దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం తెలుగు స్వతంత్రలో వినిపించిన నూతిలో గొంతుకలు బలమైన ధ్వని వలయాలను సృష్టించుకుంటూ బయటి ప్రపంచాన్ని చుట్టుకొని, ముఖ్యంగా తెలుగు కవిత్వ ఆవరణలో నలుమూలలా ప్రతిధ్వనించాయి. వస్తువును కవిత్వంగా వ్యక్తీకరించడంలోనూ, ఆ వ్యక్తీకరణలో సమకాలీనమైన వ్యక్తిని ప్రపంచవ్యాప్తమైన అనుభవాల రేఖలతో, తనదైన తాత్వికత రంగులో ప్రదర్శించడంలోనూ, భాష, శైలి లాంటి స్థూల రూపంతోనే కాక, అంతశ్చేతన లాంటి సూక్ష్మరూపంతో సహా బైరాగి ఆనాడు ఎంత ప్రత్యేకంగా కనిపించాడో, ఇప్పటికీ అంతే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.
కవిత్వం చదివే కొద్దిమంది పాఠకుల్లో నుంచి, తన విలక్షణ తాత్విక దృక్పథం కారణంగా మరికొద్దిమందే మిగిలినా, వాళ్ళు, బైరాగిని ఒకప్పటి కవిగా కాక ఎప్పటికీ కవిగా, అతని కవిత్వాన్ని ఎప్పటికీ ఆగమగీతిగానే గుర్తించుకొంటారు. అయితే, ఏ కావ్యం ద్వారా బైరాగి తీక్షణంగా ఎదిగి బృహదాకారంతో కనిపిస్తాడో, ఆ కావ్యంలోనే మానవుడుగా (మానవుడిలో తాదాత్మ్యత) చీకట్లో కలిసిపోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. స్వయంగా కవి ఆ కావ్యాన్ని సంశయకావ్యంగా చెప్పుకోవడమే గాక, సంశయదశలో నలిగిన అర్జునుడు, హేమ్లెట్, రాస్కల్నికోవ్ పాత్రల ద్వారా జీవితాన్ని దర్శించి, వ్యాఖ్యానించాడు. చీకట్లో పడికొట్టుకొంటున్న మానవుడికి త్రోవ చూపించమని సోనియాను కోరుతూ, ఆవేదనతో కూడిన నివేదన చేశాడు. విశ్వమానవుడికి ప్రతీకలుగా తీసుకున్న ఆ ముగ్గురివీ ‘ఆవేదనల అనంతంలో అంతమైన’ జీవితాలుగా ప్రతిపాదించారు. నూతిలో గొంతుకలు కంటే ముందు వెలువడిన చీకటి నీడలులోనే నిరాశల చీకటి కనిపించినా, అప్పటికి చీకటి అంత చిక్కబడినట్టులేదు. ‘కొంచెం నమ్మకమిస్తే కొండల్ని పిండి కొడతా‘నన్న కవికి, ఆ కొంచెం నమ్మకం దొరక్కపోవడం… విశ్వవిషాదం అనుకోవాలేమో!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ఆందోళన కలిగించిన అప్పటి ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణమూ, జాతీయ స్థాయిలో నెలకొన్న నిరాశా వాతావరణమూ కాక… పాశ్చాత్య మేధావుల నుంచి దిగుమతైన కొత్త సాహిత్య సిద్ధాంతాలూ, ఎమ్.ఎన్. రాయ్ ‘నవ్య మానవతావాదం’ లాంటివీ, మరికొన్ని కారణాలూ తోడై, బైరాగిలో చీకటి నీడలను పరచి ఉండవచ్చునని ఊహిస్తూనే, తన మీద ఇంకా నమ్మకముంచుకున్న వాళ్ళు మాత్రం కవిగా, వ్యక్తిగా ఆయన సమగ్ర రూపాన్ని చూడాలని కోరుతూ వచ్చారు. అందువల్ల, ఇప్పుడు వెలువడిన ‘ఆగమగీతి’కి ఒక మంచి కవితా సంకలనానికి మించిన ప్రముఖత ఉంది. బైరాగి ముఖ చిత్రంతో, ప్లాస్టిక్ కవర్, 1/8 డెమ్మీ సైజులో మంచి కాగితం మీద అచ్చు తప్పుల్లేకుండా ఉన్న అందమైన ముద్రణతో, బ్లాకులు చేయించిన 98 సొంత కవిత్వ శీర్షికలతోనూ, 31 అనువాద కవితలతోనూ 250 పేజీలున్న ఈ పుస్తకానికి సహేతుకమైన ధరనే నిర్ణయించి, ప్రచురణకర్తలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పుస్తకం విలువను పెంచారు.
పుస్తకంలో ఏ కవిత ఎప్పుడు రాసిందీ వంటి వివరాలు లేవు. కానీ, ‘నూతిలో గొంతుకలు’కు ముందు రాసినవీ, తర్వాత రాసినవి ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ పూర్వాపరాల కవితల్ని పరిశీలించి చూస్తే, మొదట ఆశావాదిగా ఉండిన బైరాగి తర్వాత నిరాశావాదిగా మారినట్టు నిర్ధారించుకోవడానికి వీల్లేదనీ అర్థమవుతుంది. ఆశనూ, నిరాశనూ కూడా అంతే బలమైన ఆధారాలతో, ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన కవిని, ‘ఏదో ఒక ‘వాది’గా ముద్ర వెయ్యడం ఎలా సాధ్యం? కనుక, మిగిలిందీ, సరైనదీ అయిన మార్గం కవిత్వంలోనూ, జీవితంలోనూ నిజాయితీని కనపర్చిన కవి, ఇలా పరస్పర వ్యతిరేకంగా కనిపించడానికి కారణాలేమిటి… అని ఆలోచించడమే.
