పాఠకుల అభిప్రాయాలు

హనుమంతరావు results: 290

  1. సువర్ణభూమిలో … గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/06/2008 9:30 pm

    భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:

    “కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]

    అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.

    మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:

    “పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]

    పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.

  2. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/03/2008 9:04 pm

    కామేశ్వరరావు గారికి,

    సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.

    వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.

    భూషణ్ గారికి,

    నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.

    మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి తమ్మినేని యదుకులభూషణ్. అభిప్రాయం:

    12/02/2008 10:25 pm

    ఇస్మాయిల్ గారిని బాగా ఎరిగున్న వ్యక్తిగా నాలుగు మాటలు చెబుతాను.ఆయన వ్యక్తిగా చాలా ఉదారుడు. చేయనిదానికి ఘనత పొందాలనే తాపత్రయం ఆయనలో ఏనాడు లేదు. అయితే కొడవళ్ల హనుమంతరావు గారు చూపిన వ్యాసం ఇస్మాయిల్ గారి “ఇద్దరు భాష్యకారుల”కు మూలం అన్న దాంట్లో రెండవ అభిప్రాయానికి తావు లేదు.

    ఇంకో పార్శ్వం:
    తెలుగులో పుస్తక ప్రచురణ పెద్ద తలనొప్పి వ్యవహారం (దేశిబుక్స్ తరపున ఇస్మాయిల్ గారి “కవిత్వంలో నిశ్శబ్దం”, “పల్లెలో పాత ఇల్లు” మేము ప్రచురించిన సంగతి కొంత మంది పాఠకులకైన తెలిసే ఉంటుంది). ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే , ఇస్మాయిల్ గారి ఆముద్రిత కవితలు అనువాదాలు ప్రచురించే ముందు ఆయన స్వదస్తూరిలో ఒక అనువాదం దొరికింది. దాని మీద, ఆయన రష్యన్ కవయిత్రి అని రాశారు అంతే. ఊరు, పేరు ఏమీలేవు. ఆయనకు రష్యన్ లో ఇష్టులైన కవులు/కవయిత్రులు నాకు తెలుసు కాబట్టి, అందునా అది ఆ కవయిత్రి రాసిన కవితల్లో కొంత విలక్షణమైనది కాబట్టి నేను వెంటనే, గుర్తించి ఒక లఘు టిప్పణి లిఖించి ప్రచురణ పనులు చూస్తున్న కవిమిత్రులకు పంపాను. అదే రకంగా ఇంకో రెండు పోలిష్ కవితలను గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ రాయప్రోల్ కవిత్వం/జీవితం గురించి అమెరికన్ పత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు వాక్యాలు రాసి పంపాను. కానీ, ఇవేవీ పుస్తకం ప్రచురణలోకి రాలేదు.

    నేను చెప్ప దలచుకొన్నది ఏమంటే, మనవారికి పాదపీఠికలమీద పెద్ద ఖాతరీ లేదు. కవి /రచయితల శుద్ధప్రతి మొదలుకుని ప్రెస్సుకు వెళ్ళే ఆఖరి ప్రతి (gateway అంటారు మన ప్రెస్సువాళ్ళు) దాకా ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకొంటాయి. పుస్తక ప్రచురణలో కవి /రచయిత /సంపాదకుల ప్రమేయం ఉన్నా, ఒక్కొక్కసారి కొందరి అజాగ్రత్త వల్ల ఎన్నో స్ఖాలిత్యాలు. అటువంటి స్ఖాలిత్యాల ఫలితమా ఇది? ఇస్మాయిల్ గారు మొదట రాసిన ప్రతిలో దాని మూలాన్ని పేర్కొన్నారా?? అసలు మొదటి సారి ఏ పత్రికలో ప్రచురించ బడింది?? ఇవన్నీ సాహిత్య చరిత్రకారులు తేల్చవలసిన విషయాలు.

    తమ్మినేని యదుకులభూషణ్.

