చురుకుదనం మూర్తీభవించినట్టు కనిపించే జానకమ్మ తన అయిదు నెలల నివాసాన్ని, రెండు నెలల పైచిలుకు సాగరయానాన్నీ వింతలూ విశేషాలూ వినోదాలకూ పరిమితం చెయ్యలేదు. ఉన్న సంపదతో, తమతో తీసుకువెళ్ళిన ముగ్గురు సేవకుల సాయంతో సుఖంగా, విలాసంగా గడపలేదు. జిజ్ఞాస, ఆలోచన, పరిశీలన, పరిశోధన ఆమెను అనుక్షణం నడిపించాయి.

తెలుగు కవిత్వానికి అలవాటు కాని పద్ధతిలో ఈ ఒరియా కవిత్వాన్ని అనుసృజన పేరుతో పనికట్టుకుని అచ్చు వేయించడంలో వెంకటేశ్వరరావుకి ప్రత్యేకమైన దృష్టి వుందని నా అనుమానం. నేలబారుగా ఏదో ఒక వస్తువునో ఒక వాదాన్నో ఒక నమ్మకాన్నో చెప్పడం కోసం రాసే తెలుగు పద్యాల పద్ధతి ఒరియా కవిత్వం ద్వారా మార్చాలని, తెలుగు అభిరుచి ఇంకా క్లిష్టమవ్వావలని వెంకటేశ్వరరావు ఆలోచన.

కథాకాలాన్ని అనుసరించి ఈ కథల్లో యుద్ధ వాతావరణమూ, యుద్ధం మీద చర్చా ఉన్నాయి. రచయితకు ఉన్న అపార విజ్ఞానం ఈ కథల్లో చోటు చేసుకున్న సంఘటనల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద ఆయన వ్యాఖ్యానం తేటతెల్లం చేస్తుంది. రచయిత రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో పాల్గొని ఉండటం ఆయన నేవీ కథలకు నేపథ్యం అని స్పష్టమవుతుంది.

ఇది జాజుల జావళి. కాదు. అత్తరులు అద్దిన వెన్నెల ప్రవాహం. కోనేట్లో స్నానమాడి గుడిమెట్లు ఎక్కి వచ్చిన పిల్లగాలి అమృతస్పర్శ. ఏకాంతంలో మనతో మనం చేసుకునే రహస్య సంభాషణ. కాగితం వరకు రాకుండానే మనసులో ఇంకిపోయిన అనేకానేక అద్భుత భావసంచయం. ‘కవిత్వం ఒక ఆల్కెమీ’ అంటాడు తిలక్. ఆ రహస్యం నిషిగంధకు పట్టుబడింది.

నవల చదివేవారికి చిత్రకళ, చరిత్ర, రంగుల లోతుపాతులు తెలియకపోతే ఏమీ అర్థం కాదన్న సంశయం, కళాకారుడి కళామయ జీవితం దేనికన్న సంశయం కంటే, ఒక ఆర్టిస్టుకి కళ పట్ల, జీవితం పట్ల గల అగాధపు లాలస గుండె నిండిపోయేలా కనిపిస్తుంది. అతడి జీవన వైరుధ్యాన్ని ప్రతి సెంటీమీటరు తాకి, స్పందించగల నిర్మాణం ఈ నవలలో ఉంది.

ఈ నాలుగు కథలు వస్తుపరంగా ప్రయోగాత్మకమైన కథలు. స్వీకరించే వస్తువు కొత్తదైనప్పుడు, మూస వస్తువుల్ని కాదని కొత్త వస్తువులతో కథలు రాసినప్పుడు ప్రయోగమే అవుతుంది మరి! అన్ని కథలు సమకాలీన కథలు. ఇవాల్టి కథలు. ఆధునిక సమాజంలో సంభవిస్తున్న మార్పులే ఆమె కథలకి వస్తువులు. ఇక కథలు వస్తుపరంగానే కాకుండా, రూపపరంగా వైవిధ్యాన్ని, విలక్షణతనీ కూడా కలిగివున్నాయి.

నిజానికి మహా సౌందర్యాఘాతమూ నరకమే. అదేదో గట్టిగా అనుభవించిన దాఖలా ఈ కవిగారు తన గురించి ఈ పుస్తకంలో చెప్పినచోట కనిపించింది. నా సొంత అనుభూతిలో నడిచి నడిచి సీదా తిరిగి మళ్ళీ ఈ సంకలనంలోని కవితల్లోకి ఇరుక్కున్నట్టయింది. అంటే భారీ సెంటిమెంట్లు, మరికొళుందు వాసన గోల కాదు నాది. ఈ కవితలు పన్నిన వలే అంత!

రవివర్మ అనే ఆనాటి కళాకారుని జీవితకథలో ఒకటి రెండు మలుపులను వెదికి పెన్సిల్ చెక్కినట్టు రాసిపడెయ్యటం, కిట్టించడం కుదరదు–నాటి ప్రాంతీయ చరిత్ర, వలస కళల వాతావరణం, తైనాతీల వస్తుప్రపంచం, బ్రిటిష్ జమీందారీ అడుగుబొడుగు నీడలు సర్వసమగ్రంగా శోధించి నేతపని చేయడంవల్ల పాఠకుడికి ‘రవి’ కళాప్రపంచపు ‘అదనపు విలువలు’ బహుళ ప్రయోజనం చేకూర్చాయి.

