కవులను, సాహిత్యకారులను దేశంనుంచి తరిమేయడంలో రష్యా ప్రతిభే వేరు. అలా స్వదేశం నుంచి పారిపోక తప్పని పరిస్థితి ఎదురైన ఒక రచయిత్రి కరొలీనా పావ్లోవా . ఆమె పారిపోవడానికి కారణం జార్ ప్రభువు కాదు. తోటి సాహితీవేత్తలు పెట్టిన మానసిక హింస. మగరచయితల బహిష్కరణకు రాజ్యం కారణమైతే, ఈ రచయిత్రి పారిపోవడానికి కారణం ఆ మగ రచయితలే. వినడానికి ఎంత దారుణంగా ఉన్నా అదే నిజం.

“పెద్దింటి అమ్మడమ్మ కోడలే! చిట్టెమ్మను ఎరగవూ? అమ్మడమ్మకీ చెప్పే. కోడలు పిల్ల చిట్టెమ్మ చిన్నదీ. దానికి తెలీదూ – గ్రహణం నాడు గదిలోంచి బయటికి రావొద్దనూ. నీళ్ళోసుకుందన్నావు. జాగ్రత్తా! అని. ఆవిడేం చెప్పిందో, అదేం విందో! మొదటి కాన్పు! గ్రహణం మొర్రి రాకేమవుతుందీ! పిల్లాడు చూడబోతే పనసపండులా ఉన్నాడు. మీది పెదవేమో చీలిపోయి ఉంది!

మామిడి పళ్ళ కాలం వచ్చిందంటే చాలు ఆ కాలం గడిచేదాకా దాదాపు ఋతువంతా మేము మామిడి చెట్లమీదే గడిపేవాళ్ళం. ఆ మామిడి కొమ్మల మీదికి వెళ్ళే ముందు వంటింట్లోంచి ఉప్పూ, కారం పొట్లాలు కట్టుకోడం మాత్రం మరిచేవాళ్ళం కాదు. డుబ్బుగాడయితే కళ్ళు మూసి, కాళ్ళు మడిచి, చిలకలా ఎగిరినట్లే ఎగిరి చెట్టు మీదికి వాలేవాడు. అప్పుడప్పుడు నేను చెట్టు ఎక్కలేక జారేవాణ్ణి.

ఫెజ్‌లో ప్రతి ఏడాదీ జరిగే ప్రపంచ ధార్మిక సంగీతోత్సవం ఒక విలక్షణ కార్యక్రమం. ఈ ఉత్సవం గురించి షఫియా రైలు ప్రయాణంలో చెప్పింది కూడానూ. ఈ సంగీతోత్సవానికి ప్రపంచపు నాలుగు మూలలనించీ విద్వాంసులు వస్తారట. సూఫీ ఖవ్వాలీల నుంచి హిందూ భజనల దాకా, క్రైస్తవ గీతాల నుంచి బౌద్ధమతపు మంత్రోచ్ఛారణ దాకా విభిన్న బాణీల సంగీత ప్రపంచం.

వికీర్ణం (radiation) అనేది ప్రాణాంతకమైన ప్రమాదాన్ని తీసుకొచ్చే ‘అమ్మవారు’ కాదని తెలుస్తున్నాది కదా! మనం అంతా బహుకొద్ది మోతాదులలో అసంకల్పంగా వికీర్ణం ప్రసారం చేస్తూనే ఉన్నాం, మన ఎముకలలో ఉండే అనిశ్చల పొటాసియం కారణంగా. మన వంటగదులలో నల్లసేనపురాయితో చేసిన తీనెలు కాని ఉంటే అవి కూడా కాసింత వికీర్ణాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాయి.

వానలో తడవనివారు, కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు, ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.

నీ మాటలతో నన్ను కాల్చివేయచ్చు
నీ చూపులతో నన్ను ముక్కలు చేయచ్చు
నీ విద్వేషంతో నన్ను చంపివేయచ్చు
కానీ మళ్ళీ,
నేను గాలిలా
ఇంకా పైకి లేస్తాను.

