అహం మిగిల్చేది

అహం దెబ్బతిన్న పెద్దదేశం,
చిన్నదేశాన్ని కాలరాసింది.
శవాలన్నీ మట్టిలో కలిసినా
శిథిలాలు చరిత్ర సాక్ష్యాలుగా
మిగిల్చిన యుద్ధమక్కడ.

అహం తొడుకున్న మతం
గుడుల్నే కాదు, చరిత్రనీ చెరిపేసింది.
మతాలన్నీ మట్టిలో కలిసినా
శిథిలాల సాక్ష్యాలు చరిత్ర
చెప్పలేని విధ్వంసమక్కడ.

అహం పెంచుకున్న మనిషి
తరతరాల అంతరాన్ని పెంచాడు.
అసలు మనిషే మట్టిలో కలిసినా
సాక్ష్యాల్లేని చరిత్రకు శిథిలాలైన
తరతరాల సమాధి జీవితాలక్కడ.

అహం మిగిల్చేది
యుద్ధం – విధ్వంసం – సమాధి జీవితం.


క్రాంతి కుమార్ మలినేని

రచయిత క్రాంతి కుమార్ మలినేని గురించి:

అనేక తెలుగు సాహిత్య వేదికలపై తన కవితలతో గుర్తింపు పొందిన కవి క్రాంతికుమార్ మలినేని. ఆయన “ఎన్నెన్ని వసంతాలో..”, “ఒంటరి ప్రపంచం”, “తెల్లని కాగితాలు” మొదలుకొని ఎన్నో కవితలు రచించారు. సృజనాత్మక కవిత్వానికి, ప్రశంసలు పొందారు. ‘వాకిలి’ సాహిత్య పత్రికలో ‘జయభేరి రెండవ భాగం’లో గొలుసు కవితలు రాశారు.

 ...