ఎన్నెన్ని విధములో యెదలోన తలపోసి
మారుతాత్మజు డంత మధురముగను
సీతా శుభాంగన చెవిసోకునట్లుగా
ఆలపించ దొడగె రామకథను
జూన్ 2026
సమాజంలో ఏ ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉండనక్కరలేదు. భిన్నాభిప్రాయాలు ఉండటం, విభేదించడం మానవ సహజం. ఒకప్పుడు భారతదేశపు శాస్త్రసంవాదాల్లో తమ సాటివారితో విభేదించే ముందు, వారి వాదనలో తాము అంగీకరిస్తున్న విషయాలతోనే మొదలుపెట్టేవారు. ఎక్కడ అంగీకారం ఉందో, ఎక్కడనుంచి లేదో స్పష్టంగా చెప్పేవారు. ఇరువురి దృష్టి భిన్నమైనా, వారి అంతిమ ఉద్దేశ్యం ఒక్కటే — సత్యాన్వేషణ, ఈ ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం. అప్పటి ఆ చర్చల్లో అద్భుతమైన హుందాతనం ఉండేది.
కానీ నేటి సమాజంలో క్రమంగా ఆ సంస్కారం కనుమరుగవుతున్న జాడలు కనిపిస్తున్నాయి. సనాతనుడా? ఆధునికుడా?; మూమిన్నా? కాఫీరా?; ఆస్తికుడా? నాస్తికుడా?; సంప్రదాయవాదియా? సెక్యులర్వాదియా?; కన్జర్వేటివా? లిబరలా?; లెఫ్టా? రైటా? అంటూ మొత్తం ప్రపంచాన్ని స్వపక్షం, పరపక్షం అనే రెండు ప్రపంచాలుగా విడదీసి చూసే ద్వంద్వ ప్రవృత్తి పెరిగిపోయింది. స్వపక్షపు అభిప్రాయం మాత్రమే సంపూర్ణ సత్యమనే పిడివాదం ఎప్పుడైతే ప్రబలుతుందో, అప్పుడే ఎదుటివారి పట్ల గౌరవం నశిస్తుంది. అక్కడ ఇక ఆరోగ్యకరమైన చర్చలు ఉండవు, కేవలం దూషణలే మిగులుతాయి. దురదృష్టవశాత్తూ, నేటి సామాజిక ముఖచిత్రం ఇదే. రాజకీయ నాయకులు — అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా — సమాజ శ్రేయస్సు, దేశపాలన తమ సమిష్టి బాధ్యత అన్న కనీస స్పృహను కోల్పోతున్నారు. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ ఒకరినొకరు కించపరచుకునే స్థాయికి భాష దిగజారిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే, విలువల పతనాన్ని విమర్శిస్తూనే, ఆ చౌకబారు వినోదాన్నే అపురూపమైనదిగా ఆరాధించేంత దారుణంగా మన ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ రాజకీయనాయకుల అనుయాయులు, సినీకథానాయకుల అభిమానులు కోట్లాదిగా ఉన్నారు. వారి నాయకులే స్ఫూర్తిగా సోషల్మీడియాలో ఈ నిర్భృత సైనికులంతా (unpaid soldiers) ఇదే రకమైన స్వపక్ష, పరపక్ష సందేశాలతో నిత్యం విద్వేషాగ్నిని మరింత రాజేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నదే.
రాజకీయ నాయకులనూ, సినిమాలనూ ఏదో ఒక రకంగా క్షమించేద్దాం. వారికి భాషకున్న శక్తి, పదును తెలియవు అని సరిపెట్టుకుని మన దారిన మనం పోవచ్చు. కానీ, భాషే ప్రాణంగా, ఆయుధంగా బతికే కవులు, రచయితలు సైతం ఇదే స్థాయికి దిగజారి, ఒకరినొకరు దూషించుకోవడం తీవ్రంగా కలచివేసే అంశం. సృజనకారుల దారులు వేరైనా వారి గమ్యం ఒకటే కదా! ఆ ఎరుక వారిలో ఎందుకు కరువవుతోంది? సమాజంలో చర్చలు ఎలా జరగాలో, భిన్నాభిప్రాయాలను ఎంత సంస్కారవంతంగా గౌరవించాలో నేర్పాల్సిన ప్రాథమిక బాధ్యత సాహిత్యం, ఇతర కళలదే. సద్విమర్శకు మారుగా వ్యక్తిగత దూషణలకు దిగడం ఆలోచనారాహిత్యానికీ, అజ్ఞానానికీ నిదర్శనం. ఎదుటివారిని నిందిస్తూ, వారి స్థాయిని తగ్గించి ఆనందపడే ఉడుకుమోతుతనంనుంచి, దౌర్జన్యపూరితమైన ఆలోచనాధోరణినుంచి సాహిత్యలోకం బయటపడాలి.
భిన్నాభిప్రాయాలను ద్వేషంగా కాకుండా, కొత్త ఆలోచనలకు పునాదిగా మార్చుకున్ననాడే ఏ సాహిత్యానికైనా సార్థకత. ఆ దిశగా సహేతుకమైన, సంస్కారవంతమైన చర్చలకు మన వేదికలు, పత్రికలు ప్రాణం పోయాలని ఆశిస్తూ…
రోడ్ల మీద ఇంకా సన్నటి చీకటి పొంచి ఉంది. కాలికి ఒక రాయి తగిలినట్లు కాలు విదిలించుకుంటూ గట్టిగా భూమ్మీదకు తన్ని అడుగేశాడు. అప్పుడు అతని కుడి కాలు నేలను తాకిన చోటునుండి ఒక నీటి ఊట పైకి చిమ్మడం మొదలైంది. అతను నమ్మలేకపోయాడు. ఆ ఊట ఆరడుగుల ఎత్తుకు పైకి చిమ్ముతోంది.
గాలిలో 60 సెకన్ల పాటు ప్రయాణించే ఒకే ఒక్క ఫిరంగి గుండు మార్గాన్ని పూర్తిగా లెక్కించడానికి ఒక హ్యూమన్ కంప్యూటర్ దాదాపు 20 గంటల సమయం తీసుకునేది. అదే లెక్కింపును ఎనియాక్ (ENIAC) కేవలం 30 సెకన్లలో పూర్తి చేసింది.
రాత్రి నగరాన్ని కప్పదు. వివస్త్రను చేస్తుంది. పగలు ధరించిన అబద్ధాల్ని ఒక్కొక్కటిగా విప్పి, అసలు ముఖాన్ని బయటపెడుతుంది… రాత్రి పదకొండు దాటిన తర్వాత నగరం పాత్రలు మార్చుకుంటుంది. పగలు అధికారంతో మాట్లాడిన మనుషులు, రాత్రి ఒంటరిగా నడుస్తారు. పగలు నవ్విన ముఖాలు, రాత్రి ఆలోచనలతో నిండిపోతాయి.
ఆసన్నమైయున్న మహాయుద్ధం నిమిత్తమై మంత్రాలోచన చేసేందుకు సభను ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. భీష్ముడిని తమ సర్వసైన్యాధిపతిగా ఎన్నుకున్న కాస్సేపట్లో పాండవదూతగా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు, సంధి పొసగదన్న నిశ్చయంతోనే. దూతను అమర్యాద చేద్దామనుకున్న దుర్యోధనుడి పథకం కృష్ణమాయ ముందు చతికిలపడుతుంది.
తెలుగు సాహిత్యంలో వ్యవసాయ కార్మికులు, రైతు, రైతుకూలీల పై విస్తృతంగా సాహిత్యం వెలువడింది. కానీ పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మిక జీవితాలపై వచ్చిన సాహిత్యానికి చాలా తక్కువ పేజీలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ పారిశ్రామిక కార్మికుల జీవితాలపై తెలుగులో వచ్చిన సాహిత్యం చాలా తక్కువనే చెప్పుకోవాలి. వంగపండు మాత్రం తన తొలి రోజుల నుంచే, అనగా 80వ దశాబ్దానికి పూర్వమే, తన రచనల ద్వారా కార్మిక సాహిత్యానికి ఒక స్థానం కల్పించాడు.
రాజమండ్రి గౌతమీ ఘాట్లో
తప్పిపోయిన నన్ను
కరీంనగర్లో దిగువ మానేరు తల్లి
ప్రేమగా ఒడికట్టుకుంది
తల్లి ఎక్కడైనా తల్లే
యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ
నువ్వుగా ఉంటావు
యుద్ధం చేయడమే
ఇష్టమైతే
నేను రోజూ చేసేదే యుద్ధం
ఆలస్యం దేనికి,
నన్ను ప్రేమించు
ఏది ఏమైనా
ఈ అనిదంపూర్వస్థితిని వదలలేను
ఈ చిత్తశాంతిని కాదనలేను
ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని
అదృష్టం ఎలా ఉందో చూద్దాం,’ అని కిటికీ పరదా పక్కకు తప్పించగానే చంద్రకాంతిలో మిలమిలలాడుతోన్న మనస్లు శిఖరం హలో చెప్పింది. క్షణాల్లో రెండు మూడు పొరల ఉన్ని బట్టలు వేసేసుకుని నేనూ గిరీషూ మేడమీదికి చేరిపోయాం… పువ్వుకు తావిలాగా ఆ బంగారు శిఖరం నడికొప్పున పల్చని మబ్బు తెర జయకేతనంలా నిలచి, శిఖరంతోపాటు తానూ రంగులు మార్చుకోసాగింది.
ఆధునికతనుండి అత్యాధునిక యుగానికి దారిలో అడ్డంగా నిలబడిన మేరువు హైడెగర్. అతన్ని దాటడం కష్టం. దాటకుండా యీ యుగంలోకి నడవడం కష్టం. అతడి ప్రభావం ఒక రంగంలో కాదు. తత్త్వశాస్త్రం అటుంచి, మనస్తత్త్వశాస్త్రం, మానసికవైద్యం, సాహిత్యవిమర్శ, సాంకేతికత, పర్యావరణము-బహుశా అతడి ప్రభావంలేని ఆధునికరంగం లేదేమో!
ఒడిస్సియస్ ధనుస్సును సుతారంగా నిమిరేడు. దానిని నిలువునా నిలబెట్టి సునాయాసంగా వంచి నారితాటిని బిగించేడు. బిగించి, సరిగ్గా ఉందో లేదో చూడడానికి, వీణ తీగను మీటినట్లు మీటేడు. వానకోయిల కూజితంలా శబ్దం ధ్వనించింది. దానికి ప్రతిధ్వనిలా ఆకాశంలో ఉరుములు ఉరిమేయి.
పురాణ కథలు ఎందుకు చదవాలి? అవి మనకు ఏమిటి బోధిస్తాయి? అవి చదవడంవల్ల మనం మన ప్రస్తుత జీవితాలను ఎలా మలుచుకోగలం? పురాణకథలలో ఉన్న నీతులు, బోధలు అర్థం చేసుకుని మనం ఈ కాలంలో ఏ విధంగా లబ్ధి పొందగలం? కాలం మారింది. విలువలు మారేయి కదా. ఎప్పుడో శతాబ్దాల క్రితం హోమర్ రాసిన ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు ఇప్పుడు చదవడంవల్ల లాభం ఏమిటి?
సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.
వాడ్రేవు చినవీరభద్రుడు తన తొలి కవితా సంపుటి అంటే “నిర్వికల్ప సంగీతం” వెలువరించి నలభయ్యేళ్ళయింది. ఈ నలభయ్యేళ్ళలో ఆనాడే అజంతా జ్యోతిష్యం చెప్పినట్టుగా తెలుగు సాహిత్య ప్రపంచంలో భవిష్యత్తంతా ఇతనిదే అయింది… తలుపులు బార్లా తెరిచి అజరామరమైన ప్రకృతిని లోపలికి ఆహ్వానించాల్సిన అవసరమేదో ఈ కవిని మేల్కొల్పింది.
గాలి నాసరరెడ్డికి లేఖలు’ పుస్తకంలో 56మంది కవులు, పండితులు, కవితాప్రియులు రాసిన 84 ఉత్తరాలు సంకలింపబడ్డాయి… మొత్తం మీద ఈ లేఖా సంకలనంలోని బడాబాబుల పొడి మాటలూ, సన్నజీవాల తడి తలపులూ పాఠకుల హృదయాల్ని కదిలిస్తాయి; కొండొకచో కలవరపరుస్తాయి కూడా.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై 10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!