నా కాంక్షాపటుత్వం నిన్ను కలవరపరుస్తుందా?

నేను పలకరించలేదని అలిగి ముఖం తిప్పుకున్న పెరట్లో నిన్న పూచిన పువ్వు
తలుపు చప్పుడు చేసి ఎప్పట్లా నేను తెరిచేలోపే మాయమయ్యే వీధిలో పిల్లలు
నాకు చిరునవ్వుల్ని మాత్రమే బట్వాడా చేసే పోస్ట్‌మన్‌గారు
రెండ్రోజులుగా మబ్బుల్ని తోడుగా పెట్టి ఏ ఊరో వెళ్ళిన ఎండ

కూవం నదిలా నల్లగా నురగలు కక్కతూ ప్రవహిస్తోంది. నెల రోజల క్రితం చచ్చిపోయిన ఒక గొడ్డు కాలువలో కొట్టుకుని వచ్చింది. దానికి కొక్కెం వేసి లాగి ఒడ్డున వేశాడు డిల్లిబాబు. గద్దలను తెచ్చి ఆ చచ్చిన గొడ్డు మీదకు వదిలాడు. హుషారుగా శవానికి ప్రదక్షిణలు చేశాయి కానీ చీల్చడానికో, పొడిచి లాక్కుని తినడానికో వాటికి చేతకాలేదు. ఎప్పుడూ చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన గొడ్డు మాంసానికే అలవాటు పడ్డాయి. వాటికి ఆహారం అంటే అదే. ఎలుకలను కూడా తిని ఎరగవు.

ఒక్క వాక్యం కనికరించదే
మునుపు
ఎలా కుంభవృష్టి కురిసింది
నదిలా ఉరకలేస్తూ
లోయలగుండా
ఎలా ప్రవహించింది
మనసెందుకిలా ఎడారైంది?

నేను వెళ్ళేసరికి తాతకీ అమ్మమ్మకీ సంతోషం, మనవడు ఇంజినీర్ అయిపోతున్నాడని కాబోలు. పెద్దవాడినౌతున్నాను కనక ఇప్పుడు నాతో అన్ని విషయాలు చెపుతున్నారు. నేనే అడిగాను అబ్బలనాన్న సంగతి. వేసవిలో రాలేదుట కానీ గణపతి నవరాత్రుల సమయంలో వచ్చాట్ట. అవును ఇంకా ఒక్కడే. ఆయన భార్య ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆవిడ పుట్టింటివారిక్కూడా తెలియదు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, కొంతమందైతే ఆవిడ చచ్చిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు.

మనం చదివిన చరిత్ర పుస్తకాలు, పరిశోధక పత్రాలు, ప్రసంగ పాఠాలూ దురదృష్టవశాత్తూ మంచి నవల రూపంలోకి మారలేదు. ఒకటీ అరా తప్ప ఇలాటి కథావస్తువు గల నవలలు ‘కాల్పనిక’ సాహిత్యమార్గం పట్టినవే. కల్పన ముఖ్యమై, చరిత్ర వాస్తవాలను తెరవెనక పారేసినట్టు వుంటాయవి. కొన్ని చారిత్రక వివరాలు మినహా వాస్తవ చిత్రణ జోలికి పోనివే అవి!

సామాన్యముగా ఉదాహరణములలో ప్రతి విభక్తికి మొదటి పద్యము ఒక వృత్తము, తఱువాత కళికోత్కళికలుగా రగడ భేదములను వ్రాయవలెను. అంతములో ఒక సార్వ విభక్తిక పద్యముండును. కళికోత్కళికలు లేక కూడ ఉదాహరణములను కొందఱు కవులు వ్రాసిరి. దేవీనవరాత్రుల పండుగ సమయములో అలాటి ఉదాహరణమును ఒకదానిని నేను వ్రాసినాను. దేవికి ఆర్య అని కూడ పేరు, కావున ఈ పద్యములను ఆర్యాభేదములలో వ్రాసినాను. కావున ఇది ఆర్యోదాహరణము!

ఈ కథల్లో మనిషి, అతని జీవనపోరాటం, విధ్వంసాల మధ్యనయినా బతకాలన్న ఆరాటం, ఆ ఆరాటపోరాటాల మధ్యనే స్నేహాలు, ఆత్మీయతలు, ఎల్లలు ఎరుగని ప్రేమలు, మానవీయ స్పందనలు – అవును ఎల్లలు ఎరగని కథలు ఇవి. శ్రీలంక నుంచి కెనడా దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా, గ్రీస్ నుంచి భారతదేశం దాకా – ఈ కథల రంగస్థలాల్లో ప్రపంచమంత వైవిధ్యం.

ప్రవాస జీవితపు వివిధ పార్శ్వాలు, కోణాలు, మహిళలపట్ల వివక్ష వీటిని గురించి ఒక మహిళా రచయిత రాసిన తీరు, స్పందించిన విధానం ఈ కథల ప్రత్యేకత! రాయడానికి సంకోచపడే విషయాలతో, సెన్సార్‌షిప్ ఉన్న అనేక అంశాలతో వినూత్నంగా రాసిన కల్పన కథలు తెలుగు కథను కొత్త కోణంలో చూపించాయని చెప్పవచ్చు.

క్రితం సంచికలోని గడినుడి-62కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై ఆరుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-62 సమాధానాలు.

అడ్డం ఆంగ్ల సొగసుకత్తెకు సొమ్ము తోడైతే మేధావి (3) సమాధానం: మనీషి సిరిసిరి ఈటెల ఆటలు (5) సమాధానం: ప్రాసక్రీడలు పార్సీ పట్టింపు తెలుగువాళ్ళు […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

