ఎవరిలో ఎవరో

ఎవరిలో ఎవరైనా ఉండొచ్చు
ఎవరూ ఉండకపోవచ్చు కూడా
ఒకోసారి లోలోపల
మరణించిన సహచరి సజీవ శీతలచ్ఛాయో
మరపురాని ఒకనాటి అందాలబొమ్మో
గూట్లో దీపంలా వెలుగుతుండొచ్చు

ఒకోసారి ఎవడిలో వాడే బిర్రుగా ఉండొచ్చు –
స్నానం తొట్టిలో ఉబ్బిపోయిన శవంలా
మృతనిశ్శబ్దాల పిరమిడ్ మమ్మీలు
మెలిదిరిగిన కోర్కెల కొండచిలువలు
కొరివిదెయ్యాలు వేటతోడేళ్ళు
ఒకడిలో సంపూర్ణంగా ఉందొచ్చు

ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?
ఎవరిలో ఏవైనా ఉండొచ్చు
ఎవరూ వేటినీ చూసుకోకపోవచ్చు

ఒకనాటి పొద్దున్నే నా ముందు నేను నిలబడ్డప్పుడు
నక్షత్రఖచిత వినీలాకాశం కింద
పచ్చికబీళ్ళ పైన పచ్చపిట్టలు
కొండవాగుల కోడెగిత్తలు
అరుగుమీద అచ్చారు గుక్కపట్టిన చిన్నప్పటి మట్టిబొంగరం
చూశాను


పాపినేని శివశంకర్

రచయిత పాపినేని శివశంకర్ గురించి:

పాపినేని శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచంలోని అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన కథకులు, విమర్శకులు కూడా. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధిగాంచారు. పాపినేని శివశంకర్ 6 నవంబర్ 1953న గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించారు. రెండు కథాసంపుటాలు, ఐదు కవితా సంకలనాలు, మూడు వ్యాససంపుటాలు, ఒక పరిశోధనా గ్రంథం, తల్లీ నిన్ను దలంచి పద్యపరిచయ గ్రంథం ప్రచురించారు. రజనీగంధ కవితాసంపుటానికి 2016లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసి గుంటూరులో నివాసం చేస్తున్నారు. ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి.

 ...