  4. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/01/2008 11:05 pm

    స్వచ్ఛమైన గాఢమైన అస్పష్టత 🙂

    కామేశ్వరరావు గారికి,

    నన్ను కరెక్ట్ చేసినందుకు థాంక్స్. నాకు పాత సాహిత్యంతో పరిచయం నామమాత్రంగా కూడా లేదు. నేను పాపినేని ని paraphrase చేశానంతే. ఆయన మాటల్లో:

    “భావ కవిత్వానికి ముందు తెలుగు కవిత్వంలో అస్పష్టత (ambuguity), దానిని గూర్చిన భావన కన్పించవు. వెనకటి ఏ ప్రసిద్ధకవి పద్యమైనా భాషాకాఠిన్యం వల్ల, అన్వయక్లేశం వల్ల అర్థంకాక పోవటమంటూ వుందిగానీ అస్పష్టం కావటమంటూ లేదు. ప్రాచీన కావ్యాల్లో కవి ఉద్దేశ్యాన్ని ప్రతి పద్యంలోనూ సుళువుగానే గ్రహించవచ్చు. కవి ఉద్దేశ్యం తెలియకపోవటం అనే ఇబ్బంది ఆధునిక కవిత్వంలోనే ఎదురవుతోంది. ఈ ఇబ్బందిని గూర్చి ముచ్చటించుకోవాలంటే ముందుగా అస్పష్టత అనే భావనను నిర్వచించుకోవాలి.”

    అస్పష్టతకి ఉదాహరణగా పాపినేని ఇచ్చిన ఒక కవిత – “పోలికలు”:

    “అద్దాలమేడ – అందాల భామ
    బృహదారణ్య కోపనిషత్తులో
    సీలియాని కుట్టి చంపేసిన కిం గం జా ఐలండ్ చీమలు
    వేదాల పనసలు – ఉల్లిపాయ పొరలు.
    నిలువుటద్దాల్ని నిట్టూర్పులతో కొలువ్
    షాపెనోవర్ పడుకున్నచోట
    పడిపోయిందొక క్షురకర్మ అద్దం.
    పగిలిన అద్దంలో అతనొక
    అనంత శయన ఐక్యతా శతమూర్తి.
    సంసారి కొలిమిలో సన్యాసి ఊపిరి ఊదు
    దీపాల కొలువులో పాపాల చీకటి చిమ్ము
    నిలువుటద్దాలపై పడకటద్దాలు పడితే
    కళ్ళు విరిగి కాళ్ళు పగుల్తాయ్.
    వాలుటద్దాలపై కార్నర్ అద్దాలు రగిలితే
    స్ప్లింటర్స్ లో సిన్నర్స్ మిగుల్తారు.
    అద్దాల మేడలో గాజుసూదుల కంపలో
    గాయపడ్డ వాళ్ళని చూచి డాక్టరే కట్టుకుంటాడు.”

    ఎలియట్, డెరీడా, షెల్లీ లకి అధోదీపికలున్నాయి! ఎవరు రాసిందో చెప్పనవసరం లేదు కదా. పాత కవిత్వంలో కూడా ఇంతటి అస్పష్టత కలవి ఉన్నాయంటారా? పాతా కొత్తా, రెండూ ఎరిగిన మీరే చెప్పాలి.

    నాకిది అర్థమయితే ఒట్టు. అందంగా ఉందని మాత్రం ఒప్పుకోవాలేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  5. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/30/2008 11:16 pm

    To Give Credit Where It Is Due

    సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.

    గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.

    మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. 🙂 పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.

    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:

    “అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”

    వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. 🙂 మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు – ఛాందసులు, అఛాందసులు – అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.

    నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?

    ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.

    ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి ఆ కవిత చేరేదేమో కూడాను.

    చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
    [2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.

  6. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/29/2008 12:13 am

    ఆధునిక కవిత్వంలో అస్పష్టత

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,

    మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!

    సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.

    భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.

    సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు – దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక – కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “సాహిత్యం – మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.

  7. కుతంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/27/2008 8:29 pm

    బావుంది. కథనం చాలా బావుంది. భాష బ్రహ్మాండంగా ఉంది.

