అక్టోబర్ 2019

ఈరోజు తెలుగుభాష ఏ స్థితిలో ఉన్నది అన్న ప్రశ్నకు పతనమవుతున్నది అన్నదొకటే సమాధానం ఎవరిచ్చినా. ఏ దేశంలోనైనా, కాలంతో పాటు భాష తీరుతెన్నులు మారడం సహజం. కానీ, ఈ మార్పులను ఏ తరానికాతరం గమనించుకోవాలి. భాషను నిలబెడుతున్నవేవో, పతనానికి గురిచేస్తున్నవేవో చర్చించుకొని వాటిని నమోదు చేయడం, భావి తరాలకు భాష పట్ల మెలకువను, జాగరూకతను మప్పుతాయి. తెలుగు భాష స్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోందని అందరూ ఒప్పుకుంటున్నా, దానికి కారణాలు వెదికి విశ్లేషించే దిశగా ఎవరూ అడుగులు వేయలేదు. అందుకే, తెలుగు వచనం కాలక్రమేణా ఎలాంటి మార్పులకు గురైంది? వాటి నేపథ్యమేమిటి? అన్న మౌలికమైన ప్రశ్నలకు కూడా, కనీసం రెండు శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే గానీ సమాధానం దొరకదు. ఈ బృహత్కార్యాన్ని వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ తలకెత్తుకొని, సమగ్రమైన తమ పరిశోధనా సారాన్ని మూడు భాగాలుగా సాగిన వ్యాసరూపంలో విశ్లేషించారు. తెలుగు భాష చరిత్రలో మొదటగా వినవచ్చే ప్రముఖులు పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల అభిప్రాయాలలో వైరుధ్యాల వల్ల తెలుగు భాషా వ్యవహారాలలో కలిగిన మార్పుల గురించి మొదటి భాగంలోనూ; స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని లార్డ్ కర్జన్ తీసుకున్న నిర్ణయం, తెలుగు దగ్గరకు వచ్చేసరికి ఏ రూపు తీసుకుంది? లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పిన తెలుగు ఇప్పటికీ కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయ్యింది కానీ కొత్త ఆలోచనలు తయారుచేసే భాష ఎందుకు కాలేదు? అనే విషయాలు రెండవ భాగంలోనూ వివరించారు. ఇక, బళ్ళలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో గ్రాంథిక భాషావాదులు గెలిచిన తరువాతి పరిణామాలు ఏమిటి? వ్యావహారిక భాషను సమర్థించిన గిడుగు రామమూర్తి వాదం మనకు ఏ అదనపు సౌకర్యాన్నిచ్చింది? ఈ భాషోద్యమం తరువాత, తెలుగులో వచ్చిన మార్పుల్లో రేడియో, పత్రికలు, పత్రికా సంపాదకుల పాత్ర ఏమిటి? ప్రస్తుత తెలుగు భాష పరిస్థితిని విశ్లేషిస్తూ, మెరుగుపరుచుకోగలిగే మార్గాలను సూచిస్తూ రాసిన ఆఖరి భాగం ఈ సంచికలో. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృష్టితో ఎంతో కృషి చేసి, ఈ వ్యాసాన్ని మనకు అందించిన రచయితలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.


ఈ సంచిక నుండీ మానస చామర్తి ఈమాట సంపాదక బృందంలో ఒకరవుతున్నారు. వారికి మా హార్దిక స్వాగతం.