పెళ్ళాడటానికి ప్రేమ ఒక్కటే అర్హతగా నిలిస్తే బాగుంటుంది కాని, మానవ సహజమైన కుతూహలం అవతలి వ్యక్తిలోని ప్రత్యేకతలు తెలుసుకోనిదే, ఎందెందులో అతడు/ఆమె తనకు సరిజోడో తెలుసుకోనిదే అంత త్వరగా శాంతించదు. తృప్తి చెందదు. ఈ కథానాయకుడు అలాంటి కుతూహలపరుడు.

మనం చదివిన చరిత్ర పుస్తకాలు, పరిశోధక పత్రాలు, ప్రసంగ పాఠాలూ దురదృష్టవశాత్తూ మంచి నవల రూపంలోకి మారలేదు. ఒకటీ అరా తప్ప ఇలాటి కథావస్తువు గల నవలలు ‘కాల్పనిక’ సాహిత్యమార్గం పట్టినవే. కల్పన ముఖ్యమై, చరిత్ర వాస్తవాలను తెరవెనక పారేసినట్టు వుంటాయవి. కొన్ని చారిత్రక వివరాలు మినహా వాస్తవ చిత్రణ జోలికి పోనివే అవి!

ఈ కథల్లో మనిషి, అతని జీవనపోరాటం, విధ్వంసాల మధ్యనయినా బతకాలన్న ఆరాటం, ఆ ఆరాటపోరాటాల మధ్యనే స్నేహాలు, ఆత్మీయతలు, ఎల్లలు ఎరుగని ప్రేమలు, మానవీయ స్పందనలు – అవును ఎల్లలు ఎరగని కథలు ఇవి. శ్రీలంక నుంచి కెనడా దాకా, ఆఫ్రికా నుంచి అమెరికా దాకా, గ్రీస్ నుంచి భారతదేశం దాకా – ఈ కథల రంగస్థలాల్లో ప్రపంచమంత వైవిధ్యం.

ప్రవాస జీవితపు వివిధ పార్శ్వాలు, కోణాలు, మహిళలపట్ల వివక్ష వీటిని గురించి ఒక మహిళా రచయిత రాసిన తీరు, స్పందించిన విధానం ఈ కథల ప్రత్యేకత! రాయడానికి సంకోచపడే విషయాలతో, సెన్సార్‌షిప్ ఉన్న అనేక అంశాలతో వినూత్నంగా రాసిన కల్పన కథలు తెలుగు కథను కొత్త కోణంలో చూపించాయని చెప్పవచ్చు.

ఈ నవలలో అతను తీసుకున్న జీవితం వాస్తవం, గతానికి చెందిన వాస్తవం. దీన్ని చిత్రించటానికి రచయిత చరిత్రతో దిగిన సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారసపడ్డాయి. అతనితో ఘర్షణపడ్డాయి. ఆ తరువాత అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకుని తమని గురించి తామే యదార్థంగా పరిచయం చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి.

రెండు దారులుంటాయి. ఒకటి నలిగిన, ఎవరినీ ఇబ్బంది పెట్టని, దేనితోనూ పేచీ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన దారి. మరొకటి దాన్ని ఒప్పుకోలేని, రాజీ పడలేని, తోడు దొరకని, తనకు నచ్చిన సూటి బాట. ఏదీ తేలిక కాదు. ఏ బాట పట్టినా యుద్ధం లోపలి మనిషితోనో, బయటి సమాజంతోనో తప్పనిసరి అవుతుంది కొందరికి ఈ కథల్లోని పాత్రలకు లాగే.

నలుగురు యాత్రికులు – నలుగురిదీ ఒకటే బాణీ. జీవితానికీ ప్రయాణానికీ అంతరం లేదని భావించినవారు. జడజీవితం మీద తిరుగుబాటు జెండా ఎగరేసినవారు. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని, ఆ ప్రక్రియలో తమను తాము అన్వేషించుకుంటూ సాగినవారు.

మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తలెత్తినప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు.

విప్పారిన కళ్ళతో, వికసించిన మనసుతో, శ్రుతి అయిన సర్వాంగాలతో అడవిని తమలోకి ఆవాహన చేసుకొని కాలపు ప్రమేయమూ స్పృహా లేకుండా ఏనాడో వదిలివచ్చిన మనల్ని మనం వెదుక్కుంటూ, తిరిగి ఆవిష్కరించుకొంటూ తిరుగాడే వ్యక్తులు అత్యంత అరుదు.

రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!

ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే నవల

1995లో తన ‘క్రాస్‌రోడ్స్’ కథాసంపుటి కోసం వడ్డెర చండీదాస్ రాసిన ముందుమాటను తాను పోగొట్టుకున్నానని, ఆ చేతిరాతప్రతి తిరిగి ఈమధ్యే దొరికిందనీ చెబుతూ సదాశివరావు ఇటీవల ఆ ప్రతిని, ఆయనే తీసిన చండీదాస్ ఫోటోని, మాతో మరికొందరు మిత్రులతో పంచుకున్నారు.