ఫిబ్రవరి 2024


‌(చిత్రం: దాసరి అమరేంద్ర)

సాహిత్యానికి మనుగడ రచయితలు, పాఠకులు. అయితే, వీరిద్దరి మధ్యా వారధిగా నిలబడి, మంచి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ, పాఠకుల అభిరుచిని పెంపొందించేందుకు సాయపడే మాధ్యమాలలో పత్రికలది ముందువరుస. ఒక్కొక్క తరంలో రచయితలు కుదురుకునే వేదికగా కొన్ని మాసపత్రికలు, వారపత్రికలు బలంగా పనిచేశాయి. పత్రికలు రచయితల ద్వారానూ, రచయితలు పత్రిక ద్వారానూ పేరు తెచ్చుకొన్న సందర్భాలవి. దీపావళి, ఉగాది, సంక్రాంతి పండగలు ప్రత్యేక సంచికలుగా సాహిత్య సంబరాలను కూడా మోసుకురావడం అప్పటి ఆనవాయితీ. ఈ సరళి కేవలం వ్యాపారం కోసమే కాదు, మంచి రచయితలను, నాణ్యమైన సాహిత్యాన్ని నిలుపుకోవడానికి కూడా ఉపయోగపడింది. కాలం ఎంతమారినా, రచయితకు పత్రికకూ ఉన్న ఈ సంబంధం మారలేదు. ఎందుకంటే, పత్రికకు ఎన్ని వనరులు ఉన్నా, ప్రధానంగా పత్రిక ఆధారపడేది సమకాలీన రచయితల మీద, నాణ్యమైన రచనల మీదే. తన రచన పదిమందికి చేరడానికి రచయితలకు వేరే దారులు ఉన్నా, అందంగా తీర్చిదిద్దబడి, ఒక స్థాయి ఉన్న రచనలే ప్రచురింపబడతాయి అన్న పేరు వచ్చిన పత్రికలో రచనను చూసుకోవడం, దానికదే ఒక గౌరవం. వేలి చివర ఒక స్థలం ఖాళీగా కనబడి రాయమని పోరుతున్నా నిభాయించుకుని, ఆ ఆలోచనలను ఒక వరుసలో, శ్రద్ధతో రాసుకోవడం, దిద్దుకోవడం పరిశ్రమతో కూడిన పని. కానీ అది ప్రాథమిక సాహిత్య అవసరం. అంతేకాదు, అది ఎంతో తృప్తినిచ్చే వ్యవహారం కూడానని ఎందరో చేయి తిరిగిన రచయితలు అంటారు. ఫేర్‌వెల్ టు ఆమ్స్ ఆఖరు పేజీని సరైన పదాల కోసం వెదుక్కుంటూ ముప్పై తొమ్మిదిసార్లు తిరగరాశాడట హెమింగ్వే. తాను వ్రాసినదానికంటే చెరిపివేసినదే ఎక్కువ అంటాడు నబకోవ్. సరిగ్గా పడవలసిన ఒక్క పదం కోసం రోజుల తరబడి ఎదురు చూసేవారట దేవులపల్లి కృష్ణశాస్త్రి. అజంతా తన స్వప్నలిపిలో ప్రచురించిన ప్రతి కవితా ఆయన మళ్ళీ మళ్ళీ దిద్దుకున్నదే. ఏది తోస్తే అది వ్రాసే ప్రతీవారూ రచయితలు కాలేరు; రచయిత కాదలచుకున్న వారికి తన రాతని బేరీజు వేసుకోని అందులోనుంచి ఎంతభాగాన్నయినా నిర్దాక్షిణ్యంగా తీసివేయగల చూపు ఉండాలి అంటుంది సిదొనీ కొలెట్. అట్లాంటి చూపు సహజంగానే రచయితలకు ఉంటే మంచిదే. లేనప్పుడు ఆ నిష్పాక్షికమైన చూపును ఇవ్వగలిగే పత్రికలు అవసరం. ఎందుకంటే, ఆ చూపు తన రచనలోని ప్రతి అక్షరాన్ని ప్రేమించే రచయితకు అందులోని అక్కర్లేని భాగాన్ని కూడా చూడగల శక్తిని ఇస్తుంది. తద్వారా రాతలో బిగి పెరుగుతుంది. ఆ బిగి ద్వారా రాతలో నాణ్యత. ఆ నాణ్యతే పాఠకులను రచనకు కట్టి పడేస్తుంది, వారి అభిరుచిని మెరుగుపరుస్తుంది. అలా నాణ్యత కోరుకునే రచయితలు పత్రికలకు అవసరం. బ్లాగులు, సోషల్ మీడియాల ఉద్దేశాలు వేరు కనుక, అక్కడ వ్రాసే వారికీ చదివే వారికీ ఈ చూపు అవసరం ఉండచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆ చూపునివ్వగల పత్రికలు రచయితలకు అవసరం. రచయితలు కాదలచుకున్న వాళ్ళకి మరింత అవసరం.