అన్ని వాదనలకీ ముగింపుగా, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టు చివరకి ఇలా చెప్పేవాడు: ‘ఈ సరఫరా-గిరాకీ అన్న నియమం భగవంతుడు ఏర్పాటు చేసినది. మనం ఊహించగలిగిన అన్ని సందర్భాల్లోనూ ఈ నియమం పని చేస్తుంది. ఈ నియమమే శ్రమకి తగిన ధరని కూడా నిర్ణయిస్తుంది. దీనికి తిరుగు లేదు. ఈ ఆచరణావిధానం నచ్చని వాళ్ళు తమ స్వంత ప్రపంచాలను నిర్మించుకోవచ్చు.’

మహమ్మదీయ మతమునందేగాక అన్ని మతములందును సత్యమున్నదని నమ్మిన అక్బరుచక్రవర్తి యంతటి వేదాంతికి కూడా పైన చెప్పినవానియందు కొంత విశ్వాసముండెను. ఆయన కుమారుడైన జహంగీరునకీ విషయమున వెర్రినమ్మకముండెను.

హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో దేవుళ్ళతో సమానంగా దేవతలున్నారు. చరిత్రలో వీరపురుషులతో పాటు వీరనారీమణులున్నారు. ప్రార్థనాది విషయాలు మినహాయిస్తే మన పాఠ్యపుస్తకాలలో ఏ స్థాయిలోనూ వారి వీరోచిత గాథలు గాని, ప్రేరణాత్మకమైన వారి జీవిత విశేషాలు గాని లేవు, ఉండవు.

ఈ నవలలో కథ చిన్నదే. కానీ ఇది రేకెత్తించిన ఆలోచనలు కొత్తవి. అందులో ముఖ్యమైన విషయం నల్లజాతీయుల బానిసత్వం. బ్రిటన్‌లో అప్పటికి ఆఫ్రికన్ కాలనీల్లో బానిసత్వం ముమ్మరంగా ఉన్నప్పటికీ దానిపై తిరుగుబాట్లు, దాని నిషేధానికి పోరాటాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అక్కడక్కడా కొందరు వ్యతిరేకించడం మినహా, సంఘటిత పోరాటాలేవీ అప్పుడు లేవు.

“బావుంది. ఏడు ఎమిరేట్లు. ఎనభైవేలనుంచి ముప్ఫయిమూడు లక్షలదాకా జనాభా వ్యత్యాసాలు. రెండొందల ఏభై చదరపు కిలోమీటర్ల నుంచి అరవైవేల కిలోమీటర్ల దాకా భౌగోళిక వ్యత్యాసాలు. అసలు ఈ ఉమ్మడి కుటుంబం ఎలా బతుకుతోందీ? డబ్బుల విషయంలోనో సరిహద్దుల విషయంలోనో, హక్కులూ ఆధిపత్యాల విషయంలోనో గొడవలు పడరా వీళ్ళు?!”

ధరణా కూర్చుని సాత్విక నిరోధము చేయుట భారతదేశములో అనాదిసిద్ధమైన సత్యాగ్రహ పద్ధతి. ఒకడింకొకనికన్యాయము చేసినయెడల అన్యాయమును పొందినవాడాయన్యాయము చేసినవాని వాకిట తిండి తినక, ఎండయనక వానయనక నిశ్చలముగా కూర్చుండి యుండును. దీనికే ధరణాకూర్పొనుటయందురు. ఇట్లు కూర్చుండి ప్రాణములను బాసినవాని యుసురాయింటివానికి గొట్టునని ప్రజలనమ్మకము.

రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!

మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి.

రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.

ఫ్రెంచి భాషలో తొలి చారిత్రక నవలగా, మనస్తత్వ ప్రధాన నవలగా ఈ నవల పేరు పొందింది. ఇందులో కథానాయిక తప్ప తక్కిన అందరూ చారిత్రక వ్యక్తులే. ఏ భాషలోని చారిత్రక నవలల్లోనైనా చారిత్రక వ్యక్తులు అతి తక్కువగా, కల్పిత పాత్రలు ఎక్కువగా ఉండడం సహజం. కానీ ఈ తొలి ఫ్రెంచి చారిత్రక నవలలో అన్నీ చారిత్రక పాత్రలే. కథానాయిక మాత్రమే కల్పితం.

చల్లని తెల్లని కట్టడమది. పాలరాయి విరివిగా వాడిన సంగతి ప్రాంగణంలోకి వెళ్ళగానే బోధపడింది. అసంఖ్యాకంగా ఉన్న గుమ్మటాలు, నాలుగు పక్కలా కనిపించే మీనార్లు, ఎంతో ఎత్తుగా ఉన్న ప్రవేశ ద్వారం, శీతాకాలపు ఆరుబయట సన్నపాటి పొగమంచు వీచికలా అక్కడంతా పరచుకొని ఉన్న కళాత్మకత-వినమ్రభావన కలిగింది.

