జులై 2024

ఒకప్పుడు తెలుగులో సాహిత్యమంటే అగ్రవర్ణ సమాజపు పేర్లు, వారి కథలే ప్రధానంగా వినపడేవి. కాలక్రమేణా మార్పులు వచ్చాయి. దళిత, మైనారిటీ, శ్రామిక, స్త్రీవాద తదితర గొంతుకలు నేటి సాహిత్యంలో బలోపేతం అయ్యాయి. ఇన్నేళ్ళూ సాహిత్యంలోకి రాని ఎన్నో జీవితాలను, ఎన్నో సంఘర్షణలనూ కొంతకాలంగా తెలుగు సాహిత్యంలో గమనిస్తున్నాం. ఇప్పటిదాకా సమాజం వినని, వినదల్చుకోని గొంతుకలను, గుర్తించడానికి కూడా ఇష్టపడని పాయలను ఇప్పుడు మనం సాహిత్యంలో కలుపుకోగలుగుతున్నాం. ముఖ్యంగా, ఎన్నాళ్ళగానో గొంతుల్లోనే నొక్కివేయబడ్డ కథలకు, నిరసనలకు, ఆశలకు ఇప్పటి సాహిత్యం ఒక స్వరాన్నిస్తోంది. ఇలా నాణానికి ఆవలి వైపుని, తరాలు మారినా చల్లారని లోపలి ఆవేదనలని, ఇప్పటి సాహిత్యం చూపించగలుగుతోంది. ఇవన్నీ నిస్సందేహంగా ఆయా జీవితాల పట్ల మిగతా సమాజానికి కొత్త చూపుని, కొత్త అవగాహననీ ఏర్పరిచేవే. లిపి కూడా లేని బంజారాల జీవితాలను కథలుగా మలిచిన రమేశ్ కార్తీక్ నాయక్ ఇందుకు ఒక ఉదాహరణ. మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం. గత కొంతకాలంగా సాహిత్య అకాడెమీ ఇటువంటి యువరచయితలకు పురస్కారాలిచ్చి ప్రోత్సహించడం కూడా సమర్థనీయం. కాని, ఇది వారి ప్రయత్నానికి మాత్రమే ఇస్తున్న ప్రోత్సాహం అనిపించడం సహజం. తమ తమ కథలని, తమకి నచ్చిన భాషలో, రీతిలో చెప్పుకోవడమే లక్ష్యంగా రాతలోకి అడుగుపెట్టినవాళ్ళకు సంబంధించినంతవరకూ, రాత అన్న దశ ముగిసిపోయింది. రచన ఎప్పుడూ రచయిత పక్షమే. అది వ్యక్తిగతమైన వ్యవహారం. అయితే, ఎప్పుడు దాన్ని సాహిత్యం అన ప్రయత్నిస్తామో, అప్పుడిక సాహిత్యనియమాలు, లక్షణచర్చ అమలులోకొస్తాయి. కథాకథన నైపుణ్యతల విశ్లేషణ, విమర్శ తప్పనిసరి అవుతాయి. ఈ విలువలను యువరచయితలు మార్చుకోవచ్చు. కొత్తవి తెచ్చుకోవచ్చు. కానీ అసలు సాహిత్యనియమాలే అవసరం లేదనుకోవడం అజ్ఞానం. ఆశయాల గొప్పదనంతో రచన విలువ ముడిపడి లేదు. ఇది నిజం. అందువల్ల, ఇప్పుడు కొత్తగా వస్తున్న రచనలు కూడా ఏ ఆదర్శాలతో వచ్చినా, అవి పదికాలాలు నిలబడడానికి వీటిలో సత్యంతోపాటు, ఉద్వేగంతోపాటు, సాహిత్య విలువలు ఉండి తీరాలి. ఇప్పటి సమాజంలో ఏ గొంతుకీ ఏ నిర్బంధమూ లేదు. ఏ రచనా ప్రచురణకైనా మాధ్యమాల కొదవ లేదు. సామాజిక మాధ్యమాల్లో మనం మన చుట్టూ నిలుపుకుంటున్నది, కో అంటే కో అనే ఒక సమూహాన్ని మాత్రమే. ఆ సమూహాలలో స్నేహం ఉంది. అవగాహన ఉంది, సహానుభూతి ఉంది. పైకి చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యే సమీకరణాలు ఉన్నాయి. అక్కడ నాకే పాఠకుడు అక్కర్లేదు, నాకే విమర్శతో పని లేదు అని బింకాలు పోవడం తేలిక. కానీ ఈ సమూహాలకు ఆవల అసలైన ప్రపంచం ఉంది. రచయిత స్వయంగా వెళ్ళి సమర్థించుకోలేని ఆ తావుల్లో కూడా రచన స్వంతంగా మనగలగాలి. అలా జరగాలంటే, యువరచయితలు తమ కథననైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి. వాళ్ళ వాళ్ళ సమూహాలను దాటి వచ్చి, తమ రచనలను నిజాయితీగా పరామర్శించుకోవాలి.