పాకశాలలో పాణినీయం

అనగనగా… ఒక రోజు, దేవలోకం అంతా చాలా హడావిడిగా ఉంది. కలియుగం ప్రవేశించి అయిదువేల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంద్రుడు గొప్ప విందొకటి ఏర్పాటు చేశాడు. ఆ విందుకి, సరిగ్గా కలియుగం ప్రవేశించే ముందు జరిగిన మహాభారతయుద్ధంలో పాల్గొన్న వీరులందరినీ ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. దేవేంద్రుని విందంటే ఆషామాషీ వ్యవహారమా! బ్రహ్మగారు సైతం వర్ణించలేనంత బ్రహ్మండమైన ఏర్పాట్లు జరిగిపోయాయి. ముల్లోకాలలో పేరుమోసిన వంటవారిని రప్పించి విందుకు నియోగించారు.

వచ్చే అతిథులు అసమాన ధీరులైన కురువీరులు. అంతే కాదు, వారికంటూ ప్రత్యేకమైన రుచులు కూడా ఉన్నాయి. అందువల్ల పాకశాసనుడు పాకశాలాధిపతిని పిలిపించి పాండవకౌరవాదులలో ఎవరెవరికి ఏయే వంటకాలు వడ్డించాలో ఎవరికేది వడ్డించకూడదో చాలా వివరంగా చెప్పాడు. ఏమైనా తేడాలు వస్తే నరకానికి పంపేస్తానని హెచ్చరించాడు కూడా. అన్నీ జాగ్రత్తగా విన్న వంటపెద్దకి బెంగ పట్టుకుంది. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ గుర్తుపెట్టుకొనడం ఎలా? ఏమాత్రం పొల్లుపోకుండా తన క్రింది వారందరికీ ఆ వివరాలన్నీ చెప్పగలడా? వారందరూ కూడా సరిగ్గా గుర్తుపెట్టుకుంటారని ఏమిటి నమ్మకం? విందుకి ఇంకా వారం రోజులు ఉంది. ఈలోపు ఎవ్వరయినా ఏ చిన్న విషయమైనా మరిచిపోయి తేడా వచ్చిందంటే, తనతోపాటు తనవారందరూ నరకానికి బదిలీ అయిపోతారు! ఏం చెయ్యాలో తోచక, ఆఖరికి తరుణోపాయం చెప్పమని వెళ్ళి బృహస్పతిని అర్థించాడు.

“నాయనా! ఈ వ్యవహారం కొంచెం క్లిష్టంగానే ఉంది. దీనికి పరిష్కారం చూపగలిగేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతనే పాణిని. ఐరావతంలాంటి అమరభాషను సూత్రబద్ధం చేసిన మహామహుడతను. అతని కొరకు వెదుకు. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ ఆయనకు తెలుసు. ఆయనను ప్రార్థించు, పరిష్కారం దొరుకుతుంది.”

బృహస్పతి సలహా మేరకు పాణిని గురించి వెతకనారంభించాడు వంటపెద్ద. అల అమరావతీ పురంబులో నగరిలో ఆ నందనవనంబులో, ఒక మూలన కూర్చొని, జరుగుతున్న హడావిడిని పట్టించుకోకుండా ధ్యానంలో మునిగి ఉన్న పాణినిని సులభంగానే పట్టుకున్నాడు. తన మొరనాలకించి కావుమని అర్థించాడు. అంతా విన్న పాణిని చిద్విలాసంగా ఒక చిరునవ్వు నవ్వి, ‘ఇంతేనా’ అంటూ, ఒక పాతిక పైచిలుకు చిన్న చిన్న వాక్యాలు అతని చెవిలో ఊది, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. పాణిని చెప్పిన వాక్యాలు గుర్తుపెట్టుకోడానికి సులువుగానే ఉన్నాయి కానీ ఒకదానికీ మరొకదానికీ పొంతన లేదు. వంటపెద్ద పెద్ద అయోమయంలో పడిపోయాడు!

“వీటిని ఏం చేయాలి స్వామీ?” బెరుకుతో అడిగాడు చిన్నగా.

“మీ వాళ్ళందరికీ చెప్పి కంఠతా పట్టమను. ఎవరికేం వడ్డించాలో తెలిసిపోతుంది.” కళ్ళు మూసుకొనే బదులిచ్చాడు పాణిని.

“ఇది నాకే ఒక్కముక్క అర్థంకాలేదు. మా వాళ్ళకేం తెలుస్తుంది స్వామీ!” వంటపెద్ద వాపోయినా తిరిగి మాట్లాడలేదు పాణిని. ఆయన పని అయిపోయిందన్నట్లు ధ్యానంలో మునిగిపోయాడు. ఏంచేయాలో తెలియక బుర్ర గోక్కుంటూ పాణిని చెప్పిన వాక్యాలను వల్లెవేసుకొంటూ తిరుగుదారి పట్టాడు వంటపెద్ద.