మన సమాజంలో ఒక ఆనవాయితీ ఉంది. ‘పెద్ద’వారు, ‘గొప్ప’వారు, బడా ‘బాబు’ల వంటివారు మామూలు ప్రజలు కొనవలసి వచ్చేవి చాలా చాలా కొనరు. అవి వారికి ‘కాంప్లిమెంటరీ’గా వస్తాయి, వారిని ప్రసన్నం చేసుకోగోరిన వారినుంచి. వారూ అలా తాయిలాలు ఆశిస్తారు, సాధిస్తారు. అయితే కాంప్లిమెంటరీగా ఏదైనా ఇప్పించుకున్నంత మాత్రాననే పెద్దవారు గొప్పవారు ఎవరూ కారు. పెద్దరికం, గౌరవం వచ్చి వారి మీద పడిపోవు. డబ్బులు పెట్టి కొనుక్కోవడం వారనుకున్నట్టు నామోషీ కాదు. కాని, ఆ అపోహ మాత్రం మనలో వేళ్ళూనుకునిపోయింది. తెలుగు సాహిత్యసమాజమూ ఇందుకు మినహాయింపు కాదు. వేరే దేశాల్లో, వేరే భాషల్లో సాధారణంగా ఏ బుక్‍షాపులోనో, పుస్తకోత్సవాలలోనో జరిగే పుస్తకావిష్కరణ సభలో వేదిక మీద రచయిత ఒక్కడే ఉంటాడు. తన పుస్తకం నుంచి కొంతభాగం చదివి వినిపిస్తాడు, శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. సంధానకర్తగా అక్కడ వేరెవరైనా ఉన్నా, వాళ్ళు పుస్తకానికి సంబంధించిన చర్చనే నడుపుతారు. దానికి కొనసాగింపుగా పాఠకులు ఆ పుస్తకాన్ని పరిశీలిస్తారు, నచ్చితే కొనుక్కుంటారు, రచయిత స్వహస్తాలతో సంతకం చేసి ఇస్తాడు కూడా. పాఠకులు, రచయితా ఒకే తలంలోకి వచ్చి, సాహిత్య సంస్కారాన్ని పెంపొందించుకునే ఇలాంటి ఒక దృశ్యం తెలుగులో ఊహకు కూడా అందదు. కొత్తొక వింత అనిపించుకోవడం కోసం ఆవిష్కరణలు హోటళ్ళలో, బారుల్లో అయినా జరుపుతారు కాని బుక్‍షాపులకు మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. అధ్యక్షులుగానో ప్రత్యేక ఆహ్వానితులగానో ఎప్పుడూ విచ్చేసే ఆ కొద్దిమందే ఎంత ఇరుకుగా ఉన్నా వేదికమీదే సర్దుకుంటారు. సాహిత్యం గురించి, సాహిత్యబాధ్యతల గురించి, రచయితకూ తమకూ ఉన్న బంధం గురించి, రచయిత వ్యాసంగంలో తమ పాత్ర గురించి, రచయిత ప్రతిభ గురించి- ఉన్నవీ లేనివీ కలిపి కుట్టిన ఊకదంపుడు ఉపన్యాసాల అనంతరం, పుస్తకాన్ని అందరూ కలిసి గిఫ్టురాపునుంచి ఆవిష్కరిస్తారు. అప్పటికప్పుడే సదరు రచయిత ఆ వేదిక మీద పెద్దలందరికీ గౌరవాదరాభిమానాలతో తన పుస్తకాన్ని వినయంగా సమర్పించుకుంటాడు. ఆ కాపీ అలా కాంప్లిమెంటరీగా రాకపోతే తమ గౌరవానికి భంగం కలిగినట్టు సదరు ఆహ్వానితులు చిన్నబుచ్చుకోవడం కద్దు. ఆపైన అచ్చేసిన ఐదువందల కాపీలలో కనీసం రెండు మూడొందలు రచయితే అందరికీ ఉచితంగా ఇవ్వడమూ లేదా తానే గంపగుత్తంగా తెలిసినవాళ్ళందరికీ పంపడమూ కద్దు. ఈ ప్రహసనం ఇంత రివాజుగా మారాక కూడా రచయితలందరూ మా పుస్తకాలు ఎవరూ కొనరు, వాటికి ఆదరణ లేదు, తెలుగువారికి సాహిత్యాభిమానం శూన్యం అని ఆక్రోశించడమే ఆశ్చర్యం. రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు. మరి అలా ఇస్తున్నాడూ అంటే కారణం? తన గుర్తింపు కోసం, ఆ పెద్దల ఆమోదం, సాహచర్యం కోసం. అబద్దపు రివ్యూల కోసం లేదూ కనీసం కానిమాటలు దొర్లకుండా వాళ్ళ ముందరి కాళ్ళకు బంధం వెయ్యడం కోసం. ఈ రొంపిలోకి ఇంకా దిగని, దిగాలనుకోని రచయితలుంటే, వారికి మేమొక సలహా ఇవ్వదలచాం. అది ఇదీ: పుస్తకావిష్కరణ సభలు పుస్తకాల దుకాణాలలోనే పెట్టండి. అచ్చు వేసిన ప్రతులన్నీ, ఐదుకు మించకుండా తీసుకొని, మిగతావన్నీ ప్రచురణకర్త/పంపిణీదారుడి దగ్గరే ఉంచండి. అమ్మే బాధ్యత వారికే అప్పచెప్పండి. సభకు విచ్చేసిన పెద్దలు, పిన్నలు, అతిథులు, ఆహ్వానితులు, ఉపన్యాసకులు, శ్రోతలు, ఆపైన పాఠకులు అందరూ, ఏ మినహాయింపూ లేకుండా నచ్చితే పుస్తకం కొనుక్కుంటారు, లేకుంటే లేదు. మిమ్మల్ని మీరైనా మరొకరైనా రచయితగా గుర్తించాలంటే, ఇట్లాంటి నిబద్ధత ఒక కనీస అర్హత. ప్రచురణకర్త కష్టానికి ఇదొక కనీస గౌరవం. సాహిత్యపు మనుగడా? దిగులొద్దు. దాని జీవితం మనం చింతించాల్సినంత చిన్నదేం కాదు.