“ఆకలినీ, చీకటినీ, అకాల మరణాన్నీ రద్దు చేశాం” అని సగర్వంతో సముత్సాహంతో ప్రకటించిన కవే
“సర్వమసత్యం, ఒకటే సత్యం: ఎల్లబాటలూ వల్లకాటికే;
ఓటమి సత్యం, ఓటమి తథ్యం”
అని క్రుంగిపోవడం ఎందుకు జరిగినట్టు?
కవి ఎప్పటికప్పుడు తన కళ్ళు చూసిన సంఘటనల ద్వారా, ఎదురైన అనుభవాల ద్వారా సామాజిక జీవితాన్నో, మానవ జీవితాన్నో (‘మానవగీత’ను ఆలపిస్తున్నట్టు బైరాగి చెప్పాడు) అర్థం చేసుకున్నామనుకుంటే, అది పొరపాటవుతుంది. కవిత్వ వ్యక్తీకరణకు కావలసిన సమర్థత, నిజాయితీ అవసరమైనట్టే శాస్త్రీయమైన ప్రాపంచిక, చారిత్రక దృష్టి అవసరం.
దీని అర్థం, బైరాగికి నిజాయితీ లేదంటున్నట్టో, శాస్త్రీయ దృక్పథం లేదంటున్నట్టో కాదు.
కవిగా, వ్యక్తిగా బైరాగి నిజాయితీపరుడని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు గుర్తుంచుకోవలసిందేమిటంటే, తను పరస్పర వ్యతిరేకంగా కనిపిస్తానేమోనని భయపడకుండా చెప్పగలగడం నిజాయితీపరుడికే సాధ్యమన్నది.
“మానవుడు రాజరాజు అతని నవరత్న ఖచిత సింహాసనం ఈ భూతలి”
“విప్లవానికి దొడ్డి గుమ్మం లేదు.
అన్నా పాలకులు రాజ్యశ్యాలకులు తెరచేది కాదు.
అమెరికాలో తిరిపెమెత్తేవారు
అన్నార్తుల ఆకలి తీర్చలేరు
అవి తెరవవలసిన వారు
జననాయకులైన మీరు”
అని చాటిన బైరాగికి శాస్త్రీయ దృష్టి లేకపోయిందంటే అపచారమవుతుంది.
అసలు సమస్య ఏమిటంటే, శాస్త్రీయ దృష్టి ఉండటమే కాదు, ఆ శాస్త్రీయ దృక్పథం మీద సడలని నమ్మకం ఉండటం. అది లేనప్పుడు శాస్త్రీయం, అశాస్త్రీయం రెండూ ఒకటే, లేదా, రెండు రూపాలూ విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి. “నాక్కొంచెం నమ్మకమివ్వు” అని బైరాగి కోరిన సంగతి ఈ సందర్భంలో జ్ఞప్తికి ఉంచుకోవాలి.
అటువంటి సడలని నమ్మకం లేనందువల్ల, తొందరపడి, పొరపడి ప్రజా వ్యతిరేకులకు ఉపయోగపడే భావాలను ప్రకటిస్తానేమోననే భయమూ ఉంది బైరాగికి.
“ఇచట మసక చీకటిలోన
నా నిస్వన శిథిల వికట కుటిలోన
తోచక నేనేదైనా పొరపడి, తొందరపడి
వ్రాసినా, అది మీ కోసం కాదు
ఏదైనా, చేదైనా నాదే అది, మీ కోసం కాదు
మోసం కాదు”
‘మీకోసం కాదు’ అని అటు ప్రజా వ్యతిరేకులనూ, ‘మోసం చెయ్యడం లేదు’ అని ఇటు ప్రజలను ఉద్దేశించి, స్పష్టంగా వీలునామా రాశాడు.
“పరాజితుడను, మౌనవ్రతుడను
శ్రేయోభిలాషిని, హితుడను
కాచుకున్న రేతిరికే హితుడను”
‘పరాజితుడిని’ అని చెప్పుకున్నా ప్రజాశ్రేయోభిలాషి. మోసం చెయ్యలేదు, మోసపోయి ఉండవచ్చు. అదీ పొరపడి, తొందరపడి (ఏదైనా, చేదైనా అది నాదే).
చీకటి నీడల కవి బైరాగి గడ్డకట్టిన కారుచీకటి కాదు. ఉదయకాంతికి ముందటి పల్చటి చీకటి. “రాతిరికే హితుడు” కాదు, ప్రభాతానికి మరింత సన్నిహితుడు.
తుఫానుకు ముందటి తుఫానును మించిన లోలోపలి అశాంతి. అదీ… ఆలూరి బైరాగి.
[ఇది ఆంధ్రజ్యోతి వీక్లీ, జనవరి 1982 తొలి సంచికలో తొలుత ప్రచురింపబడింది. ఈ వ్యాసాన్ని సేకరించి, కాపీరైటు అనుమతిని పొంది మాకు పంపిన పద్మజ సూరపరాజు గారికి మా కృతజ్ఞతలు. – సం.]