1. విందు రాత్రి భోజనం
2. లడ్డూలు, అరిసెలు తీపి
3. బూరెలూ
4. పంచామృతం కాదు
5. పళ్ళు కూడా
6. కారప్పూస, జంతికలు, చేగోడీలు కారం
7. విందులో
8. ఇంకా నైవేద్యాలలో
9. పాండవులకు తీపి వడ్డించాలి
10. భీమునికి లడ్డూలు
11. నకులునికీ
12. అర్జునుడికి అరిసెలు వద్దు
13. ఇతరులకు ఏవైనా
14. అడిగిన కౌరవులకూ
15. ధృతరాష్ట్రునికి తప్ప
16. పళ్ళు మాత్రమే
17. కృష్ణుడికి నైవేద్యంలో
18. అన్నీ
19. పంచామృతం
20. ఇతరులకు వద్దు
21. అశ్వత్థామకు ఇవ్వొచ్చు
22. సాత్యకికి ఎప్పుడూ
23. కారానికీ అంతే
24. పాండవులకు తప్ప
25. కోరినవి
26. దుర్యోధనుడికి గోంగూర

అలా వల్లెవేసుకొంటూ వెళుతున్న వంటపెద్దకు అల్లంత దూరంలో తననే చూస్తున్న మరో ముని కన్పించాడు. ఆయనను అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని అనుకొంటూ అటు వెళ్ళాడు.

“హుఁ, అంతా విన్నాను. పాణిని ఏం చెప్పాడు నీకు?” ప్రశ్నించాడాయన.

“అసలే నేను ఇంద్రుడు చెప్పిన వివరాలు ఎలా గుర్తుపెట్టుకోవడం అని కంగారుపడుతూ ఉంటే, ఆయన మరింత కలగాపులగం చేసేశారు! తమరెవరో గొప్పవారిలాగున్నారు. కాస్త ఆయన చెప్పిన వాక్యాలని నాకర్థమయ్యేలా చెప్పండి స్వామీ!”

పాణిని చెప్పిన పొట్టి వాక్యాలన్నిటినీ యథాతథంగా విన్నవించాడు వంటపెద్ద. దాన్ని రెండుమార్లు విని దీర్ఘంగా నిశ్వసించాడా మునిసత్తముడు.

“అనుకున్నాను. ఇలా చెపితే అయోమయం కాక మరేమవుతుంది! ఈ కాత్యాయనునికే అర్థం చేసుకోవడానికి రెండుసార్లు వినవలసి వచ్చింది. ఉండు, నీకర్థమయ్యేలా నేను మారుస్తాను.”

పాణిని చెప్పిన వాక్యాల మధ్యలో మరికొన్ని వాక్యాలు చేర్చి చెప్పాడు కాత్యాయన మహర్షి.

1. విందు రాత్రి భోజనం
2. లడ్డూలు, అరిసెలు తీపి
3. బూరెలూ
          వా. బూరెలను కలిపే చెప్పి ఉండవచ్చు.
4. పంచామృతం కాదు
          వా. కలిపినా దోషం లేదు.
5. పళ్ళు కూడా
6. కారప్పూస, జంతికలు, చేగోడీలు కారం
7. విందులో
8. ఇంకా నైవేద్యాలలో
9. పాండవులకు తీపి వడ్డించాలి
10. భీమునికి లడ్డూలు
11. నకులునికీ
12. అర్జునుడికి అరిసెలు వద్దు
13. ఇతరులకు ఏవైనా
14. అడిగిన కౌరవులకూ
15. ధృతరాష్ట్రునికి తప్ప
          వా. ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ విదుర కృపులకూ అని చెప్పిఉండాలి.
16. పళ్ళు మాత్రమే
17. కృష్ణుడికి నైవేద్యంలో
          వా. విందులో కూడా అని చెప్పవలసింది.
వా. బలరామకృష్ణులకు అనాలి.

18. అన్నీ
19. పంచామృతం
          వా. పళ్ళు కూడా అని చెప్పాలి.
20. ఇతరులకు వద్దు
21. అశ్వత్థామకు ఇవ్వొచ్చు
          వా. కౌరవులతో ఉన్నప్పుడే.
22. సాత్యకికి ఎప్పుడూ
23. కారానికీ అంతే
24. పాండవులకు తప్ప
25. కోరినవి
26. దుర్యోధనుడికి గోంగూర

“ఇదేమిటి స్వామీ! ఇందాకటికంటే గందరగోళంగా ఉంది. ఆ మునిగారు చెప్పినవాటికి మీరు ఇంకొన్ని చేర్చి చెప్పారు తప్ప వాటి అర్థమేమిటో చెప్పనే లేదు!” మరింత అయోమయంలో పడిపోతూ బావురుమన్నాడు వంటపెద్ద.

“మూర్ఖుడా! పాణిని చెప్పింది సూత్రాలు. నేను చెప్పింది వార్తికం!” గర్జించాడు కాత్యాయనుడు.

“ఏ రోలైతేనేంలెండి వేళ్ళు నలగ్గొట్టుకోడానికి. అర్థం కానిదాని పేరు ఏదైనా ఒకటే. ఇప్పుడు దీన్నేం చేయాలో, మావారికి ఎలా వివరించాలో మాత్రం చెప్పండి.” అర్థించాడు పాకశాలాధిపతి. ఇంక చెప్పవలసిందేమీ లేనట్లు అటు తిరిగి కూర్చున్నాడు కాత్యాయనుడు. నిస్సహాయంగా చూసి వెనుతిరిగిన వంటపెద్ద అలా నిరాశగా వనంలో నడిచిపోతుండగా ఒక పిలుపు వినిపించింది.