాన్ని చర్చకు తీసుకొని వచ్చారు. వీరి పుస్తకం ఈ సంచికలో ప్రచురిస్తున్న సందర్భంలో, ఆ పుస్తకపు ముందుమాట, ఇక్కడ ప్రచురిస్తున్నాం – సం.
గిడుగు రామమూర్తి పంతులు
జీవిత విశేషాలు
గిడుగు వెంకట రామమూర్తి (1863 – 1940) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాం.
గిడుగు రామమూర్తి పంతులు రచనలు
పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.
వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా?
భాషావ్యవస్థలు భాషలోనే ఉన్నవి; మనము వాటిని కనుక్కోవలెను.