    “ఈ గొడ్లు. వీరి కన్నా అతడే నయం.” ఏ మగాడికైనా అంతకు మించిన పొగడ్త ఏముంటుంది? 🙂

    “లే నగవు చేతను భావముచేత సిగ్గుచే … కలహము చేత … కందువమాటలచే … వలపింతురు కాంతలు పెక్కుభంగులన్.”

    కొడవళ్ళ హనుమంతరావు

  8. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/27/2008 1:32 pm

    బాబ్జీలు గారికి,

    బాధేం లేదు. మో నిరాకారుడి లాగే నేనూ అడివిలో చిక్కుకుపోయాను. 🙂

    ఇస్మాయిల్ చెప్పేదేదో ఈ సందర్భంలో ఆలోచించదగ్గదనిపిస్తోంది కాని, అది అభిప్రాయాల పరిథి దాటిపొయ్యేటట్లుంది. ప్రస్తుతానికి అంతటితో ఆపేస్తాను.

    వేలూరి గారికి నిరాకారుణ్ణి ప్రస్తావించినందుకు కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

  9. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu అభిప్రాయం:

    11/27/2008 6:16 am

    పాఠకుడి గారికి:
    ఇస్మాయిల్ గారి వ్యాఖ్యనీ, కన్యాశుల్కాన్నీ ఒకే గాటని కట్టకండి. ఇస్మాయిల్ గారే వొప్పుకోరు. కన్యాశుల్కం జీవితం. జీవితం గురించి మరో వెయ్యేళ్ళ తరవాత కూడా “హాట్ హాట్” చర్చలు జరుగుతాయి. మీరొక్కరే హనుమంతరావు గారడిగిన చర్చ చేశేరు. విపులంగా చేయాలి, దయచేసి.

    సురేష్ కొలిచాల గారికి:
    వేలూరి వారు “సాధారణ పాఠకుడు”. ఇది వేలూరి వారికి అవమానం కాదు. శ్రీశ్రీ చివరివరకూ “సాధారణ పాఠకుడే” సాధారణ పాఠకుడి మొదటి లక్షణం, నూతనత్వాన్ని, అదెలాటిదయినా, అందులో మంచి లేశమాత్రమైనా, “కానీయండి” అని. అసాధారణ పాఠకులు ఎక్కడో ఒకదగ్గర ఆగిపోతారు.కొత్త జ్నాపకాన్ని సృష్టించడవేవిఁటీ? వేలూరి వారు రాసింది రైటు. కొత్త జ్నాపకాన్ని నెమరు వేయడం. మీరు ఇస్మాయిల్ గారి గురించీ, “మో” గారి గురించీ ఏవీఁ అన్లేదు. అన్నట్టు “అసాధారణ పాఠకుడి” గురించి: “అమ్మమ్మా! కందిగుండలో ఇంగువ వెయ్యవా, ప్లీజ్. మా అత్తారింట్లో కందిగుండ ఘుమఘుమ లాడుతుందే, ఇంగువతోటి. ప్లీజ్ ప్లీజ్” అని బతిమాలినా “నో ఇంగువ. ఓన్లీ జీలకర్ర” అనే రకం.

    వైదేహీ శశిధర్ గారికి:
    నిజవేఁనండోయ్. “ట్రాన్స్పెరెంట్ చీకటి” .

    హనుమంతరావు గారూ, మహానుభావుల వ్యాఖ్యల గురించి నా అజ్నానపు విజ్నానపు అభిప్రాయాల్ని క్షమించీయండి.
    ట్రాన్స్పెరెంట్ చీకటి, స్పష్టవైఁన అస్పష్టం, అస్పష్టవైఁన స్పష్టం, తీరిపోయిన దాహం, అంతవైఁన అనంతం. హనుమంతరావుగారూ! ఇదేవిటండీ. బాబ్జీలూ, ఇదనంతం.

  10. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/27/2008 1:31 am

    “నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.” – మో

    బాబ్జీలు గారికి, (కొంత వైదేహి గారికి),

    “ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)

    మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?

    కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.

    వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.

    కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
    “నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
    చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
    నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,

    మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
    నేనెళ్ళొస్తా గడేసుకో.”

    అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:

    “నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”

    నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”

    “The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.

    “అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
    [2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.