ఇంగ్లీషు కుంపినీవారి దుష్పరిపాలనమునందు జరుగుచుండిన అన్యాయముల వలన మన్యములోని కొండరాజులు జమీందారులు తరచుగా తిరుగుబాటుచేయుచు తమ పరిసరారణ్యములోని ఆటవికజాతుల నాయకుల దగ్గర తలదాచుకొనుచుండిరి. ఆ మన్యప్రాంతములందు కల్లోలములు కలిగినప్పుడు ఆటవికజాతులును తిరుగుబాటు చేయుచుండెను.

కేసియోపియా అని గ్రీసు దేశస్తులు పిలిచిన నక్షత్ర మండలాన్ని వివిధ సంస్కృతులలో ప్రజలు వివిధమైన పేర్లతో పిలిచేరు. ఈ గుంపులో ఉన్న నక్షత్రాల గురించి అరబ్బులకి తెలుసు, చైనీయులకి తెలుసు, వేదకాలపు భారతీయులకి తెలుసు. వారివారి పురాణ గాథలలో ఇటువంటి కథలు వారికీ ఉన్నాయి.

కళ కేవలం తనకోసమే తాను ఉంటుంది. ఎప్పుడైతే కళాకారుడు ఈ సత్యాన్ని విస్మరించి, తన కళ ద్వారా మానవాళికి సందేశం ఇవ్వాలని ఉబలాటపడతాడో అప్పుడతను కేవలం ఒక ప్రబోధకుడు మాత్రమే. తన కళ ద్వారా సామాజిక నైతికతను నిర్దేశించి, అమలుచేయాలని తపనపడతాడో అప్పుడతను కేవలం ఒక తార్పుడుగాడు మాత్రమే.

ఈ నవలలో నాయకుడున్నాడు గానీ నాయిక లేదు. నాయికలు అనేకం ఉన్నారు. నవలలో 40కి పైగానే పాత్రలున్నాయి. అందులో పాతిక వరకూ ప్రాముఖ్యం కలిగినవి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మూరాసాకి, ఫుజిత్సుబొ, ఆకాషీ. ఈ ముగ్గురిని గెన్జి వేర్వేరు దశల్లో ప్రేమిస్తాడు. అతనిలో ఆనందానికీ, మనోవ్యథకూ కూడ వీళ్ళు ముగ్గురూ ఎక్కువ కారకులౌతారు.

మా డెజర్ట్ సఫారి ఒక ప్యాకేజ్ డీల్. రవాణా ఛార్జీలు, వెల్‌కమ్ డ్రింకులు, స్థానికదుస్తులలో ఫోటోలు, ఒంటెమీద సవారీ, విరివిగా పానీయాలు, కాస్త కాస్త చిరుతిళ్ళు, చేతికి గోరింటాకు, చిత్రవిచిత్రమైన వినోదకార్యక్రమాలు, చివరగా కబాబ్ కేంద్రీకృత భోజనం–రానూపోనూ ఆరేడు గంటలు.

భర్తని కోల్పోయిన లైయస్ భార్య యొకాస్టా ఈడిపస్‌కి పట్టమహిషి అయింది! తను చంపినది తన తండ్రినే అనిన్నీ, తను వివాహం చేసుకున్నది తన తల్లినే అనిన్నీ ఈడిపస్‌కి కానీ అనుచరులకి కానీ ఊహామాత్రంగానైనా తెలియలేదు. విధి వైపరీత్యం! ఈడిపస్-యొకాస్టాల దాంపత్యానికి ఫలితంగా నలుగురు పిల్లలని కంటారు.

ఇట్టి స్థితిలో నాంగ్లేయులకీ ప్రజలలో నెట్టి పలుకుబడియుండును? భయము వల్ల నేర్పడిన భక్తియేగాని ప్రేమవలన నేర్పడిన విశ్వాసము లేదు. తమ అధికారమును సంపదను హరించి తమ్ము నాశనము చేసిన ఈ ఆంగ్ల ప్రభుత్వము నీ ప్రజలు ప్రేమింతురా? తమ గౌరవమును తీసివేసి అధోగతిలోనికి దింపినవారిని వీరు మన్నింతురా?

క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి నవలను తమ ప్రధాన సాహిత్యమాధ్యమంగా చేసుకుని, ప్రపంచ భాషలన్నిటిలోనూ నవలా సామ్రాజ్యంలో మహిళలు తమ బావుటా ఎగరేశారు. అలాంటి నవలారచయిత్రులను సాహిత్య చరిత్రలు ఎలా గుర్తించాయి? వారు ఎలా జీవించారు? వారు ఏం రాశారు? సమకాలీన సాహిత్య సమాజం వారిని ఎలా చూసింది? వారి రచనల్లో ఇప్పుడు కూడా చదివి, తెలుసుకుని ఆనందించగల విషయాలేవైనా ఉన్నాయా?

“ఎమిరేట్స్‌కి స్వాగతం! మొత్తానికి రెండేళ్ళు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి.” నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్ళు పట్టేసింది. క్రమక్రమంగా వెనకబడిపోయిన దుబాయి ప్లాను. ఢిల్లీకీ దుబాయ్‌కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్ళు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాటగలిగాను.